కొండపల్లి శేషగిరి రావు
From Wikipedia, the free encyclopedia
Remove ads
కొండపల్లి శేషగిరి రావు (జనవరి 27, 1924 - జూలై 26, 2012) తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ చిత్రకారుడు.[1] భారతీయ సాంప్రదాయ చిత్రలేఖనంలో అద్భుతాలు సాధించిన వ్యక్తి.
Remove ads
జీవిత విశేషాలు
కొండపల్లి శేషగిరి రావు 1924 జనవరి 27 న వరంగల్ జిల్లా, పెనుగొండ గ్రామంలో ఒక బ్రాహ్మణ భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. బెంగాల్, శాంతినికేతన్ లో చిత్రలేఖనం అభ్యసించి, జె ఎన్ టి యు ఫైన్ అర్ట్స్ కళాశాలలో అధ్యాపకుడిగా వృత్తి జీవితం మొదలు పెట్టాడు. అతని చిత్రలేఖనాప్రస్థానం అప్రతిహతంగా సాగింది. అతని చిత్రాలలో శకుంతల, దమయంతి, రామాయణం వంటి పురాణాల వివిధ సన్నివేశాలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. డాక్టరేట్ లు, హాంస అవార్డ్లతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదరించింది. అతని చిత్రాలను దేశ పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ , సాలార్ జంగ్ మ్యూజియంలలో ప్రదర్శించారు.
కోటిరత్నాల వీణ తెలంగాణలో వేయిస్తంభాల గుడి, అరుదైన చారిత్రక కళాసంపదను చాటుతున్న వరంగల్ ప్రాంతంలో జన్మించిన కొండపల్లి శేషగిరిరావు చిన్నతనం లోనే ఆయనలోని సృజనాత్మకతను పరిశీలించిన ఆ పాఠశాల డ్రాయింగ్ మాస్టర్ దీనదయాళ్ ఆనాడే కొండపల్లి గొప్ప కళాకారుడవుతాడని గ్రహించారు. చుట్టూ వ్యాపించి ఉన్నకళాసంపద ఆయన కళాభిమానాన్ని తట్టిలేపింది. వేయిస్తం భాల గుడిలోని ప్రతీ స్తంభం ఆయనకు రోజుకో పాఠం చెప్పింది. రామప్ప గుడి ఆయన్ని తన హృదయాంతరాలలో నింపుకుంది. ఆ గుడిలోని శిల్ప సౌందర్యం.. శిల్పక్షేత్రాల శిల్ఫకళా సొగసుల ను సుదీర్ఘ, సునిశిత అధ్యయనంతో తన సొంతం చేసుకొన్న కొండపల్లి వాటినుంచి స్ఫూర్తిపొంది కొన్ని వందల చిత్రాలతో ఆ శిల్ఫకళకు దర్ఫణం పట్టారు. శిల్పుల మనోగతా ల్ని, వారి అభిరుచిలో తొంగిచూసిన ప్రత్యేకతల్ని, విశిష్టతల్ని తాను అవగతం చేసుకోవడమే కాక ప్రజా బాహుళ్యానికి చాటే ప్రయత్నం చేశారు.
తెలుగు చిత్రకళా ప్రపంచంలో ఓ వటవృక్షం. చిత్రకళకు అత్యంత కీర్తిని, బాహీర్ సౌందర్యాన్ని మాత్రమే కాకుండా ఆత్మ సౌందర్యాన్ని సమకూర్చిన కొండపల్లి శేషగిరిరావు.భారతీయ ఇతిహాసాలను చిత్రిక పట్టడంలో శేషగిరిరావుది అందె వేసిన చేయి. ప్రకృతి, చారిత్రక గాథలను.. ముఖ్యంగా కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని ఆయన సజీవ చిత్రాలుగా మలిచారు. ఆక్వా టెక్స్చర్ పెయింటింగ్లకు ఆయన మార్గదర్శకుడిగా చెబుతారు. లండన్, అమెరికా, మాస్కో తదితర దేశాల్లో జరిగిన ఎగ్జిబిషన్లలో శేషగిరిరావు చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. సాలార్జంగ్ మ్యూజియం సహా వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం, పిట్స్బర్గ్ వేంకటేశ్వరస్వామి ఆలయాలకు ఆయన చిత్రాలు మరింత శోభను తీసుకువచ్చాయి.
Remove ads
కళాసృజన
మనం అంటే ఇది అని కళ్లకు కట్టేలా చెప్పిన కళాకారుడు కొండపల్లి శేషగిరిరావు. నలభై ఏళ్ల క్రితం పోతన ముఖచిత్రంగా వచ్చిన ఆంధ్రపత్రికను రంగుల్లో చూసి వందలాది తెలుగువారు ఫ్రేములు కట్టించుకున్నారు. కొండపల్లి ప్రతిభకు నీరాజ నాలు పలికారు. అంత అందం, అంత ప్రశాంతత, అంత భక్తి భావం ఆ చిత్రంలో ఒలికించారు. పోతన భాగవతాన్ని 16 సార్లకు పైగా చదివి, మనోలోకాల్లో కాలయానం చేసి కొండపల్లి చిత్రించారు. అందుకే దానికి అంత జీవం వచ్చింది. అజంతా, ఎల్లోరా, రామప్ప, రాచకొండ,
లేపాక్షి తదితర చారిత్రక చిత్రకళా కేంద్రాలను పర్యటించి, తన భావానుగుణంగా వరూధినీ- ప్రవరా ఖ్యుడు, రాణి రుద్రమ, గణపతి దేవుడు, శకుంతల చిత్రాలను చిత్రించారు. తొలి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కొండపల్లి శేషగిరిరావు తెలుగు తల్లిని సాక్షాత్కరింపజేశారు. ఆ చిత్రం ఆధారంగానే తెలుగు తల్లి విగ్రహాలనూ రూపొందించారు. అదే సందర్భంలో అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి ఆంధ్రుల సాంఘిక చరిత్రకు దృశ్యరూపం ఇవ్వవలసినదిగా కొండపల్లిని కోరారు. విశ్వామిత్రుడు వంటి ఐతిహాసిక వ్యక్తుల నుంచి, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్నాటి బ్రహ్మనాయుడు వంటి చారిత్రక వ్యక్తుల నుంచి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వరకూ తన చిత్రంలో నీరాజనం పలికారు కొండపల్లి. అన్నమయ్య, త్యాగయ్య వంటి వాగ్గేయకారులు, జానపద కళాకారులు అంతా.. అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పు ఉన్న శేషగిరిరావు గారి మహత్తర చిత్రంలో కొలువుదీరారు. తెలుగు చిత్రకళను అంతర్జాతీయ వేదికపై సగౌరవంగా ఆవిష్కరించిన కొద్దిమందిలో శేషగిరిరావు ఒకరు. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్బహదూర్ శాస్ర్తి, ఇందిరా గాంధీ, రాజీవ్గాంధీలతోపాటు ఎంతో మంది ప్రముఖులు ఆయన చిత్రాలను మెచ్చుకున్నారు. తెలంగాణ కాకిపడగలు, రామప్పదేవాలయం విశిష్టతను వివరించిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆయనే. 1975లో ప్రపంచ తెలుగుమహాసభలకు ఆయన రూపొందించిన తెలుగుతల్లి పెయింటింగ్ ప్రశంసలు పొందింది. 1994 లో శేషగిరిరావును అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రత్యేకంగా సత్కరించారు. సంగీత ఆంధ్ర విజ్ఞాన కోశం ఎడిటర్ లక్ష్మిరంజన్, మ్యాక్స్ ముల్లర్భవన్ డైరెక్టర్ పీటర్ స్విడ్జ్ల అభినందనలు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలిండియా ఫైన్ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీల గౌరవం పొందారు.
Remove ads
అవార్డులు
హైదరాబాదు, మైసూరు, మద్రాసు, ఆలిండియా ఆర్ట్ ఎగ్జిబిషన్స్, కోల్కతా అకాడమీ ఆఫ్ ఫైనార్ట్, ఏపీ లలిత కళా అకాడమీ అవార్డులను అందుకున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ పక్షాన 1988లో ఎమిరిటస్ ఫెలోషిప్ను, తెలుగు యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ను ఆయనకు అందజేశారు. ప్రతిష్ఠాత్మక హంస అవార్డును కూడా ఆయన అందుకున్నారు. ఆర్ట్స్ సురేఖ అనే పుస్తకాన్ని రాశారు.
పుస్తకాలు
చిత్రకారుడిగా కొండపల్లి శేషగిరి రావు తన అనుభవాలను, చిత్రరచనా పద్ధతులను వివరిస్తూ రాసిన వ్యాసాలను కొండపల్లి నీహారిణి సంపాదకత్వంలో 'చిత్ర,శిల్పకళా రామణీయకం' పేరుతో 2011 లో ప్రచురించిన పుస్తకం.
శత జయంతి
ఆచార్య కొండపల్లి శేషగిరిరావు గారి శత జయంతి సందర్భంగా, హైదరాబాద్ చిత్రమయి స్టేట్ ఆర్ట్ గేలరీ లో జనవరి 25, 2025 నుండి ఫిబ్రవరి 5 తేదీ వరకు కొండపల్లి చిత్రాలను ప్రదర్శించారు.
మూలాలు
బయటి లంకెలు
యితర లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads