కోయ
From Wikipedia, the free encyclopedia
కోయ అనేది ఆంధ్ర ప్రదేశ్ లో నివసించే ఒక తెగ. ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితాలో 18వ కులం. వీరు ఇంద్రావటి, గోదావరి, శబరి, సీలేరు నదుల ప్రాంతాల్లోను, బస్తర్, కొరాపూట్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తరించియున్న దట్టమైన అడవులైన తూర్పు కనుమలలోను కనిపిస్తారు. భారతీయ కుల వర్గీకరణ ప్రకారం వీరు షెడ్యూల్ ట్రైబ్ గ్రూపుకి చెందినవారు. 1991 జనాభా లెక్కల ప్రకారం వీరి సంఖ్య 1,40,000. దేశభక్తి, ఐక్యత ఎక్కువగా ఉన్న వీరు 1880 లో బ్రిటీషు పాలనపై తిరుగుబాటు చేశారు. భారతీయ స్వాతంత్ర్య పోరాట చరిత్ర ప్రకారం దీనినే కోయ తిరుగుబాటు అని అంటారు. కోయవారు మాట్లాడే భాష కోయి - తెలుగు భాషకు పోలికగా ఉంటుంది.
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
కోయవారి నమ్మకం ప్రకారం మొదటిగా జీవి నీటిలోని పుట్టింది. నాలుగు సముద్రాల మధ్య ఘర్షణ ఏర్పడి అందులోంచి నాచు, కప్పలు, చేపలు, సన్యాసులు పుట్టుకొచ్చారు. ఆఖరిగా దేవుడు పుట్టుకొచ్చి తునికి, రేగు పళ్ళను సృష్టించాడు. 18 వ శతాబ్దంలో మరాఠాలు పెట్టిన చిత్రహింసలు భరించలేక కొండల్లో తలదాచుకొన్నారు. ఈ సమయంలో యాత్రికులు వీరిని అనాగరికులు గా పరిగణించేవారు. తరువాతి కాలంలో నిజాంవారు భద్రాచలం తాలూకాను బ్రిటీషువారి కిచ్చారు. ఆప్పుడు ఆ డివిజన్ లో 225 కోయ గ్రామాలుండేవి.
కోయవారిలో రాచకోయ, లింగదారి కోయ, కమ్మర కోయ, అరిటి కోయ అనే ఉప కులాలున్నాయి. ఈ ఉపకులాల్లోనే ఆహారపు అలవాట్లు ఒకలా ఉండవు. లింగదారి కోయలు గొడ్డు మాంసం తినరు - ఇతరులతో భోజనం చేయరు. కులాంతర వివాహాల వచ్చే నష్టాలను నివారించడానికి కొన్ని పూజలు చేస్తారు. రాచ కోయలు గ్రామ పెద్దలుగా ఉంటారు. పండుగ సమయాల్లో వీరు కూడా కొన్ని పూజలు చేస్తారు. కమ్మర కోయలు వ్యవసాయ పనిముట్లను తయారు చేస్తారు.