కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం
From Wikipedia, the free encyclopedia
కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం (ప్రవాస టిబెట్ ప్రభుత్వం అనేవారు) భారతదేశంలోని ధర్మశాల కేంద్రంగా పనిచేస్తున్న ఎన్నికైన టిబెట్ పార్లమెంటరీ ప్రభుత్వం. దీన్ని ప్రవాస టిబెట్ ప్రజా సంస్థ (ఎక్సైల్ టిబెటన్ పీపుల్స్ ఆర్గనైజేషన్) అని కూడా అంటారు [1] ఇందులో న్యాయవ్యవస్థ, శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖలు ఉంటాయి. 1959 లో ఏర్పడినప్పటి నుండి, ప్రవాస టిబెట్ ప్రభుత్వాన్ని చైనా అధికారికంగా గుర్తించలేదు. [2] పార్లమెంటు సభ్యులను, అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడం ద్వారాను, "గ్రీన్ బుక్" ను ఉపయోగించి వార్షిక ఆర్థిక సహకారాన్ని అందించడం ద్వారానూ టిబెటన్ ప్రవాసులు, కాందిశీకులూ టిబెట్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ప్రవాస టిబెట్ ప్రభుత్వం అంతర్జాతీయంగా, సంస్థల నుండి, వ్యక్తుల నుండీ కూడా మద్దతును పొందుతుంది.
కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం བོད་མིའི་སྒྲིག་འཛུགས་ Bod mi'i sgrig 'dzugs / Bömi Drikdzuk | |
---|---|
గీతం: గ్యాలూ | |
స్థాయి | ప్రవాస ప్రభుత్వం |
కేంద్ర కార్యాలయం | 176215, ధర్మశాల, కాంగ్రా జిల్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం |
అధికారిక భాషలు | టిబెటన్ |
మతం | టిబెటన్ బౌద్ధం |
Type | ప్రవాస ప్రభుత్వం |
ప్రభుత్వం | |
• సిక్యోంగ్ | లోబ్సాంగ్ సంగే |
• స్పీకర్ | పెమా జంగ్నీ |
శాసనవ్యవస్థ | కేంద్రీయ టిబెట్ ప్రభుత్వ పార్లమెంటు |
స్థాపన | 1959 ఏప్రిల్ 28 |
ద్రవ్యం | Indian rupee (de facto) (INR) |
కేంద్రీయ టిబెట్ ప్రభుత్వ అంతర్గత నిర్మాణం ప్రభుత్వాన్ని పోలి ఉంటుంది; దీన్ని "టిబెట్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు రూపొందించలేదు" అని పేర్కొంటూ, "టిబెట్లో స్వేచ్ఛ పునరుద్ధరించబడిన వెంటనే" టిబెట్ లోపలే టిబెటన్లు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వానికి అనుకూలంగా దీన్ని రద్దు చేస్తాం అని చెప్పింది. [1] రాజకీయ ప్రాతినిధ్యం వహించడంతో పాటు, ఇది నివేదికలు, పత్రికా ప్రకటనలు తయారు చేసి ప్రచురిస్తుంది. ఇది భారతదేశం లోని టిబెటన్ల కోసం పాఠశాలలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల నెట్వర్కును నిర్వహిస్తుంది. 1991 ఫిబ్రవరి 11 న, నెదర్లాండ్స్లోని హేగ్లోని పీస్ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో ప్రవాస టిబెట్ ప్రభుత్వం ప్రాతినిధ్యం లేని దేశాలు, ప్రజల సంస్థ (యుఎన్పిఓ) లో వ్యవస్థాపక సభ్యురాలిగా చేరింది. [3] [4]