భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ కు టిబెట్కూ మధ్య ఉన్న సరిహద్దు రేఖ From Wikipedia, the free encyclopedia
ఈశాన్య భారతదేశానికి, టిబెట్కూ మధ్యన సరిహద్దు మెక్మహాన్ రేఖ. దీన్ని 1914 లో జరిగిన సిమ్లా సమావేశంలో హెన్రీ మెక్మహాన్ ప్రతిపాదించాడు. చైనా ప్రభుత్వం ఇది చెల్లదంటోంది.[1] చైనా దీన్ని చట్టబద్ధతను వివాదాస్పదం చేసినప్పటికీ ఈ రేఖయే రెండు దేశాల మధ్య సరిహద్దుగా వ్యవహారంలో ఉంది.[2][3]
బ్రిటిషు ప్రభుత్వానికి విదేశాంగ మంత్రిగాను, సిమ్లా సమావేశంలో ప్రధాన వ్యవహర్తగానూ ఉన్న హెన్రీ మెక్మహాన్ పేరిట ఈ రేఖను పిలుస్తున్నారు. ఆ ఒప్పందంపై మెక్మహాన్, టిబెట్ ప్రభుత్వం తరపున లాంచెన్ సాత్రా సంతకాలు చేసారు.[4] ఈ రేఖ పశ్చిమాన భూటాన్ నుండి 890 కి.మీ., తూర్పున బ్రహ్మపుత్రా నది మలుపు నుండి 260 కి.మీ. వరకు విస్తరించి ఉంది. ఎక్కువగా ఈ రేఖ హిమాలయ శిఖరాల మీదుగా సాగుతుంది. సిమ్లా ఒప్పందాన్ని (మెక్మహాన్ రేఖతో సహా) భారత ప్రభుత్వం తొలుత తిరస్కరించింది. 1907 ఆంగ్లో రష్యన్ ఒప్పందానికి ఇది వ్యతిరేకంగా ఉండడం ఇందుకు కారణం. ఈ ఒప్పందం 1921 లో రద్దైంది. అయినా, మెక్మహాన్ రేఖను 1935 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. 1935 లో ఒలాఫ్ కారో అనే బ్రిటిషు సివిల్ సర్వీసు అధికారి, మెక్మహాన్ రేఖను అధికారిక మ్యాపులపై ముద్రించేలా బ్రిటిషు ప్రభుత్వాన్ని ఒప్పించాడు.[5]
మెక్మహాన్ రేఖను భారత్ చట్టబద్ధమైన సరిహద్దుగా గుర్తించగా, చైనా మాత్రం సిమ్లా ఒప్పందాన్ని, ఈ రేఖనూ కూడా గుర్తించేందుకు నిరాకరించింది. టిబెట్ సార్వభౌమిక దేశం కాదనీ, దానికి ఒప్పందాలు కుదుర్చుకునే అధికారం లేదనీ చైనా వాదన.[6] ఈ రేఖకు దక్షిణాన 65,000 చ.కి.మీ. ప్రాంతాన్ని టిబెట్ స్వాధికార ప్రాంతంలో భాగంగా చైనా మ్యాపులు చూపిస్తాయి. దీన్నిదక్షిణ టిబెట్ అనీ చైనా అంటోంది.[7] 1962 చైనా భారత యుద్ధంలో చైనా దళాలు ఈ ప్రాంతాన్ని కొన్ని రోజుల పాటు ఆక్రమించుకున్నాయి. చైనా గుర్తించిన వాస్తవాధీన రేఖ ఇరుదేశాల సరిహద్దు తూర్పు భాగాన "మెక్మహాన్ రేఖ అని చెప్పబడే రేఖ"తో దాదాపుగా కలుస్తుందని 1959 లో దౌత్య పత్రంలో జౌ ఎన్లై తెలిపాడు.[8]
1959 కి ముందు, 14 వ దలైలామా "తవాంగ్తో సహా, దక్షిణ టిబెట్ భారతదేశ సర్వభౌమాధికారాన్ని గుర్తించలేదు" అన్నాడు. 2003 లో "వాస్తవానికి అరుణాచల్ ప్రదేశ్ టిబెట్లో భాగమ"ని ఆయన చెప్పాడు. అయితే 2007 జనవరిలో 1914లో బ్రిటిషు ప్రభుత్వము, టిబెట్ ప్రభుత్వమూ రెండూ కూడా మెక్మహాన్ రేఖను గుర్తించాయని ఆయన చెప్పాడు.[9] 2008 లో "బ్రిటిషు, టిబెట్ ప్రభుత్వాల ప్రతినిధులు సంతకాలు పెట్టిన ఒప్పందం ప్రకారం, అరుణాచల్ ప్రదేశ్, భారత్లో అంతర్భాగమ"ని ఆయన చెప్పాడు.[10]
19 వ శతాబ్ది మధ్యలో తవాంగ్ టిబెట్ రాజ్యంలో భాగమని బ్రిటిషు వారు కనుగొనడంతో సరిహద్దు రేఖను గీయాలనే ఆలోచన వారికి కలిగింది. 1873 లో, బ్రిటిషు వారి భారత ప్రభుత్వం అంతర్జాతీయ సరిహద్దుగా భావిస్తూ ఒక బాహ్య రేఖను గీసారు.[11] ఈ రేఖ హిమాలయ పర్వత పాదాలను స్పృశిస్తూ, ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ సరిహద్దు గుండా సాగుతుంది. బర్మా[12] సిక్కింలతో.[13] టిబెట్ సరిహద్దులకు సంబంధించి బ్రిటిషు ప్రభుత్వం చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ ఒప్పందాల ద్వారా గుర్తించిన సరిహద్దులను గుర్తించడానికి టిబెట్ ప్రభుత్వం నిరాకరించింది.[మూలాలు తెలుపవలెను] సర్ ఫ్రాన్సిస్ యంగ్హస్బండ్ నాయకత్వంలో బ్రిటిషు సేనలు టిబెట్ను ఆక్రమించి టిబెటన్లచే ఒప్పందాన్ని ఒప్పించాయి.[14] 1907 లో బ్రిటను, రష్యాలు టిబెట్పై చైనా సార్వభౌమత్వాన్ని గుర్తించి, "చైనా ప్రభుత్వపు మధ్యవర్తిత్వంలో తప్ప టిబెట్తో నేరుగా సంప్రదింపులు జరపరాద"ని నిర్ణయించాయి.[15]
1910–12 లో క్కింగ్ ప్రభుత్వం టిబెట్లో చైనా పాలనను విధించేందుకు సేనలను పంపినపుడు సరిహద్ద్దులపై బ్రిటిషు ప్రభుత్వం తిరిగి దృష్టి సారించింది. ఇప్పటి అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలోకి తమ సేనలను పంపి ఈశాన్య సరిహద్దు ప్రదేశం అనే సంస్థను ఏర్పాటు చేసి పరిపాలనను మొదలుపెట్టింది (1912). ఈ సంస్థ 1912–13 లో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న గిరిజన ప్రభువులతో ఒప్పందాలను కుదుర్చుకుంది.[మూలాలు తెలుపవలెను] బాహ్య రేఖను ఉత్తరానికి జరిపారు. కానీ తవాంగ మాత్రం టిబెట్లో భాగంగానే ఉంచేసారు.[16] చైనాలో క్కింగ్ వంశం పతనమయ్యాక, టిబెట్ చైనా అధికారులు, సైనికులు అందరినీ బహిష్కరించి, స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. (1913).[17][18]
1913 లో టిబెట్ స్థితిని చర్చించేందుకు సిమ్లాలో బ్రిటిషు అధికారులు సమావేశమయ్యారు.[19] భ్రితన్, చైనా, టిబెట్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సుమారుగా ప్రస్తుత స్వాధికార టిబెట్ ప్రాంతమంతా "బాహ్య టిబెట్," దలైలామా పాలనలో చైనా యొక్క అధిసత్తాక దేశంగా ఉంటుంది.[20] అధిసత్తాక అంటే తనపై ఆధారపడిన దేశంపై ఒక దేశానికి ఉండే పరిమితమైన ఆధిపత్యం. 1914 జూలై 3 నాటి అంతిమ ఒప్పందంలో సరిహద్దు యొక్క వివరణ ఏమీ లేదు.[21] పెద్దగా విపులంగా లేని ఒక చిన్న మ్యాపును మాత్రం చూపించారు. చైనాను అంతర టిబెట్నూ, అంతర టిబెట్ను బాహ్య టిబెట్నూ వేరు చేసే రేఖలు మాత్రమే అందులో ఉన్నాయి. ఈ మ్యాపుపై చైనా రాయబారి ఇవాన్ చెన్ యొక్క సంతకం లేదు. అయితే గతంలో చెన్ ఇలాంటిదే 1914 ఏప్రిల్ 27 నాటి ఒక చిత్తు ప్రతిపై సంతకం పెట్టి ఉన్నాడు.
అ రెండు చిత్తు ప్రతులు కూడా చైనాకు అంతర టిబెట్కూ మధ్యన ఉన్న ఎర్రటి రేఖను వాయవ్యంగా, దాదాపు మెక్మహాన్ రేఖ పొడవునా విస్తరించి, తవాంగ్ వద్ద ఉన్న భూటాన్ త్రిబిందువు వద్ద కలుస్తుంది. అయితే ఈ రెండు రేఖల్లోనూ ఇప్పటి అరుణాచల్ ప్రదేశ్ భూభాగాన్ని బ్రిటిష్ ఇండియాగా సూచించలేదు.
వాటి కంటే ఎంతో ఎక్కువ వివరంగా ఉన్న 194 మార్చి 24-25 నాటి మెక్మహాన్ రేఖ మ్యాపుపై బ్రిటిషు, టిబెట్ ప్రతినిధులు సంతకం చేసారు. ఈ మ్యాపు తయారీ, మెక్మహాన్ రేఖపై చర్చలు రెండూ కూడా చైనా ప్రతినిధులు లేకుండానే జరిగాయి.[22][23] సిమ్లా సమావేశంలో తీర్మానంపై సంతకం పెట్టేందుకు నిరాకరించాక, బ్రిటిషు టిబెట్ ప్రతినిధులు ఆ ఒప్పందం ప్రకారం చైనాకు ఏ అధికారమూ దక్కకుండా ఉండేలా ఒక నోట్ను చేర్చి, దాన్ని ఒక ద్వైపాక్షిక ఒప్పందంగా సంతకం చేసారు.[24] టిబెట్ ప్రభుత్వం కొత్త సరిహద్దును ఆమోదించాలంటే సిమ్లా ఒప్పందాన్ని చైనా అంగీకరించాలనేది టిబెట్ షరతు అని బ్రిటిషు రికార్డులు తెలియజేస్తున్నాయి. బ్రిటను చైనా ఆమోదాన్ని పొందలేకపోయింది కాబట్టి, మెక్మహాన్ రేఖ చెల్లదని టిబెట్ భావించింది.[1]
భారత ప్రభుత్వం తొలుత సిమ్లా ఒప్పందాన్ని తిరస్కరించింది. అది 1907 నాటి ఆంగ్లో రష్యన్ ఒప్పందాన్ని అతిక్రమిస్తోంది. సి.యు.ఐచిసన్ రాసిన ఎ కలెక్షన్ ఆఫ్ ట్రీటీస్ లో సిమ్లాలో ఎటువంటి ఒప్పందమూ జరగలేదని రాసాడు.[25] 1921 లో ఆంగ్లో రష్యన్ ఒప్పందాన్ని రెండు దేశాలూ కూడా రద్దు చేసుకున్నాయి.[26] 1935 లో ఓలాఫ్ కారో అనే సివిల్ సర్వీసు అధికారి మెక్మహాన్ రేఖపై దృష్టి సారించే దాకా దాన్ని అందరూ మర్చిపోయారు. మెక్మహాన్ రేఖను అధికారిక సరిహద్దుగా గుర్తిస్తూ 1937 లో సర్వే ఆఫ్ ఇండియా ఒక మ్యాపును ప్రచురించింది. 1938 లో బ్రిటిషు వారు ఐచిసన్స్ ట్రీటీస్లో సిమ్లా ఒప్పందాన్ని ప్రచురించారు. గతంలో ప్రచురించిన పుస్తకాన్ని గ్రంథాలయాల నుండి తీసేసి, ఈ కొత్త ప్రచురణను ఆ స్థానంలో చేర్చారు. ఈ ప్రచురణలో సిమ్లా ఒప్పందాన్ని బ్రిటను, టిబెట్లు శిరసావహించాయని, చైనా ఆ ఒప్పందంలో భాగం కాదనీ పేర్కొన్నారు.[27] దీని ప్రచురణ తేదీని 1929 అని తప్పుగా పేర్కొన్నారు.
1938 ఏప్రిల్లో కెప్టెన్ జి.ఎస్. లైట్ఫుట్ నేతృత్వంలో ఒక చిన్న బ్రిటిషు దళం తవాంగ్ చేరుకుని, జిల్లాఅంతా భారతదేశంలో భాగమని అక్కడున్న మొనాస్టరీకి తెలియజేసారు. టిబెట్ ప్రభుత్వం దీన్ని ఖండించింది. లైట్ఫుట్ వెళ్ళిపోగానే తన అధికారాన్ని తిరిగి స్థాపించుకుంది. 1951 వరకూ జిల్లా టిబెట్ చేతులోనే ఉండిపోయింది. అయితే, మెక్మహాన్ రేఖ యొక్క ఇతర ప్రాంతాల్లో బ్రిటిషు వారి కార్యకలాపాలకు లాసా ఎటువంటి అభ్యంతరమూ తెలుపలేదు. 1944 లో NEFT తనకు కేటాయించిన మొత్తం భూభాగమంతటిపై నియంత్రణ ఏర్పరచుకుంది - తవాంగ్పై టిబెట్ తిరిగి తన పెత్తనాన్ని ఏర్పరచుకుంది. 1947 లో టిబెట్, మెక్మహాన్ రేఖకు దక్షిణాన ఉన్న ప్రాంతాలపై తన దావాను ప్రకటిస్తూ భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. .[28] 1949 లో చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చాక, టిబెట్ను విముక్తి చెయ్యాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించింది. 1947 లో స్వాతంత్ర్యం పొందిన భారత్ దీనికి స్పందిస్తూ, మెక్మహాన్ రేఖను సరిహద్దుగా ప్రకటిస్తూ, తవాంగ్పై తన నియంత్రణను నిర్ణయాత్మకంగా ప్రకటించింది (1950–51).
1950 ల్లో భారత చైనా సంబంధాలు సహృద్భావంతో ఉండేవి. సరిహద్దు వివాదం సద్దు లేకుండా ఉండేది. ఆ సమయంలో నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వం హిందీ చీనీ భాయి భాయి అనే నినాదాన్ని ప్రచారంలో పెట్టింది. చైనా సరిహద్దు వివాదాన్ని లేవదీస్తే తాను చర్చలు చెయ్యనని నెహ్రూ 1950 లో చేసిన తన ప్రకటనకు కట్టుబడి ఉన్నాడు. చైనా దాన్ని చారిత్రిక వాస్తవంగా, ముగిసిన అధ్యాయంగా అంగీకరిస్తుందని ఆయన భావించాడు.[29] 1954 లో ఈ వివాదాస్పద ప్రాంతానికి నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఏజెన్సీ (నేఫా) అని పేరు పెట్టాడు.
1954 లో చేసుకున్న ఒక ఒప్పందం ద్వారా టిబెట్ చైనాలో అంతర్భాగమని భారత్ గుర్తించి బ్రిటిషు వారి ద్వారా టిబెట్పై తమకు సంక్రమించిన హక్కులను వదులుకుంది.[29] 1954 లో సరిహద్దు సమస్యపై జరిగిన సమావేశంలో చైనా ఈ విషయాన్ని లేవనెత్తలేదు కాబట్టి ఈ సమస్య ముగిసిపోయిందని నెహ్రూ అన్నాడు. కానీ ఆ సమావేశానికి ముందు భారత్ లిఖించిన సరిహద్దు మెక్మహాన్ రేఖ ఒక్కటే. ఆ సమావేశం జరిగిన చాలా నెలల తరువాత భారత్ తనవిగా భావిస్తున్న అక్సాయ్ చిన్ వంటి అనేక ప్రాంతాలను చూపిస్తూ భారతదేశ మ్యాపులను ప్రచురించవలసినదిగా నెహ్రూ ఆదేశించాడు.[30] ఈ కొత్త మ్యాపుల్లో NEFA ప్రాంతంలోని శిఖరాలను సరిహద్దుగా సూచించారు. ఈ సరిహద్దు మెక్మహాన్ రేఖకు ఉత్తరంగా ఉన్నప్పటికీ అలాగే చూపించారు.[8]
1959 లో టిబెట్ తిరుగుబాటు విఫలమవడం, 14 వ దలైలామా భారత్లో తలదాచుకోవడం మొదలైన వాటితో చైనా చేత మెక్మహాన్ రేఖను గుర్తింపజేయడంలో వైఫల్యంపై భారత పార్లమెంటు సభ్యులు నెహ్రూను ఆక్షేపించారు. దానికితోడు, భారత పత్రికలు టిబెట్కు స్వాతంత్ర్యం ఇవ్వాలని బహిరంగంగా సమర్ధించాయి. దీనికి సత్వర స్పందనగా, తన అధికారుల సలహాలకు విరుద్ధంగా "సరిహద్దు వెంట వీలైనన్ని సైనిక స్థావరాలను" ఏర్పాటు చేయించాడు. భారత పత్రికల్లో వస్తున్న రాతల నేపథ్యంలో ఈ స్థావరాలను కూడా గమనించిన చైనా నేతలు, ఈ ప్రాంతంపై నెహ్రూకు ఆశలున్నాయని భావించారు. 1959 ఆగస్టులో చైనా దళాలు త్సారి చు నదిపై ఉన్న లాంగ్జు వద్ద ఉన్న ఓ కొత్త భారత స్థావరాన్ని ఆక్రమించాయి. మాక్స్వెల్ పుస్తకంలోని మ్యాపు ప్రకారం, లాంగ్జు మెక్మహాన్ రేఖకు కొద్దిగా ఉత్తరంగా ఉంది. భారత పర్వతారోహకుడైన హరీష్ కపాడియా కూడా ఈ సంగతిని నిర్ధారించాడు. అతడి మ్యాపు ప్రకారం లాంగ్జు మెక్మహాన్ రేఖకు ఒకటి రెండు కిలోమీటర్లు చైనా వైపున "చైనా సైనిక శిబిరం ఉన్న మిగ్యిటున్ పట్టణానికి చేరువలో ఉంది.1959 అక్టోబరు 24 న నెహ్రూకు రాసిన ఉత్తరంలో జౌ ఎన్లై వాస్తవాధీన రేఖ నుండి ఇరు దేశాలూ తమ బలగాలను 20 కిలోమీటర్లు వెనక్కు మళ్ళించాలని ప్రతిపాదించాడు.[31] ఆ తరువాత కొన్నాళ్ళకే జౌ ఆ రేఖను "తూర్పున మెక్మహాన్ రేఖ అని చెప్పబడే రేఖ, పశ్చిమాన ఇరుదేశాలూ వాస్తవంగా నియంత్రిస్తూ ఉన్న రేఖ" అని నిర్వచించాడు.
1961 నవంబరులో నెహ్రూ వివాదాస్పద ప్రాంతాల్లో సైనిక శిబిరాలను నెలకొల్పే "ఫార్వర్డు పాలసీ"ని లాంఛనంగా ప్రారంభించాడు. జౌ చెప్పిన వాస్తవాధీన రేఖకు ఉత్తరాన కూడా 43 శిబిరాలున్నాయి ఈ ప్రణాళికలో. 1962 సెప్టెంబరు 8 న నమ్కా చూ లోయలో ధోలా వద్ద చైనా దళాలు భారత శిబిరంపై దాడి చేసాయి. మాక్స్వెల్లో 360 వ పేజీలోని మ్యాపు ప్రకారం, ఇది మెక్మహాన్ రేఖకు 7 కిలోమీటర్లు ఉత్తరంగా థాగ్ లా శిఖరానికి దక్షిణాన ఉంది. అక్టోబరు 20 న చైనా మెక్మహాన్ రేఖ మీదుగా ఒక దాడి, దానికి ఉత్తరంగా మరొక దాడీ చేసింది. దీనికి కొనసాగింపే చైనా భారత యుద్ధం. ఈ యుద్ధంలో చైనా భారత్లోకి వేగంగా చొచ్చుకు వచ్చింది. నేఫాకు తూర్పున రూపా వరకు 90 కిలోమీటర్లు, పశ్చిమాన తవాంగ్ కు ఆగ్నేయంగా 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాకు వరకూ వచ్చింది. నేఫాకు తూర్పు కొసన రేఖ నుండి 30 కి.మీ. దూరంలో ఉన్న వాలాంగ్ వరకూ చొచ్చుకు వచ్చింది.[32] సోవియట్ యూనియన్, [33] అమెరికా, బ్రిటన్లు భారత్కు సైనిక సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి. అప్పుడు చైనా మెక్మహాన్ రేఖ వెనక్కి వెళ్ళి, భారతీయ యుద్ధ ఖైదీలను విడుదల చేసింది (1963). ప్రభుత్వం ఈ ఓటమికి కారణం ఊహించని మెరుపుదాడిగా చెబుతూ వచ్చింది.[34]
1972 లో నేఫాను అరుణాచల్ ప్రదేశ్గా పేరు మార్చారు — చైనా మ్యాపుల్లో ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్గా చూపించారు. 1981 లో చైనా నేత డెంగ్ జియావోపింగ్ సరిహద్దు వివాదానికి ఒక ప్యాకేజీ పరిష్కారం సూచించాడు. ఈ విషయమై 8 సార్లు సమావేశాలు జరిగినప్పటికీ పరిష్కారం కుదరలేదు.
1984 లో తవాంగ్ ప్రాంతంలోని భారత ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులు సుమ్దొరాంగ్ చు లోయలో ఒక పరిశీలక శిబిరాన్ని స్థాపించారు. ఇది అక్కడి అత్యంత ఎత్తైన శిఖరానికి దక్షిణంగా ఉంది. కానీ మెక్మహాన్ రేఖకు 3 కి.మీ. ఉత్తరంగా ఉంది. శీతాకాలానికి ముందు వాళ్ళు ఆ శిబిరాన్ని విడిచి వెళ్ళారు. 1986 లో భారత బృందం వెళ్ళడానికి ముందే చైనా దళాలు ఆ ప్రాంతంలో తిష్ఠ వేసాయి. ఈ సంగతి భారత ప్రజలకు తెలియగానే పెద్ద దుమారం చెలరేగింది. 1986 అక్టోబరులో భారత్కు పాఠం నేర్పుతానని బెదిరించాడు. భారత సైన్యం లోయలోకి ఒక టాస్క్ ఫోర్సును విమానంలో తరలించింది. 1987 మేలో ఘర్షణ నివారించినప్పటికీ, గూగుల్ ఎర్త్ ప్రకారం, రెండు సైన్యాలు అక్కడే ఉండిపోయాయని ఇటీవలే అక్కడ రోడ్లు, ఇతర వసతులూ నిర్మించారనీ కూడా తెలుస్తోంది.
1988 లో భారత ప్రధాని రాజీవ్ గాంధీ చైనా సందర్శించినపుడు సరిహద్దు సమస్యపై ఒక సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేసారు. అది పెద్దగా పురోగతి సాధించలేదు. 1993 నాటి చైనా-భారత ఒప్పందం ప్రకారం వాస్తవాధీన రేఖను నిర్వచించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసారు; ఈ బృందం కూడా సాధించిందేమీ లేదు. 1996 నాటి చైనా భారత ఒప్పందం సరిహద్దు గొడవలను నివారించేందుకు "విశ్వాసం నెలకొల్పే చర్యలు" తీసుకుంది. 1998 లో భారత అణు పరీక్షల తరువాత, సరిహద్ద్దు వెంటా తరచూ అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నప్పటికీ, రెండు పక్షాలూ కూడా వీటికి కారణం వాస్త్వాధీన రేఖ వెంబడి ఒక కిలోమీటరులోపే ప్రాంతంగురించేనని చెబుతున్నాయి.[35]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.