ముహమ్మద్ ప్రవక్త
From Wikipedia, the free encyclopedia
Remove ads
ముహమ్మద్ విను (అరబిక్ : محمد), (మొహమ్మద్, మహమ్మద్ అని కూడా పలకవచ్చు), అరబ్బుల మత , రాజకీయ నాయకుడు , ఇస్లాం యొక్క చివరి ప్రవక్త. ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరోపాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర ఆదమ్ ప్రవక్తతో ప్రారంభమయినది. అనేక ప్రవక్తల గొలుసుక్రమంలో ముహమ్మద్ చివరివాడు. ముహమ్మద్ ప్రవక్త బోధనలకు ముందస్తుగా మూసా (మోజెస్) , ఈసా (యేసు) యొక్క బోధనలు ఉన్నాయి. ముస్లిమేతరులు సాధారణంగా ఇతనిని ఇస్లాంమత స్థాపకునిగా భావిస్తారు. కానీ ఇస్లాం మతం ప్రారంభమయినది ఆదిపురుషుడయిన ఆదమ్ ప్రవక్తతో. సాంప్రదాయిక ముస్లిం జీవితకర్తల ప్రకారము c.570 మక్కాలో జన్మించాడు , జూన్ 8, 632లో మదీనాలో మరణించారు. మక్కా , మదీనా నగరములు రెండూ అరేబియన్ ద్వీపకల్పములో ఉన్నాయి.
Remove ads
పేరు

ఖురాన్లో " ముహమ్మద్ " అని వ్రాయబడింది. ముహమ్మద్ అనే పదానికి మూలం అరబ్బీ పదం "హమ్ద్" (హ మ్ ద్), అర్థం: "శ్లాఘన" లేదా "కీర్తించుట". ఈ "హమ్ద్" అనే పదానికి Prefix 'ము' (మ్ ఉ) చేర్చిన "ము హ మ్ మద్" ('మ్' ను వత్తి పలికి) అగును. అర్థం "శ్లాఘించబడినవాడు" లేదా "కీర్తించబడిన వాడు". ఈ పేరును, ముహమ్మద్, మొహమ్మద్, మహమ్మద్, , మహమ్మదు (తెలుగులో సాధారణంగా నకారం పొల్లు వచ్చినచో, దానిని 'కొమ్ము' చేరుస్తారు.) వ్రాస్తారు. అరబ్బీలో సరియైన గ్రాంధిక పదము 'ముహమ్మద్'. వ్యావహారికంలో 'మొహమ్మద్' అని కూడా పలుకుతారు. అరబ్బీ, ఉర్దూ భాషేతరులూ, ఈ పేరును 'మహమ్మద్' అని పలకడం వ్యావహారికంగా సాధారణం. టర్కీ వాసులు ముహమ్మద్ ను Mahmet (మహ్మెట్ లేదా మహమెట్) అని, అహ్మద్ ను Ahmet అనీ పలుకుతారు. ఇది మధ్య ఐరోపాలో ఉచ్ఛారణా శైలి. English Wikipedia లోని "Muhammad" వ్యాసంలో "Names and appellations in the Quran" చూడండి.
Remove ads
సారాంశము
ముహమ్మద్ విస్తృతముగా ప్రయాణించిన వర్తకుడు. తొలి ముస్లిం మూల నివేదికల ప్రకారము 611 లో, 40 ఏళ్ళ వయసులో మక్కాకు సమీపములోని హిరా గుహలో ధ్యానము చేయుచుండగా, దివ్య దృష్టిని పొందాడు. తరువాత తన అనుభూతిని సమీప వ్యక్తులకు వర్ణిస్తూ దేవదూత జిబ్రయీల్, తనకు కనిపించి ఖురాన్ ప్రవచనాలను గుర్తుపెట్టుకొని ఇతరులకు బోధించమని అల్లాహ్ ఆదేశించినాడని చెప్పాడు. తదనంతరం తన విద్యుక్తధర్మాన్ని మతపర కర్తవ్యాన్ని వ్యాప్తి చేస్తూ, దైవ సందేశాలను ప్రజలకు ఉపదేశిస్తూ, కఠోర ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన విడనాడడం, ప్రళయదినం పై విశ్వాసం, విశ్వాసుల ప్రథమకర్తవ్యమని బోధించాడు. అతను అరబ్బులకు తెలిసిన ఇతర రెండూ ఏకేశ్వరోపాసక మతములు జుడాయిజము (యూదమతము) ను కానీ క్రైస్తవ మతమును గానీ పూర్తిగా తిరస్కరించలేదు; ఇబ్రాహీం ప్రవక్త అవలంబించిన ఈ మతముల చివరి మెట్టైన ఇస్లాం మతమును ప్రకటిస్తున్నానని చాటెను. అతి తక్కువ సమయంలోనే అనేకుల విశ్వాసం పొందిననూ విగ్రహారాధనావలంబీకులైన అరబ్ తెగల ద్వేషాన్ని తప్పించుకొనుటకు, తాత్కాలికంగా 622లో మక్కా నుండి వలసపోయి తన సహచరులతో కలసి యస్రిబ్ (ఇప్పుడు మదీనాఅని పిలవబడే) లో స్థిరపడినాడు. ఇక్కడ ఆయన తొలి ముస్లిం సముదాయము స్థాపించి దానికి నాయకుడయ్యెను. తరువాత ఖురేషులు (అరబ్బు జాతి తెగ) , మదీనాకు చెందిన విశ్వాసులకు మధ్య జరిగిన యుద్ధంలో మహమ్మద్ , అతని అనుచరులు విజయం సాధించారు. ఈ పోరాటములో సంపాదించిన యుద్ధ ప్రావీణ్యాణ్ణి ఇతర అరేబియా పాగన్ తెగలను జయించడానికి ఉపయోగించారు. మహమ్మద్ చనిపోయే నాటికి అరేబియా ద్వీపకల్పమును సమైక్యము చేసి ఉత్తరమున సిరియా , పాలస్తీనా ప్రాంతములలో ఇస్లాంను వ్యాపింపజేశాడు.
ముహమ్మద్ తర్వాత వచ్చిన ఖలీఫాల నేతృత్వములో ఇస్లామీయ సామ్రాజ్యము పాలస్తీనా, సిరియా, ఇరాక్ (మెసపొటేమియా), ఇరాన్, ఈజిప్టు, ఉత్తర ఆఫ్రికా, , స్పెయిన్ లకు వ్యాపించింది. ఈయన తరువాత జరిగిన దండయాత్రలు, ముస్లింలు , ముస్లిమేతరుల మధ్య వర్తక సంబంధాలు, మతప్రచారణా కార్యకలాపాలు మహమ్మద్ ప్రవచించిన మతాన్ని భూమి నలుమూలలా వ్యాప్తి చెందడానికి దోహదపడ్డాయి.
Remove ads
ముహమ్మద్ (స అ సం) గురించి మనకెలా తెలిసినది?
ముహమ్మద్ జీవితాన్ని గురించి మనం ఉన్న వనరులలో ఖురాన్, సీరత్ జీవితచరిత్రలు , హదీస్ సేకరణలు ముఖ్యమైనవి. ఖురాన్ ముహమ్మద్ జీవితచరిత్ర కానపట్టికీ ఇందులో కొంతసమాచారము ఈయన జీవితం గురించి తెలుపుతుంది. ఇప్పటివరకు లభ్యమైన జీవిత చరిత్రలలో ఇబ్నె ఇస్ హాఖ్ (మ.768) రచించిన, ఇబ్నె హిషాం (మ.833) చే కూర్చబడిన దైవప్రవక్త యొక్క జీవితం, , అల్-వఖీదీ(మ. 822) రచించిన ముహమ్మద్ జీవితచరిత్ర అత్యంత పురాతన మైనవి. ఇబ్నె ఇస్ హాఖ్ ముహమ్మద్ మరణించిన 120 నుండి 130 సంవత్సరాల తర్వాత జీవితచరిత్రను రచించాడు. ఇక మూడవ వనరైన హదీసుల సేకరణలు ఖురాన్ లాగే ఆయన జీవితచరిత్ర కాదు కానీ అందులో ముహమ్మద్ , ఆయన శిష్యుల మాటలు, చేసిన పనులను గురించిన కథనాలు ఉన్నాయి.
కొంతమంది పండితులు (గోల్డ్ జిహర్, ష్కాట్, వాన్స్ బరో, కుక్, క్రోనే, రిప్పిన్, బెర్గ్ తదితరులు) ఈ మూలాలు, ముఖ్యంగా హదీసుల సేకరణల యొక్క నిబద్ధత గురించి సందేహాలు లేవనెత్తారు. మౌఖిక సంప్రదాయాలు సేకరించేనాటికే ముస్లిం సమాజము అనేక పరస్పరవిరుద్ధ తెగలు, సాంప్రదాయ శాఖలుగా ముక్కలైనదని; ముహమ్మద్ , అతని అనుచరులు ఏమి చెప్పారు? ఏమి చేశారు అన్న విషయాలపై ప్రతి తెగకు లేదా శాఖకు తమదైన సొంత, కొన్నిసార్లు పరస్పర విరుద్ధమైన సంప్రదాయాలు ఉన్నాయని వీరి వాదన. ఈ సంప్రాదాయాలు రానురాను పెరిగిపోయినాయి. సాంప్రదాయ ముస్లిం పండితులు వారు ఉబుసుపోక కథలుగా భావించిన వాటిని ఏరివేయటానికి కఠోరకృషి చేశారు. సాంప్రదాయవాదులు ఈ ముస్లిం పండితుల కృషిపై ఆధారపడతున్నారు కానీ విమర్శకులు ఈ సమస్యను ఆధునిక పద్ధతులతో తిరిగి పరిష్కరించవలసిన అవసరం ఉందని భావిస్తున్నారు.
హదిత్ (హదీసుల) సేకరణలలో ముహమ్మద్ జీవితానికి సంబంధించి అనేక అప్రామాణికమైన సంప్రదాయాలు ముస్లిం , ముస్లిమేతర పండితులందరూ ఏకగ్రీవముగా అంగీకరిస్తారు. (ముస్లిం పండితగణము ఈ సంప్రదాయాలలో చాలా మటుకు ప్రామాణికము కావనీ, కేవలం కొన్ని హదీస్ సేకరణలు మాత్రమే సహీ లేదా నమ్మదగివని ఒప్పుకుంటారు). "ఖురాను మాత్రమే ముస్లింలు" అనే ఒక అల్పసంఖ్యాక వర్గము హదిత్ మొత్తం నమ్మదగినద కాదని భావిస్తారు. అయితే పై సారాంశపు విభాగములో ఉన్న ముహమ్మద్ యొక్క చారిత్రక , జీవిత విశేషాలు మాత్రం సాధారణంగా అందరూ అంగీకరిస్తారు. ముస్లిం , ముస్లిమేతర సాంప్రదాయ వాదులు మాత్రము ముహమ్మద్ యొక్క జీవిత విశేషాలను మరింత వివరణాత్మకముగా ఈ క్రింద విధముగా వర్ణిస్తారు.
సీరా (సీరత్) ప్రకారము ముహమ్మద్ జీవితము
ముహమ్మద్(సం.అ.వ) గారి వంశము
ప్రధాన వ్యాసం: ముహమ్మద్ వంశవృక్షం
ముహమ్మద్ యొక్క వంశాన్ని ఇబ్రాహీం ఆదమ్ వరకు తీసుకెళ్ళవచ్చు. .
ఆదమ్ + హవ్వ - షీస్ (షేతు) - ఇద్రీస్ (ఎనోషు) - కెయినా - అఖ్నోక్ - లెమక్ - నూహ్ -రావూ -షారూక్ -నాహోరు - తారహు - ఇబ్రాహీమ్
- ఇబ్రాహీమ్ నుండి ముహమ్మదు వరకు
ఇబ్రాహీమ్ + హాజరా - ఇస్మాయిల్ - కేదారు - అద్నాను - ఖుసై - అబ్దుల్ మునాఫ్ - అబ్దుల్ ముత్తలిబ్ - అబ్దుల్లా - ముహమ్మద్.
బాల్యం
మక్కా లోని ఒక సంపన్నమైన ఇంట్లో జన్మించాడు. ఇతని జన్మ తారీఖు 20 ఏప్రిల్, 570, షియాల ప్రకారం 26 ఏప్రిల్, ఇతరత్రా 571 అని భావిస్తారు. సంప్రదాయాల ప్రకారం "ఏనుగు యొక్క సంవత్సరం" ఈ సంవత్సరమే జరిగింది. మహమ్మదు ప్రవక్త పుట్టకమునుపే తండ్రి అబ్దుల్లా కళ్ళు మూసాడు, తన తాతయైన అబ్దుల్ ముత్తలిబ్ (ఖురైష్ తెగల నాయకుడు), వద్ద పెరుగుతాడు. బెదూయిన్ దాయి అయినటువంటి హలీమా వద్ద పాలపోషణ జరుగుతుంది. 6 సంవత్సరాల వయసులో తల్లి ఆమినా పరమపదిస్తుంది. 8 సంవత్సరాల వయస్సులో తాత అబ్దుల్ ముత్తలిబ్ మరణిస్తాడు. తన పినతండ్రి, హాషిమ్ కుటుంబ నాయకుడైన అబూ తాలిబ్ (మక్కాలో శక్తిమంతమైనవాడు) వద్ద పెరుగుతాడు.
మక్కా అరేబియాలోనే ప్రముఖ వాణిజ్యకేంద్రం. కాబా గృహం కలిగివున్నందున ధార్మికపరంగాకూడా ప్రముఖక్షేత్రం. పుణ్యక్షేత్రదర్శనాకాలంలో దూరప్రాంతాలనుండి ధర్మపారాయణులూ, వర్తకులూ తరచూ మక్కాను సందర్శిస్తూవుండేవారు. అన్నిరంగాల్లోను మక్కా విరాజిల్లుతూయుండేది.
యుక్త వయస్సులో ముహమ్మద్ తన పినతండ్రితో వాణిజ్య ప్రయాణాలెన్నో చేశాడు. 'షామ్' (సిరియా) వరకూ ప్రయాణాలు చేశాడు. అంతర్జాతీయ వ్యాపారాలు, ప్రయాణాలను బాగా ఔపోసనపట్టాడు.
మధ్య కాలం
ఖదీజా మక్కానగరానికి చెందిన సంపన్నురాలు విధవ, 40 సంవత్సరాలవయస్సు, ఈమెదగ్గర వర్తకసామాగ్రితీసుకొని చాలామంది వర్తకాలు చేసేవారు, ప్రముఖంగా దుస్తులవ్యాపారం, మహమ్మదు ప్రవక్తకూడా ఈమెదగ్గర దుస్తులు గైకొని అమ్మేవాడు. మహమ్మదు ప్రవక్త వయస్సు 25 సంవత్సరాలు, మహమ్మదు ప్రవక్త గుణగణాలు తెలుసుకొని ఖదీజా (ఖతీజా) పెళ్ళిప్రస్తావన 595 తీసుకురాగా ముహమ్మదు ప్రవక్త అందుకు అంగీకరించాడు. ఇబ్న్ ఇస్ హాఖ్ ఈ విధంగా రాశాడు: మహమ్మదు ప్రవక్త , ఖదీజాల సంతానం ఐదుగురు, అందులో ఒక కుమారుడు నలుగురు కుమార్తెలు. వీరందరూ ముహమ్మదు ఇస్లాం గురించి ప్రకటనకు మునుపు పుట్టారు. కుమారుడు ఖాసిం తన రెండో యేటయే మరణించాడు. నలుగురు కుమార్తెలు జైనబ్, రుఖయా, ఉమ్-ఎ-కుల్సుమ్, , ఫాతిమా.
మొదటి అవతరణలు
మక్కా పొలిమేరల్లో హిరా గుహ యందు ముహమ్మద్ ప్రవక్త ధ్యానముద్రలో గడపడం సాధారణం. 610లో తన దైనందినచర్యలో భాగంగా హిరా గుహయందు ధ్యానం చేయుచుండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై సందేశమిచ్చాడు "చదువుము అల్లాహ్ పేరున, మీ ప్రభువు , సృష్టికర్త అతడే. అల్లాహ్ మానవుణ్ణి గడ్డకట్టిన రక్తపు ముద్దనుండి సృష్టించాడు. చదువుము, మీ ప్రభువు పరమదయాళువు, కలంతో మానవుణ్ని (తెలియని) విద్యను నేర్పాడు." ఖురాన్ 96:1-6.
జిబ్రయీల్ మొదటిసారి ప్రత్యక్షమైనందున ముహమ్మదు ప్రవక్త కలవరపడ్డాడు, పత్నియైన ఖదీజా ముహమ్మదు ప్రవక్తకు 'ఇవి అల్లాహ్ వాక్కులు, ఇది సత్య దృష్టి' యని చెప్పి తన సంపూర్ణవిశ్వాసాన్ని ప్రకటించింది. తన పినతండ్రి కుమారుడైన అలీ (10 సంవత్సరాల వయస్సు) , అబూబక్ర్ కూడా తమ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించి ఇస్లాంను స్వీకరించారు.
మరణాంతము వరకూ 'అవతరణలను' పొందుతూనేవచ్చారు. మొదటి అవతరణ తరువాత రెండో అవతరణకు చాలా సమయం పట్టింది. ఈ విషయమూ మహమ్మద్ కు కలవరపరచింది, చివరికి అద్-దుహా సూరా అవతరించింది, అపుడు మాత్రమే ముహమ్మదు ప్రవక్త మనస్సు కుదుటపడింది.
613 లో, ముహమ్మదు ప్రవక్త తన సందేశాన్ని ప్రజలవద్దకు చేర్చడం ప్రారంభించాడు. చాలా మంది ఇతని సందేశం చెవినవేసుకోలేదు. కొందరు మాత్రమే గంభీరంగా స్వీకరించారు. కొద్దిమంది మాత్ర విశ్వాసాన్ని ప్రకటించి ముహమ్మద్ ప్రవక్త సహాబా లయ్యారు.
తిరస్కారము
ముహమ్మదు ప్రవక్త అనుయాయులు పెరిగేకొద్దీ, ఈవిషయం ప్రాంతీయ తెగలవారికి , నగర పరిపాలకులకు సింహస్వప్నంగా మారింది. వీరి సంపద అంతా కాబా గృహంలోనే వుండినది, ఈ కాబా గృహం 'విగ్రహ స్థలి' , మక్కా ప్రజల ధార్మిక కేంద్రం. ముహమ్మదు ప్రవక్త ప్రవచించినట్లు విగ్రహాలను త్యజిస్తే కాబా గృహ ప్రాశస్తం పోతుంది, తీర్థయాత్రికులు ఉండరు, మక్కా వ్యాపారకేంద్ర ప్రాముఖ్యత తగ్గిపోతుంది, ఆఖరుకు సంపద లేకుండా పోతుంది. ముహమ్మదు ప్రవక్త ప్రవచనం అయిన బహుదేవతారాధనా , విగ్రహారాధన ల నిషేధం వారి తెగలలోనే (ఖురేషులు) భయాందోళనలు తెచ్చిపెట్టింది, కారణం కాబా గృహానికి వారే పోషకులు , పాలకులు కూడా. ముహమ్మదు ప్రవక్త , అనుయాయులు వీరి కోపానికి గురయ్యారు, కొందరైతే (సహాబీలు) సత్యవాక్కులు , విశ్వాసాలు త్యజించలేక, ఖురేషులు పెట్టే బాధలు భరించలేక అబిసీనియాకు వలస వెళ్ళారు. అచట కాలనీలు ఏర్పాటు చేసుకొని జీవించసాగారు.
619లో ముహమ్మదు ప్రవక్త పత్ని ఖదీజా , పినతండ్రి అబూ తాలిబ్ మరణించారు; ఈ సంవత్సరాన్ని శోక సంవత్సరంగా అభివర్ణించారు. ముహమ్మదు ప్రవక్త తెగలే మహమ్మదు ప్రవక్తకు రక్షణ కల్పించడానికి వెనుకడుగు వేశాయి. ముస్లింలు పస్తులుంటూ బాధలకు తట్టుకుంటూ హృదయవిదారకంగా జీవించారు. ఈ సమయం వీరికి చాలా కఠోరంగా మారినది.
620లో మహమ్మదు ప్రవక్త తన ఇస్రా , మేరాజ్ ప్రయాణం గూర్చి ప్రకటించాడు. ఈ ప్రకటన ఇంకనూ శత్రువులను తయారుచేసింది.
హిజ్రత్
622లో మక్కానగరంలో ముస్లింల జీవనం కఠినంగా మారింది, అందుకొరకు మహమ్మదు ప్రవక్త తన అనుచరగణంతో వలస వెళ్ళడానికి నిశ్చయించాడు. మక్కా నగరం వీడి మదీనాకు వలస వెళ్ళాడు. మదీనా ఆ కాలంలో 'యస్రిబ్' గా పిలువబడుతూండేది. ఈవలసవెళ్ళిన తేదీతోనే ఇస్లామీయ కేలండర్ యొక్క మొదటి సంవత్సరం ప్రారంభమౌతుంది. ఈ శకానికే హిజ్రీ శకం అంటారు.
మహమ్మదు ప్రవక్త మదీనా నగరానికి వెళ్ళి అక్కడి తెగలైన 'బనూ ఆస్' , 'బనూ ఖజ్రజ్' ల మధ్య వైషమ్యాలను తొలగించాడు. ముస్లింల మధ్య శాంతి సౌభ్రాతృత్వాలను పెంపొందించాడు. ఈ కాలంలోనే ప్రథమ ఖిబ్లా బైతుల్-ముఖద్దస్ , రెండవ ఖిబ్లా కాబా ఏర్పడింది.
యుధ్ధములు
మక్కా లోని ఖురేషులు , మదీనా లోని ముస్లింల మధ్య యుధ్ధవాతావరణం నెలకొన్నది. మక్కా వాసులకు మదీనా వాసుల ఇస్లామీయ సరళి నచ్చలేదు. అందుకే యుద్ధాలైన బద్ర్ యుధ్ధం, ఉహద్ యుధ్ధం, ఖందఖ్ యుధ్ధం, హునైన్ యుధ్ధం జరిగాయి. కొద్ది ఫలితాలు మక్కావాసులు పొందగా సంపూర్ణవిజయాలు మదీనావాసుల వశమయ్యాయి.
మహమ్మద్ పరిపాలనా స్థిరత్వం
బద్ర్ యుధ్ధంలో లభించిన విజయం నిజంగానే ఆశ్చర్యజనకమైనది, కొద్దిపాటి ముస్లింలు పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవడం, ఈ అసాధారణ విజయం ముస్లింలందరూ మహమ్మదు యొక్క ప్రవక్తగారి ప్రవక్తా ప్రకటనను అంగీకరించడానికి సందేహంలేకుండా చేసింది. అందరూ అమితానందపరులయ్యారు. దీని పర్యంతం యూదులతో జరిగిన ఒప్పందం యూదులు నిలుపుకోలేదు, యూదతెగ యైన బనూ ఖైనుఖాను బహిష్కరించారు. దాదాపు మదీనా అంతటా ప్రజలు ఇస్లాం స్వీకరించారు.
ఖదీజా మరణం తరువాత మహమ్మదు ప్రవక్త అబూబక్ర్ (మహమ్మద్ మరణం తరువాత మొదటి రాషిదూన్ ఖలీఫా అయ్యాడు) కుమార్తె ఆయెషా సిద్దీఖాతో మదీనాలో వివాహం చేసుకొన్నాడు, (అప్పుడు ఆమె వయస్సు 9 సంవత్సరాలని, 14 సంవత్సరాలని, కాదు 21[1][2] సంవత్సరాలని విభిన్నవాదనలున్నాయి). వాస్తవానికి దాదాపు 18 నుండి 21 సం. లనే అభిప్రాయాలే ఎక్కువ. ఈ వివాహాలతో మహమ్మదు ప్రవక్త , ఇతర ప్రముఖ సహాబాలతో సంబంధబాంధవ్యాలు బలీయమైనాయి.
మహమ్మదు ప్రవక్త కుమార్తె ఫాతిమా యొక్క వివాహం అలీ (ఉస్మాన్ మరణం తరువాత నాలుగవ రాషిదూన్ ఖలీఫా అయ్యారు) తో జరిగింది. ఇంకో కుమార్తె ఉమ్-ఎ-కుల్సుమ్ యొక్క వివాహం ఉస్మాన్ (ఉమర్ మరణం తరువాత మూడవ రాషిదూన్ ఖలీఫా అయ్యాడు) తో జరిగింది. మహమ్మదు ప్రవక్త అనుయాయులు సహాబీలు, వారసులు చాలా పలుకుబడి, స్థితిమంతులు, , శక్తిమంతులైనందున పరిపాలన స్థిరమైంది. వీటన్నిటికంటే మహమ్మదు ప్రవక్తను ప్రాణాలకంటే మిన్నగా చూసుకొనే అనుయాయులు, మహమ్మదు ప్రవక్త ప్రకటించిన సత్యవచనాల బలం, అల్లాహ్ కారుణ్యంవల్ల ఈ స్థిరత్వం ఏర్పడింది (అని ముస్లింలు భావిస్తారు).
సమరాల పరంపర
ఇక్కడ ఓ నిర్దిష్టమైన విషయం తెలుసుకోవాలి. ముహమ్మద్ ప్రవక్త ఎవరిపైనా దండయాత్రలు చేయలేదు. ముహమ్మద్ ప్రవక్త మదీనాలో నివసిస్తున్నపుడు, మక్కా నగరానికి చెందిన కురైషీయులు మదీనాలో నివసిస్తున్న ముహమ్మద్ , వారి అనుచరగణానికి , ఇస్లాంలో చేరినవారిపై యుద్ధం ప్రకటించి మదీనాపై దండయాత్ర చేశారు. ముహమ్మద్ ప్రవక్త తన అనుచర గణాలతో కురైషీయులను ఎదుర్కొన్నారు తప్ప దండయాత్రలు చేయలేదు. 625లో మక్కా నాయకుడు అబూ సుఫియాన్ 3,000 మందీమార్బలంతో మదీనా వైపు దండయాత్రకు సాగాడు. మార్చి 23 న ఉహద్ యుధ్ధం జరిగింది. ఈ యుధ్ధంలో మక్కావాసులకు విజయం, మదీనా వాసులకు అపజయం కలిగినది. కాని అబూసుఫియాన్ కు తీరని నష్టం జరిగింది. పెక్కుమంది మరణించారు. మక్కా నుండి మదీనాకు తరలి వచ్చి విజయం సాధించికూడా వట్టి చేతులతో మక్కా తిరుగుప్రయాణమయ్యాడు.
ఏప్రిల్ 627లో అబూ సుఫియాన్ ఇంకో సారి మదీనా పై దండయాత్ర చేశాడు. మదీనాలో అబూసుఫియాన్ సానుభూతిపరులు (యూదులు) బనూ ఖురైజా తెగ, మహమ్మదు ప్రవక్తతో ఒడంబడిక చేసుకొనికూడా కట్టుబడక, అబూసుఫియాన్ తో కుమ్మక్కై, మదీనాలోని ముస్లింలకు వెన్నుపోటు పొడవడానికి సిద్ధమయ్యింది. ఈ విషయం తెలుసుకొన్న మహమ్మదు ప్రవక్త , ముస్లింలు ముందు జాగ్రత్తచర్యగా మదీనా నగరం చుట్టూ కందకం "ఖందఖ్"ను తవ్వారు. అందుకే ఈ యుధ్ధానికి ఖందఖ్ యుధ్ధం అని అంటారు. అబూసుఫియాన్ సేనను సునాయాసంగా తిప్పికొట్టారు. ఈ యుధ్ధం తరువాత, బనూఖురైజా తెగవారు యుధ్ధఖైదీలుగా పట్టుబడ్డారు. వీరిలో ముదుసలులకు, స్త్రీలకు, పిల్లలకు క్షమాభిక్షప్రసాదించి, సేవకులుగానుంచారు. వెన్నుపోటుదార్లందరికీ సాద్ ఇబ్న్ ముఆద్ ఆదేశాన మృత్యుదండన విధించబడింది.
ఖందఖ్ యుధ్ధం తరువాత ముస్లింల శక్తి బలీయమైనది, ధార్మికపరంగా ప్రజలంతా తండోపతండాలుగా ఇస్లాంను స్వీకరించారు. సైన్యం బలీయమైంది. ప్రాంతాలపై పట్టు ఏర్పడింది. ప్రముఖంగా వివిధ తెగలమధ్య వైషమ్యాలు తొలగాయి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరిశాయి.
మక్కా వశం
628లో ముస్లింల పరిస్థితి కుదుటబడింది, మహమ్మదు ప్రవక్త మక్కా నగరానికి తిరిగి వెళ్ళడానికి నిశ్చయించారు, ఈ సారి తీర్థయాత్రికులుగా ముస్లింలందరూ మక్కా వెళ్ళాలని నిర్ణయించారు. మార్చినెలలో మక్కానగరానికి బయలు దేరారు. తీర్థయాత్రికుల సమూహం 1,600 సంఖ్యగలది. మూర్ఖులైన మక్కా వాసులు ఈ తీర్థయాత్రికులకు మక్కానగరంలో ప్రవేశం నిషిధ్ధపరచి, మక్కానగర పొలిమేరల్లోనే ఓ ఒడంబడిక చేసుకొన్నారు. దీనిని హుదైబియా సంధి అంటారు. తీర్థయాత్ర మరుసటి సంవత్సరానికి వాయిదా పడింది.
ఈ ఒడంబడిక రెండు సంవత్సరాలు మాత్రం నిలువగలిగినది, 630లో ఒప్పందం నీరుగారింది. మహమ్మదు ప్రవక్త 10,000 మంది ముస్లింలను తీసుకొని మక్కా వైపు ప్రయాణమయ్యారు. మక్కావాసులు ఈ భారీ సమూహాలను, మందీ మార్బలాన్ని, ముస్లింల , ఇతర తెగల మధ్య సౌభ్రాతృత్వాలను చూసి, అచేతనంగా వుండిపోయారు. ఎలాంటి నిలువరింపూ లేకుండా ముస్లింలు మక్కాలో ప్రవేశించారు. నిజానికి మక్కావాసులు ముస్లింలను చూసి భయపడ్డారు, వారు మక్కానగరాన్ని కొల్లగొడతారనీ, మక్కావాసులను చీల్చి చెండాతురాని, పగతీర్చుకొంటారని భావించారు. కానీ అంతా దీనికి భిన్నంగా జరిగింది. మక్కా వాసులందరూ క్షమింపబడ్డారు, ఒక్క రక్తపు చుక్కా పారలేదు. అంతటా శాంతి వెల్లి విరిసింది. ఇస్లాం అనగా శాంతి అనే బోధనే గాక ఆచరణా జరిగింది. దీనిని చూసి ఇస్లాంపట్ల ద్వేషంతోవున్నవారు నిశ్చేష్టులయ్యారు, తమ కీడు భావనలపట్ల పశ్చాత్తాప పడ్డారు. మహమ్మదు ప్రవక్త కాబాలో గల విగ్రహాలన్నీ తొలగించారు. కాబాను తన ప్రాశస్తం కోల్పోకుండా చూశారు. కాబా ముస్లింల పవిత్రక్షేత్రమైనది. మక్కావాసులందరూ విశాలతత్వాన్నీ, శాంతినీ చూసి ఆనందపడ్డారు. బహువిగ్రహారాధనా, , ఇతర సాంఘిక దురాచారాలలో తామెంత కోల్పోయినదీ మక్కావాసులు గ్రహించారు. మక్కావాసులందరూ ఇస్లాంను స్వీకరించారు. మహమ్మదు ప్రవక్త తమను గాఢాంధకారాలనుండి విముక్తి ప్రసాదించినందుకు అతనిపై గర్వపడ్డారు.
అరేబియా ఏకీకరణ
మక్కా పై రక్తరహిత విజయం, హునైన్ యుద్ధ విజయాలు ముస్లింలకు అరేబియాలో సంపూర్ణ ఇస్లామీయ సామ్రాజ్యం ఏర్పాటు చేయుటకు దోహదపడ్డాయి. చిన్న చిన్న తెగల ప్రాంతాలన్నీ ఏకీకృతమై అరేబియా దేశం ఏర్పడింది. ఈ పరిణామాలన్నీ మహమ్మదు ప్రవక్త నాయకత్వంలోనే జరిగాయి.
ముస్లింలు అరేబియా మొత్తం పై అధికారం చెలాయించే స్థాయికి చేరుకొన్నారు. మిగతా తెగలన్నీ మహమ్మదు ప్రవక్త ముందు తలదించాయి.
యోధుడిగా మహమ్మద్
- మరిన్ని వివరాలకు చూడండి: యోధుడిగా మహమ్మద్.
63 సంవత్సరాల వయస్సు పొందిన మహమ్మదు ప్రవక్త, చాలా సంవత్సరాలు వర్తకుడుగాను, ప్రబోధకుడి గానూ గడిపారు. తాను కరవాలాన్ని చేబట్టింది కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. అదియూ స్వీయ , ముస్లింల రక్షణకొరకు మాత్రమే యుధ్ధాలు చేశాడు. కొద్దిమంది గల సేనతో, అదియూ అరకొర ఆయుధాలతో యుధ్ధాలు చేసి విజయం పొందడం వీరి విశ్వాస పటుత్వానికి , అల్లాహ్ దయకు ప్రతీక.
గుర్తుంచుకోవలసిన విషయాలు:
- మక్కావాసులు మాత్రమే మదీనాపై దండెత్తారు గాని మదీనావాసులు మక్కాపై దండయాత్ర చేయలేదు
- బద్ర్ యుధ్ధం, ఉహద్ యుధ్ధం, ఖందఖ్ యుధ్ధం, హునైన్ యుధ్ధం , ఇతరాలు మదీనాకు దగ్గరలో జరిగాయి, మక్కా దగ్గర జరగలేదు. అనగా మక్కావాసులు మదీనా దగ్గరకు వచ్చి యుధ్ధాలు చేశారు గానీ మదీనా వాసులు మక్కా దగ్గర పోయి యుధ్ధాలు చేయలేదు.
- మదీనా వాసులు (ముస్లింలు) మక్కా వైపు రెండు సార్లు వెళ్ళారు. మొదటిసారి తీర్థయాత్రకొరకు వెళ్ళి, మక్కా వాసుల అనుమతిలేక హుదైబియా సంధి జేసుకొని, తీర్థయాత్ర వాయిదా వేసుకొని మదీనా తిరిగొచ్చారు.
- మదీనావాసులు ఇంకో సారి మక్కా వైపు వెళ్ళారు ఈ సారి ఏలాంటి రక్తపాతం లేకుండా, అసలు యుధ్ధమనేదే లేకుండా మక్కాను స్వాధీనం చేసుకొన్నారు.
- పశ్చిమ దేశపు విమర్శకులు ఉబుసుపోక పోకడలతో మహమ్మదు ప్రవక్తపై విమర్శించేందుకు ఎల్లప్పుడూ సిధ్ధంగా వుంటారు. 20 , 21 వ శతాబ్దంలో ఈ పోకడ ఇంకా ఎక్కువైంది. పశ్చిమదేశాలలోనే ఈ వైఖరి ఎక్కువ కనిపిస్తోంది. తూర్పుదేశాలు ఆధ్యాత్మికతను కలిగిన దేశాలు, పశ్చిమ దేశాలు భౌతిక వాద దేశాలు. భౌతికవాదం తీవ్రమైన పోకడలతోనూ, దైనందిన జీవితాలలో ఎలాంటి కళ్ళేలూ లేకుండా జీవించడంలో ఆనందం పొందుతున్నాయి. తూర్పు దేశాలు ఆధ్యాత్మిక వాదం, శాంతి, ధర్మం, , భగవంతుని యెడ భయం భక్తి గల్గి ఉన్నాయి. ఈ దేశాలలో భూతదయ, జీవితంలో కట్టు బాట్లు ఎక్కువగా కానవస్తాయి. ఇవి రుచించని వారు, ఈ విషయాల బోధకుల పట్ల ఎల్లప్పుడూ విమర్శనాత్మక వ్యంగ్య దృష్టితోనే చూస్తారు. కాలమే అందరి కళ్ళూ తెరిపిస్తుంది. భగవంతుడు (అల్లాహ్) అందరినీ గమనిస్తుంటాడు, సహనంతో వేచి చూడడం సత్యసంధుల పని.
ముహమ్మదు (స.అ.సల్లం) వారి భార్యలు పిల్లలు
- పదకొండు మంది భార్యలు :
ముహమ్మదు ప్రవక్త తన 25 వ ఏట 40 సంవత్సరాల వయసు గల ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయికి తల్లి అయిన ఖదీజా అనే వితంతువును మొదట పెళ్ళి చేసుకున్నారు. ఆమెకు అప్పటికే ఇద్దరు భర్తలు చనిపోయారు. ఖదీజా మక్కానగరానికి చెందిన సంపన్నురాలు. ఈమె మరణం తరువాత, ముహమ్మదు ప్రవక్త పెళ్ళి చేసుకున్న భార్యలు పది మంది. వీరికి భార్య హోదా మీద ఇప్పిటికీ భిన్న వాదనలు ఉన్నాయి.[3][4][5][6][7][8][9]
- 1.ఖదీజా బింత్ ఖువాలిద్
- 2.సౌదా బింత్ జమా
- 3.అయేషా బింత్ అబూ బకర్
- 4.హఫ్సా బింత్ ఉమర్
- 5.హింద్ బింత్ అబి ఉమయ్యా
- 6.జేనబ్ బింత్ ఖుజేమా
- 7.జువైరియా బింత్ అల్-హారిత్
- 8.రేహనా బింత్ జైద్
- 9.మారియా అల్-ఖిబ్తియ్యా
- 10.మైమూనా బింత్ అల్-హారిత్
- 11.సఫియ్యా బింత్ హుయాయ్
- ఏడుగురు పిల్లలు :.ఖదీజా వలన ఆరుగురు,మారియా వలన .ఇబ్రహీం అనే ఒకరు.
- నలుగురు ఆడపిల్లలు: 1.జైనబు 2.రుఖయ్యా 3.ఉమ్మెఖుల్సూమ్ 4. ఫాతిమా
- ముగ్గురు మగ పిల్లలు:1.ఖాసిం 2.అబ్దుల్లా 3.ఇబ్రహీం . ఈ ముగ్గురు మగ పిల్లలు చిన్నవయసులోనే చనిపోయారు.
ముహమ్మదు (స.అ.సల్లం) యొక్క సహాబాలు (అనుయాయులు)
- మరిన్ని వివరాలకు చూడండి: సహాబా.
సహాబి అనగా ముహమ్మద్ (స.అ.సల్లం) ను చూసినవారిలో, అతని సహచరులలో ఎవరయితే అతనిపై విశ్వాసముంచి, ఇస్లామును స్వీకరించి, ముస్లిముగా మరణించారో వారే సహాబీలు. వేలకొలది సహాబీలు గలరు గాని వారిలో అతిముఖ్యమైన సహాబీల సంఖ్య 50 నుండి 60 వరకూ గలదు.
హదీసులలో గల ఉల్లేఖనాలన్నీ ఈ సహాబీలద్వారా చేరినవే. హదీసుల ఉల్లేఖనాలు నమ్మకస్తులైన సహాబాల ఇస్ నద్ ద్వారా ఇస్లామీయ సంప్రదాయాలకు లభ్యమయినవి. కొందరు సహాబాల పేర్లు క్రింద ఇవ్వబడినవి.
ముహమ్మదు ( స.అ.సల్లం) మరణము

ముహమ్మదు ప్రవక్త కొన్నిరోజులు అనారోగ్యం పాలయ్యారు, తదనంతరం 63 సంవత్సరాల వయస్సులో మదీనా నగరంలో 8 జూన్ 632 సోమవారం పరమపదించారు.
ముహమ్మదు( స.అ.వసల్లం) వారసులు
కుమారుడు ఖాసిం తన రెండో యేటయే మరణించాడు. నలుగురు కుమార్తెలు జైనబ్, రుఖయా, ఉమ్-ఎ-కుల్సుమ్, , ఫాతిమా. ముహమ్మదు ప్రవక్త వారసులు ఫాతిమా , జైనబ్ లు.
Remove ads
ముహమ్మదు యొక్క చారిత్రక ఆవశ్యకత
మరణానికి ముందు 632లో ముహమ్మదు ప్రవక్త అరేబియా అంతటా సుస్థిరమైన సామాజిక రాజకీయ ఇస్లామీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరిమరణం తరువాత ఇతని వారసులు అరేబియా అంతటినీ ఏకీకరించారు, , ఇరాన్, ఇరాక్, ఈజిప్టు, పాలస్తీనా, సిరియా, ఆర్మీనియా , ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలను జయించారు. 750 లో ఇస్లాం ఏకేశ్వరవాద మతధార్మిక వాదనగల మతంగా దక్షిణ స్పెయిన్, , మధ్యాసియా లోను విస్తరించింది.
ఘజ్ఞవీడుల కాలంలో 10 వ శతాబ్దంలో భారతదేశంలోనూ ఆగ్నేయాసియాలోనూ విస్తరించింది. 150 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండవస్థానంలో నిలుస్తూంది.
Remove ads
ముహమ్మదుపై ముస్లింల గౌరవం
దాదాపు ప్రతిముస్లిం మహమ్మదు ప్రవక్త పట్ల అమిత ప్రేమ గౌరవాలు ప్రకటిస్తాడు, ఈ ప్రకటించడం అనేక విధాలుగా కానవస్తుంది.
- ముహమ్మదు ప్రవక్త పేరు ఉచ్ఛరించినపుడుగాని వ్రాయునపుడు గాని వినినపుడుగాని; ముహమ్మదు ప్రవక్త పేరు తరువాత "సల్లల్లాహు అలైహి వసల్లమ్" (అతనిమీద శాంతికలుగునుగాక) అని పలుకుతారు.
- ముస్లింల కార్యక్రమాలలో ముఖ్యంగా సూఫీ ధార్మిక సంగీతంలో ముహమ్మదు ప్రవక్త ప్రాశస్తాన్ని వివరిస్తూ కవితలు, పాట (నాతేషరీఫ్)లు ఖవ్వాలీ రూపంలో పాడుతారు.
- ముస్లింలు ముహమ్మదు ప్రవక్త జన్మదినాన్ని మీలాద్-ఉన్-నబిగా జరుపుకొంటారు.
- ముహమ్మదు ప్రవక్త గూర్చి ఎవరైనా విమర్శిస్తే వీరికి కొన్ని ఇస్లామీయ దేశాలలో మరణదండన విధిస్తారు.
- ముహమ్మదు ప్రవక్తకు గౌరవ బిరుదులతోనే పలుకుతారు.
- ముహమ్మదు ప్రవక్తకు సంబంధించిన వస్తువులైన ప్రవక్త గారి కేశం, సమాధి, ఖడ్గం, ధరించిన / వాడిన వస్త్రాలు మొదలగునవి అమితంగా గౌరవింపబడుతాయి.
- అమూర్తీకృతులు (మూర్తుల, చిత్రాల ద్వారా కాకుండా) ఇస్లామీయ లిపీ కళాకృతులు ద్వారా ఉదాహరణకు ప్రవక్తగారి నామం గల చిత్రం, మస్జిద్ ఎ నబవి చిత్రం, వారి వంశవృక్ష చిత్రం వగైరాలు కూడా అమితంగా గౌరవింపబడుతాయి.
- హదీసుల ద్వారా తెలిసిన ముహమ్మదు ప్రవక్త జీవనగాధను , కథలను గౌరవంగా ఆలకిస్తారు.
Remove ads
ఇవీ చూడండి
- అల్ బర్దాహ్ షరీఫ్
- ఇస్లాం , ముహమ్మదు పట్ల గౌరవం
- సీరత్
- ఇస్లాం
- హదీసులు
- ముహమ్మద్ ప్రవక్త వంశవృక్షం
- మత స్థాపకులు
- ఇస్లామీయ ప్రవక్తలు
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads