తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై నిర్మిస్తున్న నీటిపారుదల పథకం From Wikipedia, the free encyclopedia
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. దీని ఆయకట్టు 45,00,000 ఎకరాలు. ఇది పూర్వపు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత - చేవెల్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్.[2] సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇది.[3] 2016, మే 2 దీనికి శంకుస్థాపన జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కాదు. ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువలు, సొరంగాల సమాహారం. కానీ, అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.[4] ఇది ప్రాణహిత ,గోదావరి నదుల సంగమం వద్ద ఉంది. ప్రధానంగా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసే ప్రాణహిత , దమ్మూరు వద్ద కలిసే ఇంద్రావతి నదుల జలాల వినియోగం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 195 టిఎంసి నీటిని వెనుకబడిన ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందించబడినది.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు | |
---|---|
ప్రదేశం | కన్నేపల్లి గ్రామం, మహదేవ్పూర్ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా |
అక్షాంశ,రేఖాంశాలు | 18°48′41″N 79°54′24″E |
ఆవశ్యకత | వ్యవసాయానికి నీరు, తాగునీరు |
స్థితి | నిర్మాణంలో వున్నది |
నిర్మాణం ప్రారంభం | 2016 |
ప్రారంభ తేదీ | 2019 జూన్ 21 (తొలిదశ) |
నిర్మాణ వ్యయం | 80,000 కోట్లు (పూర్తి)[1] |
నిర్వాహకులు | తెలంగాణ నీటిపారుదల శాఖ |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
నిర్మించిన జలవనరు | గోదావరి |
Spillway type | Chute spillway |
జలాశయం | |
మొత్తం సామర్థ్యం | 180 టిఎమ్సి |
Website http://www.irrigation.telangana.gov.in/icad/projectsLisUp |
తెలంగాణ ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకార ప్రాజెక్టు నిర్మాణానికి ఈ-ప్రొక్యూర్మెంట్ వేదికల ద్వారా లంప్సమ్ కాంట్రాక్టు సిస్టం ఆధారంగా టెండర్లు పిలిచారని, ప్రాజెక్టు కోసం రూ.86వేల కోట్ల రుణాన్ని ఆర్థిక సంస్థలు మంజూరు చేశాయని, దాంట్లో 2021 డిసెంబరు నెల నాటికి రూ.56వేల కోట్లు విడుదల చేయగా.. 83శాతం పనులు పూర్తయ్యాయని 2021, డిసెంబరు 16న జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.[5]
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును దాదాపు రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. తెలంగాణలోని దాదాపు 13 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చనుంది. గోదావరి నది నుంచి 90 రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటి చొప్పున 180 టీఎంసీలు ఏత్తిపోయడం ఈ పథకం ఉద్దేశం. వందల కిలోమీటర్ల దూరం కాలువలు, సొరంగ మార్గాల నిర్మాణం, దేశంలోనే అతి పెద్ద ఎత్తిపోతలు, ఆసియాలోనే అతి పెద్ద ఎగసిపడేనీటి జలాశయము (సర్జి పూల్) ఏర్పాటు, భూగర్భం లోనే నీటిపంపులు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణం.[6] దీనికోసం మొత్తంగా 80 వేల ఎకరాల భూసేకరణ జరిపారు. అటవి భూమి 3050హెక్టార్లను వినియోగించుకుంటున్నారు. 18,25,700 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు 134.5టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకు రానున్నారు. ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్ధిరీకరణకు 34.5టీఎంసీల కేటాయిస్తారు. కాళేశ్వరం నుంచి హైదరబాద్ తాగునీటికి 30టీఎంసీలు, గ్రామాల తాగునీటికి మరో 10టీఎంసీలు పారిశ్రామికంగా అవసరాలకు-16 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా అందిస్తారు. అక్టోబర్ 31 నాటికి కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం 83.7 శాతం పూర్తవ్వగా, దీని కింద 18,25,700 ఎకరాల ఆయకట్టు ప్రాంతానికి నీరు అందనుంది. అదనంగా 18,82,970 ఎకరాల భూమిని స్థిరీకరించనున్నారు.
తెలంగాణలో గోదావరి నీటిని కాలువల్లో తరలించడానికి ఉన్న పెద్ద ఇబ్బంది భూమి ఎత్తు. ఈ ప్రాంతం దక్కన్ పీఠభూమి మీద ఉండటంతో నది నుంచి నీటిని కాలువల్లోకి పంపాలంటే మోటార్ల ద్వారా తోడి కాలువలో పోయాల్సిందే. గోదావరి నది నుంచి తొంబై రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటి చొప్పున 180 టీఎంసీలు మళ్లించడం కోసం కాళేశ్వరం పథకం రూపొందించబడినది , దీని కోసం వందల కి.మీ. దూరం కాలువలు, సొరంగ మార్గాల నిర్మాణం చేస్తున్నారు ,ఇవి భారత దేశంలోనే అతి పెద్ద లిఫ్టులు నీటిని పంపుల ద్వారా తోడటానికి ఆసియాలోనే అతి పెద్ద సర్జ్పూల్ ఏర్పాటు చేశారు, దీనికోసం భూగర్భంలోనే పంప్హౌస్లు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి.[8]
మొత్తం 12 బ్లాక్లుగా ప్రాజెక్టును విభజించారు.
కొన్ని వందల గ్యాలాన్ల నీటిని గోదావరి నది నుండి , కాల్వల నుంచి తోడి ఎగువ ప్రాంతానికి పంపాలంటే భారీ మోటార్లు, పైపులు అవసరం అవుతాయి, కాళేశ్వరంలోని మొత్తం 22 పంపింగ్ కేంద్రాలు ఉన్నాయి ఇందులో 96 పంపులు, మోటార్లను 4,680 మెగావాట్ల సామర్థ్యం తో నిర్మిస్తున్నారు, ఇందులో ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)తోపాటు ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ సంస్థలు బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైలం, ఏబీబీ, క్రాంప్టన్ గ్రేవ్స్, వెగ్ లాంటి సంస్థలు ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయి. కాళేశ్వరంలో వాడే అతి పెద్ద పంపుల సామర్థ్యం 139 మెగావాట్లు. ఈ పంపులకు కరెంటు సరఫరా చేయడానికి 400/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నారు.
2019, ఏప్రిల్ 24న ఆరో ప్యాకేజీలో భాగంగా ధర్మారం మండలం నందిమేడారం అండర్ టన్నెల్లోని మొదటి మోటర్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్లోకి 0.01 టీఎంసీల నీటిని 105 మీటర్ల ఎత్తుకు లిఫ్టు చేయబడింది. నందిమేడారం పంప్హౌస్లోని 124.4 మెగావాట్ల తొలి మోటర్ వెట్న్న్రు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ మధ్యాహ్నం 12.03 గంటలకు పూజలుచేసి ప్రారంభించడంతో సర్జ్పూల్ నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రయోగం విజయవంతమైంది..[11][12]
2019 జూన్ 21 న ప్రాజెక్టు ప్రారంభం అయ్యింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పూజ, హోమ క్రతువు జరిపిన తర్వాత కన్నెపల్లి పంపుహౌజ్ దగ్గర ప్రారంభోత్సవంలో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు మూడు పంపులను ప్రారంభించారు.[13]
ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చివరి ఆయకట్టు సూర్యాపేట జిల్లా, పెన్పహాడ్ మండలం రావిచెరువుకు నీళ్లు అందుతున్నాయి. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను జిల్లాకు తరలించినందుకుగాను తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 2023, జూన్ 7న నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో భాగంగా జిల్లాలో కాళేశ్వరం జలాలు పారుతున్న 68 కిలోమీటర్ల మేర కాలువల వెంట వరుసలో నిలబడిన లక్షా 16 వేల 142 మంది (సూర్యాపేటలో 8,625 పురుషులు, 11,256 మంది మహిళలు, చివ్వెంలలో 10,454 మహిళలు, 9785 పురుషులు, పెన్ పహాడ్లో 11,935 మహిళలు, 8,125 మంది పురుషులు ఆత్మకూరులో 10,156 మహిళలు, 9,521 మహిళలు జాజిరెడ్డి గూడెంలో 9,985 మహిళలు, 8,152 మంది పురుషులు) రైతులు, మహిళలతో మధ్యాహ్నం 12 గంటలకు 'కాళేశ్వరం జలానికి-లక్ష జనహారతి' కార్యక్రమం జరిగింది. లక్షలాది మంది రైతులు, మహిళలు పంట కాలువల వెంట నిలబడి పూజా కార్యక్రమాలను నిర్వహించడం ఇదే ప్రథమం, దాంతో ఈ కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది.[14][15] చివ్వేంల మండల కేంద్రంలోని 71 డీబీయం కాళేశ్వరం జలాలకు మంత్రి జగదీష్ రెడ్డి జలహారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు చేశాడు.
ఈ ప్రాజెక్టు మిగిలిన ప్రాంతాల్లో భూసేకరణ కంటే సిద్ధిపేట దగ్గరి మల్లన్న సాగర్ రిజర్వాయర్ కోసం భూసేకరణ చాలా క్లిష్టంగా మారింది,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ పరిహారం కేంద్రం చట్టం ప్రకారం కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా ఇస్తోంది. దీనిపై పలువురు నిర్వాసితులు అభ్యంతరాలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 70 వేల ఎకరాలు అవసరం ఉండగా, ఇంకా 33 వేల ఎకరాల వరకూ సేకరించాల్సి ఉంది.[16] కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఏడాది మోటార్లను పంప్ హౌస్లను సక్సెస్ గా రన్ చేసినా.. కొత్త ఆయకట్టుకు మాత్రం ఈ ప్రాజెక్టు నుండి నీరు రాలేదు, వర్షాల వలన ముందు తోడిన నీరంతా మళ్ళీ దిగువకు వదిలారు అని కొందరు విమర్శలు చేశారు,గ్రావిటీ మీద వచ్చే శ్రీరాంసాగర్ నీళ్లను ఉపయోగించకుండా ప్రభుత్వం భారీ ఖర్చుతో ఎత్తిపోతలు చేపట్టినది, పాజెక్టు నిర్మాణ వ్యయం వేలకోట్లు పెరిగినది ఇలా ప్రాజెక్టుకు అయిన ఖర్చు మీద వివాదాలు ఉన్నాయి.[17]
2023 జూలై నెలలో ప్రాణహిత నది ద్వారా లక్ష్మి బ్యారేజీలోకి 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరగా 35 గేట్లను ఎత్తివేసి 87,690 క్యూసెక్కుల నీటిని విడుదలచేశారు. పెద్దపల్లి జిల్లా సరస్వతీ పంప్హౌస్ నుంచి 3 మోటార్ల ద్వారా 8,793 క్యూసెక్కుల నీటిని పార్వతీ బ్యారేజీలోకి, పార్వతీ పంప్హౌస్ నుంచి 7,830 క్యూసెక్కుల నీటిని శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీలోకి ఎత్తిపోశారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నందిమేడారంలో గల నంది పంప్హౌస్కు 9,450 క్యూసెక్కుల నీళ్ళు రాగా, అంతే మొత్తంలో నీటిని కరీంనగర్ జిల్లా లక్ష్మిపూర్లో గల గాయత్రి పంప్హౌస్కు తరలించారు. కాగా, నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 19,680 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరగా, నీటిమట్టం 1070.60 అడుగులకు చేరుకుంది.[18][19]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.