సిల్క్ రోడ్డు
From Wikipedia, the free encyclopedia
సిల్క్ రోడ్డు తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించే వాణిజ్య మార్గాల అల్లిక. క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దం నుండి సా.శ. 18 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన పరస్పర సంపర్కాలకు ఈ సిల్క్ మార్గం అనుసంధాన కర్తగా ఉంది.[1][2][3] సిల్క్ రోడ్డు ప్రధానంగా తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలను దక్షిణ ఆసియా, పర్షియా, అరేబియా ద్వీపకల్పం, తూర్పు ఆఫ్రికా, దక్షిణ ఐరోపాతో కలిపే భూ మార్గాలను సూచిస్తుంది.
సిల్క్ రోడ్డు (Silk Road) | |
---|---|
మార్గ సమాచారం | |
Time period | సుమారు సా.శ.పూ 114–సా.శ 1450ల వరకు |
అధికారిక పేరు | Silk Roads: the Routes Network of Chang'an-Tianshan |
రకం | Cultural |
క్రైటేరియా | ii, iii, iv, vi |
గుర్తించిన తేదీ | 2014 (38th session) |
రిఫరెన్సు సంఖ్య. | 1442 |
Region | Asia-Pacific |
సిల్క్ రోడ్డు అంటే పట్టు మార్గం అని అర్థం. చైనాలోని హాన్ రాజవంశం కాలం నుండి (సా.శ.పూ 207–సా.శ 220) మొదలు, ఈ దారి పొడవునా జరిగిన లాభదాయకమైన పట్టు వ్యాపారం కారణంగా దీనికి సిల్క్ రోడ్డు దాని పేరు వచ్చింది. చైనా సామ్రాజ్య రాయబారి జాంగ్ కియాన్ చేసిన యాత్రలూ, అన్వేషణల ద్వారానూ, అనేక సైనిక విజయాల ద్వారానూ హాన్ రాజవంశం క్రీ.పూ. 114 ప్రాంతంలో మధ్య ఆసియాలో విస్తరించింది.[4] చైనీయులు తమ వాణిజ్య ఉత్పత్తుల భద్రత పట్ల ఎంతో ఆసక్తి చూపారు. వాణిజ్య మార్గపు రక్షణ కోసం మహా కుడ్యాన్ని విస్తరించారు.[5]
చైనా, కొరియా,[1] జపాన్,[2] భారత ఉపఖండం, ఇరాన్, ఐరోపా, హార్న్ ఆఫ్ ఆఫ్రికా, అరేబియా నాగరికతల అభివృద్ధిలో సిల్క్ రోడ్డు వాణిజ్యం ముఖ్యమైన పాత్ర పోషించింది. వివిధ నాగరికతల మధ్య సుదూరమైన రాజకీయ, ఆర్థిక సంబంధాలను తెరిచింది.[6] చైనా నుండి ఎగుమతి చేసిన ప్రధాన వాణిజ్య వస్తువు పట్టు అయినప్పటికీ, మతాలు (ముఖ్యంగా బౌద్ధమతం), సమకాలీన తత్వాలు, శాస్త్రాలు, కాగితం, గన్పౌడర్ వంటి సాంకేతికతలతో సహా అనేక ఇతర వస్తువులు, ఆలోచనలూ కూడా మార్పిడి చేసుకున్నారు. కాబట్టి ఆర్థిక వాణిజ్యంతో పాటు, సిల్క్ రోడ్డు వివిధ నాగరికతల మధ్య సాంస్కృతిక వాణిజ్యం కోసం కూడా ఉపయోగపడింది.[7] వ్యాధులు, ముఖ్యంగా ప్లేగు, కూడా సిల్క్ రోడ్డు వెంట వ్యాపించాయి.[8]
ఈ దారి గుండా చైనా ప్రధానంగా పట్టు, తేయాకు, పోర్సలీన్ ఎగుమతి చేసేది. భారతదేశం సుగంధద్రవ్యాలు, దంతాలు, మిరియాలు, నేతవస్త్రాలు, విలువైన రత్నాలూ ఎగుమతి చేసేది. రోమన్ సామ్రాజ్యం బంగారం, వెండి, ద్రాక్షరసం, తివాచీలు, నగలు ఎగుమతి చేసేది. ఈ దారి పొడవునా పూర్తిగా ఒకే మనిషి ప్రయాణించడం చాలా తక్కువ. మధ్యలో ఎంతోమంది దళారీలు ఉండేవారు. ప్రాచీన భారతీయులూ, బాక్టీరియనులూ ప్రధాన వర్తకులుగా ఉండగా, సా.శ. 5–8 శతాబ్దాలలో సోగ్దియనులూ, ఆ తర్వాతకాలంలో అరేబియా, పర్షియా వర్తకులూ ప్రధానంగా వర్తకం చేసేవారు.
2014 జూన్లో, యునెస్కో సిల్క్ రోడ్డు లోని చాంగన్-టియాన్షాన్ కారిడార్ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేర్కొంది. భారతీయ భాగం తాత్కాలిక సైట్ జాబితాలో ఉంది.