1947 లో జమ్మూలో ముస్లిములపై జరిగిన ప్రతీకార దాడులు From Wikipedia, the free encyclopedia
భారత విభజన తరువాత, 1947 సెప్టెంబరు-నవంబరు కాలంలో జమ్మూ ప్రాంతంలో అనేక మంది ముస్లిములను ఊచకోత కోసారు. ఎంతో మందిని పాకిస్తాను భూభాగంలోకి తరిమికొట్టారు. ఈ ఊచకోతను చేసినది తీవ్రవాద హిందువులు, సిక్ఖులూను. వీరికి మహారాజా హరిసింగ్ యొక్క డోగ్రా సేనలు.[6] రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు ఈ అల్లర్ల పథకరచనలోను, అమలులోనూ కీలక సహాయం అందించారు.[7][8]
ఆ తరువాత, నేటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులోని మీర్పూర్లో పాకిస్తాన్ గిరిజన జాతులు, సైనికులూ 20,000 మంది హిందువులను ఊచకోత కోసారు.[3][4][5] అలాగే జమ్మూ డివిజను లోని రాజౌరి ప్రాంతంలో అనేక మంది హిందువులు, సిక్ఖులను ఊచకోత కోసారు.
1947 దేశ విభజన సమయాంలో బ్రిటిషు వారు సంస్థానాలపై తమ ఆధిపత్యాన్ని వదలుకున్నారు. ఈ సంస్థానాల వారు తమ ఇష్టానుసారం భారత్లోనో, పాకిస్తాన్లోనో చేరవచ్చు లేదా స్వతంత్ర దేశంగానూ ఉండిపోవచ్చు. జమ్మూకాశ్మీరు సంస్థానాధీశుడు, మహారాజా హరిసింగ్ తన సంస్థానాన్ని స్వతంత్రంగా ఉంచాలనుకుంటున్నట్లు సూచించాడు. సంస్థానంలోని రాజకీయ పక్షాలన్నీ అతడి నిర్ణయాన్ని హర్షించాయి. ఒక్క ముస్లిము కాన్ఫరెన్స్ మాత్రం పాకిస్తాన్లో చేరాలని 1947 జూలై 19 న ప్రకటించింది.[9] దీనికి జమ్మూ ప్రాంతంలో ప్రాబల్యం ఉంది. పాకిస్తాన్ కోసం పోరాడి సాధించుకున్న ఆల్ ఇండియా ముస్లిం లీగ్తో ముస్లిం కాన్ఫరెన్స్కు సన్నిహిత సంబంధాలున్నాయి.
విభజన సమయంలో ప్రశాంతంగా ఉన్న కాశ్మీరు లోయ లాగా కాకుండా, పంజాబు పక్కనే ఉన్న జమ్మూ ప్రాంతం సామూహిక వలసలను, దాంతో హింసాత్మక సంఘటనలనూ చూసింది. 1947 మార్చి నాటికి పెద్ద సంఖ్యలో హిందువులు, సిక్ఖులూ రావల్పిండి, సియాల్కోట్ల నుండి వచ్చి చేరుకున్నారు. వారు "పశ్చిమ పంజాబులో ముస్లిములు జరుపుతున్న ఘోర అకృత్యాల గురించిన" కథనాలను చెప్పారు. ఇవి జమ్మూలోని ముస్లిములపై ప్రతీకార హింస చేసేందుకు ముస్లిమేతరులను ప్రేరేపించాయి. "ఈ హింసకు సియాల్కోట్లో జరిగిన హింసకూ చాలా సామ్యాలున్నాయి".[10] ఇల్యాస్ చత్తా ఇలా రాసారు, "పశ్చిమ పంజాబులో జరిగిన హింసకు ప్రతిగా 1947 సెప్టెంబరు-అక్టోబరుల్లో కాశ్మీరీ ముస్లిములు భారీ వెల చెల్లించారు."[11]
ఇయాన్ కోప్ల్యాండ్ ప్రకారం, ముస్లిములపై పాలనా యంత్రాంగం చేపట్టిన మారణ కాండకు పాక్షిక కారణం అంతకు ముందు మొదలైన పూంచ్ తిరుగుబాటుకు ప్రతీకారమే.[12] పరిశీలకులు ఇలా అంటారు: హరి సింగ్, అతడి పాలనా యంత్రాంగం యొక్క ప్రధాన లక్ష్యం ఆ ప్రాంతంలోనిముస్లిము ప్రజలను తీసివేసి, హిందూ మెజారిటీ ప్రాంతంగా మార్చడమే.[13] ఇల్యాస్ చత్తా, పాత్రికేయుడు వేద్ భసీన్లు విస్తృతమైన మత కల్లోలాలకు కారణం మహారాజా హరిసింగ్, అతడి బలగాలు శాంతి భద్రతలను సరిగా నిర్వహించలేక పోవడమేనని ఆరోపిస్తారు.
ఉధంపూర్ జిల్లాలో ముస్లిములపై విస్తృతంగా ఊచకోతలు జరిగాయని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఉధంపూర్ పట్టణం, చెనాని, రామ్నగర్, భదర్వా, రీసి ప్రాంతాల్లో ఎక్కువగా జరిగాయి. చంబ్, దేవ బటాలా, మనాసర్, అఖ్నూర్లలో పెద్ద సంఖ్యలో ముస్లిములను హతమార్చారని తెలిసి, అనేకమంది ముస్లిములు పాకిస్తానుకో, జమ్మూకో పారిపోయారు. కథువా, బిలావర్ ప్రాంతాల్లో కూడా అనేకమంది ముస్లిములను హతమార్చారు. స్త్రీలను ఎత్తుకుపోయి చెరచారు.[14][15]
జమ్మూ చుట్టుపక్కల ముస్లిముల సామూహిక హననం జరిగింది. సంస్థానపు దళాలు ఈ హింసకు నాయకత్వం వహించాయి. అధికారులు ఆందోళనకారులకు ఆయుధాలు అందించారు. సంస్థానపు సైన్యం నుండి అనేక మంది ముస్లిము సైనికులను తొలగించారు. ముస్లిము పోలీసు అధికారులను కూడా తొలగించారు[16][lower-alpha 1] నగరం కర్ఫ్యూలో ఉన్నప్పటికీ ముస్లిములు మెజారిటీగా లేని ప్రాంతాల్లో సాయుధ దుండగులు వాహనాల్లో వచ్చి ముస్లిములను హతమార్చారు.[lower-alpha 2] చుట్టుపక్కల గ్రామాల నుండి నగరంలో పాలు సరఫరా చేసేందుకు వస్తున్న గుజ్జర్ స్త్రీ పురుషు లనేకులను దారిలో చంపేసారు. జమ్మూలోని రామ్నగర్ రిజర్వు గుజ్జర్ స్త్రీ పురుషుల శవాలతో నిండిపోయింది. జమ్మూ లోని ముస్లిము ప్రాంతాలైన తాలాబ్ ఖటికాన్, మొహల్లా ఉస్తాద్లను దిగ్బంధనం చేసి, వారికి నీళ్ళు, ఆహారం సరఫరాలను ఆపేసారు. తాలాబ్ ఖటికాన్ లోని ముస్లిములు అందుబాటులో ఉన్న ఆయుధాలను చేపట్టి స్వీయరక్షణ కోసం సంఘటితమయ్యారు. వీరికి ముస్లిము కాన్ఫరెన్స్ మద్దతు లభించింది. చివరికి ప్రభుత్వం వాళ్ళను లొంగిపొమ్మని చెప్పి, వాళ్ళను తమ తమ భద్రత దృష్ట్యా పాకిస్తాన్కు వెళ్ళమని చెప్పింది. వేల సంఖ్యలో ఉన్న వాళ్ళందరినీ అనేక ట్రక్కుల్లో కెక్కించి సైనిక దళాల కాపలాతో నగరం దాటిస్తూండగా, నగర శివార్లలో సాయుధ దుండగులు వీళ్లపై దాడి చేసి, స్త్రీలను అపహరించి, పురుషులను హతమార్చారు.[17][18]
1947 నవంబరు 16 న షేఖ్ అబ్దుల్లా జమ్మూ చేరుకుని మొహల్లా ఉస్తాద్ వద్ద ఒక శరణార్థి శిబిరాన్ని ఏర్పాటు చేసాడు.[18]
"ఆనాటి మత కల్లోలాలను గుర్తు చేసుకోవడంలో నా ఉద్దేశం ఒక్కటే.. మతోన్మాదికి, హంతకుడికీ మతం లేదు అని చెప్పడం. మతోన్మాదుల దౌష్ట్యానికి బలైనది మానవత్వం. చరిత్ర నుండి మనం సరైన పాఠాలను నేర్చుకోవాలి. ఈ మతానికో ఆ మతానికో చెందిన ఉన్మాదులు వాతావరణాన్ని విషపూరితం చేసి, మత సామరస్యాన్ని దెబ్బతీయకుండా కాపాడుకోవాలి."
— వేద్ భసీన్, 1947 లో జమ్మూలో జరిగిన హింసకు ప్రత్యక్ష సాక్షి. |
1947 డిసెంబరు 25 న ఢిల్లీలో ఒక ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ మహాత్మా గాంధీ జమ్మూ పరిస్థితి గురించి ఇలా మాట్లాడాడు: "జమ్మూ లోని హిందువులు, సిక్ఖులు, అక్కడికి బయటినుండి వెళ్ళినవారూ కలిసి, ముస్లిములను హతమార్చారు. అక్కడ జరుగుతున్న దానికి కాశ్మీరు మహారాజా బాధ్యుడు. పెద్ద సంఖ్యలో ముస్లిములను చంపారు. ముస్లిము స్త్రీలను అగౌరవపరచారు"[19]
వేద్ భసీన్, ఇల్యాస్ చత్తా ఇలా చెప్పారు: "జమ్మూ అల్లర్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యులు, పశ్చిమ పాకిస్తాన్ నుండి వచ్చిన వ్యక్తులతో కలిసి చేసారు. హరి సింగ్, అతడి పాలనా యంత్రాంగం వీరికి గట్టి మద్దతు ఇచ్చారు. వారి ప్రధాన ధ్యేయం జమ్మూ ప్రాంతాన్ని ముస్లిమేతర మెజారిటీ ప్రాంతంగా చెయ్యడమే. భసీన్ ఇలా అన్నాడు: ఈ అల్లర్లు అరెస్సెస్ కార్యకర్తలు రచించినవే నన్నది స్పష్టం."
అకాలీ సిక్ఖులు, కొందరు మాజీ భారత జాతీయ సైనికాధికారులు కూడా వీరితో చేరి, హింసలో పాల్గొన్నారని పరిశీలకులు అన్నారు.
ఈ ఊచకోతలు అప్పటి జమ్మూ కాశ్మీరు ప్రధాన మంత్రి మెహర్ చంద్ మహాజన్, జమ్మూ గవర్నరు చేత్ రాం చోప్రాల సమక్షంలో జరుగాయని భసీన్ చెప్పాడు. ఉధంపూర్, భదర్వాల్లో అల్లర్లకు నాయకత్వం వహించిన వారిలో కొందరు, తరువాతికాలంలో నేషనల్ కాన్ఫరెన్సులో చేరి మంత్రులు కూడా అయ్యారని కూడా చెప్పాడు.[lower-alpha 3]
పాకిస్తానులో వేసిన అంచనాల ప్రకారం 50,000 ముస్లిములు హతులయ్యారు.[20] భారత పాక్ ప్రభుత్వాలు సంయుక్తంగా నియమించిన ఇద్దరు ఆంగ్లేయుల బృందం ఏడు ఘటనలను దర్యాప్తు చేసి, మృతుల సంఖ్య 70,000 దాకా ఉండొచ్చని తేల్చింది.[21] ఇయాన్ కోప్ల్యాండ్ మొత్తం మృతుల సంఖ్య 80,000 ఉండొచ్చని చెప్పాడు.[22] వేద్ భసీన్, ఈ సంఖ్య 100,000 దాకా ఉండవచ్చని అన్నాడు. క్రిస్టొఫర్ స్నెడెన్, హతులైన ముస్లిముల సంఖ్య 20,000 - 100,000 మధ్య ఉండవచ్చని అన్నాడు.[1] జస్టిస్ యూసుఫ్ సరాఫ్ 20,000 - 30,000 మధ్య ఉండొచ్చని అన్నాడు.[23]
అక్టోబరు 24 న పూంచ్ తిరుగుబాటు తరువాత పాలాంద్రిలో సర్దార్ ఇబ్రహీమ్ నేతృత్వంలో ఆజాద్ కాశ్మీర్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉండగా, వాయవ్య సరిహద్దు ప్ర్రాంతం నుండి అనేక వేల సంఖ్యలో సాయుధ గిరిజనులు పాకిస్తాన్ పాలకుల, సైన్యపు మద్దతుతో జమ్మూ కాశ్మీరును మహారాజా నుండి ఆక్రమించు కునేందుకు చేరుకున్నారు. అక్టోబరు 26 న జమ్మూ కాశ్మీరును భారత్లో విలీనం చేసాక, భారత పాకిస్తాన్ల మధ్య మొదటి కాశ్మీరు యుద్ధం మొదలైంది.
1947 నవంబరు 7 న పాకిస్తానీ దుండగులు రాజౌరీని ఆక్రమించారు. 30,000 హిందువులను, సిక్ఖులను చంపడంగాని, గాయపరచడంగాని, అపహరించడంగానీ జరిగిందని భారతీయ వర్గాల అంచనా.[24][25][26]
1947 నవంబరు 25 న ఆ తరువాతా, మీర్పూర్లో అనేకమంది హిందువులు, సిక్ఖులూ స్వీయరక్షణ కోసం గుమిగూడారు. వీరిని పాకిస్తాను గిరిజనులు, సైనికులూ ఊచకోత కోసారు. స్త్రీల సామూహిక అపహరణ, మానభంగాలు జరిగాయి. మృతుల సంఖ్య 20,000 వరకూ ఉంటుందని అంచనా.[3][4] 'ఎంతో దిగ్భ్రాంతి చెందిన' సర్దార్ ఇబ్రహీమ్ 1947 నవంబరులో "మీర్పూర్ నుండి హిందువులను పంపేసారు" అని బాధతో చెప్పాడు. కానీ అతడు సంఖ్య ఏదీ చెప్పలేదు.[3][lower-alpha 4][lower-alpha 5]
కింది పట్టికలో 1941 నాటి ముస్లిము జనాభా శాతం, ప్రస్తుత జనాభా శాతాలు ఇవ్వబడ్డాయి. అలాగే మరణాలు, వలసల కారణంగా ముస్లిముల సంఖ్య ఎంత తగ్గిందో కూడా ఈ పట్టికలో చూడవచ్చు.
ప్రాంతం | 1941 జనాభా[28] | 1941 ముస్లిముల శాతం[28] | 2011 ముస్లిముల శాతం[29] | తగ్గిన ముస్లిముల సంఖ్య (అంచనా)[lower-alpha 6] |
---|---|---|---|---|
జమ్మూ జిల్లా[lower-alpha 7] | 431,362 | 39.6% | 7.1% | 151,010 |
కథువా జిల్లా | 177,672 | 25.3% | 10.4% | 29,567 |
ఉధంపూర్ జిల్లా (inc. చెనానీ)[lower-alpha 8] | 306,013 | 42.7% | 41.5% | 5,975 |
రీసి జిల్లా[lower-alpha 9] | 257,903 | 68.1% | 58.4% | 59,804 |
జమ్మూ ప్రాంతం (పూంచ్, మీర్పూర్ కాకుండా) | 1,172,950 | 44.5% | 27.9% | 246,356 |
పూంచ్ జాగీర్ | 421,828 | 90.0% | 90.4% | – |
ప్రాంతం | 1941 జనాభా[28] | 1941 H/S శాతం[28] | 1951 జనాభా[30][lower-alpha 10] | 1951 H/S శాతం[31] | తగ్గిన హిందువులు/సిఖుల సంఖ్య (అంచనా) |
---|---|---|---|---|---|
మీర్పూర్ జిల్లా | 386,655 | 19.6% | 371,459 | – | – |
పూంచ్ జాగీర్ | 421,828 | 10.0% | 293,723 | – | – |
ముజఫరాబాద్ జిల్లా | 264,671 | 7.1% | 220,971 | – | – |
ఆజాద్ కాశ్మీర్ జిల్లాలు[lower-alpha 11] | 1,073,154 | 12.7% | 886,153 | 0.09% | 113,210 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.