భారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలు
From Wikipedia, the free encyclopedia
భారతదేశం లోని వివిధ ప్రాంతాల ప్రజలు అనేక భాషలు మాట్లాడుతారు. దేశంలో కనీసం 800 భాషలు, 2000 వరకు యాసలు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలకు గాను హిందీ, ఇంగ్లీషు భాషలను వాడాలని భారత ప్రభుత్వం నిర్దేశించింది. వివిధ రాష్ట్రాలు తమతమ అధికార భాషలను వాడుతాయి. కేంద్ర ప్రభుత్వంతో సంపర్కించేందుకు ఇంగ్లీషు వాడుతాయి. ఉదాహరణకు, కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హిందీ, ఇంగ్లీషుల్లో ఉత్తరాలు రాస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు, ఇంగ్లీషుల్లో రాస్తుంది. హిందీ, ఇంగ్లీషులతో కలిపి భారత్ లో 24 అధికార భాషలు ఉన్నాయి. అధికార భాషా కమిషను వద్ద ఈ భాషలకు ప్రాతినిధ్యం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో అభ్యర్థులు పై భాషల్లో దేనిలోనైనా సమాధానాలు రాయవచ్చు.
భారత రాజ్యాంగం లోని 343 వ అధికరణం దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది. 1950 లో రాజ్యాంగంలో పొందుపరచినట్లుగానే 1965 లో ఇంగ్లీషు అధికార భాష హోదాను (హిందీతో సమానంగా) కోల్పోయింది. ఆ తరువాత దాన్ని అదనపు అధికార భాషగా కొన్నాళ్ళపాటు కొనసాగించి, హిందీని పూర్తి స్థాయిలో అమలుపరచాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా ఉండేది. అయితే, హిందీ అంతగా ప్రాచుర్యం పొందని దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించడంతో జంట భాషల పద్ధతి ఇంకా కొనసాగుతూ వస్తోంది. శీఘ్ర పారిశ్రామికీకరణ, ఆర్థిక వ్యవస్థపై బహుళజాతి సంస్థల ప్రభావం మొదలైన వాటి కారణంగా ప్రభుత్వంలోనూ, బయటా కూడా దైనందిన కార్యకలాపాల్లో ఇంగ్లీషు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. దాన్ని తొలగించాలన్న ప్రతిపాదనలు అటకెక్కక తప్పలేదు.