ఆంధ్రప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు
ఆంధ్రప్రదేశ ప్రాంతలోని బౌద్ధ క్షేత్రాలు / From Wikipedia, the free encyclopedia
బౌద్ధమతం ఆరంభ దశనుండి ఆంధ్ర ప్రదేశ ప్రాంతలో విశేషమైన ఆదరణ పొందింది. అశోకునికి ముందే, అనగా బుద్ధుని కాలం నుండే ఆంధ్రదేశంలో బౌద్ధమతం ప్రాచుర్యంలో ఉన్నదని పెక్కు ఆధారాల వల్ల తెలియవస్తుంది. బౌద్ధ ధర్మం ఆంధ్ర జాతిని సమైక్య పరచి వారి కళానైపుణ్యానికి, సృజనా సామర్ధ్యానికి, నిర్మాణ నైపుణ్యానికి, తాత్విక జిజ్ఞాసకు అపారమైన అవకాశం కల్పించింది. సుప్రసిద్ధ దార్శనికులు అయిన నాగార్జునుడు, ఆర్యదేవుడు, భావవివేకుడు, దిజ్ఞాగుడు వంటి వారికు ఆంధ్రదేశం నివాసభూమి అయ్యింది. థేరవాదులకు మగధవలె మహాయాన బౌద్ధులకు ఆంధ్రదేశం పవిత్ర యాత్రాస్థలం అయ్యింది.[1]
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. (సెప్టెంబరు 2023) |
తూర్పున శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం నుండి విజయనగరం జిల్లాలోని రామతీర్థం వరకు, పడమర కరీంనగర్ జిల్లా ధూళికట్ట నుండి వైఎస్ఆర్ జిల్లా ఆదాపూర్ వరకు ఆంధ్రదేశం నలుమూలలలో అనేక బౌద్ధ క్షేత్రాలు వెలిశాయి. క్రీ.పూ. 300 నుండి సా.శ.300 వరకు, 600 సంవత్సరాలు ఆంధ్రావనిలో జీవితం ప్రగాఢంగా బౌద్ధం ప్రభావంలో ఉంది. కుల వ్యవస్థ లోని దురభిమానం ఆనాటి శాసవాలలో కానరాదు. విధికుడు అనే చర్మకారుడు సకుటుంబంగా అమరావతి స్థూపాన్ని దర్శించి బహుమతులు సమర్పించినట్లు అక్కడి ఒక శాసనం ద్వారా తెలుస్తుంది. ఆ కాలంలో వర్తకం, వ్యవసాయం, వృత్తిపనులు సర్వతోముఖంగా విస్తరించాయని అనేక ఆధారాల ద్వారా తెలుస్తున్నది.