భారతదేశ సైనిక చరిత్ర
From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో సైన్యం గురించిన ప్రస్తావనలు వేల సంవత్సరాలకిందటి వేదాల లోను, రామాయణ, మహాభారతాల లోను కనిపిస్తాయి. ప్రాచీన కాలంనుండి, 19వ శతాబ్దం వరకూ, భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తుల నుండి చిన్నచిన్న భూభాగాలను ఏలిన రాజుల వరకు, రాజ్యంకోసం, అధికారంకోసం యుద్ధాలు చేసారు. సా.శ. 19 వ శతాబ్దంలో బ్రిటీషువారు, భారతదేశంలో తమ వలసరాజ్యాన్ని స్థాపించారు. ప్రస్తుత భారతసైన్యానికి ముందు, మూడు ప్రెసిడెన్సీలు పోషించిన సిపాయి సమూహాలు, స్థానిక కాల్బలాలు, అశ్వదళాలు, ఉండేవి. సా.శ. 19వ శతాబ్దంలో, ముందున్న ప్రెసిడెన్సీల సైన్యాన్నీ, ఒకే గొడుగు కిందకి తెచ్చి, భారత సైన్యాన్ని ఏర్పరిచారు. బ్రిటీషు భారత సైన్యం, రెండు ప్రపంచ యుద్ధాలలోనూ పాల్గొన్నది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, కొన్ని యుద్ధకాల ప్రత్యేక దళాలు రద్దుచేయబడ్డాయి. అటుపైన, భారత-పాకిస్తాన్ విభజనలో సైనికబలాలు కూడా పంచబడ్డాయి. భారత రక్షణ బలాలు, మూడు భారత-పాకిస్తాన్ యుద్ధాలలోను, భారత-చైనా యుద్ధంలోనూ పాల్గొన్నాయి. సా.శ. 1999లో భారత సైన్యం, పాకిస్తాన్ తో కార్గిల్ యుద్ధం కూడా చేసింది. ఐక్య రాజ్య సమితి యొక్క శాంతిస్థాపన కార్యక్రమాల్లో, భారత రక్షణ దళాలు అనేకమార్లు పాల్గొన్నాయి. ఐరాస శాంతిదళాల సంఖ్యాపరంగా భారత రక్షణ దళాలు రెండోస్థానంలో ఉన్నాయి.