ఇ.వి. రామస్వామి నాయకర్
తమిళ రాజకీయవేత్త మరియు సాంఘిక సంస్కర్త / From Wikipedia, the free encyclopedia
పెరియార్ ఈరోడ్ వేంకట రామస్వామి పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలోని ఈరోడ్ పట్టణంలో 1879 వ సంవత్సరం సెప్టెంబర్ 17 వ తారీఖున జన్మించారు. ఈయన పెరియార్ గా, తందై పెరియార్ గా, రామస్వామిగా, ఇ.వి.ఆర్.గా కూడా సుప్రసిద్దులు.[1][2][3][4]
ఇ.వి. రామస్వామి (తంతై పెరియార్) ಇವಿ ರಾಮಸ್ವಾಮಿ ನಾಯಕ | |
---|---|
జననం | (1879-09-17)1879 సెప్టెంబరు 17 ఈరోడ్,మద్రాసు రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఈరోడ్ జిల్లా, తమిళనాడు, భారతదేశం) |
మరణం | 1973 డిసెంబరు 24(1973-12-24) (వయసు 94) వెల్లూరు, తమిళనాడు, భారతదేశం |
ఇతర పేర్లు | ఇ.వి.ఆర్., వైకం వీరార్, వెంతాది వెంతన్ |
వృత్తి | ఉద్యమకారుడు, రాజకీయనాయకుడు, |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ జస్టిస్ పార్టీ ద్రవిడర్ ఖగజం వ్యవస్థాపకుడు |
ఉద్యమం | స్వీయ గౌరవం ఉద్యమం, ద్రవిడ జాతీయవాదం |
జీవిత భాగస్వామి | నాగమ్మాయి (మరణం 1933), మణీయమ్మాయి(1948–1973) |
ఈయన నాస్తికవాది, సంఘ సంస్కర్త. తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమం, ద్రావిడ ఉద్యమ నిర్మాత. దక్షిణ భారతీయులను రాక్షసులుగా, వానరులుగా చిత్రీకరించిందంటూ రామాయణాన్ని, రాముడిని ఈయన తీవ్రంగా విమర్శించాడు. 1904లో ఈయన కాశీ లోని విశ్వనాథుడి దర్శనార్థం వెళ్ళినపుడు అచట జరిగిన అవమానంతో ఈయన నాస్తికుడిగా మారాడని చెప్తారు. హేతువాదిగా మారి హిందూ మతాన్ని అందులోని కులవ్యవస్థను అసహ్యించుకున్నాడు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాన్ని ద్వేషించాడు. వీరి పూర్వీకులు కర్ణాటక ప్రాంతానికి చెందిన కన్నడ బలిజలు.
ఈయన 1919 నుండి 1925 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడాడు. తదనంతర కాలంలో ఈయన, ఇతని అనుచరులు దేశ స్వాతంత్ర్యం కన్నా సాంఘిక సమానత్వం కొరకు ఎక్కువగా పోరాడారు. అన్ని కులాల వారికీ సమానంగా దేవాలయ ప్రవేశార్హత ఉండాలని వాదించారు. 1937 వ సంవత్సరంలో రాజాజీ నేతృత్వంలోని మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ భాషను మద్రాసు రాష్ట్ర పాఠశాలల్లో ప్రవేశపెట్టినపుడు పెరియార్ తన జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేకోద్యమాన్ని పెద్దయెత్తున చేపట్టి చివరికి హిందీ బోధనను విరమింపచేశాడు.
తరువాత ఈయన పార్లమెంటరీ రాజకీయాల మీద విశ్వాసం కోల్పోయి జస్టిస్ పార్టీని ద్రావిడర్ కళగం అనే సామాజికోద్యమ సంస్థగా మార్చాడు. రాజకీయాలవైపు మొగ్గుచూపిన కొందరు అనుచరులు ఆయన నుండి విడిపోయి అన్నాదురై నాయకత్వంలో ద్రవిడ మున్నేట్ర కళగం (డి.యమ్.కె.) అనే పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. ఆ తదుపరి 1969లో అన్నాదురై మరణం తర్వాత కరుణానిధి నాయకత్వంతో విభేదించిన యమ్.జి.రామచంద్రన్ డి.యమ్.కె. నుండి విడిపోయి అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఎ.ఐ.ఎ.డి.యమ్.కె.) అనే పేరుతో మరో పార్టీ స్థాపించారు. ఈ రెండు పార్టీలే అప్పటి నుండి నేటివరకు తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నాయి. రామస్వామి 1973 డిసెంబరు 24 న కన్నుమూశారు.