పాల్కురికి సోమనాథుడు
శివకవి యుగానికి చెందిన తెలుగు కవి / From Wikipedia, the free encyclopedia
పాల్కురికి సోమనాధుడు (1160 - 1240), శివకవి యుగానికి చెందిన తెలుగు కవి. ఈ యుగానికి చెందిన "శివకవి త్రయం" అనబడే ముగ్గురు ముఖ్య కవులలో ఇతనొకడు. తక్కిన ఇద్దరు మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు.
పాల్కురికి సోమనాధుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. వీరశైవం వ్యాప్తికి కృషి చేశాడు. వీరశైవ సంప్రదాయంలో సోమనాధుడు శివుని ప్రమధ గణాలలో "భృంగి" అవతారం. అప్పటి ఇతర శివకవులు తమ రచనలలో బ్రాహ్మణులను గౌరవంగా ప్రస్తావించేవారు కాని పాల్కురికి సోమనాధుడు వారి ఆచార వ్యవహారాలను నిశితంగా నిరసించాడు.సోమనాథుడు వరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే వైష్ణవ దంపతులకు జన్మించాడు. వీరు ఉత్తమరాజు వారను, కౌండిన్యస గోత్రము కలిగిన నియోగులు. అనేక శాస్త్రములు చదివిన మీదట వీరశైవం లోకి ప్రవేశించి దీక్ష ధరించెను. సోమనాథుడు గురువు కట్టకూరి పోతిదేవర వద్ద వీరశైవ/శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు.