ఓల్గా (రచయిత్రి)
From Wikipedia, the free encyclopedia
ఓల్గా గా ప్రసిద్ధి పొందిన పోపూరి లలిత కుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి.[1] ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ, సాహిత్యరంగపు చర్చలో స్త్రీవాద ధృక్పధాన్ని ప్రవేశపెట్టిన రచయితగా ఈమెను గుర్తిస్తారు[2] స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓల్గా, తనను తాను తెలుగులో గురజాడ అప్పారావు వ్రాసిన కన్యాశుల్కంతో ప్రారంభమైన అభ్యుదయ రచనా పరంపరలో భాగంగా కూడా భావించింది.[3]
ఓల్గా | |
---|---|
జననం | పోపూరి లలిత నవంబర్ 27, 1950 గుంటూరు,ఆంధ్రప్రదేశ్ |
నివాస ప్రాంతం | హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్, ఇండియా |
వృత్తి | అధ్యాపకురాలు రచయిత సంఘసేవిక |
మతం | హిందూ |
నవంబర్ 27, 1950లో గుంటూరు జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి గ్రామములో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పోపూరి వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ. ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యం ఎం.ఎ. చేసిన తర్వాత తెనాలిలోని వి.ఎస్.ఆర్. కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. ఓల్గా కథలు, నవలలు, పద్యాలు మహిళా సాహిత్యములో ఎన్నదగినవి. చలం, కొడవటిగంటి కుటుంబరావు రచనల వల్ల ప్రభావితమై స్త్రీ చైతన్యము అంశముగా రచనలు చేసి తనకై ఒక ప్రత్యేక స్థానము సంపాదించింది. పత్రికలలో, సాహిత్యములో, అనువాదములలో మహిళా హక్కులపై వివాదాస్పద చర్చలు గావించింది. చలన చిత్ర రంగములో 'ఉషా కిరణ్' సంస్థకు కథా రచయిత్రిగా పనిచేసి మూడు చిత్రాలు నిర్మించి పురస్కారాలు పొందింది. ఈమె రాసిన స్వేచ్ఛ నవలని వివిధ భారతీయ భాషల్లోకి అనువదించడానికి నేషనల్ బుక్ ట్రస్టు స్వీకరించింది.1986 నుండి 1995 వరకు ఆమె ఉషా కిరణ్ మూవీస్ లో సీనియర్ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేసారు. 1991 నుండి 1997 వరకు అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ కు అధ్యక్షురాలిగా పనిచేసారు. ఆమె ప్రస్తుతం అస్మితలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారు ఓల్గా వ్రాసిన 12 రచనలను, ఆమె కథల ఆంగ్లానువాదములను తమ సంగ్రహములో చేర్చారు. వీరి విముక్త కథలను అజయ్ వర్మా అల్లూరి కన్నడలోకి అనువదించారు. ఆ కథలు ఇతర భారతీయ భాషలకు కూడా అనువాదమయ్యాయి.