From Wikipedia, the free encyclopedia
ఇండోనేషియా లోని ఆరు అధికారిక మతాలలో హిందూ మతం ఒకటి. [1] 2018 ఇండోనేషియా జనాభా లెక్కల ప్రకారం, మొత్తం జనాభాలో 1.74% మంది, బాలిలో దాదాపు 87% మంది హిందువులు. [2] 1వ శతాబ్దంలో వ్యాపారులు, నావికులు, పండితులు, పూజారుల ద్వారా హిందూమతం ఇండోనేషియాకు వచ్చింది. [3] ముందునుండీ అక్కడ ఉన్న జావానీయ జానపద మతం, సంస్కృతినీ, 6వ శతాబ్దం నుండి బౌద్ధ ఆలోచనలనూ కూడా సంశ్లేషణ చేసుకుని, హిందూమతపు ఇండోనేషియా శాఖగా పరిణామం చెందింది. [4] ఈ ఆలోచనలు శ్రీవిజయ, మజాపహిత్ సామ్రాజ్యాల కాలంలో అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. [5] సుమారు సా.శ. 1400 లో, ఈ రాజ్యాల లోకి తీరప్రాంత ముస్లిం వ్యాపారుల ద్వారా ఇస్లాంకు పరిచయమైంది. ఆ తర్వాత హిందూమతం చాలావరకు ఇండోనేషియాలోని అనేక ద్వీపాల నుండి అదృశ్యమైంది. [6] [7]
2010లో, ఇండోనేషియా ప్రభుత్వ మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇండోనేషియా దీవులలో సుమారు కోటి మంది హిందువులు నివసిస్తున్నారని అంచనా వేసింది. [8] 2010 ఇండోనేషియా అధికారిక దశాబ్దిక జనగణనలో ఇది 40 లక్షలుగా ఉంది. [2] [9] భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్ ల తర్వాత హిందువుల జనాభాలో ఇండోనేషియా నాల్గవ స్థానంలో ఉంది. [10] పరిసద హిందూ ధర్మ ఇండోనేషియా దశాబ్ధ జనాభా గణన పద్ధతిలో లోపముందని ప్రకటించింది. 2005లో ఇండోనేషియాలో 1.8 కోట్ల మంది హిందువులు నివసించారని అంచనా వేశారు. [11] [12] మైనారిటీ మతం అయినప్పటికీ, హిందూ సంస్కృతి ఇండోనేషియాలో జీవన విధానాన్నీ రోజువారీ కార్యకలాపాలనూ ప్రభావితం చేసింది. [13] అధికారిక గుర్తింపు పొందేందుకు బాలి వెలుపలి ప్రాంతాల్లో ఉన్న అనేక మంది సాంప్రదాయిక స్వదేశీ మతాలను అనుసరించేవారు తమను హిందువులుగా చెప్పుకుంటారు.
ఇండోనేషియా ద్వీపసమూహంలోని స్థానికులు ఆస్ట్రోనేషియన్ ప్రజల లాగానే స్వదేశీ యానిమిజం, డైనమిజం లను పాటించేవారు. వాళ్ళు పూర్వీకుల ఆత్మలను పూజిస్తారు. కొన్ని ఆత్మలు పెద్ద చెట్లు, రాళ్ళు, అడవులు, పర్వతాలు లేదా ఏదైనా పవిత్ర స్థలం వంటి ప్రదేశాలలో నివసిస్తాయని కూడా వారు విశ్వసిస్తారు. [14] అతీంద్రియ శక్తి ఉండే ఈ కనిపించని ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పురాతన జావానీయ, సుండానీస్, బాలినీయ "హ్యాంగ్" గా భావిస్తారు. దీనికి దైవిక లేదా పూర్వీకులు అని అర్థం. ఆధునిక ఇండోనేషియాలో, "హ్యాంగ్" అంటే దేవునితో సంబంధం కలిగినదని అర్థం. [15] [16]
హిందూ ప్రభావాలు మొదటి శతాబ్దంలోనే ఇండోనేషియా ద్వీపసమూహానికి చేరుకున్నాయి. "కిడుంగ్ హర్ష విజయ" [17] వంటి కథలలో "రట భట్టార నరసింహ" అనేది హరి వంశానికి చెందిన వారని, హరి అనేది "విష్ణు" అనే పదానికి పర్యాయ పదమనీ చదువుతారు. కావి మాన్యుస్క్రిప్ట్ల ప్రారంభ అనువాదకులు "పుత్రుడిగా" అనే మాటను బట్టి వాస్తవానికి విష్ణువుకు మానవ సంతానం ఉందని తప్పుగా అర్థం చేసుకున్నారు. అయితే ఇక్కడ మనం వైష్ణవ మతానికి చెందిన ఒక మతపరమైన ఆలోచనగా దీన్ని గమనించాలి. [18] కాబట్టి, జావా, బాలి, సుమత్రాల్లో హిందూమతపు రెండు శాఖలూ విస్తరించాయని గమనించాలి. అందువల్ల, భారతదేశం నుండి సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఆలోచనల వ్యాప్తి ప్రక్రియ గురించి చారిత్రక ఆధారాలు పూర్తిగా అస్పష్టంగా లేవు. [19] జావా ఇతిహాసాలు శక-యుగాన్ని సూచిస్తాయి, ఇది 78 AD నాటిది. [20]1వ శతాబ్దం నాటికే ఇండోనేషియా దీవులలో మహాభారతం లోని కథలు ఉండేవి; ఇవి భారత ద్వీపకల్పపు ఆగ్నేయ ప్రాంతంలో (ఇప్పటి తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ ) కనిపించే వాటికి అనుగుణంగా ఉంటాయి. [21] ఇండోనేషియాలోని పురాతన కథలు, కళలు, చేతిపనుల సమాహారమైన 14వ శతాబ్దపు జావానీయ గద్య రచన తంతు పగేలరన్ లో సంస్కృత పదాలు, భారతీయ దేవతల పేర్లు, మతపరమైన భావనలూ విస్తృతంగా కనిపిస్తాయి. [22] అదేవిధంగా జావా, పశ్చిమ ఇండోనేషియన్ ద్వీపాలలో జరిపిన త్రవ్వకాలలో బయల్పడిన చందీల (దేవాలయాలు) లోను, అలాగే 8 వ శతాబ్దపు కంగ్గల్ శాసనం లోనూ శివ లింగారాధన, పార్వతి, గణేశ, విష్ణు, బ్రహ్మ, అర్జున తదితర హిందూ దేవతలను ఆరాధించడం సా.శ. 1వ సహస్రాబ్ది మధ్యకాలం నాటికే ఉండేదని తెలుస్తోంది. [23] సా.శ.414 లో సిలోన్ నుండి చైనాకు తిరిగి వచ్చిన ఫా హియాన్ రచనల్లో [21] జావాలోని హిందువుల్లో రెండు శాఖలుండేవని రాసాడు. అయితే 8వ శతాబ్దానికి చెందిన చైనీస్ పత్రాలు రాజా సంజయ పాలించిన హిందూ రాజ్యాన్ని హోలింగ్గా సూచిస్తాయి. దీనిని "అత్యంత సంపన్నమైనద"నీ, ఇది జావా ద్వీపంలోని బౌద్ధ ప్రజల తోటి, కేడు మైదానంలోని శైలేంద్ర పాలకులతో శాంతియుతంగా సహజీవనం చేసిందనీ రాసాయి. [24]
ఇండోనేషియాలోకి హిందూమతం రాకకు సంబంధించిన రెండు ప్రధాన సిద్ధాంతాలలో ఒకటి దక్షిణ భారత సముద్ర వ్యాపారులు తమతో హిందూ మతాన్ని తీసుకువచ్చారనేది. రెండవది ఇండోనేషియా రాజులే భారతీయ మతాలు, సంస్కృతిని స్వాగతించారు. ఈ ఆధ్యాత్మిక ఆలోచనలను మొదటగా వాళ్ళే ఆచరించగా, ప్రజలు వారిని అనుసరించారు. ఇండోనేషియా ద్వీపాలు హిందూ, బౌద్ధ ఆలోచనలను స్వీకరించాయి. అంతకు ముందే అక్కడ ఉన్న స్థానిక జానపద మతం. యానిమిస్ట్ నమ్మకాలతో ఇవి కలిసిపోయాయి. [25] 4 వ శతాబ్దంలో, తూర్పు కలిమంటన్ లోని కుటాయి రాజ్యం, పశ్చిమ జావా లోని తరుమనగర, సెంట్రల్ జావా ప్రాంతంలోని హోలింగ్ ఈ ప్రాంతంలో ఏర్పాటైన తొలి హిందూ రాజ్యాలు. 1950 - 2005 మధ్య జరిగిన తవ్వకాల్లో, ముఖ్యంగా చిబూయా, బటుజయా తవ్వకాల్లో, తారుమనగారా రాజులు విష్ణువును ఆరాధించేవారని తెలుస్తోంది. [26] జావాలోని పురాతన హిందూ రాజ్యాలు అనేక చతురస్రాకార దేవాలయాలను నిర్మించాయి. ద్వీపంలోని నదులకు గోమతి, గంగా అని పేరు పెట్టారు. ప్రధాన నీటిపారుదల, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేశారు. [27] [28]
అనేక ముఖ్యమైన పురాతన ఇండోనేషియా హిందూ రాజ్యాల్లో మాతరం, కేదిరి, సింఘాసరి ఉన్నాయి. మాతరం పాలన లోనే ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయాలలో ఒకటైన ప్రంబనన్ ఆలయాన్ని నిర్మించారు. బౌద్ధమతంతో పాటు హిందూమతం ద్వీపసమూహం అంతటా వ్యాపించింది. [29] హిందూ మతం లోని అనేక శాస్త్రాలు సూత్రాలు జావానీయ భాషలోకి అనువదించబడ్డాయి. కళారూపాల్లో వ్యక్తీకరించబడ్డాయి. [30]ఉదాహరణకు, 11వ శతాబ్దపు జావా గ్రంథం అగస్త్య పర్వలో అగస్త్య మహర్షి ప్రధాన వ్యక్తి. ఈ గ్రంథంలో, హిందూ మతంలోని పురాణాలు, సాంఖ్య, వేదాంత ఆలోచనలు కలగలిసి ఉన్నాయి. [31] 14వ శతాబ్దంలో హిందూ-బౌద్ధ ఆలోచనల ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకుంది. హిందూ-బౌద్ధ జావానీయ సామ్రాజ్యాలలో చివరిది, అతిపెద్దదీ అయిన మజాపహిత్, ఇండోనేషియా ద్వీపసమూహాన్ని ప్రభావితం చేసింది. [32]
షఫీ ఫిఖ్ సున్నీ ముస్లిం వ్యాపారులు, అలాగే భారతదేశం, ఒమన్, యెమెన్ ల నుండి సూఫీ ముస్లిం వ్యాపారులూ ఇండోనేషియాకు ఇస్లాంను తీసుకువచ్చారు. ఇండోనేషియాలోని హిందువుల మధ్య ఒక చిన్న ఇస్లామిక్ కమ్యూనిటీ గురించిన మొట్టమొదటి ప్రస్తావన మార్కో పోలో, సుమారుగా సా.శ. 1297 కి సంబంధించినది. అతను దీన్ని పెర్లాక్లోని మూరిష్ వ్యాపారుల కొత్త సంఘంగా పేర్కొన్నాడు. [33] ఉత్తర సుమత్రా (అచే), దక్షిణ సుమత్రా, పశ్చిమ మధ్య జావా, దక్షిణ బోర్నియో ( కలిమంటన్) లో నాలుగు విభిన్న, వివాదాస్పద ఇస్లామిక్ సుల్తానేట్లు ఉద్భవించారు. [34]
ఈ సుల్తానులు ఇస్లాంను తమ అధికారిక మతంగా ప్రకటించుకున్నారు. [35] కొన్ని ప్రాంతాలలో, ఇండోనేషియా ప్రజలు తమ పాత నమ్మకాలను కొనసాగిస్తూనే, ఆనాటి ఇస్లాంను స్వీకరించారు. ఇతర సందర్భాల్లో, హిందువులు, బౌద్ధులు తమ ప్రాంతాలను విడిచిపెట్టి, తమను తాము రక్షించుకోగలిగే ద్వీపాలలో సంఘాలుగా ఏర్పడ్డారు. ఉదాహరణకు, తూర్పు జావాలోని హిందువులు బాలికి, పొరుగున ఉన్న చిన్న ద్వీపాలకూ తరలివెళ్లారు. [36] మతపరమైన సంఘర్షణ, సుల్తానేట్ల మధ్య యుద్ధాల కాలం ముగుస్తున్న సమయంలో, కొత్త శక్తి కేంద్రాలు తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో యూరోపియన్ వలసవాదం వచ్చింది. ఇండోనేషియా ద్వీపసమూహంపై త్వరలోనే డచ్ వలస సామ్రాజ్యం ఆధిపత్యం చెలాయించింది. [37] డచ్ వలసరాజ్యాల సామ్రాజ్యం మత ఘర్షణలను నివారించింది. ఇది ఇండోనేషియా ప్రాచీన హిందూ-బౌద్ధ సాంస్కృతిక పునాదులను, ముఖ్యంగా జావా, ఇండోనేషియాలోని పశ్చిమ దీవులలో త్రవ్వడం, అర్థం చేసుకోవడం, సంరక్షించడం అనే ప్రక్రియను నెమ్మదిగా ప్రారంభించింది. [38]
డచ్ వలస పాలన నుండి ఇండోనేషియా స్వాతంత్ర్యం పొందిన తరువాత, రాజకీయ ఇస్లాం ఒత్తిడితో అది అధికారికంగా ఏకధర్మ మతాలను మాత్రమే గుర్తించింది. పైగా, ఇండోనేషియాలో పూర్తి ఇండోనేషియా పౌరసత్వ హక్కులను పొందాలంటే, వ్యక్తికి మతం ఉండి తీరాలి. అధికారికంగా ఇండోనేషియా హిందువులను గుర్తించలేదు. [39] ఇది హిందువులను ఒరాంగ్ యాంగ్ బెలమ్ బెరగామా (మతం లేని వ్యక్తులు) గా పరిగణించింది. తప్పక మతం మార్చవలసిన వారుగా వారిని పరిగణించింది. [40] 1952లో, ఇండోనేషియా మత మంత్రిత్వ శాఖ బాలినీ, హిందువులు ఉన్న ఇతర ద్వీపాలనూ ఇస్లాం మతానికి మార్చేందుకు క్రమబద్ధమైన ప్రచారం అవసరమని ప్రకటించింది. ఈ అధికారిక జాతీయ విధానంతో దిగ్భ్రాంతికి గురైన బాలి స్థానిక ప్రభుత్వం, 1953లో బాలిని స్వయంప్రతిపత్తి కలిగిన మతపరమైన ప్రాంతంగా ప్రకటించింది. బాలినీయ ప్రభుత్వం దౌత్య, మానవ హక్కుల మద్దతు కోసం భారతదేశాన్ని, మాజీ డచ్ వలస అధికారులను కూడా సంప్రదించింది. [41] బాలి, భారతదేశం మధ్య వరుసగా జరిగిన విద్యార్థి, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలుబాలినీయ హిందూమతం (చతుర్వేదం, ఉపనిషత్తు, పురాణాలు, ఇతిహాస) వెనుక ఉన్న ప్రధాన సూత్రాలను రూపొందించడంలో సహాయపడ్డాయి. ప్రత్యేకించి, 1950ల మధ్యలో బాలిలో జరిగిన రాజకీయ స్వీయ-నిర్ణయ ఉద్యమం, అహింసా నిష్క్రియ ప్రతిఘటన ఉద్యమాలకూ, ఇండోనేషియా ప్రభుత్వం హిందూ ధర్మాన్ని గుర్తించాలని డిమాండ్ చేసిన 1958 ఉమ్మడి పిటిషనుకూ దారితీసింది. [42]ఈ ఉమ్మడి పిటిషన్ హిందూ గ్రంధాల నుండి క్రింది సంస్కృత మంత్రాన్ని ఉటంకించింది, [43]
ఓం తత్ సత్ ఏకం ఏవ అద్వైతం
—బాలి హిందువుల సంయుక్త ప్రకటన
ఇండోనేషియా పౌరులు ఒకే దేవుడిపై ఏకధర్మ విశ్వాసాన్ని కలిగి ఉండాలనే రాజ్యాంగపరమైన ఆవశ్యకతను సంతృప్తి పరచడమే "అవిభాజిత ఏకం"పై పిటిషన్ యొక్క దృష్టి. పిటిషనర్లు ఇడా సంఘ్యాంగ్ విధి వాసాను అవిభక్త ఒకటిగా గుర్తించారు. బాలినీయ భాషలో ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి: దైవిక విశ్వ పరిపాలకుడు, దైవిక సంపూర్ణ కాస్మిక్ సూత్రం. ఈ సృజనాత్మక పదబంధం ఇండోనేషియా మత మంత్రిత్వ శాఖ యొక్క ఏకేశ్వరవాద అవసరాన్ని పూర్వ కోణంలో తీర్చింది, అయితే దాని అర్థం యొక్క తరువాతి భావన హిందూమతం యొక్క పురాతన లిపిలలో ధర్మం యొక్క కేంద్ర ఆలోచనలను సంరక్షించింది. [44] 1959లో, ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో, ఆ పిటిషనుకు మద్దతు పలికాడు. మత మంత్రిత్వ శాఖలో అధికారికంగా హిందూ-బాలినీయ వ్యవహారాల విభాగాన్ని ఏర్పరచాడు. [45]
ఇండోనేషియా రాజకీయాలు, మతపరమైన వ్యవహారాలు 1959 నుండి 1962 వరకు అల్లకల్లోలంగా మారాయి. సుకర్ణో కాన్స్టిట్యూయాంటెను రద్దు చేయడంతో, రాజకీయ ఇస్లాంతో పాటు ఇండోనేషియాలో కమ్యూనిస్ట్ ఉద్యమపు ప్రభావం బలహీనపడింది. [46] అయినప్పటికీ, అధికారికంగా తమ మతాన్ని హిందూమతంమని చెప్పుకోవడం 1962 వరకు ఇండోనేషియన్లకు చట్టపరంగా సాధ్యమయ్యేది కాదు. అది రాజ్య గుర్తింపు పొందిన ఐదవ మతంగా మారింది. [47] ఈ గుర్తింపును మొదట బాలినీయ మత సంస్థలు కోరాయి. హిందువులు మెజారిటీగా ఉన్న బాలి కొరకు దీన్ని మంజూరు చేసారు. 1966 - 1980 మధ్య, బాలినీయ హిందువులతో పాటు, పశ్చిమ జావాలో పెద్ద సంఖ్యలో ఇండోనేషియన్లు, అలాగే దక్షిణ సులవేసి, ఉత్తర సుమత్రా, మధ్య దక్షిణ కలిమంటన్లోని కొన్ని ప్రాంతాలు తమను తాము హిందువులుగా అధికారికంగా ప్రకటించుకున్నాయి. [48] వారు తమ హక్కులను సాధించడానికి, కాపాడుకోవడానికీ రాజకీయ సంస్థలను ఏర్పరచుకున్నారు. [49] ఈ సంస్థలలో అతిపెద్దది, పరిసాద హిందూ ధర్మ బాలి, 1986లో దాని పేరును పరిసాద హిందూ ధర్మ ఇండోనేషియా (PHDI) గా మార్చింది. ఇది హిందూ మతాన్ని కేవలం బాలినీయ ఆందోళనగా కాకుండా జాతీయంగా నిర్వచించడానికి చేసిన తదుపరి ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. [50]
బాలిలో అధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువులు అభివృద్ధి సాధించారు. తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరిస్తారు. ఇండోనేషియాలోని ఇతర దీవులలో హిందువులు మెజారిటీ మతమైన ఇస్లాంను విడిచిపెట్టిన వారిగా పరిగణించబడుతున్నారు. స్థానిక అధికారులు వారి పట్ల వివక్ష చూపిస్తూ, హింసకు గురిచేసారు. అయితే ఇండోనేషియా కేంద్ర ప్రభుత్వం హిందువులకు మద్దతు పలికింది. [51] 1960 లలో బౌద్ధమతం, కన్ఫ్యూషియనిజం లకు అధికారికంగా గుర్తింపు లేని కాలంలో ఆ మతాలకు చెందిన ఇండోనేషియన్లు హిందూమతాన్ని ఒక గొడుగుగా ఉపయోగించేవారు. అంతేకాకుండా, ఇండోనేషియాలోని హిందూ రాజకీయ కార్యకర్తలు ఆ మతాల ప్రజలకు రక్షణగా ఉండేవారు. [52]
బాలినీయ హిందూమతం అనేది ఇస్లాం, ఆ తరువాత డచ్ వలసవాదం రాకముందు ఇండోనేషియా ద్వీపసమూహంలో ఉన్న భారతీయ మతాలు, స్వదేశీ ఆనిమిస్ట్ ఆచారాల సమ్మేళనం. [53] ఇది హిందూ మతం లోని అనేక ప్రధాన విశ్వాసాలను, బాలినీయ ప్రజల కళలు, ఆచారాలతో అనుసంధానిస్తుంది. సమకాలీన కాలంలో, బాలిలోని హిందూ మతాన్ని ఇండోనేషియా మత మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆగమ హిందూ ధర్మంగా సూచిస్తోంది. అయితే సాంప్రదాయకంగా ఈ మతాన్ని తీర్థ, త్రిమూర్తి, హిందూ, ఆగమ తీర్థ, సివా, బుడా, సివా-బుడా వంటి అనేక పేర్లతో పిలుస్తారు. [54] తీర్థ, త్రిమూర్తి అనే పదాలు భారతీయ హిందూమతం నుండి ఉద్భవించాయి, ఇవి వరుసగా తీర్థ (పవిత్ర జలాల దగ్గర ఆధ్యాత్మికతకు తీర్థయాత్ర), త్రిమూర్తులకు అనుగుణంగా ఉంటాయి. భారతదేశంలో వలె, బాలిలో హిందూమతం వశ్యతతో పెరిగింది, విభిన్న జీవన విధానాన్ని కలిగి ఉంది. ఇది అనేక భారతీయ ఆధ్యాత్మిక ఆలోచనలను కలిగి ఉంది, భారతీయ పురాణాలు, హిందూ ఇతిహాసాల యొక్క ఇతిహాసాలు, పురాణాలను గౌరవిస్తుంది, అలాగే అనేక హయాంగ్లతో (స్థానిక, పూర్వీకుల ఆత్మలు, అలాగే రూపాలు) అనుబంధించబడిన ప్రత్యేకమైన పండుగలు, ఆచారాలు, జంతు బలి [55] వగైరాల ద్వారా దాని సంప్రదాయాలను వ్యక్తపరుస్తుంది.
బాలినీయ ఆలయాన్ని పురా అని పిలుస్తారు. ఈ ఆలయాలు చతురస్రాకార హిందూ దేవాలయ ప్రణాళికపై రూపొందించబడి, చుట్టూ గోడలతో, సంక్లిష్టంగా అలంకరించబడిన గేట్లతో అనుసంధానించబడి ఉంటాయి. [56] ఈ దేవాలయాలన్నిటికీ అటూ ఇటూగా స్థిరమైన సంఖ్యలో సభ్యులుంటారు; ప్రతి బాలినీయ వంశం, వారసత్వంగా గాని, నివాసం ద్వారా గానీ ఏదో ఒక ఆలయానికి చెంది ఉంటుంది. కొన్ని ఇంటి దేవాలయాలు కుటుంబ గృహ సమ్మేళనం ( బాలీలో బంజర్ అని కూడా పిలుస్తారు), మరికొన్ని వరి పొలాలతో సంబంధం కలిగి ఉంటాయి. మరికొన్ని ముఖ్యమైన భౌగోళిక ప్రదేశాలతో సంబంధం కలిగి ఉంటాయి. బాలి, బనువా (లేదా వన్వా, అటవీ డొమైన్) ప్రతి దేశ (గ్రామం) లోనూ సర్వసాధారణంగా ఉంటాయి. [57] బాలి ద్వీపంలో 20,000 దేవాలయాలు ఉన్నాయి అంటే, దాదాపు ప్రతి 100 నుండి 200 మందికి ఒక దేవాలయం ఉంటుంది. స్థానిక ఆత్మలకు అలాగే భారతదేశంలో కనిపించే దేవతలకూ దేవాలయాలు ఉంటాయి; ఉదాహరణకు, సరస్వతి, గణేశుడు, విష్ణువు, శివుడు, పార్వతి, అర్జునుడు తదితరులు. ఆలయ రూపకల్పన భారతదేశంలోని హిందూ దేవాలయాలలోని నిర్మాణ సూత్రాలు ప్రాంతీయ ఆలోచనలూ మిళితమై ఉంటాయి. [56]
ప్రతి వ్యక్తికి కుల దేవత అని పిలువబడే ఒక కుటుంబ దేవత ఉంటుంది. ఆ వ్యక్తి, అతని కుటుంబం ఆరాధించే కుటుంబ దేవాలయంలో ఈ కులదేవత కొలువై ఉంటుంది. బాలినీయ హిందువులు 210-రోజుల క్యాలెండర్ను అనుసరిస్తారు (వరి పంట, చంద్రకళల ఆధారంగా). ఆలయాల వార్షికోత్సవం ప్రతి 210 రోజులకు ఒకసారి జరుగుతుంది (క్యాలెండర్ను పావుకాన్ క్యాలెండర్ అంటారు). [58] [59] భారతదేశంలో కనిపించని బాలినీయ హిందువుల ప్రత్యేక ఆచారాలు, పండుగలు, దహన సంస్కారాలు, కోడిపందాలు, దంతాల చెక్కుళ్ళు, న్యేపి, గలుంగన్లు ఉన్నాయి. ప్రతి ఆలయ వార్షికోత్సవం, అలాగే పండుగలు, పెళ్ళిళ్ళ వంటి కుటుంబ కార్యక్రమాలలో పువ్వులు, నైవేద్యాలు, ఎత్తైన వెదురు గడలు, ఊరేగింపూ ఉంటాయి. వీటిని ప్రార్థనలు, విందులతో జరుపుకుంటారు. [53] చాలా పండుగలు దేవాలయంలో జరుపుకుంటారు. అప్పుడు ప్రార్థనలు, కళాప్రదర్శనలు జరుగుతాయి. కొన్ని సంప్రదాయాల్లో, తాబూ రాహ్ (ప్రాణాంతకమైన కోడిపందేలు), బూత కాల (ఆత్మలు), కారు (జంతు రక్త బలి) వంటి క్రతువులు ఉంటాయి. అయితే, జంతు బలులు ఆలయ ప్రాంగణానికి బయట నిర్వహిస్తారు. [60] [61]
జావా, సుమత్రా రెండూ భారత ఉపఖండపు సాంస్కృతిక ప్రభావానికి గణనీయమైన లోనయ్యాయి. [62] ఆధునిక జకార్తా, బోగోర్ చుట్టూ విస్తరించి ఉన్న 4వ శతాబ్దపు తరుమనగర శాసనాలలో జావాలో హిందూ ప్రభావాలకు సంబంధించిన తొలి ఆధారాలు కనిపిస్తాయి.[63]ఆరు, ఏడవ శతాబ్దాలలో సుమత్రా, జావాల్లో అనేక సముద్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇవి మలక్కా జలసంధిలోని జలాలను నియంత్రించాయి. చైనా, భారతదేశాల మధ్య, దానికి వెలుపల పెరుగుతున్న సముద్ర వాణిజ్యం కారణంగా ఇవి అభివృద్ధి చెందాయి. ఈ సమయంలో, భారతదేశం, చైనాల నుండి పండితులు ఈ రాజ్యాలకు వచ్చి సాహిత్య, మత గ్రంథాలను అనువదించారు.
4వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు, జావాలో తరుమనగర, కళింగ, మేడాంగ్, కేదిరి, సుంద, సింగసరి, మజాపహిత్ వంటి అనేక హిందూ రాజ్యాలు విలసిల్లాయి. ఈ యుగాన్ని జావానీయ క్లాసికల్ ఎరా అని పిలుస్తారు, ఈ సమయంలో హిందూ-బౌద్ధ సాహిత్యం, కళ, వాస్తుశిల్పం అభివృద్ధి చెందాయి. రాజ ప్రోత్సాహంతో స్థానిక సంస్కృతిలో భాగమయ్యాయి. ఈ సమయంలో యోగ్యకర్త సమీపంలోని 9వ శతాబ్దపు ప్రంబనన్తో సహా అనేక హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయి. ప్రస్తుతం ఈ ప్రంబనన్ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఈ హిందూ రాజ్యాలలో, మజాపహిత్ రాజ్యం ఇండోనేషియా చరిత్రలో అతిపెద్ద, చివరి ముఖ్యమైన హిందూ రాజ్యం. మజాపహిత్ రాజ్య పీఠం తూర్పు జావాలో ఉంది. అక్కడ నుండి అది నేటి ఇండోనేషియా లోని ఎక్కువ భాగాన్ని పాలించింది. మజాపహిత్ రాజ్యపు అవశేషాలు పదహారవ శతాబ్దంలో సుదీర్ఘ యుద్ధం, ఇస్లామిక్ సుల్తానేట్లకు ప్రాదేశిక నష్టాల తర్వాత బాలికి మారాయి.
హిందూ మత వారసత్వం జావానీయ కళా సంస్కృతుల్లో గణనీయమైన ప్రభావాన్ని కలిగించి, తన ముద్రను వేసింది. వాయాంగ్ తోలుబొమ్మ ప్రదర్శన, వయాంగ్ వాంగ్ నాట్యం, ఇతర జావానీయ శాస్త్రీయ నృత్యాలు హిందూ ఇతిహాసాలు రామాయణం, మహాభారతం గాథల నుండి తీసుకోబడ్డాయి. జావానీయుల్లో అత్యధికులు ఇప్పుడు ముస్లిములుగా గుర్తించబడుతున్నప్పటికీ, ఈ కళారూపాలు ఇప్పటికీ మనుగడలో ఉన్నాయి. జావాలో హిందూ మతం వివిధ స్థాయిలలో, రూపాల్లో మనుగడ సాగించింది. జావాలోని టెంగెరీస్, ఓసింగ్ వంటి కొన్ని జాతి సమూహాలు కూడా హిందూ మత సంప్రదాయాలతో సంబంధం కలిగి ఉన్నాయి. [64]
టెంగర్ సంఘం మజాపహిత్ సామ్రాజ్యం వరకు విస్తరించి ఉన్న హిందూ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. బాలిలోని హిందూ మతానికి, టెంగర్ రకామికీ మధ్య బలమైన సారూప్యతలు ఉన్నాయి; రెండింటినీ హిందూ ధర్మమే అంటారు. [65] అయితే, టెంగర్ రకంలో కుల వ్యవస్థ లేదు. టెంగర్ ప్రజల సంప్రదాయాలు మజాపహిత్ యుగం నుండి వచ్చిన వాటిపై ఆధారపడి ఉంటాయి. టెంగర్ ప్రజలు మౌంట్ బ్రోమో ( బ్రహ్మ ) ఒక పవిత్ర పర్వతం అని నమ్ముతారు. [66] టెంగర్ ప్రతి సంవత్సరం యజ్ఞ కసడ అనే ఆచారాన్ని జరుపుకుంటారు. [67]
ఓసింగ్లలో ఇస్లాం, క్రైస్తవ మతాలను ప్రచారం చేయడానికి డచ్లు ప్రయత్నించినప్పటికీ, వారిలో కొందరు ఇప్పటికీ తమ పాత నమ్మకాలకే కట్టుబడి ఉన్నారు. [68] నేటికీ ఓసింగ్ జనాభాలో హిందూమతం ఉనికిలో ఉంది. [69] ఓసింగ్లు బాలినీయులతో సమానమైన సంస్కృతిని స్ఫూర్తిని పంచుకుంటారు. హిందువులు న్యేపి వంటి వేడుకలను జరుపుకుంటారు. [70] బాలినీయ ప్రజల మాదిరిగానే, ఓసింగ్ ప్రజలు కూడా పుపుటాన్ సంప్రదాయాన్ని పాటిస్తారు. సామాజిక స్తరీకరణ పరంగా ఓసింగ్ ప్రజలు బాలినీయ ప్రజల నుండి భిన్నంగా ఉంటారు. ఓసింగ్ ప్రజలు హిందువులు అయినప్పటికీ, బాలినీయుల వలె కుల వ్యవస్థను పాటించరు. [64]
బాలినీయేతర సమూహాల్లో ప్రభుత్వం హిందూ మతంగా పరిగణించేవాటిలో దాయక్ ను అనుసరించే కహారింగన్ మతస్థులు ఒక ఉదాహరణ. ఈ మతస్థులున్న కలిమంటన్ టెంగాలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం As of 1995[update]జనాభాలో 15.8% హిందువులున్నారు. అదేవిధంగా, సులవేసి లోని టోరాజన్ల మతాన్ని హిందూ మతంగా గుర్తించారు. సుమత్రా లోని బటక్లను వారి యానిమిస్ట్ సంప్రదాయాల ప్రకారం హిందూమతస్థులుగా గుర్తించారు. మైనారిటీ భారతీయ జాతి సమూహంలో, తమిళులు, మలయాళీలు, తెలుగులు, జకార్తాలోని మెడాన్, సుమత్రా, సింధీలకు చెందిన పంజాబీలు భారతీయ హిందూ మతాన్ని పోలి ఉండే హిందూ మతాన్ని ఆచరిస్తారు. భారతదేశంలో జరుపుకునే దీపావళి, తైపూసం పండుగలను జరుపుకుంటారు. [71] లాంబాక్ ద్వీపంలోని ససక్ ప్రజల బోధా వర్గం ముస్లిమేతరులు; వారి మతం హిందూమతం, బౌద్ధమతం, యానిమిజంల కలయిక; దీనిని ప్రభుత్వం బౌద్ధంగా పరిగణిస్తుంది. సమరిండా, లాంబాక్ ప్రాంతాలలో, ప్రత్యేకించి కాక్రానెగరాలో, న్యేపీని జరుపుకుంటారు. [72]
చిన్న ద్వీపం అయిన తనింబార్ కేయ్లోని జనాభాలో ఎక్కువ మంది హిందూ మత రూపాన్ని ఆచరిస్తారు. ఇందులో పూర్వీకుల ఆరాధన ఉంటుంది. తనింబర్ కేయ్ ద్వీపం పేరులో తనింబర్ ఉన్నప్పటికీ అది తనింబర్లో భాగం కాదు. ఇది కై దీవులలో ఒకటి. 2014 నాటికి, ఇక్కడ సుమారు 600 మంది నివసిస్తున్నారు. [73] [74]
హిందూ సంస్థ డిట్జెన్ బీమాస్ (DBH) హిందూ సంఘాలతో సన్నిహిత సంబంధాల ద్వారా ఇండోనేషియా అంతటా కాలానుగుణ సర్వేలను నిర్వహిస్తుంది. ఇండోనేషియాలో 1,02,67,724 మంది హిందువులు ఉన్నారని 2012లో అది చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. PHDI (పరిసాద హిందూ ధర్మ ఇండోనేషియా) తోపటు కొన్ని ఇతర మతపరమైన మైనారిటీ సమూహాలు, జనాభా గణనలో ప్రభుత్వం ముస్లిమేతరులను తక్కువగా లెక్కిస్తోందని చెప్పింది. [75] 2018 జనాభా లెక్కల ప్రకారం హిందువుల సంఖ్య 4,,46,357గా నమోదైంది, వారిలో 80% మంది హిందూ హృదయ ప్రాంతమైన బాలిలో నివసిస్తున్నారు.
బాలికి వెలుపల హిందువులలో మెజారిటీ సంఖ్యలో జావాలో పసురువాన్ రీజెన్సీ లోని తొసారి జిల్లా (66.3%), [76] సెంట్రల్ సులవేసి, పరిగి మౌటోంగ్ రీజెన్సీ లోని బాలింగి జిల్లా (77.3%) [76] దక్షిణ సులవేసి తానా తొరాజా రీజెన్సీ లోని మప్పాక్ (50%) లు ఉన్నాయి. [76] జావా లోని తోరూ (41%) సౌసు (30%), [76] దక్షిణ సులవేసి లోని టోమోని తైమూర్ (35%), ఆంగ్కోనా (27%), సింబువాంగ్ (36%) [76] టెల్లులింపో ఇ (40%) జిల్లాలు, [76] లొంబోక్, మాతారం లోని కాక్రనగెర జిల్లా (39%) లలో హిందువులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. [76]
2018 జనాభా లెక్కల ప్రకారం, ఇండోనేషియాలో మొత్తం 46,46,357 మంది హిందువులు ఉన్నారు. 2010 జనాభా లెక్కల ప్రకారం 40,12,116 మంది హిందువులు ఉన్నారు. [77] హిందూమతం శాతం 2010లో 1.69% నుండి 2018 నాటికి, 8 సంవత్సరాలలో, 1.74%కి పెరిగింది.
ప్రావిన్స్ (2018 జనగణన) | మొత్తం | హిందువులు | హిందువుల % |
---|---|---|---|
ఇండోనేషియా | 26,65,34,836 | 46,46,357 | 1.74% |
ఉత్తర సుమత్రా | 1,49,08,036 | 16,346 | 0.11% |
పశ్చిమ సుమత్రా | 55,42,994 | 93 | 0.002% |
రియావు | 61,49,692 | 739 | 0.012% |
జంబి | 34,91,764 | 510 | 0.02% |
దక్షిణ సుమత్రా | 82,67,779 | 40,319 | 0.49% |
బెంకులు | 20,01,578 | 4,184 | 0.21% |
లాంపంగ్ | 90,44,962 | 1,27,903 | 1.47% |
బంగ్కా బెలితుంగ్ దీవులు | 13,94,483 | 1,193 | 0.09% |
DKI జకార్తా | 1,10,11,862 | 20,216 | 0.18% |
పశ్చిమ జావా | 4,56,32,714 | 17,017 | 0.04% |
సెంట్రల్ జావా | 3,66,14,603 | 15,648 | 0.043% |
DI యోగ్యకర్త | 36,45,487 | 3,418 | 0.09% |
తూర్పు జావా | 4,07,06,075 | 1,07,971 | 0.027% |
బాంటెన్ | 1,08,68,810 | 8,292 | 0.08% |
బాలి | 42,36,983 | 36,82,484 | 86.91% |
వెస్ట్ నుసా తెంగ్గారా | 38,05,537 | 1,28,600 | 3.4% |
తూర్పు నుసా తెంగ్గారా | 54,26,418 | 6030 | 0.11% |
పశ్చిమ కలిమంటన్ | 54,27,418 | 2,998 | 0.06% |
సెంట్రల్ కలిమంటన్ | 25,77,215 | 1,55,595 | 5.84% |
దక్షిణ కలిమంటన్ | 29,56,784 | 23,252 | 0.79% |
తూర్పు కలిమంటన్ | 31,55,252 | 8,311 | 0.26% |
ఉత్తర సులవేసి | 26,45,118 | 15,525 | 0.58% |
సెంట్రల్ సులవేసి | 29,69,475 | 1,09,308 | 4.84% |
దక్షిణ సులవేసి | 91,17,380 | 63,652 | 1.02% |
ఆగ్నేయ సులవేసి | 17,55,193 | 50,065 | 2.97% |
గోరంతలో | 11,81,531 | 1.049 | 0.09% |
పశ్చిమ పాపువా | 11,48,154 | 1,164 | 0.1% |
పాపువా | 43,46,593 | 3,341 | 0.08% |
2010 జనాభా లెక్కల ప్రకారం, ఇండోనేషియాలో మొత్తం 40,12,116 మంది హిందువులు ఉన్నారు. 2000 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 35,27,758 మంది ఉన్నారు. [78] హిందువుల సంఖ్య పెరిగినప్పటికీ, ముస్లిం జనాభాతో పోలిస్తే హిందూ జనాభాలో తక్కువ జనన రేటు కారణంగా, 2000 నుండి 2010 నాటికి హిందువుల సాపేక్ష శాతం తగ్గింది. వివిధ ద్వీపాలలో హిందూ స్త్రీకి సగటు జననాల సంఖ్య 1.8 - 2.0 మధ్య ఉంటుంది. అయితే ముస్లిం జనాభాలో ఇది ప్రతి స్త్రీకి 2.1 - 3.2 మధ్య ఉంటుంది.
Province | Total | Hindu 2010[2] | % Hindu 2010 | % Hindu 2000 | Change |
---|---|---|---|---|---|
ఇండోనేషియా | 23,76,41,326 | 40,12,116 | 1.69% | 1.79% | |
అచే | 44,94,410 | 136 | 0.00% | 0.01% | -0.01% |
ఉత్తర సుమత్రా | 1,29,82,204 | 1,22,644 | 0.11% | 0.17% | -0.06% |
పశ్చిమ సుమత్రా | 48,46,909 | 234 | 0.00% | 0.00% | 0.00% |
రియావు | 55,38,367 | 1,076 | 0.02% | 0.09% | -0.07% |
జంబి | 30,92,265 | 582 | 0.02% | 0.02% | 0.00% |
దక్షిణ సుమత్రా | 74,50,394 | 39,206 | 0.53% | 0.26% | 0.27% |
బెంకులు | 17,15,518 | 3,727 | 0.22% | 0.15% | 0.07% |
లాంపంగ్ | 76,08,405 | 1,13,512 | 1.49% | 1.44% | 0.05% |
కెప్. బంగ్కా బెలితుంగ్ | 12,23,296 | 1,040 | 0.09% | 0.01% | 0.08% |
రియావు దీవులు | 16,79,163 | 1,541 | 0.09% | 0.37% | -0.28% |
DKI జకార్తా | 96,07,787 | 20,364 | 0.21% | 0.23% | -0.02% |
పశ్చిమ జావా | 4,30,53,732 | 19,481 | 0.05% | 0.02% | 0.03% |
సెంట్రల్ జావా | 3,23,82,657 | 17,448 | 0.05% | 0.09% | -0.04% |
యోగ్యకర్తలో | 34,57,491 | 5,257 | 0.15% | 0.09% | 0.06% |
తూర్పు జావా | 3,74,76,757 | 1,12,177 | 0.30% | 0.27% | 0.03% |
బాంటెన్ | 1,06,32,166 | 8,189 | 0.08% | 0.07% | 0.01% |
బాలి | 38,90,757 | 32,47,283 | 83.46% | 88.05% | -4.59% |
వెస్ట్ నుసా తెంగ్గారా | 45,00,212 | 1,18,083 | 2.62% | 3.03% | -0.41% |
తూర్పు నుసా తెంగ్గారా | 46,83,827 | 5,210 | 0.11% | 0.15% | -0.04% |
పశ్చిమ కలిమంటన్ | 43,95,983 | 2,708 | 0.06% | 0.08% | -0.02% |
సెంట్రల్ కలిమంటన్ | 22,12,089 | 11,149 | 0.50% | 5.89% | -5.39% |
దక్షిణ కలిమంటన్ | 36,26,616 | 16,064 | 0.44% | 0.21% | 0.23% |
తూర్పు కలిమంటన్ | 35,53,143 | 7,657 | 0.22% | 0.13% | 0.09% |
ఉత్తర సులవేసి | 22,70,596 | 13,133 | 0.58% | 0.56% | 0.02% |
సెంట్రల్ సులవేసి | 26,35,009 | 99,579 | 3.78% | 4.84% | -1.06% |
దక్షిణ సులవేసి | 80,34,776 | 58,393 | 0.73% | 1.13% | -0.40% |
ఆగ్నేయ సులవేసి | 22,32,586 | 45,441 | 2.04% | 2.97% | -0.93% |
గోరంతలో | 10,40,164 | 3,612 | 0.35% | 0.00% | 0.35% |
పశ్చిమ సులవేసి | 11,58,651 | 16,042 | 1.38% | 1.88% | -0.50% |
మలుకు | 15,33,506 | 5,669 | 0.37% | NA | 0.00% |
ఉత్తర మలుకు | 10,38,087 | 200 | 0.02% | 0.02% | 0.00% |
పశ్చిమ పాపువా | 7,60,422 | 859 | 0.11% | 0.68% | -0.57% |
పాపువా | 28,33,381 | 2,420 | 0.09% | 0.16% | -0.07% |
2000 జనాభా లెక్కల ప్రకారం, ఇండోనేషియా మొత్తం జనాభాలో హిందువులు 1.79% ఉన్నారు. బాలిలో అత్యధికంగా హిందువులు ఉన్నారు. బాలి జనాభాలో 88.05% మంది హిందువులు. [79] 1990 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో హిందువుల శాతం క్షీణించింది. హిందువుల్లో ఉన్న తక్కువ జననాలు, అధిక హిందూ జనాభా ఉన్న ప్రావిన్సులకు జావా నుండి ముస్లింలు వలస రావడం దీనికి కారణాలు. [80] మధ్య కలిమంటన్లో మధుర నుండి వచ్చిన వారి ప్రగతిశీల స్థిరనివాసం ఉంది. [81] ఇండోనేసియాలో హిందూ జనాభా వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:
ప్రావిన్స్ (2000 సెం) | హిందువులు | మొత్తం | % హిందువు |
---|---|---|---|
ఉత్తర సుమత్రా | 18,907 | 1,14,29,919 | 0.17% |
పశ్చిమ సుమత్రా | 0 | 42,20,318 | 0.00% |
రియావు | 4,385 | 46,76,025 | 0.09% |
జంబి | 410 | 23,86,866 | 0.02% |
దక్షిణ సుమత్రా | 17,874 | 67,56,564 | 0.26% |
బెంకులు | 2,033 | 13,96,687 | 0.15% |
లాంపంగ్ | 95,458 | 66,31,686 | 1.44% |
బంగ్కా బెలితుంగ్ దీవులు | 76 | 9,45,682 | 0.01% |
DKI జకార్తా | 19,331 | 84,82,068 | 0.23% |
పశ్చిమ జావా | 8,177 | 3,52,79,182 | 0.02% |
సెంట్రల్ జావా | 28,677 | 3,07,75,846 | 0.09% |
DI యోగ్యకర్త | 2,746 | 30,26,209 | 0.09% |
తూర్పు జావా | 92,930 | 3,44,56,897 | 0.27% |
బాంటెన్ | 5,498 | 79,67,473 | 0.07% |
బాలి | 27,40,314 | 31,12,331 | 88.05% |
నుసా తెంగ్గారా బారాత్ | 1,15,297 | 38,05,537 | 3.03% |
నుసా తెంగ్గారా తైమూర్ | 5,698 | 39,04,373 | 0.15% |
పశ్చిమ కలిమంటన్ | 2,914 | 37,21,368 | 0.08% |
సెంట్రల్ కలిమంటన్ | 1,05,256 | 17,85,875 | 5.89% |
దక్షిణ కలిమంటన్ | 6,288 | 29,56,784 | 0.21% |
తూర్పు కలిమంటన్ | 3,221 | 24,14,989 | 0.13% |
ఉత్తర సులవేసి | 10,994 | 19,72,813 | 0.56% |
సెంట్రల్ సులవేసి | 99,443 | 20,53,167 | 4.84% |
దక్షిణ సులవేసి | 87,660 | 77,59,574 | 1.13% |
ఆగ్నేయ సులవేసి | 52,103 | 17,55,193 | 2.97% |
గోరంతలో | 0 | 8,33,720 | 0.00% |
ఇరియన్ జయ | 2,068 | 20,94,803 | 0.10% |
ఇండోనేషియా | 35,27,758 | 19,66,01,949 | 1.79% |
జావాలోని కొత్త హిందూ సమాజాలలో ఒక సాధారణ లక్షణం ఏమిటంటే, వారు కొత్తగా నిర్మించిన దేవాలయాలు (పురా) లేదా హిందూ ఆరాధనా స్థలాలుగా పునరుద్ధరించబడుతున్న పురావస్తు ఆలయాలు (కాండీ) కేంద్రంగా సమూహమౌతూ ఉంటారు. [89]
1984లో పరిసాద హిందూ ధర్మం దాని పేరును పరిసాద హిందూ ధర్మ ఇండోనేషియాగా మార్చుకుంది. గెడాంగ్ బాగస్ నేతృత్వంలోని దాని జాతీయ ప్రభావాన్ని గుర్తించింది. తూర్పు జావాలోని అనేక కొత్త హిందూ దేవాలయాలలో ఒకటి పుర మందరగిరి సుమేరు అగుంగ్, ఇది జావా లోని ఎత్తైన పర్వతమైన సెమెరు పర్వత సానువులపై ఉంది. బాలికి చెందిన దాతల ఉదార సహాయంతో 1992 జూలై లో ఆలయం పూర్తయినప్పుడు, కొన్ని స్థానిక కుటుంబాలు మాత్రమే అధికారికంగా హిందూ మతాన్ని అంగీకరించాయి. 1999 డిసెంబరులో జరిగిన ఒక అధ్యయనంలో స్థానిక హిందూ సమాజం లోని కుటుంబాల సంఖ్య 5000 పైచిలుకు దాకా పెరిగింది.
పురా అగుంగ్ బ్లాంబంగన్ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఇదే విధమైన సామూహిక మతమార్పిడులు జరిగాయి. అగుంగ్ బ్లాంబంగన్ అనేది మరొక కొత్త దేవాలయం, జావాలోని చివరి హిందూ రాజ్యమైన బ్లాంబంగన్ రాజ్యానికి చెందిన చిన్న పురావస్తు అవశేషాలతో నిర్మించబడింది. [90] మరొక ముఖ్యమైన ప్రదేశం పురా లోక మోక్ష జయబాయ (కేదిరి సమీపంలోని మెనాంగ్ గ్రామంలో). ఇక్కడ హిందూ రాజు, ప్రవక్త అయిన జయబాయ మోక్షం పొందాడని ప్రతీతి. [91]
ఈస్ట్ జావాలో ఇస్లామీకరణకు వ్యతిరేకంగా మరింత ఎక్కువ చరిత్ర ఉన్నప్పటికీ హిందూ సమాజం కూడా సెంట్రల్ జావా (లియోన్ 1980) లో విస్తరించింది. పురాతన హిందూ మతం స్మారక ప్రాంబనాన్ సమీపం లోనిక్లాటెన్ దీనికొక ఉదాహరణ. నేడు ప్రంబనన్ ఆలయంలో గలుంగన్, నైపి వంటి వివిధ వార్షిక హిందూ వేడుకలు, పండుగలు జరుగుతాయి. [92]
పశ్చిమ జావాలో, పురా పరహ్యంగన్ అగుంగ్ జగత్కర్త అనే హిందూ దేవాలయాన్ని సలాక్ పర్వత వాలుపై నిర్మించారు. ఇది, బాలి వెలుపల నిర్మించిన అతిపెద్ద బాలినీయ హిందూ దేవాలయం. గ్రేటర్ జకార్తా ప్రాంతంలోని బాలినీయ హిందూ జనాభాకు ఇది ప్రధాన ఆలయం. అయితే, ఈ ఆలయం సుండానీస్ పవిత్ర స్థలంలో ఉంది కాబట్టి, ప్రసిద్ధ సుండానీస్ రాజు ప్రభు సిలివాంగికి అంకితం చేసిన మందిరం కూడా ఇక్కడ ఉన్నందున, తమ పూర్వీకుల జ్ఞాపకాలను మననం చేసుకోవాలనుకునే స్థానికులలో ప్రజాదరణ పొందింది.
హిందూ ద్వీపం బాలి, ఇండోనేషియాలో అతిపెద్ద పర్యాటక ఆకర్షణ. [93] సహజ సౌందర్యం అలరారే ప్రకృతిలో ఆలయ నిర్మాణం, విస్తృతమైన హిందూ పండుగలు, గొప్ప సంస్కృతి, రంగురంగుల కళ, నృత్యాలు బాలినీయ పర్యాటకానికి ప్రధాన ఆకర్షణలు. ఫలితంగా, పర్యాటకం, ఆతిథ్య సేవలు బాలినీయ ఆర్థిక వ్యవస్థ ఆదాయానికి అత్యంత ముఖ్యమైన వనరులుగా వర్ధిల్లుతున్నాయి. [94] బాలిలో అధిక పర్యాటక కార్యకలాపాలు ఇండోనేషియాలోని ఇతర ప్రావిన్సులతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. ఆ ప్రాంతాల్లో హిందూ జనాభా అంతగా లేదు లేదా అసలే లేదు. [95]
ఇండోనేషియా ప్రభుత్వం బౌద్ధంతో పాటు హిందూ మతపు పురాతన ప్రదేశాలు, భవనాలపై కూడా పెట్టుబడి పెడుతుంది. దృష్టీ పెడుతుంది.
ఇస్లామీకరణకు ముందు, ఇండోనేషియా కళ, సంస్కృతులు హిందూమతం సంస్కృతులతో ప్రభావితమయ్యాయి. [96] ఆధునిక ఇండోనేషియాలో కూడా, చాలా మంది ఇండోనేషియా ముస్లింలు, క్రైస్తవులు, ముఖ్యంగా బాలి, జావా ఇతర ద్వీపాలలో నివసించే హిందువుల సంస్కృతీ సంప్రదాయాలను అనుసరిస్తారు. ఇండోనేషియాలో అనేక ప్రసిద్ధమైన, హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటిని ప్రజలు తరచూ సందర్శిస్తూంటారు. ఆయా ద్వీపాలు తీర్థయాత్రలకు, పర్యాటకానికీ మంచి ప్రదేశాలు.
ఇండోనేషియాలోని హిందూ దేవాలయ నిర్మాణం, వాస్తుశిల్పం ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటాయి. వాటిలో వాటికి కూడా వైవిధ్యం ఉంటుంది. [97] ఇండోనేషియాలోని ఆలయ నిర్మాణాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.