2019–21 కరోనావైరస్ మహమ్మారి
కొవిడ్ వ్యాధి ఉన్నవారు తుమ్మినా, మాట్లాడినా వచ్చే చిన్న తుంపరల ద్వారా వ్యాపించే వ్యాధి / From Wikipedia, the free encyclopedia
2019-20 కరోనావైరస్ మహమ్మారి అన్నది సార్స్-సీవోవీ-2 వైరస్ (కరోనావైరస్ 2019) కారణంగా వచ్చే కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉండడంతో ప్రస్తుతం కొనసాగుతున్న మహమ్మారి. మొట్టమొదటగా ఈ వ్యాప్తి 2019 డిసెంబరులో చైనాలోని హుబయ్ ప్రావిన్సులో వుహాన్ నగరంలో ప్రారంభమైంది. 2020 జనవరి 30న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్వో) ఈ వ్యాప్తిని అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితిగానూ, 2020 మార్చి 11న మహమ్మారి (పాన్డమిక్)గానూ గుర్తించింది. 2020 ఏప్రిల్ 4 నాటికి, 190 పైచిలుకు దేశాల్లో, 200 పైచిలుకు ప్రాంతాల్లో మొత్తం 10 లక్షల పైచిలుకు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కారణంగా 54 వేల మందికి పైగా చనిపోగా, 2 లక్షల 18 వేల మంది వరకూ దీని నుంచి కోలుకున్నారు.
వ్యాధి | కరోనా వైరస్ వ్యాధి 2019 (కోవిడ్-19) |
---|---|
వైరస్ స్ట్రెయిన్ | సార్స్-సీవోవీ-2 |
ప్రదేశం | ప్రపంచవ్యాప్తంగా; ప్రస్తుత కేంద్రం ఐరోపా |
మొదటి కేసు | వుహాన్, హుబయ్, చైనా 30°37′11″N 114°15′28″E |
కేసులు నిర్ధారించబడింది | 552,000+[1][2][lower-alpha 1] |
బాగైనవారు | 128,000+[1][2] |
మరణాలు | 25,000+[1][2] |
ప్రాంతములు | 190+[1][2] |
వైరస్ ప్రధానంగా సన్నిహితంగా మసిలినప్పుడు[lower-alpha 2], వ్యాధిగ్రస్తులు దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా వచ్చే చిన్న తుంపరల ద్వారా వ్యాపిస్తుంది.[5] ఈ తుంపరలు ఒక్కోసారి ఊపిరి పీల్చేప్పుడు కూడా ఏర్పడతాయి కానీ ఈ వ్యాధి సాధారణంగా గాలి ద్వారా వ్యాపించేది కాదు. [6] ఈ వైరస్ మనిషి నుంచి రకరకాల వస్తువుల ఉపరితలాల మీద కూడా నిలిచివుంటుంది. మనుషులు అలా కలుషితమైన ఉపరితలాలను తాకి, ఆ చేతులతో తమ ముఖాన్ని తాకినా వైరస్ వారికి సోకుతుంది. రోగ లక్షణాలు (దగ్గు, జ్వరం వగైరా) కనిపిస్తున్న దశలో ఈ వ్యాధి బాగా వ్యాపిస్తుంది, కానీ రోగ లక్షణాలు కనిపించని దశలో కూడా వ్యాపించే అవకాశం ఉంది. వైరస్ సోకిన తర్వాత రోగ లక్షణాలు కనిపించడానికి సాధారణంగా ఐదు రోజులు పడుతుంది, అయితే ఆ సమయం అన్నది రెండు రోజుల నుంచి 14 రోజుల మధ్య ఎంతైనా ఉండవచ్చు. సాధారణ లక్షణాలు జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం. దీని వల్ల తలెత్తే సమస్యలలో న్యుమోనియా, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి ఉండవచ్చు. ఇంతవరకూ దీన్ని అడ్డుకోవడానికి టీకా కాని, నయం చేయడానికి నిర్దిష్టమైన యాంటీ-వైరల్ చికిత్స కానీ అందుబాటులో లేదు. రోగలక్షణాలను బట్టి చేసే చికిత్స, సహాయక చికిత్స మాత్రమే దీనికి ప్రస్తుతం చేస్తున్న ప్రాథమిక చికిత్స. వీలైనంత తరచుగా చేతులు కడుక్కుంటూ ఉండడం, దగ్గేప్పుడు నోరు కప్పుకోవడం, ఇతరుల నుంచి దూరంగా ఉండడం, వైరస్ సోకిందన్న అనుమానం ఉన్నవారిని వేరుగా ఉంచి, పర్యవేక్షించడం వంటివి సూచిస్తున్న నివారణ చర్యల్లో కొన్ని.[7]
వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రయాణ పరిమితులు, నిర్బంధాలు, కర్ఫ్యూలు, కార్యాలయాల్లో నియంత్రణలు, కార్యక్రమాల వాయిదా, రద్దు, సౌకర్యాల మూసివేత, దిగ్బంధం వంటి చర్యలు చేపట్టారు. వీటిలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రాంతాల నిర్బంధాలు (హుబయ్ నిర్బంధంతో మొదలయింది), వివిధ దేశాల్లో కర్ఫ్యూలు, సరిహద్దుల మూసివేతలు, ప్రయాణికులపై ఆంక్షలు, విమానాలు, రైల్వేస్టేషన్లలో స్క్రీనింగ్, బయటకు వెళ్ళే ప్రయాణికుల ప్రయాణాల నిషేధాలు ఉన్నాయి. [8]
ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సామాజిక ఆర్థిక పరిస్థితులను అల్లకల్లోలం చేసింది. క్రీడా, మత, సాంస్కృతిక కార్యక్రమాలు వాయిదా పడడం, రద్దు కావడం, భయాందోళనలు, వాటి కారణంగా సరఫరాల కొరత తలెత్తుందన్న విస్తృత భయాలు. 160 దేశాల్లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు దేశవ్యాప్తంగానో, స్థానికంగానో మూతబడ్డాయి. దీని కారణంగా 150 కోట్ల మంది విద్యార్థుల చదువు ప్రభావితమైంది. వైరస్ గురించి తప్పుడు సమాచారం ఆన్లైన్లో వ్యాపించింది,ఐరోపా దేశాల్లో, అమెరికాలో, మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ఇతర దేశాల్లో చైనీయులు, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా సంతతికి చెందినవారి పట్ల జనం జాతిపరంగా భయాలు, దూషణలు, వివక్ష చూపుతున్నారు. ఈ వైరస్ ప్రభావం అంతర్జాతీయంగా అనేక దేశల్లో విస్తరిస్తున్న కొద్దీ ఈ జాతి వివక్ష కూడా పెరుగుతోంది. [9] [10]