కోతి ఆధునిక మానవుడిగా రూపొందిన క్రమం From Wikipedia, the free encyclopedia
మానవ పరిణామం అనేది శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల ఆవిర్భావానికి దారితీసిన పరిణామ ప్రక్రియ. ఇది ప్రైమేట్స్ పరిణామ చరిత్రతో, ప్రత్యేకించి హోమో జాతి పరిణామ చరిత్రతో మొదలై, హోమినిడ్ కుటుంబం లోనే గొప్ప జాతిగా హోమో సేపియన్స్ జాతి ఆవిర్భవించడానికి దారితీసింది. రెండు కాళ్ళపై నడక, భాష వంటి లక్షణాల అభివృద్ధి ఈ ప్రక్రియలో భాగం [1] వీటితో పాటు, ఇతర హోమినిన్లతో జాత్యంతర సంతానోత్పత్తి వంటివి కూడా ఈ పరిణామ ప్రక్రియలో భాగమవడాన్ని బట్టి, మానవ పరిణామం సూటిగా ఒక సరళరేఖలో సాగినది కాదని, అదొక సాలె గూడు లాగా విస్తరించిందనీ తెలుస్తోంది.[2][3][4][5]
భూమి ప్రత్యేక గోళంగా ఏర్పడి సుమారు నాలుగు వందల ఏభై కోట్ల సంవత్సరాలయితే ఆ తరువాత మరో ఇరవై కోట్ల సంవత్సరాలకు[ఆధారం చూపాలి] సముద్రాలలో సేంద్రియ రసాయనిక పదార్థాల కలయిక వల్ల జీవం ఏర్పడింది. సేంద్రియ రసాయనిక పదార్థాల నుంచి ఏకకణ జీవులు, వాటినుంచి జలచరాలు, వాటినుంచి నాలుగుకాళ్ళ జంతువులు, వాటినుంచి స్తన్య జంతువులు, వాటి నుంచి ప్రథమ శ్రేణి జంతువులు (Primates), వాటినుంచి మానవుడూ వచ్చాయి.
మానవ పరిణామాన్ని అధ్యయనం చెయ్యడంలో ఫిజికల్ ఆంత్రోపాలజీ, ప్రైమటాలజీ, ఆర్కియాలజీ, పాలియోంటాలజీ, న్యూరోబయాలజీ, ఎథాలజీ, భాషాశాస్త్రం, ఎవల్యూషనరీ సైకాలజీ, పిండశాస్త్రం, జన్యుశాస్త్రం వంటి అనేక శాస్త్రాలు భాగం పంచుకున్నాయి.[6] 8.5 కోట్ల సంవత్సరాల క్రితం, చివరి క్రెటేషియస్ పీరియడ్లో ప్రైమేట్స్, ఇతర క్షీరదాల నుండి వేరుపడ్డాయని జన్యు అధ్యయనాలు చూపుతున్నాయి. తొట్టతొలి శిలాజాలు మాత్రం 5.5 కోట్ల సంవత్సరాల క్రితం, పాలియోసీన్లో కనిపిస్తాయి.[7]
మానవులకు, చింపాంజీలకూ సంయుక్తంగా ఉన్న పూర్వీకుడి నుండి మొదటిసారిగా వేరుపడ్డాక మానవ పరిణామం శరీరాంగాల పరంగా, అభివృద్ధి పరంగా, శారీరిక, ప్రవర్తనల పరంగా అనేక మార్పులకు లోనౌతూ సాగింది. ఈ మార్పులలో రెండు కాళ్ళపై నడవడం, మెదడు పరిమాణం పెరగడం, దీర్ఘకాలం పాటు సాగే గర్భధారణ, శైశవదశలు, లైంగికపరమైన డైమోర్ఫిజం తగ్గడం అనేవి ముఖ్యమైనవి. ఈ మార్పుల మధ్య పరస్పర సంబంధం ఏమిటనే విషయమై చర్చ కొనసాగుతూనే ఉంది. బలమైన, ఖచ్చితమైన చేతి పట్టు కూడా ఒక ముఖ్యమైన పరిణామమే. ఈ పరిణామం మొదట హోమో ఎరెక్టస్లో సంభవించింది.
రెండు కాళ్ళపై నడవడం అనేది హోమినిడ్ల ప్రాథమిక పరిణామం. అన్ని ద్విపాద హోమినిడ్లలోనూ కనిపించే అస్థిపంజర మార్పుల వెనుక ఉన్న ప్రధాన కారణం ఇదే. 60, 70 లక్షల సంవత్సరాల నాటి సహెలాంత్రోపస్ [8] గానీ, ఒర్రోరిన్ గానీ తొట్టతొలి హోమినిన్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ కాలం లోనే, పిడికిళ్ళపై నడిచే చతుష్పాదులైన గొరిల్లాలు, చింపాంజీలు హోమినిన్ల నుండి వేరుపడ్డాయి. కాబట్టి సహెలాంత్రోపస్ గానీ, ఒర్రోరిన్ గానీ మన సంయుక్త పూర్వీకుడు కావచ్చు. ఆ తరువాతి కాలంలో, సుమారు 56 లక్షల సంవత్సరాల క్రితం, సంపూర్ణ ద్విపాది అయిన ఆర్డిపిథెకస్ ఉద్భవించింది.[9]
తొలి ద్విపాదులు ఆస్ట్రలోపిథెసీన్లు గాను, తరువాత హోమో ప్రజాతి గానూ పరిణామం చెందాయి. ద్విపాద లక్షణానికి ఉన్న విలువ పట్ల అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆహారాన్ని పట్టుకోవడానికీ, మోసుకు తీసుకువెళ్ళడానికీ, నడిచేటపుడు శక్తిని ఆదా చేయడానికీ చేతులను వాడడం కోసం ద్విపాద లక్షణాన్ని అలవాటు చేసుకుని ఉండవచ్చు.[10] బహు దూరాల పాటు పరిగెత్తి వేటాడడం, ఎక్కువ దూరం చూసే వీలు కలగడం, ఎండకు గురయ్యే శరీర విస్తీర్ణాన్ని తగ్గించుకోవడం వంటి వాటికి కూడా ద్విపాద లక్షణం దోహద పడింది. తూర్పు ఆఫ్రికా లోని రిఫ్ట్ వ్యాలీలో ఉండే అడవులు అంతరించి, వాటి స్థానంలో గడ్డి మైదానాలు ఏర్పడ్డాయి. పై పరిణామాంశాలన్నీ కూడా ఈ మైదానాల్లో నివసించేందుకు అనువైనవే. చతుష్పాద పిడికిలి-నడక కంటే, రెండు కాళ్ళపై నడవడానికి తక్కువ శక్తి అవసరమౌతుందని 2007 లో చేసిన ఒక అధ్యయనంలో తేలింది. ఇది కూడా ద్విపాద పరిణామ సిద్ధాంతానికి మద్దతు నిస్తోంది [11][12] అయితే, నిప్పును ఉపయోగించగల సామర్థ్యం తెలిసి ఉండకపోతే, కేవలం రెండుకాళ్ళపై నడిచినంత మాత్రాన మానవ పూర్వీకులు ప్రపంచమంతటా విస్తరించగలిగి ఉండేవారు కాదని ఇటీవలి అధ్యయనాల ప్రకారం తెలుస్తోంది.[13]
నడక తీరులోని ఈ మార్పు వలన కాళ్ళ పొడవు పెరిగి, చేతుల పొడవు తగ్గింది. మరొక మార్పు కాలి బొటనవేలి ఆకారంలో వచ్చింది. కాలి బొటనవేలితో పట్టు బిగించగల సామర్థ్యం వలన ఆస్ట్రలోపిథెసీన్లు తమ జీవిత కాలంలో కొంత భాగం చెట్లపైన నివసించాయని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ లక్షణం హాబిలైన్స్లో క్రమంగా అంతరించింది.
ద్విపాద నడక పరిణామం పర్యవసానంగా కాళ్ళు, కటి భాగాల్లో మాత్రమే కాకుండా, వెన్నెముక కాలమ్, పాదాలు, చీలమండలు, పుర్రె వంటి అనేక భాగాల్లో కూడా పెద్ద సంఖ్యలో పరిణామాలు చోటుచేసుకున్నాయి. శరీరపు గరిమనాభి, జామెట్రిక్ కేంద్రానికి దగ్గరగా ఉండేందుకు గాను, తొడ ఎముక కోణం కొంచెం పెరిగింది. పెరిగిన శరీర బరువును మోసేందుకు గాను, మోకాలు, చీలమండల కీళ్ళు బలోపేతమయ్యాయి. నిటారుగా ఉన్నపుడు ప్రతి వెన్నుపూసపై పెరిగిన బరువును తట్టుకునేందుకు గాను, వెన్నెముక కాలమ్ S- ఆకారంలోకి మారింది. కటి వెన్నుపూస పొట్టిగా, వెడల్పుగా అయింది. కాలి బొటనవేలు ఇతర కాలి వేళ్ళతో ఒకే వరుస లోకి చేరింది. ఇది నడకలో సహాయపడింది. కాళ్ళతో పోలిస్తే చేతులు, ముంజేతుల పొడవు తగ్గి, సులువుగా పరుగెత్తడానికి వీలైంది. ఫోరామెన్ మాగ్నం (వెన్నెముక పుర్రెలోకి ప్రవేశించే రంధ్రం) పుర్రె లోనికి, మరింత ముందుకు పోయింది.
కటి ప్రాంతంలో చాలా ముఖ్యమైన మార్పులు సంభవించాయి. పొడవుగా ఉండి, క్రిందికి చూస్తూండే ఇలియాక్ బ్లేడ్ పొట్టిగా, వెడల్పుగా మారింది. నడిచేటప్పుడు గరిమనాభిని స్థిరంగా ఉంచేందుకు ఇది దోహదపడింది; దీని కారణంగా, ద్విపాద హోమినిడ్లకు పొట్టిదైన, విశాలమైన, గిన్నె లాంటి కటి ఉంటుంది. ఒక లోపం ఏమిటంటే, ఆస్ట్రలోపిథెసిన్లతోటి, ఆధునిక మానవులతోటీ పోల్చితే జనన కాలువ వెడల్పుగా ఉన్నప్పటికీ, ద్విపాద వాలిడుల జనన కాలువ, పిడికిళ్ళపై నడిచే వాలిడుల కన్నా చిన్నదిగా ఉండేది. కపాల పరిమాణం పెరగడం వల్ల నవజాత శిశువులు వెళ్ళడానికి వీలుండేది. అయితే, ఇది ఎగువ భాగానికే పరిమితమై ఉండేది. ఎందుకంటే ఇది మరింత పెరిగితే ద్విపాద నడకకు ఆటంకం కలిగించేది.
కటి చిన్నదవడం, జనన కాలువ చిన్నదవడం ద్విపాద నడక కోసం ఆవశ్యకమయ్యాయి. ఇది మానవ జనన ప్రక్రియపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. జననప్రక్రియ ఇతర ప్రైమేట్ల కంటే ఆధునిక మానవులలో చాలా కష్టతరంగా మారింది. కటి ప్రాంతపు పరిమాణంలో వైవిధ్యం ఉన్నందున, మానవ పుట్టుక సమయంలో జనన కాలువలోకి ప్రవేశించేటప్పుడు పిండం తల తప్పనిసరిగా (తల్లితో పోలిస్తే) అడ్డంగా ఉండాలి. కాలువ నుండి బయటికి వచ్చిన తరువాత అది 90 డిగ్రీలు తిరుగుతుంది.
జనన కాలువ పొట్టిగా ఉండటాన, పిండం మెదడు పరిమాణం పెరగడానికి ఒక అవరోధంగా మారింది. ఇది గర్భధారణ కాలం తగ్గడానికి దారితీసింది. దీంతో మానవ సంతానంలో పరిపక్వత సాపేక్షికంగా తక్కువ ఉండేది. వీరు 12 నెలల కంటే పెద్దగా ముందు నడవలేరు. అదే, ఇతర ప్రైమేట్లలోనైతే, 12 నెలల కంటే చాలా ముందే నడవడం మొదలు పెడతాయి. పుట్టిన తరువాత మెదడులో కలిగే పెరుగుదల ఎక్కువవడం, పిల్లలు తల్లులపై ఆధారపడటం ఎక్కువవడం వంటివి స్త్రీల పునరుత్పత్తి చక్రంపై పెద్ద ప్రభావాన్ని చూపింది.[14] ఇందువలననే మానవుల్లో ఇతర హోమినిడ్లలో కంటే ఎక్కువగా అల్లోపేరెంటింగ్ (స్వంత తల్లిదండ్రులు కాని వారి వద్ద పెరగడం) కనిపిస్తుంది.[15] ఆలస్యమైన మానవ లైంగిక పరికపక్వత మెనోపాజ్ పరిణామానికి కూడా దారితీసింది. వృద్ధ మహిళలు, తామే ఎక్కువ సంతానం పొందడం ద్వారా కంటే, తమ కుమార్తె సంతానాన్ని సాకడం ద్వారానే తమ జన్యువులను మరింత మెరుగ్గా వారికి అందించగలుగుతారు అనేది దీనికి ఉన్న ఒక వివరణ.[16]
అంతిమంగా మానవ జాతి, ఇతర ప్రైమేట్ల కన్నా చాలా పెద్ద మెదడును పొందింది. సాధారణంగా ఆధునిక మానవులలో మెదడు 1,330 సెం.మీ3 ఉంటే, చింపాంజీ లేదా గొరిల్లా మెదడు ఇందులో మూడో వంతు మాత్రమే ఉంటుంది.[17] ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్, ఆర్డిపిథెకస్ల మెదడు పరిణామంలో కొంత కాలంపాటు ఏర్పడిన స్తబ్దత తరువాత,[18] తిరిగి హోమో హ్యాబిలిస్లో మెదడు పరిమాణం పెరగడం మొదలైంది. దీని మెదడు పరిమాణం 600 సెం.మీ3 ఉండేది. హోమో ఎరెక్టస్లో మెదడు పరిణామ ప్రక్రియ కొనసాగి 800 సెం.మీ3 వరకు పెరిగింది. నియాండర్తల్లో ఇది గరిష్టంగా 1200–1900 సెం.మీ3 కు చేరుకుంది. ఇది ఆధునిక హోమో సేపియన్ల మెదడు కంటే కూడా పెద్దది. ఈ అధిక మెదడు పరిమాణం కారణంగా ప్రసవానంతర మెదడు పెరుగుదల ఇతర వాలిడుల్లో (హెటెరోక్రోని) కంటే మానవుల్లో చాలా ఎక్కువగా ఉండేది. బాల్యంలో దీర్ఘ కాలం పాటు సాంఘిక అభ్యాసానికి, భాషా సముపార్జనకు కూడా ఇది దోహద పడింది. ఇది 20 లక్షల సంవత్సరాల క్రితమే మొదలైంది.
మానవుని మెదడు పరిమాణంలోని పెరుగుదల కంటే, దాని నిర్మాణంలో చోటు చేసుకున్న మార్పులే చాలా ముఖ్యమైనవి కావచ్చు.[19][20][21][22]
భాషను విశ్లేషించే కేంద్రాలుండే టెంపొరల్ లోబ్లు అసమానంగా పెరిగాయి. అలాగే సంక్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవటానికి, సామాజిక ప్రవర్తనను నియంత్రించడానికీ సంబంధించిన ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ కూడా ఎక్కువగా పెరిగింది.[17] మెదడు పరిణామం - ఆహారంలో పెరిగిన మాంసం, పిండి పదార్ధాలతోను, వండుకోవడం తోనూ [23] ముడిపడి ఉంది.[24][25] మానవ సమాజం మరింత క్లిష్టంగా మారింది, దాంతో సామాజిక సమస్యలూ పెరిగాయి. వీటిని పరిష్కరించడానికి మేధస్సు పెరిగింది అని ప్రతిపాదించారు.[26] దవడలూ దవడ కండరాలూ చిన్నవి కావడంతో, మెదడు పెరగడానికి అవసరమైన ఖాళీ పుర్రెలో ఏర్పడింది.
చేతి బొటనవేలు, అదే చేతి చిటికెన వేలి కొసలు తాకడమనేది హోమో ప్రజాతికే (జీనస్) విశిష్టమైన అంశం.[27] నియాండర్తల్కూ, సిమా డి లాస్ హ్యూసోస్ హోమినిన్స్ కూ, శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవులకూ అన్నిటికీ ఈ విశిష్టత ఉంది.[28] ఇతర ప్రైమేట్లలో బొటనవేలు చిన్నదిగా ఉండడంతో, అవి బొటన వేలితో చిటికెన వేలిని అందుకోలేవు. ఈ రెండు వేళ్ళ అంటుకోవడం మానవుడి చేతికి బలవత్తరమైన, ఖచ్చితమైన పట్టును ఇచ్చింది. ఈ పట్టే అనేక నైపుణ్యాలకు పునాది అయింది.
అనేక ఇతర మార్పులు కూడా మానవ పరిణామంలో భాగమయ్యాయి. వాసన కంటే దృష్టికి ఎక్కువ ప్రాముఖ్యత ఏర్పడటం వాటిలో ఒకటి. సుదీర్ఘ బాల్య దశ, శిశువులు తల్లిపై ఆధారపడే కాలం ఎక్కువ కావడం, చిన్న పొట్ట, త్వరితమైన జీవక్రియ;[29] శరీరంపై ఉండే వెంట్రుకలు తొలగి పోవడం; చెమట గ్రంథుల పరిణామం; పలువరుస 'యు' ఆకారం నుండి పారాబోలిక్ ఆకారం లోకి మారడం; చుబుకం అభివృద్ధి (హోమో సేపియన్స్లో మాత్రమే ఇది కనిపిస్తుంది); స్టైలాయిడ్ ప్రక్రియల అభివృద్ధి; స్వరపేటిక అభివృద్ధి మొదలైనవి ఈ పరిణామంలోని ఇతర అంశాలు.
మానవులు హోమో అనే ప్రజాతికి చెందిన వారు. ఈ లాటిన్ పదానికి "మానవ" అని అర్థం. దీనిని మొదట కార్ల్ లిన్నేయస్ తన వర్గీకరణ పద్ధతిలో ఉపయోగించాడు. [lower-alpha 1] లాటిన్ "హోమో" అనే పదం ఇండో-యూరోపియన్ మూలమైన *ధ్గేమ్ లేదా "ఎర్త్" నుండి ఉద్భవించింది. లిన్నేయస్, అతని కాలంలోని ఇతర శాస్త్రవేత్తలు కూడా అవయవాల, శరీర నిర్మాణ సంబంధమైన సారూప్యతల ఆధారంగా గొప్ప వాలిడులను మానవుడి దగ్గరి బంధువులుగా భావించారు.[30]
1859 లో చార్లెస్ డార్విన్ తన ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ను ప్రచురించిన తరువాత మాత్రమే, పుట్టుకను ప్రమాణంగా చేసుకుని మానవులకు వాలిడులతో సంబంధం కలిపే అవకాశం స్పష్టమైంది. మునుపటి జాతుల నుండి కొత్త జాతులు పరిణామం చెందడం గురించి అతను తన సిద్ధాంతంలో ప్రతిపాదించాడు. డార్విన్ పుస్తకం మానవ పరిణామానికి సంబంధించిన సవాళ్ళను పరిష్కరించలేదు. "మనిషి మూలాలపై, అతని చరిత్రపై వెలుగు ప్రసరిస్తుంది" అని మాత్రమే డార్విన్ చెప్పాడు.[31]
మానవ పరిణామ స్వభావం గురించి మొదటగా థామస్ హెన్రీ హక్స్లీ, రిచర్డ్ ఓవెన్ల మధ్య చర్చలు జరిగాయి. మానవులు, వాలిడుల మధ్య అనేక సారూప్యతలు, వ్యత్యాసాలను వివరించడం ద్వారా హక్స్లీ, వాలిడుల నుండి మానవ పరిణామం జరిగిందని వాదించాడు. ముఖ్యంగా 1863 లో తన ఎవిడెన్స్ యాస్ టు మ్యాన్స్ ప్లేస్ ఇన్ నేచర్ అనే పుస్తకంలో ఈ వాదన చేశాడు. అయితే, డార్విన్కు తొలినాళ్ళలో సమర్ధకులైన ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్, చార్లెస్ లియెల్ వంటివారు మొదట్లో మానసిక సామర్థ్యాల మూలాన్ని, మానవుల నైతిక సున్నితత్వాలనూ సహజ ఎంపిక ద్వారా వివరించవచ్చనే విషయాన్ని అంగీకరించలేదు. అయితే తరువాతి కాలంలో వారు ఈ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. డార్విన్ 1871 లో ప్రచురించిన ది డిసెంట్ ఆఫ్ మ్యాన్ పుస్తకంలో పరిణామ సిద్ధాంతం, లైంగిక ఎంపిక సిద్ధాంతాలను మానవులకు వర్తింపజేసాడు.
19 వ శతాబ్దిలో తగినన్ని శిలాజాలు లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. 1856 లో, ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ను ప్రచురించడానికి మూడేళ్ళ ముందు, ఒక సున్నపురాయి క్వారీలో నియాండర్తల్ అవశేషాలను కనుగొన్నారు. అంతకు ముందే జిబ్రాల్టరులో నియాండర్తల్ శిలాజాలను కనుగొన్నారు. అయితే ఎదో రోగంతో బాధపడ్డ మానవుడి అవశేషాలుగా వాటిని భావించారు. 1891 లో జావా లోని ట్రినిల్లో యూజీన్ దుబోయిస్ కొన్ని శిలాజాలను కనుగొన్నప్పటికీ, ప్రస్తుతం వాటిని హోమో ఎరెక్టస్ అవశేషాలుగా భావిస్తున్నారు. దీంతో 1920 ల్లో ఆఫ్రికాలో కనుగొన్న అవశేషాలతోనే పరిణామక్రమం లోని మధ్యంతర జాతుల అవశేషాల సేకరణ మొదలైనట్లైంది. 1925 లో, రేమండ్ డార్ట్, ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ను గుర్తించాడు.[32] ఒక గుహలో కనుగొన్న పిల్లవాడి శిలాజం, టాంగ్ చైల్డ్, ఆస్ట్రలోపిథెకస్ జాతికి చెందిన నమూనాయే. ఎంతో భద్రంగా ఉన్న చిన్న కపాలం, దాని లోపల మెదడు గుర్తులూ ఈ నమూనా ప్రత్యేకం.
మెదడు చిన్నదిగా ఉన్నప్పటికీ (410 cm 3), దాని ఆకారం చింపాంజీలు, గొరిల్లాల మెదడుల మాదిరిగా కాకుండా, ఆధునిక మానవ మెదడు వలె గుండ్రంగా ఉండేది. అలాగే, ఈ నమూనాలో చిన్న కోర పళ్ళు చినవిగా ఉన్నాయి. ఫోరామెన్ మాగ్నమ్ స్థానం (వెన్నెముక పుర్రెలో ప్రవేశించే రంధ్రం) ద్విపాద నడకకు రుజువు. ఈ లక్షణాలన్నిటినీ బట్టి, టార్ట్ చైల్డ్ ఒక ద్విపాద మానవ పూర్వీకుడని, వాలిడులకు, మానవులకూ మధ్య పరివర్తన రూపమనీ డార్ట్ భావించాడు.
1960, 1970 లలో, తూర్పు ఆఫ్రికాలోని ఓల్డువాయ్ గార్జ్, తుర్కానా సరస్సు ప్రాంతాలలో వందలాది శిలాజాలను కనుగొన్నారు. లీకీ కుటుంబానికి చెందిన శిలాజాల వేటగాళ్ళు, పాలియో ఆంత్రోపాలజిస్టులూ అయిన లూయిస్ లీకీ, అతని భార్య మేరీ లీకీ, వారి కుమారుడు రిచర్డ్, కోడలు మీవ్ ఈ అన్వేషణలు చేసారు. ఓల్దువాయ్, తుర్కానా సరస్సుల లోని శిలాజ స్థావరాల వద్ద వారు తొలి హోమినిన్ల నమూనాలను - ఆస్ట్రలోపిథెసిన్స్, హోమో జాతులు, హోమో ఎరెక్టస్ లకు చెందిన వాటిని - సేకరించారు.
ఆఫ్రికా, మానవజాతికి ఉయ్యాల వంటిది అనే భావనను ఇవి బలపరచాయి. 1974 లో డొనాల్డ్ జోహన్సన్ ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ శిలాజమైన లూసీని ఉత్తర ఇథియోపియాలోని అఫార్ త్రికోణం ప్రాంతంలోని హదర్లో కనుగొన్నారు. దీంతో 1970 ల చివర లోను, 1980 లలోనూ ఇథియోపియా, పాలియో ఆంత్రోపాలజీ పరంగా ప్రముఖ స్థలంగా మారింది. ఈ నమూనా మెదడు చిన్నదిగా ఉన్నప్పటికీ, కటి, కాలు ఎముకలు పనితీరులో ఆధునిక మానవులతో దాదాపు సమానంగా ఉన్నాయి. దీనితో, హోమినిన్లు నిటారుగా నడిచాయని నిశ్చయంగా తెలుస్తోంది. లూసీని ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ అనే కొత్త జాతిగా వర్గీకరించారు. ఇది, హోమో జాతికి చెందిన ప్రత్యక్ష పూర్వీకుడు గానీ, లేదా ఆ పూర్వీకుడి దగ్గరి బంధువు గానీ అయి ఉంటుందని భావించారు.[33] ఆ కాలానికి చెందిన మరే ఇతర హోమినిడ్ లేదా హోమినిన్ కు ఇంతటి దగ్గరి సంబంధం లేదు. (బీటిల్స్ వారి " లూసీ ఇన్ ది స్కై విత్ డైమండ్స్ " పాట మీదుగా ఈ నమూనాకు "లూసీ" అని పేరు పెట్టారు. తవ్వకాల సమయంలో వారు ఈ పాటను వింటూండేవారు.) అఫార్ త్రికోణంలో ఆ తరువాత మరెన్నో హోమినిన్ శిలాజాలను కనుగొన్నారు. వీటిలో ఆర్డిపిథెకస్ రామిడస్, ఆర్డిపిథెకస్ కడబ్బా ఉన్నాయి.[34]
2013 లో, దక్షిణాఫ్రికా, జోహన్నెస్బర్గ్ దగ్గర లోని మానవ జాతి ఉయ్యాల ప్రాంతంలోని రైజింగ్ స్టార్ గుహల్లో హోమో ప్రజాతికి చెందిన హోమో నలేడి అనే శిలాజ అస్థిపంజరాలను కనుగొన్నారు.[35] 2015 సెప్టెంబరు నాటికి, ఈ గుహల నుండి కనీసం పదిహేను మంది వ్యక్తుల శిలాజాలను, 1,550 నమూనాల వరకూ వెలికి తీసారు. ఈ జాతికి, చిన్నపాటి దేహముండే మానవులతో సమానమైన శరీర ద్రవ్యరాశి, ఆస్ట్రలోపిథెకస్ మాదిరిగా చిన్నపాటి కపాలం, తొలి హోమో జాతుల మాదిరి కపాల స్వరూపమూ (పుర్రె ఆకారం) ఉన్నాయి. అస్థిపంజర నిర్మాణంలో ఆస్ట్రలోపిథెసిన్స్ కు చెందిన ఆదిమ లక్షణాలు, తొలి హోమినిన్లకు చెందిన లక్షణాలూ కలిసి ఉన్నాయి. మరణం సమీపించిన సమయంలో వ్యక్తులను గుహ లోపల ఉద్దేశపూర్వకంగా దూరంగా పెట్టిన సంకేతాలు కనిపించాయి. ఈ శిలాజాలు 2,50,000 సంవత్సరాల క్రితం నాటివని నిర్ధారించారు.[36] అందువల్ల ఇవి మానవుల ప్రత్యక్ష పూర్వీకులు కాదనీ, పెద్ద మెదడు కలిగిన, శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవులకు సమకాలీనులనీ తెలుస్తోంది.[37]
విన్సెంట్ సారిచ్, అలన్ విల్సన్ లు మానవుల, ఆఫ్రికన్ వాలిడుల (చింపాంజీలు, గొరిల్లాలు) తో సహా అనేక జీవ జాతులలో రెండేసి జీవులను తీసుకుని వాటి మధ్య రక్తం లోని అల్బుమిన్ రోగనిరోధక క్రాస్-రియాక్షన్ల బలాన్ని కొలవడంతో మానవ పరిణామ అధ్యయనాలలో జన్యు విప్లవం ప్రారంభమైంది.[38] ప్రతిచర్య బలాన్ని సంఖ్యాపరంగా రోగనిరోధక దూరంగా చూపించవచ్చు. ఇది వివిధ జాతులలోని హోమోలాగస్ ప్రోటీన్ల మధ్య అమైనో ఆమ్ల వ్యత్యాసాల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఎప్పుడు వేరుపడ్డాయో ముందే తెలిసిన రెండు జాతుల జంటకు ఈ రోగనిరోధక దూరాన్ని కొలుస్తారు. ఆ తరువాత, దీన్నే కొలమానంగా వాడుకుని ఇతర జాతుల జీవుల జతలు ఎప్పుడెప్పుడు వేరు పడ్డాయో లెక్కవేస్తారు.
సారిచ్, విల్సన్లు 1967 లో సైన్స్ పత్రికలో రాసిన వ్యాసంలో, మానవులు, వాలిడులు 40 – 50 లక్షల సంవత్సరాల క్రితం వేరుపడ్డాయని అంచనా వేశారు.[38] శిలాజ రికార్డుల ప్రకారమైతే, అప్పట్లో ఈ వేరుపడడం 1 – 3 కోట్ల సంవత్సరాల క్రితం జరిగి ఉండవచ్చని భావించేవారు. తరువాతి కాలంలో కనుగొన్న "లూసీ" వంటి శిలాజాల విశ్లేషణ, రామాపిథెకస్ వంటి పాత శిలాజాల పునర్విశ్లేషణల ద్వారా ఈ కొత్త అంచనాలే సరైనవని తేలింది. అల్బుమిన్ పద్ధతి సరైనదేనని ధృవీకరించారు.
DNA సీక్వెన్సింగ్లో పురోగతి, ప్రత్యేకంగా మైటోకాండ్రియల్ DNA (mtDNA), ఆ తరువాత Y- క్రోమోజోమ్ DNA (Y-DNA) మొదలైనవి మానవ మూలాలను అర్థం చేసుకోవడంలో తోడ్పడ్డాయి. మోలిక్యులర్ గడియార సూత్రాన్ని వర్తింపజేయడంతో మోలిక్యులర్ పరిణామం అధ్యయనంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.
ఇంకా, 2006 లో రెండు జాతుల జన్యువుల విశ్లేషణలో మానవ పూర్వీకులు చింపాంజీల నుండి వేరుపడడం మొదలయ్యాక, "ఆదిమ మానవులు", "ఆదిమ చింపాంజీల" మధ్య సంభోగం జరిగి కొన్ని జన్యువుల మార్పు జరిగింది:
పరిశోధన ఇలా సూచిస్తోంది:
1990 వ దశకంలో, గొప్ప వాలిడుల నుండి హోమినిన్ వంశం తొట్టతొలిగా వేరుపడినదానికి ఋజువుల కోసం అనేక పాలియో ఆంత్రోపాలజిస్టుల బృందాలు ఆఫ్రికా అంతటా గాలిస్తున్నాయి. 1994 లో, మీవ్ లీకీ ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్ను కనుగొన్నారు. 1995 లో టిమ్ డి. వైట్ ఆర్డిపిథెకస్ రామిడస్ ను కనుక్కున్నాడు. ఇది శిలాజ రికార్డును 42 లక్షల సంవత్సరాల వెనక్కి తీసుకుపోయింది
2000 లో, మార్టిన్ పిక్ఫోర్డ్, బ్రిగిట్టే సెనుట్లు కెన్యాలోని తుగెన్ హిల్స్లో 60 లక్షల సంవత్సరాల నాటి ద్విపాద హోమినిన్ను కనుగొన్నారు. దీనికి వారు ఒర్రోరిన్ తుగెన్సిస్ అని పేరు పెట్టారు. 2001 లో, మిచెల్ బ్రూనెట్ నేతృత్వంలోని బృందం 72 లక్షల సంవత్సరాల నాటి సహెలాంత్రోపస్ టాచెన్సిస్ పుర్రెను కనుగొంది. అది ద్విపాది అని, అందుచేత అది హోమినిడ్ అనీ, అంటే హోమినిన్ అనీ బ్రూనెట్ వాదించింది.
హోమో జాతికి చెందిన పునరుత్పత్తి అవరోధాల పట్ల, వలస ద్వారా విస్తరించడం పట్లా 1980 లలో మానవ పరిణామ శాస్త్రవేత్తల్లో భేదాభిప్రాయాలుండేవి. అనంతర కాలంలో ఈ సమస్యలను పరిశోధించడానికి, పరిష్కరించడానికీ జన్యుశాస్త్ర సహాయాన్ని తీసుకున్నారు. హోమో జాతి ఆఫ్రికా నుండి కనీసం మూడు సార్లు, బహుశా నాలుగు సార్లు, వలస వెళ్ళిందని ఆధారాలు సూచిస్తున్నాయని (హోమో ఎరెక్టస్, హోమో హైడెల్బెర్గెన్సిస్ లు ఒక్కొక్కసారి, హోమో సేపియన్స్ రెండు, మూడు సార్లు) సహారా పంపు సిద్ధాంతం చెప్పింది. ఈ విస్తరణకు, వాతావరణ మార్పులకూ దగ్గరి సంబంధం ఉందని ఇటీవలి ఆధారాలు సూచిస్తున్నాయి.[41]
గతంలో అనుకున్నదానికంటే ఐదు లక్షల సంవత్సరాల ముందే, మానవులు ఆఫ్రికా నుండి బయటికి వెళ్ళి ఉండవచ్చని ఇటీవలి ఆధారాలు సూచిస్తున్నాయి. న్యూ ఢిల్లీకి ఉత్తరాన ఉన్న సివాలిక్ పర్వతాల్లో కనీసం 26 లక్షల సంవత్సరాల నాటి మానవ హస్తకృతులను ఫ్రాంకో-ఇండియన్ బృందం ఒకటి కనుగొంది. ఇది జార్జియాలోని డమానిసి వద్ద కనుగొన్న 18.5 లక్షల సంవత్సరాల నాటి హోమో జాతి కంటే మునుపటిది. ఓ చైనీస్ గుహ వద్ద దొరికిన పనిముట్లు, 24.8 లక్షల సంవత్సరాల క్రితమే మానవులు పనిముట్లను ఉపయోగించారనే వాదనను - ఇది వివాదాస్పదమైనప్పటికీ - బలపరుస్తున్నాయి.[42] జావా ఉత్తర చైనాల్లో కనిపించే ఆసియా "ఛాపర్" పనిముట్ల సంప్రదాయం, అషూలియన్ చేగొడ్డలి కనిపించడానికి పూర్వమే ఆఫ్రికా నుండి బయటపడి ఉండవచ్చునని ఇది సూచిస్తోంది.
జన్యుపరమైన ఆధారాలు అందుబాటులోకి వచ్చేంత వరకు, ఆధునిక మానవుల విస్తరణకు రెండు నమూనాలు బలంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. హోమో ప్రజాతిలో ఇప్పుడున్నట్లుగానే పరస్పర సంబంధాలున్న జనాభా ఒక్కటి మాత్రమే ఉండేదనీ (అనేక విడివిడి జాతులు కాకుండా), గత ఇరవై లక్షల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా నిరంతరంగా ఈ జాతి పరిణామం చెందుతూ వచ్చిందనీ "బహుళ ప్రాంతీయ పరికల్పన" చెప్పింది. ఈ నమూనాను 1988 లో మిల్ఫోర్డ్ హెచ్. వోల్పాఫ్ ప్రతిపాదించాడు.[43][44] "ఆఫ్రికా నుండి బయటకు" నమూనా దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఈ నమూనా ప్రకారం, ఆధునిక హోమో సేపియన్స్ ఇటీవలనే (అనగా, సుమారు 2,00,000 సంవత్సరాల క్రితం) ఆఫ్రికాలో విస్తరించి, ఆపైన యురేషియా లోకి వలస పోవడం ద్వారా అక్కడున్న ఇతర హోమో జాతుల స్థానాన్ని ఆక్రమించారని చెప్పింది. ఈ నమూనాను క్రిస్ బి. స్ట్రింగర్, పీటర్ ఆండ్రూస్ ప్రతిపాదించి, అభివృద్ధి చేశారు.[45][46]
విస్తృత శ్రేణి దేశీయ జనాభా నుండి mtDNA, Y-DNA లను సీక్వెన్సింగు చేయడం వల్ల స్త్రీ, పురుష జన్యు వారసత్వానికి సంబంధించిన పూర్వీకుల సమాచారం వెల్లడైంది. ఈ సీక్వెన్సింగు ఫలితాలతో "ఆఫ్రికానుండి బయటకు" సిద్ధాంతం బలోపేతం కాగా, బహుళ ప్రాంతీయ పరిణామవాదం బలహీనపడింది. ఆఫ్రికా అంతటా DNA నమూనాల్లో వైవిధ్యం ఈ విశ్లేషణల్లో కనిపించింది. మైటోకాండ్రియల్ స్త్రీకి, వై-క్రోమోజోమల్ పురుషుడికీ ఆఫ్రికాయే నివాసమనే భావన తోను, ఆఫ్రికా నుండి ఆధునిక మానవ వ్యాప్తి గత 55,000 సంవత్సరాల్లోనే జరిగిందనే ఆలోచన తోనూ ఇది సరిపోయింది.
స్త్రీ మైటోకాండ్రియల్ DNA, పురుష Y క్రోమోజోంలను ఉపయోగించి చేసిన పరిశోధనల వలన "ఆఫ్రికా నుండి బయటకు" అనే భావనకు విశేషంగా మద్దతు లభించింది. 133 రకాల ఎమ్టిడిఎన్ఎలను ఉపయోగించి నిర్మించిన జన్యువృక్షాలను విశ్లేషించిన తరువాత, మానవులంతా మైటోకాండ్రియల్ ఈవ్ అనే ఒక ఆఫ్రికన్ మహిళాపూర్వీకుని వారసులే అని పరిశోధకులు తీర్మానించారు. ఆఫ్రికన్ జనాభాలో మైటోకాండ్రియల్ జన్యు వైవిధ్యం అత్యధికంగా ఉండడం కూడా "అవుట్ ఆఫ్ ఆఫ్రికా" కే మద్దతుగా నిలిచింది.[47]
సారా టిష్కాఫ్ నేతృత్వంలో జరిగిన ఆఫ్రికన్ జన్యు వైవిధ్య అధ్యయనంలో, 113 విభిన్న జనాభాలను పరిశీలించగా, శాన్ ప్రజల్లో అత్యధిక జన్యు వైవిధ్యం ఉందని కనుగొన్నారు. దీంతో ఈ తెగ 14 "పూర్వీకుల జనాభా సమూహాల" లో ఒకటిగా నిలిచింది. నైరుతి ఆఫ్రికాలో నమీబియా, అంగోలా తీర సరిహద్దుకు సమీపంలోని ప్రాంతం నుండి ఆధునిక మానవుల వలసలు మొదలయ్యాయని ఈ అధ్యయనంలో గుర్తించారు.[48] ఆధునిక మానవులు మొదట ఎక్కడ కనిపించారు అనే చర్చను పరిష్కరించడానికి పురావస్తు శాస్త్రవేత్త రిచర్డ్ లీకీకి శిలాజ ఆధారాలు సరిపోలేదు. Y- క్రోమోజోము DNA, మైటోకాండ్రియల్ DNA లోని హాప్లోగ్రూప్ల అధ్యయనాలు, ఇటీవలి ఆఫ్రికన్ మూలానికి ఎక్కువగా మద్దతు ఇచ్చాయి.[49] ఆటోసోమల్ DNA ఆధారాలన్నీ కూడా ప్రధానంగా ఇటీవలి ఆఫ్రికన్ మూలానికే మద్దతు ఇచ్చాయి. అయితే, ఇటీవల చేసిన అనేక అధ్యయనాల్లో, ఆఫ్రికాలోను, ఆ తరువాత యురేషియా అంతటానూ ఆధునిక మానవుల, పురాతన మానవుల సంకరానికి ఆధారాలు కనిపించాయి.[50]
ఇటీవలి కాలంలో నియాండర్తల్[51], డెనిసోవన్ల[52] జీనోమ్లను సీక్వెన్సింగు చేసినపుడు, వీరిలో బయటి జీనోమ్ల సంకరం జరిగిందని తేలింది. వర్తమాన కాలపు మానవుల్లో, ఆఫ్రికాయేతరుల జన్యువుల్లో 1–4% లేదా (మరింత తాజా పరిశోధనలో) 1.5-2.6% వరకూ నియాండర్తల్ అంశ ఉన్నట్లు తేలింది. కొందరు మెలనేసియన్లలో 4–6% డెనిసోవన్ అంశ ఉన్నట్లు గమనించారు. ఈ కొత్త ఫలితాలు ఆఫ్రికా నుండి బయటకు సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఏమీ లేవు. జెనెటిక్ బాటిల్నెక్ నుండి కోలుకున్న తరువాత (దీనికి టోబా అగ్నిపర్వత విస్ఫోటనం కారణమని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు) ఒక చిన్న సమూహం ఆఫ్రికా నుండి బయలుదేరి, బహుశా మధ్య ప్రాచ్యంలోని యూరేషియన్ స్టెప్పీల్లో గాని, ఉత్తరాఫ్రికాలోనే గానీ నియాండర్తళ్ళతో సంకరం జరిపింది. ఈ ఆఫ్రికా ప్రజల వారసులు ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించారు. వీరిలో కొందరు మెలనేసియాలో విస్తరించే ముందు బహుశా ఆగ్నేయాసియాలో డినిసోవన్లతో సంపర్కం జరిపారు.[53] ఆధునిక యూరేషియా, ఓషియానియా ప్రజల్లో నియాండర్తల్, డెనిశొవన్ మూలాలున్న HLA హాప్లోటైప్లు కనిపించాయి.[54] డెనిసోవన్ల EPAS1 అనే జన్యువు టిబెట్ ప్రజల్లో కూడా కనిపించింది.[55]
మానవ పరిణామాన్ని శాస్త్రీయంగా వివరించేందుకు ఆధారభూతమైన మూలాలను ప్రాకృతిక విజ్ఞాన శాస్త్రానికి చెందిన అనేక రంగాలు అందించాయి. సాంప్రదాయికంగా, పరిణామ ప్రక్రియ గురించిన జ్ఞానాన్ని అందించినది శిలాజాలు. కానీ 1970 లలో జన్యుశాస్త్రం అభివృద్ధి చెందినప్పటి నుండి, DNA విశ్లేషణ ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. సకశేరుకాలు, అకశేరుకాలు రెండింటి ఓంటొజెనీ, ఫైలోజెనీ, మరీ ముఖ్యంగా పరిణామాత్మక అభివృద్ధి జీవశాస్త్రం, మానవులు ఎలా అభివృద్ధి చెందారు అనే దానితో సహా అన్ని జీవుల పరిణామంపై గణనీయమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. మానవుల మూలాన్ని, జీవితాన్నీ నిర్దుష్టంగా అధ్యయనం చేసేది మానవ శాస్త్రం. పాలియో ఆంత్రోపాలజీ ముఖ్యంగా మానవుడి పూర్వ చరిత్ర అధ్యయనంపై దృష్టి పెడుతుంది.
మానవులకు అత్యంత సన్నిహిత సజీవ బంధువులు బోనోబోలు, చింపాంజీలు (రెండూ పాన్ ప్రజాతికి చెందినవే), గొరిల్లాలు (గొరిల్లా ప్రజాతి).[56] మానవుల, చింపాంజీల జన్యుక్రమాన్ని తయారు చెయ్యడంతో, 2012 నాటికి వాటి DNA ల మధ్య సారూప్యత 95% - 99% మధ్య ఉందని అంచనా వెయ్యగలిగారు.[57][58] మోలిక్యులర్ గడియారం అనే సాంకేతికత సాయంతో, రెండు వంశాలు విడిపోయేందుకు ఎన్ని ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్స్) అవసరమో అంచనా వెయ్యవచ్చు. ఈ విధంగా ఆ వంశాలు ఎప్పుడు వేరుపడ్డాయో సుమారు తేదీని లెక్కించవచ్చు.
హోమోనిన్ల వంశానికి దారితీసినవి తొలుత గిబ్బన్స్ (హైలోబాటిడే కుటుంబం), ఆపై ఒరాంగ్ఉటాన్లు (ప్రజాతి పొంగో). తరువాత గొరిల్లాలు (ప్రజాతి గొరిల్లా). చివరిగా, చింపాంజీలు (ప్రజాతి పాన్). హోమినిన్, చింపాంజీ వంశాలు 40 – 80 లక్షల సంవత్సరాల క్రితం, అంటే, దిగువ మయోసీన్ సమయంలో, వేరుపడ్డాయని కొంతమంది భావిస్తారు.[59][60] అయితే, పరిణామం మాత్రం అసాధారణ రీతిలో చాలా కాలం పాటు సాగినట్లుగా కనిపిస్తుంది. వేరుపడటం 70 నుండి 130 లక్షల సంవత్సరాల కిందట మొదలైంది. కానీ సంకరం కారణంగా ఈ విభజన అస్పష్టంగా మారింది. పూర్తి వేరుపడడం అనేక లక్షల సంవత్సరాల పాటు ఆలస్యమై 50 – 60 లక్షల సంవత్సరాల క్రితం జరిగిందని ప్యాటర్సన్ (2006) చెప్పాడు.[61]
తొలి ఆధునిక మానవులకు, నియాండర్తల్లకూ మధ్య ఏదైనా జన్యు ప్రవాహం ఉందా అనే ప్రశ్నను పరిష్కరించడానికీ, తొలి మానవ వలస ప్రవాహాల పైన, విభజన తేదీల పైన అవగాహనను పెంచుకోవడానికీ జన్యుగత ఆధారాలను కూడా ఉపయోగించారు. సహజ ఎంపికలో భాగం కాకుండా, చాలా స్థిరమైన ఉత్పరివర్తనాలకు లోనైన జన్యువుల భాగాలను పోల్చడం ద్వారా, చిట్ట చివరి ఉమ్మడి పూర్వీకుడి నుండి మొత్తం మానవ జాతులన్నిటి జన్యు వృక్షాన్నీ పునర్నిర్మించడం సాధ్యపడింది.
ఒక వ్యక్తిలో ఒక నిర్దుష్ట మ్యుటేషన్ (సింగిల్-న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం) కనిపించిన ప్రతిసారీ, దాన్ని తన వారసులకు అందించిన ప్రతీసారీ, ఆ వ్యక్తితో సహా తన వారసులందరికీ ఒక హాప్లోగ్రూప్ ఏర్పడుతుంది. తల్లి నుండి మాత్రమే వారసత్వంగా వచ్చే మైటోకాండ్రియల్ డిఎన్ఎను పోల్చడం ద్వారా, 2,00,000 సంవత్సరాల క్రితం నివసించిన మైటోకాండ్రియల్ ఈవ్ అని పిలవబడే స్త్రీ ఆధునిక మానవులందరిలోనూ కనిపించే జన్యు మార్కరుకు మాతృక అని జన్యు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ఒక మానవ జన్యువు మరొకదానికి భిన్నంగా ఎలా ఉందో, దానికి దారితీసిన పరిణామ గతమేంటో, దాని ప్రస్తుత ప్రభావాలు ఎలా ఉన్నాయో మానవ పరిణామ జన్యుశాస్త్రం అధ్యయనం చేస్తుంది. జన్యువుల మధ్య తేడాలు మానవ శాస్త్ర పరమైన, వైద్యపరమైన, ఫోరెన్సిక్ పరమైన ప్రభావాన్ని చూపిస్తాయి. జన్యు డేటా మానవ పరిణామంపై ముఖ్యమైన పరిజ్ఞానాన్ని అందిస్తుంది.
గొరిల్లా, చింపాంజీ, హోమినిన్ వంశాలు వేరుపడడానికి సంబంధించిన శిలాజ ఆధారాలు తక్కువగా ఉన్నాయి.[62] 70 లక్షల సంవత్సరాల నాటి సహెలాంత్రోపస్ టాచెన్సిస్, 57 లక్షల సంవత్సరాల నాటి ఒర్రోరిన్ టుగెనెన్సిస్, 56 లక్షల సంవత్సరాల నాటి ఆర్డిపిథెకస్ కడబ్బా లు, హోమినిన్ వంశానికి చెందినివిగా భావిస్తున్న తొలి శిలాజాలు. వీటిలో ప్రతి ఒక్కటీ హోమినిన్ల ద్విపాద పూర్వీకులే అనే వాదనలు వచ్చాయి. అయితే, ప్రతీ వాదనకూ పోటీ వాదనలు తలెత్తాయి. ఈ జాతులలో ఒకటో రెండో లేదా అన్నీ ఆఫ్రికన్ వాలిడుల మరొక శాఖకు పూర్వీకులై ఉండవచ్చు. లేదా హోమినిన్లకు, ఇతర వాలిడులకూ ఉమ్మడి పూర్వీకులైనా అయి ఉండవచ్చు.
ఈ తొలి శిలాజాల జాతులకు, హోమినిన్ వంశానికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటనే ప్రశ్న ఇంకా అపరిష్కృతం గానే ఉండిపోయింది. 40 లక్షల సంవత్సరాల క్రితం ఈ తొలి జాతుల నుండి, ఆస్ట్రలోపిథెసీన్లు ఉద్భవించి, బలిష్ఠ (పరాంత్రోపస్ అని కూడా పిలుస్తారు), సుకుమార శాఖలుగా వేరుపడ్డాయి. వీటిలో ఒకటి (బహుశా ఆస్ట్రలోపిథెకస్ గార్హి ) బహుశా హోమో జాతికి పూర్వీకులుగా పరిణామం చెంది ఉండవచ్చు. శిలాజ రికార్డులు అత్యధికంగా ఉన్న ఆస్ట్రలోపిథెసిన్ జాతి, ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్. ఉత్తర ఇథియోపియా (ప్రసిద్ధమైన "లూసీ" వంటివి) నుండి కెన్యా, దక్షిణాఫ్రికా వరకూ వందకు పైగా దీని శిలాజాలను కనుగొన్నారు. బలిష్ఠ ఆస్ట్రలోపిథెసీన్ల శిలాజాలు - ఆస్ట్రలోపిథెకస్ రోబస్టస్ (లేదా పరాంత్రోపస్ రోబస్టస్), ఆస్ట్రలోపిథెకస్ /పరాంత్రోపస్ బోయిసీ - దక్షిణాఫ్రికాలోని క్రోండ్రాయ్, స్వార్ట్కాన్స్, లేక్ టుర్కానా వద్ద విస్తృతంగా లభించాయి.
హోమో ప్రజాతికి చెందిన మొట్టమొదటి ప్రతినిధి హోమో హ్యాబిలిస్. ఇది 28 లక్షల సంవత్సరాల క్రిందట ఉద్భవించింది.[63] రాతి పనిముట్లు వాడినట్లుగా ఆధారాలున్న తొట్ట తొలి జాతి ఇది. ఈ తొలి హోమినిన్ల మెదళ్ళు చింపాంజీ మెదడుతో సమానమైన పరిమాణంలో ఉన్నాయి. తరువాతి పది లక్షల సంవత్సరాలలో మెదడు పరిణామం వేగంగా జరిగింది. హోమో ఎరెక్టస్, హోమో ఎర్గాస్టర్ ల నాటికి కపాల సామర్థ్యం రెట్టింపై, 850 సెం.మీ3 అయింది. (మానవ మెదడు పరిమాణంలో ఈ స్థాయి పెరుగుదలకు అర్థం, ప్రతి తరం తమ తల్లిదండ్రుల కంటే 125,000 ఎక్కువ న్యూరాన్లను కలిగి ఉండడం.) ఆఫ్రికా నుండి బయలుదేరిన హోమినిన్ వంశాల్లో ఇవి మొదటివి. ఇవి ఆఫ్రికా, ఆసియా, ఐరోపా అంతటా 18 – 13 లక్షల సంవత్సరాల క్రితం విస్తరించాయి.
తరువాతి పది లక్షల సంవత్సరాలలో, మెదడు పరిమాణం పెరిగే ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 19 లక్షల సంవత్సరాల నాటి హోమో ఎరెక్టస్ శిలాజాలు లభించేటప్పటికి, కపాల పరిమాణం రెట్టింపయింది. ఆఫ్రికా నుండి వలస వచ్చిన హోమినిన్లలో హోమో ఎరెక్టస్ మొదటిది. 18 నుండి 13 లక్షల సంవత్సరాల క్రితం, ఈ జాతి ఆఫ్రికా లోను, ఆసియా లోను, ఐరోపా అంతటానూ వ్యాపించింది. హెచ్.ఎరెక్టస్కు చెందిన ఒక జనాభా (కొన్నిసార్లు దీన్ని హోమో ఎర్గాస్టర్ అనే ప్రత్యేక జాతిగా పిలుస్తారు) ఆఫ్రికాలోనే ఉండిపోయి, హోమో సేపియన్లుగా పరిణామం చెందింది. ఈ జాతులు - హెచ్. ఎరెక్టస్, హెచ్. ఎర్గాస్టర్ లు - నిప్పును, సంక్లిష్ట పనిముట్లనూ మొదటిసారిగా ఉపయోగించాయని భావిస్తున్నారు.
ఆఫ్రికాలో కనుగొన్న హోమో రొడీసియెన్సిస్ వంటివి, హెచ్. ఎర్గాస్టర్ / ఎరెక్టస్ కూ, పురాతన హెచ్. సేపియన్లకూ మధ్య ఉన్న మొట్టమొదటి మధ్యంతర శిలాజాలు. ఆఫ్రికన్ హెచ్. ఎరెక్టస్ వారసులు 5,00,000 సంవత్సరాల క్రితం యురేషియా అంతటా వ్యాపించి, హెచ్. యాంటెసెస్సర్, హెచ్. హైడెల్బెర్గెన్సిస్, హెచ్. నియాండర్తలెన్సిస్గా పరిణామం చెందాయి. శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల తొలి శిలాజాలు, మధ్య పాతరాతియుగం (సుమారు 3,00,000 – 2,00,000 సంవత్సరాల క్రితం) నాటివి. ఇథియోపియాలో దొరికిన హెర్టో, ఓమో అవశేషాలు, మొరాకోలో దొరికిన జెబెల్ ఇర్హౌడ్ అవశేషాలు, దక్షిణాఫ్రికాలోని ఫ్లోరిస్బాడ్ అవశేషాలూ వీటిలో ఉన్నాయి; ఇజ్రాయెల్ ఎస్ స్ఖూల్ గుహలో లభించిన శిలాజాలు, దక్షిణ ఐరోపాలో దొరికిన శిలాజాలూ 90,000 సంవత్సరాల క్రితం నాటివి.
ఆధునిక మానవులు ఆఫ్రికా నుంచి బయటకు వ్యాప్తి చెందే క్రమంలో, వారికి హోమో నియాండర్తలెన్సిస్, డెనిసోవన్స్ వంటి ఇతర హోమోనిన్స్ ఎదురు పడ్డాయి. ఈ జాతులు 20 లక్షల సంవత్సరాల క్రితం ప్రాంతంలో ఆఫ్రికా నుండి వలస వెళ్ళిన హోమో ఎరెక్టస్ జనాభా నుండి ఉద్భవించి ఉండవచ్చు. తొలి మానవులకూ ఈ సోదర జాతులకూ మధ్య పరస్పర సంపర్కపు స్వభావం ఎలా ఉండేది అనే విషయం చాలాకాలంగా వివాదాస్పదంగా ఉంది. మానవులు ఈ మునుపటి జాతుల స్థానాన్ని బలప్రయోగంతో ఆక్రమించారా, లేక పరస్పర లైంగిక సంపర్కం ద్వారా సంతానోత్పత్తికి అనుకూలించేంతగా ఆ జాతుల్లో సారూప్యతలున్నాయా అనేది ఈ వివాదాలకు మూలమైన ప్రశ్న. ఒకవేళ జాత్యంతర సంకరం జరిగి ఉంటే, ఆధునిక మానవుల జన్యువుల్లో ఈ మునుపటి జనాభాలకు చెందిన జన్యు పదార్థం ఉండి ఉండవచ్చు .[64]
ఆఫ్రికా నుండి ఆధునిక మానవుల వలస 70 – 50 వేల సంవత్సరాల కిందట మొదలై ఉండవచ్చని అంచనా వేసారు. తదనంతరం వారు ప్రపంచమంతటా వ్యాపించి, మునుపటి హోమినిన్లతో స్పర్థ ద్వారా గానీ, జాత్యంతర సంకరం ద్వారా గానీ తొలగించి వారి స్థానాన్ని ఆక్రమించారు. వారు యురేషియా, ఓషియానియాల్లో 40,000 సంవత్సరాల కిందటా, అమెరికాలో కనీసం 14,500 సంవత్సరాల కిందటా నివాసాలు స్థాపించుకున్నారు.[65]
19 వ శతాబ్దంలో నియాండర్తల్ అవశేషాలను కనుగొన్నప్పటి నుండీ, వివిధ జాతుల మధ్య సంపర్కం, పునరుత్పత్తుల గురించి చర్చ మొదలైంది.[66] 1970 లలో వివిధ జాతుల మానవులను కనుగొనడంతో, మానవ పరిణామం ఒక ఋజు రేఖలో సాగిందనే అభిప్రాయం వీగిపోవడం మొదలైంది. 21 వ శతాబ్దంలో మోలిక్యులర్ బయాలజీ పద్ధతుల రాక, కంప్యూటరీకరణల కారణంగా నియాండర్తల్ల, ఆధునిక మానవుల పూర్తి జన్యు శ్రేణిని ఆవిష్కరించారు. ఇది వివిధ మానవ జాతుల మధ్య ఇటీవలి సమ్మేళనాన్ని నిర్ధారించింది.[67] 2010 లో, పరమాణు జీవశాస్త్రం ఆధారంగా ఆధారాలు ప్రచురించబడ్డాయి, మధ్య పాత రాతియుగం లోను, ఎగువ పాత రాతియుగపు తొలి నాళ్ళ లోనూ, పురాతన, ఆధునిక మానవుల మధ్య జాత్యంతర సంకరం జరిగిందనేందుకు నిస్సందేహమైన ఉదాహరణలు వెలువడ్డాయి. నియాండర్తల్లు, డెనిసోవన్లతో పాటు గుర్తు తెలియని ఇతర హోమినిన్లకు సంబంధించిన అనేక వేరువేరు సంఘటనలలో జాత్యంతర సంకరం జరిగిందని నిరూపితమైంది.[68] ఈనాటి ఆఫ్రికాయేతర జనాభాల (యూరోపియన్లు, ఆసియన్లు, ఓషియానియన్లతో సహా) DNA లో సుమారు 2% నియాండర్తల్దే.[69] వీరిలో డెనిసోవన్ వారసత్వపు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి.[70] అలాగే, ఆధునిక మెలనేసియన్ జన్యువుల్లో 4–6% డెనిసోవన్దే. మానవ జన్యువును నియాండర్తల్స్, డెనిసోవన్స్, వాలిడుల జన్యువులతో పోల్చడం వలన, ఆధునిక మానవులను ఇతర హోమినిన్ జాతుల నుండి వేరుచేసే లక్షణాలను గుర్తించడం సులభమవుతుంది. 2016 తులనాత్మక జన్యుశాస్త్ర అధ్యయనంలో, హార్వర్డ్ మెడికల్ స్కూల్ / యుసిఎల్ఎ పరిశోధన బృందం నియాండర్తల్, డెనిసోవన్ల జన్యు విస్తృతిని ప్రపంచ పటంపై గుర్తించింది. ఈ జన్యువులు ఆధునిక మానవుని జన్యువులపై ఎక్కడ ప్రభావం చూపుతుందనే దానిపై కొన్ని అంచనాలు వేసింది.[71][72]
ప్రైమేట్ల పరిణామ చరిత్ర 6.5 కోట్ల సంవత్సరాల నాటిది.[73][74][75] పురాతన ప్రైమేట్ లాంటి క్షీరద జాతులలో ఒకటైన ప్లెసియాడాపిస్, ఉత్తర అమెరికాలో ఉద్భవించింది;[76][77][78][79][80] ఆర్కిస్బస్ అనే మరొకటి చైనాలో పుట్టింది.[81] పాలియోసీన్, ఇయోసీన్ ఇపోక్లలో ఉష్ణమండల కాలాల్లో యురేషియా, ఆఫ్రికాల్లో ఇలాంటి ప్రైమేట్లు విస్తృతంగా వ్యాపించాయి.
కెన్యాలో లభించిన నకాలిపిథెకస్ శిలాజాలు, గ్రీస్లో కనిపించిన ఔరానోపిథెకస్లు గొరిల్లాలు, చింపాంజీలు, మానవుల చివరి ఉమ్మడి పూర్వీకుడికి దగ్గరగా ఉన్న జాతులై ఉండవచ్చు. 8 – 4 కోట్ల సంవత్సరాల క్రితం, మానవులకు దారితీసే పరిణామ రేఖ నుండి మొదట గొరిల్లాలు, ఆ తరువాత చింపాంజీలు (పాన్ ప్రజాతి) వేరుపడ్డాయని మోలిక్యులర్ ఆధారాలు సూచిస్తున్నాయి. సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్లను పోల్చినప్పుడు మానవ DNA, చింపాంజీల DNA లు సుమారు 98.4% వరకూ ఒకేలా ఉంటాయి. అయితే, గొరిల్లాలు, చింపాంజీల శిలాజ రికార్డు పరిమితంగా లభించింది; శిలాజాలకు సరైన సంరక్షణ లేకపోవడం వలన (వర్షారణ్యాల నేలలు ఆమ్లయుతంగా ఉండి, ఎముకలను కరిగించేసుకుంటాయి), నమూనా పక్షపాతం వలనా బహుశా ఈ సమస్య తలెత్తి ఉండవచ్చు.
ఇతర హోమినిన్లు బహుశా భూమధ్యరేఖ బెల్టుకు వెలుపల ఉన్న పొడి వాతావరణాలకు అనుగుణంగా మారి ఉంటాయి; అక్కడ వారు జింకలు, హైనాలు, కుక్కలు, పందులు, ఏనుగులు, గుర్రాలను, ఇతర జంతువులనూ ఎదుర్కొన్నారు. భూమధ్యరేఖ బెల్టు సుమారు 80 లక్షల సంవత్సరాల క్రితం కుదించుకు పోయింది. గొరిల్లాలు, చింపాంజీల వంశాల నుండి హోమినిన్ వంశం వేర్పాటు ఆ సమయంలోనే జరిగి ఉంటుందని భావిస్తున్నారు. దీనికి ఆధారమైన శిలాజాలు చాలా తక్కువగా లభించాయి. అత్యంత పురాతన శిలాజాలైన సహెలాంత్రోపస్ చాడెన్సిస్, (70 లక్షల సంవత్సరాలు), ఒర్రోరిన్ టుగెన్సిస్, (60 లక్షల సంవత్సరాలు), ఆ తరువాత ఆర్డిపిథెకస్ (55-44 లక్షల సంవత్సరాలు) ప్రజాతి, అందులోని జాతులైన Ar. కడబ్బా, Ar. రామిడస్ లు మానవ వంశానికి చెందినవని కొందరు వాదించారు.
ఆస్ట్రలోపిథెకస్ ప్రజాతి 40 లక్షల సంవత్సరాల క్రితం తూర్పు ఆఫ్రికాలో ఉద్భవించి, ఆఫ్రికా ఖండమంతటా వ్యాప్తి చెంది, 20 లక్షల సంవత్సరా కిందట అంతరించి పోయింది. ఈ కాలంలో, ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్, ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్, ఆస్ట్రలోపిథెకస్ సెడీబా, ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ వంటి అనేక రకాల ఆస్ట్రలోపిథ్లు జీవించాయి. ఈ కాలంలో జీవించిన కొన్ని ఆఫ్రికన్ హోమినిడ్ జాతులు - రోబస్టస్, బాయిసీ వంటివి - ఈ ప్రజాతిలో భాగమా కాదా అనే విషయమై విద్యావేత్తలలో ఇంకా కొంత చర్చ జరుగుతోంది; అవి భాగమయితే, వాటిని బలిష్ఠ ఆస్ట్రలోపిథ్ లుగా పరిగణించాలి. మిగతా వాటిని గ్రాసైల్ ఆస్ట్రలోపిత్స్ అని పరిగణించాలి. అయితే, ఈ జాతులకు వాటి స్వంత ప్రజాతి ఉంటే, వాటికి పారాంత్రోపస్ అని పేరు పెట్టవచ్చు.
హోమో ప్రజాతికి చెందిన మొట్టమొదటి ప్రతినిధి హోమో హ్యాబిలిస్. ఇది సుమారు 28 లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది.[63] రాతి పనిముట్లను వాడిందని చెప్పేందుకు సానుకూల ఆధారాలు ఉన్న తొట్ట తొలి జాతి ఇది. ఈ తొలి హోమినిన్ల మెదళ్ళ పరిమాణం చింపాంజీతో సమానంగా ఉన్నాయి. తరువాతి పది లక్షల సంవత్సరాలలో మెదడు పరిణామ ప్రక్రియ వేగంగా జరిగింది. శిలాజ రికార్డులలోకి హోమో ఎరెక్టస్, హోమో ఎర్గాస్టర్లు రావడంతో, కపాల సామర్థ్యం రెట్టింపు (850 సెం.మీ3) అయింది. (మానవ మెదడు పరిమాణంలో ఈ స్థాయి పెరుగుదల అంటే ప్రతి తరమూ వారి తల్లిదండ్రుల కంటే 125,000 ఎక్కువ న్యూరాన్లను కలిగి ఉండటంతో సమానం.) హోమో ఎరెక్టస్,హోమో ఎర్గాస్టర్ లు నిప్పును, సంక్లిష్ట పనిముట్లనూ ఉపయోగించారని భావిస్తున్నారు. ఆఫ్రికా నుండి వలస పోయిన హోమినిన్ లైన్లలో ఇవి మొదటివి. 13 – 18 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా, ఆసియా, ఐరోపా అంతటా ఇవి విస్తరించాయి.
ఆధునిక మానవులకు పూర్వులైన పురాతన హోమో సేపియన్స్ జాతి 4,00,000 – 2,50,000 సంవత్సరాల క్రితం మధ్య పాతరాతియుగంలో ఉద్భవించింది.[83] ఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికా మూలం సిద్ధాంతం ప్రకారం, ఆధునిక మానవులు ఆఫ్రికాలో హోమో హైడెల్బెర్గెన్సిస్ లేదా హోమో రొడీసియెన్సిస్ లేదా హోమో పూర్వీకుల నుండి ఉద్భవించి, 1,00,000 – 50,000 సంవత్సరాల క్రితం ఆ ఖండం నుండి బయటికి వలస వెళ్ళారు. వీళ్ళు క్రమంగా హోమో ఎరెక్టస్, డెనిసోవా హోమినిన్స్, హోమో ఫ్లోరేసియెన్సిస్, హోమో లుజోనెన్సిస్, హోమో నియాండర్తలెన్సిస్ ల స్థానాలను ఆక్రమించారు.[84][85] ఆఫ్రికాయేతర జనాభా లన్నింటిలోను నియాండర్తల్ మూలానికి చెందిన అనేక హాప్లోటైప్లు ఉన్నాయని ఇటీవలి DNA ఆధారాలు సూచిస్తున్నాయి. నియాండర్తల్, డెనిసోవన్స్ వంటి హోమినిన్లు వారి జన్యువుల్లో 6% వరకు నేటి మానవులకు అందించి ఉండవచ్చు. ఇది ఆయా జాతుల మధ్య పరిమితంగా ఉన్న సంతానోత్పత్తికి సూచన.[86][87][88] సంకేత సంస్కృతి, భాష, ప్రత్యేకమైన రాతి పనిముట్ల సాంకేతికతల అభివృద్ధి ద్వారా ఆధునిక ప్రవర్తన దిశగా పరివర్తన చెందడం 50,000 సంవత్సరాల క్రితం జరిగిందని కొంతమంది మానవ శాస్త్రవేత్తల అభిప్రాయం.[89] అయితే, ప్రవర్తనలో వచ్చిన మార్పుకు అంతకంటే ఎక్కువ కాలం పట్టిందని ఆధారాలున్నాయని మరికొందరు సూచిస్తున్నారు.[90]
హోమో ప్రజాతిలో హోమో సేపియన్స్ ఒక్కటే ఇప్పటికీ నిలిచి ఉన్న జాతి. కొన్ని (అంతరించిపోయిన) హోమో జాతులు హోమో సేపియన్లకు పూర్వీకులు అయి ఉండవచ్చు. కానీ, చాలా జాతులు, బహుశా ఎక్కువ జాతులు వీరికి "దాయాదులు" అయి ఉండవచ్చు.[91] ఈ సమూహాలలో దేన్ని ప్రత్యేక జాతిగా పరిగణించాలి , దేన్ని ఉపజాతిగా చూడాలి అనే దానిపై ఇంకా ఏకాభిప్రాయం లేదు; సరిపడినన్ని శిలాజాలు లేకపోవడమే దీనికి కారణం కావచ్చు, లేదా హోమో ప్రజాతి లోని జాతులను వర్గీకరించడానికి ఉపయోగించే స్వల్ప వ్యత్యాసాలు కావచ్చు. హోమో ప్రజాతి తొలినాళ్ళలోని వైవిధ్యానికి సహారా పంపు సిద్ధాంతంలో ఒక వివరణను చూడవచ్చు.
పురావస్తు, పురాజీవ శాస్త్రాల దృష్టాంతాల ఆధారంగా, వివిధ పురాతన హోమో జాతుల ఆహారపు టలవాట్లను నిర్ధారించడం [25], హోమో జాతులలో భౌతిక, ప్రవర్తనా పరిణామంలో ఆహారపు పాత్రను అధ్యయనం చెయ్యడం సాధ్యపడింది.[22][92]
కొంతమంది మానవ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు టోబా విపత్తు సిద్ధాంతాన్ని ఆమోదించారు. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో 70,000 సంవత్సరాల క్రితం టోబా అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది ప్రపంచవ్యాప్తంగా అనేక విపరిణామాలకు కారణమైందని ఈ సిద్ధాంతం చెబుతుంది.[93] ఈ ఘటనలో అనేక మంది మానవులు మరణించడంతో, ఈ నాటి మానవులందరి జన్యు వారసత్వాన్ని ప్రభావితం చేసేంతటి జనాభా బాటిల్నెక్ ఏర్పడింది.[94] అయితే, దీనికి సంబంధించిన జన్యు, పురావస్తు ఆధారాలు ప్రశ్నార్థకంగానే ఉన్నాయి.
హోమో హ్యాబిలిస్ సుమారు 28 [63] నుండి 14 లక్షల సంవత్సరాల క్రితం వరకు నివసించింది. ఈ జాతి దక్షిణ, తూర్పు ఆఫ్రికాలో మలి ప్లయోసిన్ లేదా తొలి ప్లైస్టోసీన్ కాలంలో, అంటే 25 – 20 లక్షల సంవత్సరాల మధ్య, ఆస్ట్రలోపిథెసిన్ల నుండి వేరుపడి అభివృద్ధి చెందింది. హోమో హ్యాబిలిస్కు ఆస్ట్రలోపిథెసీన్ల కంటే చిన్న మోలార్లు, పెద్ద మెదళ్ళూ ఉన్నాయి. రాతి పనిముట్లు, బహుశా జంతువుల ఎముకల పనిముట్లూ తయారు చేశాయి. రాతి పనిముట్లతో అనుబంధం ఉన్నందున వీటి ఆవిష్కర్త లూయిస్ లీకీ, దీనికి 'హ్యాండీ మ్యాన్' (హ్యాబిలిస్) అని పేరు పెట్టాడు. దాని అస్థిపంజరం నిర్మాణం హోమో సేపియన్స్ లాగా ద్విపాది కాకుండా, చెట్లపై నివసించడానికే ఎక్కువ అనుకూలంగా ఉంది. అందుచేత ఈ జాతిని హోమో నుండి ఆస్ట్రలోపిథెకస్లోకి తరలించాలని కొంతమంది శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు [95]
ఇవి సుమారు 19 – 16 లక్షల సంవత్సరాల నాటి శిలాజాలకు ప్రతిపాదించిన జాతుల పేర్లు. వీటికీ హోమో హ్యాబిలిస్కూ ఉన్న సంబంధం ఏమిటనేది స్పష్టం కాలేదు.
హోమో ఎరెక్టస్ తొలి శిలాజాలను డచ్ వైద్యుడు యూజీన్ డుబోయిస్ 1891 లో ఇండోనేషియా ద్వీపమైన జావాలో కనుగొన్నాడు. మొదట్లో అతడు దీనికి ఆంత్రోపోపిథెకస్ ఎరెక్టస్ అని పేరు పెట్టాడు. (1892–1893 లో. ఆ సమయంలో దీన్ని చింపాంజీ లాంటి ప్రైమేట్ శిలాజంగా పరిగణించాడు). తరువాత పిథెకాంత్రోపస్ ఎరెక్టస్ అన్నాడు (1893–1894 లో. దాని స్వరూపం ఆధారంగా దాన్ని వాలిడులకు,మానవులకూ మధ్యంతర జాతిగా భావించి తన మనసు మార్చుకున్నాడు,).[99] కొన్ని సంవత్సరాల తరువాత, 20 వ శతాబ్దంలో, జర్మన్ వైద్యుడు, పాలియో ఆంత్రొపాలజిస్టూ అయిన ఫ్రాంజ్ వీడెన్రీచ్ (1873–1948) జావా మనిషి (అప్పట్లో పిథెకాంత్రోపస్ ఎరెక్టస్ అనేవారు) లక్షణాలను, పెకింగ్ మనిషి లక్షణాలనూ (అప్పట్లో సినాంత్రోపస్ పెకినెన్సిస్ అనేవారు) పోల్చి పరిశీలించాడు. ఆధునిక మానవులతో వీటికి శరీర నిర్మాణ సంబంధమైన సారూప్యత ఉన్నందున, జావా, చైనా మనుషుల నమూనాలన్నింటినీ హోమో ప్రజాతికి చెందిన హోమో ఎరెక్టస్ అనే ఒకే జాతిగా పరిగణించాల్సిన అవసరం ఉందని 1940 లో గుర్తించాడు.[100] హోమో ఎరెక్టస్ సుమారు 18 లక్షల సంవత్సరాల క్రితానికి, 70,000 సంవత్సరాల క్రితానికీ మధ్య నివసించింది. బహుశా టోబా విపత్తుతో ఈ జాతి తుడిచిపెట్టుకుపోయిందని ఇది సూచిస్తుంది; అయితే, సమీపంలోని హోమో ఫ్లోరేసియెన్సిస్ ఆ విపత్తు నుండి బయటపడింది. 18 నుండి 12.5 లక్షల సంవత్సరాల మధ్య వరకు సాగిన హోమో ఎరెక్టస్ తొలి దశను కొంతమంది హోమో ఎర్గాస్టర్ అనే ప్రత్యేక జాతిగా గాని, లేదా హోమో ఎరెక్టస్ ఎర్గాస్టర్ అనే హోమో ఎరెక్టస్ లోని ఉపజాతిగా గానీ భావిస్తారు.
ఆఫ్రికాలో ప్లైస్టోసీన్ తొలినాళ్లలో, అంటే 15–10 లక్షల సంవత్సరాలక్రితం, హోమో హ్యాబిలిస్ కు చెందిన కొన్ని జనాభాలు పెద్దవైన మెదడులను పొందాయని, మరింత విస్తృతమైన రాతి పనిముట్లను తయారు చేసాయనీ భావిస్తున్నారు; ఈ తేడాలతో పాటు, ఇతర తేడాలను బట్టి, వీటిని ఆఫ్రికాలో హోమో ఎరెక్టస్ అనే కొత్త జాతిగా మానవ శాస్త్రవేత్తలు వర్గీకరించారు.[101] మోకాళ్ళు లాక్ అవడం, ఫోరామెన్ మాగ్నం (వెన్నెముక పుర్రెలోకి ప్రవేశించే రంధ్రం) ముందుకు జరగడం వంటి పరిణామాలు పెద్ద జనాభా మార్పులకు కారణమై ఉంటాయని భావిస్తున్నారు. ఈ జాతి నిప్పుతో మాంసం వండుకుని ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. హోమోలలో తగ్గిన పేగుల పొడవు, చిన్నవైన దంతాలు, నేలపై నివాసముండడం మొదలైన వాటిని గమనించాక,[102] నిప్పుపై పట్టు, వంట ద్వారా పోషక విలువల వృద్ధి వంటివి హోమోలనూ చెట్టుపై నిద్రించే ఆస్ట్రలోపిథెసీన్లనూ వేరుచేసే కీలకమైన అనుసరణలని రిచర్డ్ రాంఘామ్ చెప్పాడు.[103]
హోమో ఎరెక్టస్కు సుప్రసిద్ధ ఉదాహరణ పెకింగ్ మనిషి; మిగతావి ఆసియా (ముఖ్యంగా ఇండోనేషియాలో), ఆఫ్రికా, ఐరోపాలలో దొరికాయి. చాలా మంది పాలియో ఆంత్రోపాలజిస్టులు ఈ సమూహపు ఆసియాయేతర రూపాలను హోమో ఎర్గాస్టర్ అని పిలుస్తున్నారు. ఆసియాలో కనిపించే శిలాజాలకు - హెచ్. ఎర్గాస్టర్ కంటే కొద్దిగా భిన్నమైన కొన్ని అస్థిపంజర, దంతాల అమరిక ఉన్నవాటికి - మాత్రమే హోమో ఎరెక్టస్ అనే పేరును వాడుతున్నారు.
ఇవి హెచ్. ఎరెక్టస్కు, హెచ్ . హైడెల్బెర్గెన్సిస్కూ మధ్య ఉన్న జాతులు కావచ్చు.
హెచ్. హైడెల్బెర్గెన్సిస్ ("హైడెల్బర్గ్ మ్యాన్") సుమారు 8,00,000 నుండి 3,00,000 సంవత్సరాల క్రితం జీవించింది. దీని పేరును హోమో సేపియన్స్ హైడెల్బెర్గెన్సిస్ అని, హోమో సేపియన్స్ పాలియోహంగేరికస్ అనీ కూడా ప్రతిపాదించారు.[107]
హోమో నియాండర్తలెన్సిస్, లేదా హోమో సేపియన్స్ నియాండర్తలెన్సిస్ గా పిలిచే జాతి,[108] 4,00,000 క్రితం నుండి [109] 28,000 సంవత్సరాల క్రితం వరకూ [110] ఐరోపా, ఆసియాల్లో నివసించింది. శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవులకు (AMH), నియాండర్తల్ జనాభాకూ మధ్య స్పష్టమైన తేడాలున్నాయి. శీతల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నియాండర్తల్ జనాభాలో చోటు చేసుకున్న మార్పులకు సంబంధించిన తేడాలే వీటిలో ఎక్కువ. వాటి ఘనపరిమాణానికి, ఉపరితల వైశాల్యానికీ ఉన్న నిష్పత్తి ఆర్కిటిక్ ప్రాంతంలో నివసించే జనాభాలో కనిపించే నిష్పత్తి కంటే బాగా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆధునిక మానవుడి కంటే తక్కువగా శరీరం లోని వేడిమిని కోల్పోతుంది. నియాండర్తళ్ళ మెదడు విశేషంగా పెద్దదిగా ఉండేది. మేధోపరంగా ఆధునిక మానవులకు ఆధిపత్యం ఉండేదన్న విషయం దీనివలన ప్రశ్నార్థకమౌతోంది. ఐలున్డ్ పియర్స్, క్రిస్ స్ట్రింగర్, డన్బార్లు ఇటీవల చేసిన పరిశోధనల్లో మెదడు నిర్మాణంలో ముఖ్యమైన తేడాలు కొన్నిటిని గమనించారు. ఉదాహరణకు, నియాండర్తల్ల చూపు ఆధునిక మానవుల కంటే తీక్షణంగా ఉండేది. హిమనదీయ ఐరోపాలో తక్కువ వెలుతురు ఉండే పరిస్థితుల్లో ఇది మెరుగైన దృష్టిని ఇస్తుంది. నియాండర్తల్స్ అధిక శరీర ద్రవ్యరాశికి తగినట్లుగా శరీర సంరక్షణకు, నియంత్రణకూ అవసరమైనంత ద్రవ్యరాశి మెదడుకు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది.[111]
నియాండర్తల్ జనాభా ఆధునిక మానవుల జనాభా కంటే శారీరకంగా బలిష్ఠమైనవారు. 75,000 నుండి 45,000 సంవత్సరాల క్రితం వరకు ఆధునిక మానవులపై నియాండర్తల్ జనాభా ఆధిపత్యం సాధించడానికి ఈ తేడాలు సరిపోయి ఉండవచ్చు. నియాండర్తల్ ప్రజలు సామాజికంగా తక్కువ విస్తీర్ణంలో ఉండేవారని, ఎండోక్రానియల్ ఘనపరిమాణాన్ని బట్టి, వారు 144 మంది వరకూ పరస్పర సంబంధాలు నెరపుకొని ఉండే అవకాశం ఉందనీ భావిస్తున్నారు. ఒక్కో సమూహం లోని జనాభా సుమారు 120 మంది లోపే ఉండేవారని తెలుస్తోంది. నియాండర్తళ్ళ కంటే ఆధునిక మానవులు ఎక్కువ విశాలమైన ప్రాంతాల్లో ఆహార సేకరణకు చరించేవారని తెలుస్తోంది (రాతి పనిముట్ల వాడుకను బట్టి దీన్ని ధృవీకరించారు) . ఆధునిక మానవుల సమూహాల పరిమాణం పెద్దదిగా ఉండడంతో, వారిలో సాంఘిక, సాంకేతిక ఆవిష్కరణలు తేలిగ్గా సాధ్యపడేవి. ఇవన్నీ, 28,000 సంవత్సరాల క్రితం నాటికి ఆధునిక హోమో సేపియన్లు నియాండర్తల్ జనాభా స్థానాన్ని ఆక్రమించేందుకు దోహదం చేసాయి.[111]
హెచ్. నియాండర్తలెన్సిస్, హెచ్. సేపియన్ల మధ్య పెద్ద జన్యు ప్రవాహమేమీ జరగలేదనీ ఈ రెండూ వేరువేరు జాతులనీ, ఇవి 6,60,000 సంవత్సరాల క్రితం ఒక సాధారణ పూర్వీకుడి నుండి ఉద్భవించిన ప్రత్యేక జాతులనీ గతంలో చేసిన మైటోకాండ్రియల్ డిఎన్ఎ సీక్వెన్సింగు సూచించింది.[112][113][114] అయితే, 2010 లో చేసిన నియాండర్తల్ జన్యు క్రమం ప్రకారం 45,000 – 80,000 సంవత్సరాల క్రితం (సుమారుగా ఆధునిక మానవులు ఆఫ్రికా నుండి వలస వచ్చి, యూరప్, ఆసియా, ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందడానికి ముందు) నియాండర్తల్లు ఆధునిక మానవుల సంపర్కంతో సంతానోత్పత్తి చేసారని సూచించింది.[115] రుమేనియాకు చెందిన 40,000 సంవత్సరాల పురాతన మానవ అస్థిపంజరపు జన్యు శ్రేణిని విశ్లేషించినపుడు దాని జన్యువులో 11% వరకు నియాండర్తల్ అంశ ఉందని తేలింది. ఆ వ్యక్తిలో, అంతకుముందు మధ్య ప్రాచ్యంలో జరిగిన సంకర సంపర్కం ద్వారా వచ్చిన అంశతో పాటు, 4–6 తరాల క్రితం ఆ వ్యక్తి పూర్వీకుడు నియాండర్తలేనని కూడా అంచనా వేసారు.[116] ఈ రుమేనియన్ జనాభా ఆధునిక మానవులకు పూర్వీకులు కానప్పటికీ, జాత్యంతర సంకరం పదేపదే జరిగిందని మాత్రం తెలుస్తోంది.[117]
సుమారు 1,90,000 నుండి 50,000 సంవత్సరాల క్రితం వరకు నివసించిన హెచ్. ఫ్లోరేసియెన్సిస్, పరిమాణంలో చాలా చిన్నది. అందుచేత దాన్ని హాబిట్ అని మారుపేరుతో కూడా పిలుస్తారు. బహుశా ఇది ఇన్సులర్ మరుగుజ్జు అయి ఉంటుంది.[118] హెచ్. ఫ్లోరేసియెన్సిస్ పరిమాణం, వయస్సూ రెండూ చిత్రంగా ఉంటాయి. హోమో ప్రజాతికి చెందిన ఇటీవలి జాతి అయినప్పటికీ, ఆధునిక మానవులకు లేని లక్షణాలు కొన్ని, దీనికి ఉన్నాయి. మరో మాటలో చెప్పాలంటే, హెచ్. ఫ్లోరెసియెన్సిస్కు ఆధునిక మానవులకూ ఒక ఉమ్మడి పూర్వీకుడు ఉండి ఉంటాడని అనిపిస్తోంది. అతడు ఆధునిక మానవ వంశం నుండి వేరుపడి ఒక ప్రత్యేకమైన పరిణామ మార్గాన్ని అనుసరించి ఉంటాడు. 2003 లో సుమారు 30 సంవత్సరాల వయస్సు గల మహిళదిగా భావిస్తున్న సుమారు 18,000 సంవత్సరాల నాటి అస్థిపంజరాన్ని కనుగొన్నారు. జీవించి ఉన్నపుడు ఆ మహిళ ఒక మీటర్ ఎత్తు, కేవలం 380 సెం.మీ3 పరిమాణం గల మెదడు (ఒక చింపాంజీ కంటే చిన్నది, హెచ్.సేపియన్స్ సగటు పరిమాణమైన 1400 సెం.మీ3 లో మూడవ వంతు కంటే తక్కువ) కలిగి ఉండేదని అంచనా వేసారు.
అయితే, హెచ్. ఫ్లోరేసియెన్సిస్ నిజానికి ఒక ప్రత్యేక జాతేనా అనే దానిపై చర్చ కొనసాగుతోంది.[119] కొంతమంది శాస్త్రవేత్తలు హెచ్.ఫ్లోరేసియన్సిస్ ఒక మరుగుజ్జు హెచ్.సేపియన్ అని అంటారు.[120] ఈ ఊహ కొంతవరకు సరైనదే. ఎందుకంటే అస్థిపంజరం దొరికిన ఇండోనేషియా ద్వీపం, ఫ్లోరెస్లో నివసించే ఆధునిక మానవుల్లో కొందరు పిగ్మీలు ఉంటారు. ఇది, పాథలాజికల్ మరుగుజ్జుతనంతో కలిసి, చిన్నపాటి మానవునిగా ఉద్భవించి ఉండవచ్చు. హెచ్. ఫ్లోరేసియెన్సిస్ ప్రత్యేక జాతి కాదు అనేవారి మరొక వాదన ఏమిటంటే, దీని వద్ద లభించిన పనిముట్లు హెచ్. సేపియన్స్తో మాత్రమే సంబంధం ఉన్నవి.
హెచ్. ఫ్లోరేసియెన్సిస్ లో ఆధునిక మానవుల్లో లేని లక్షణాలు (మరుగుజ్జులైనా కాకున్నా), పురాతన హోమో జాతుల్లో ఉండే లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఇది ఎలా ఎందుకుందో పాథలాజికల్ మరుగుజ్జుతనం పరికల్పన వివరించలేకపోయింది. కపాల లక్షణాలతో పాటు, మణికట్టు, ముంజేయి, భుజం, మోకాలు, పాదాల లోని ఎముకల రూపాలు ఈ లక్షణాల్లో ఉన్నాయి. పైగా, ఇలాంటి లక్షణాలతోటే ఉన్న శిలాజాలు ఒకటీ రెండూ కాదు, చాలానే ఉన్నాయి. అన్ని ఎందుకు ఉన్నాయో కూడా ఇది వివరించలేదు. ఈ మరుగుజ్జుతనం ఒక వ్యక్తికి మాత్రమే పరిమితమైనది కాదనీ, ఒక పెద్ద జనాభాలోనే ఈ లక్షణం ఉందనీ దీన్నిబట్టి తెలుస్తోంది.[119]
లుజోన్ ద్వీపంలో లభించిన 50,000 నుండి 67,000 సంవత్సరాల క్రితం నాటి కొద్ది సంఖ్యలో ఉన్న నమూనాలకు చెందిన దంత లక్షణాల ఆధారంగా, వాటిని హెచ్. లుజోనెన్సిస్ అనే ఒక కొత్త మానవ జాతిగా గుర్తించారు.[121]
హోమో సేపియన్స్ (సేపియన్స్ అంటే లాటిన్లో "జ్ఞాని" లేదా "తెలివైన" అని అర్థం) 3,00,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో, హోమో హైడెల్బర్గెన్సిస్ లేదా తత్సంబంధిత వంశం.నుండి ఉద్భవించింది.[122][123] 2019 సెప్టెంబరులో, శాస్త్రవేత్తలు 260 సిటి స్కాన్ల ఆధారంగా కంప్యూటరైజ్డ్ నిర్ణయ పద్ధతిలో ఆధునిక మానవుల / హెచ్. సేపియన్స్ల చివరి సాధారణ పూర్వీకుల పుర్రె ఆకారాన్ని తయారు చేసారు. ఆధునిక మానవులు 2,60,000 – 3,00,000 సంవత్సరాల క్రితం తూర్పు, దక్షిణ ఆఫ్రికాలోని జనాభాలు విలీనం కావడం ద్వారా ఉద్భవించారని సూచించారు.[124][125]
4,00,000 సంవత్సరాల క్రితానికీ, మధ్య ప్లైస్టోసీన్లోని రెండవ అంతర గ్లేసియల్ కాలానికీ మధ్య, సుమారు 2,50,000 సంవత్సరాల క్రితం, కపాలం పరిమాణం పెరగడం, రాతి పనిముట్ల సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం జరిగింది. హెచ్. ఎరెక్టస్ నుండి హెచ్. సేపియన్స్ పరిణామం చెందిందనడానికి ఇవి ఆధారాలు. హెచ్. ఎరెక్టస్ ఆఫ్రికా నుండి బయటకు వలస వెళ్ళినట్లు ప్రత్యక్ష ఆధారాలు సూచిస్తున్నాయి. ఆ తరువాత ఆఫ్రికాలోనే మిగిలిపోయిన హెచ్. ఎరెక్టస్ నుండి హెచ్. సేపియన్స్ పరిణామం చెందింది. తరువాత హోమో సేపియెన్స్ చేపట్టిన వలసలో (ఆఫ్రికాలో అంతర్గతం గానూ, బయటికీ) అంతకుముందు వ్యాప్తి చెందిన హెచ్. ఎరెక్టస్ను తొలగించి ఆ స్థానాన్ని ఆక్రమించాయి. ఈ వలసను, మూలం సిద్ధాంతాన్నీ "ఇటీవలి ఏకైక-మూలం పరికల్పన" అని, "ఆఫ్రికా నుండి బయటకు-2" (ఔట్ ఆఫ్ ఆఫ్రికా-2) సిద్ధాంతం అనీ పిలుస్తారు. హెచ్. సేపియన్లు ఆఫ్రికాలో, యూరేషియాల్లో పురాతన మానవులతో జాత్యంతర సంకరం చేసారు. ముఖ్యంగా, యూరేషియాలో నియాండర్తల్, డెనిసోవన్లతో సంపర్కం పెట్టుకున్నారు.[86][126]
70,000 సంవత్సరాల క్రితం హెచ్. సేపియన్ల జనాభాకు బాటిల్నెక్ ఏర్పడిందనే టోబా విపత్తు సిద్ధాంతం,[127] 1990 లలో దాన్ని మొదటిసారిగా ప్రతిపాదించినప్పటి నుండీ వివాదాస్పదంగానే ఉంది. 2010 నాటికి అది మద్దతు బాగా కోల్పోయింది.[128]
పనిముట్ల ఉపయోగం మేధస్సుకు చిహ్నం. ఇది మానవ పరిణామంలో కొన్ని అంశాలను ఉత్తేజపరిచి ఉండవచ్చునని భావించారు - ముఖ్యంగా మానవ మెదడు పరిణామం.[129] శక్తి వినియోగం విషయంలో మెదడు డిమాండ్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, లక్షల సంవత్సరాల పాటు ఈ అవయవం పెరుగుదలను పాలియోంటాలజీ ఇంకా వివరించలేదు. ఆధునిక మానవుడి మెదడు 13 వాట్లను (రోజుకు 260 కిలో కేలరీలు) వినియోగిస్తుంది. విశ్రాంతిగా ఉన్నపుడు శరీరం వాడే మొత్తం విద్యుత్తులో ఇది ఐదవ వంతు.[130] పనిముట్ల వాడకం పెరగడంతో శక్తితో పరిపుష్టమైన మాంస ఉత్పత్తులను వేటాడేందుకు వీలైంది. మరింత శక్తితో కూడిన శాకాహార ఉత్పత్తులను తిని, అరిగించుకోడానికి చేయడానికి ఇది వీలు కల్పించింది. తొలి హోమినిన్లు పనిముట్లను రూపొందించడానికీ, వాటిని వాడే సామర్థ్యాన్ని పెంచుకోడానికీ పరిణామ క్రమంలో ఒత్తిడికి లోనయ్యారని పరిశోధకులు భావించారు.[131]
తొలి మానవులు పనిముట్లను ఉపయోగించడం ఎప్పుడు మొదలు పెట్టారో ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ప్రాచీనమైన పనిముట్లు (ఉదాహరణకు, పదునైన అంచుగల రాళ్ళు) సహజ వస్తువులో లేదా మానవుడు తయారు చేసినవో చెప్పడం కష్టం. పనిముట్లు ఎంత ప్రాచీనమైనవైతే వాటి మూలాన్ని నిర్ణయించడం అంత కష్టం.[129] ఆస్ట్రలోపిథెసీన్స్ (40 లక్షల సంవత్సరాల క్రితం) విరిగిన ఎముకలను పనిముట్లుగా ఉపయోగించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ ఇది చర్చనీయాంశం.
అనేక జాతులు పనిముట్లను తయారు చేసాయి, ఉపయోగించాయి. అయితే సంక్లిష్టమైన పనిముట్లును తయారుచేసి, ఉపయోగించినది మాత్రం మానవ జాతే. కెన్యాలోని పశ్చిమ తుర్కానాలో లభించిన 33 లక్షల సంవత్సరాల నాటి పెచ్చులు ఇప్పటి వరకూ లభించిన అత్యంత పురాతన పనిముట్లు.[132] తదుపరి పురాతన రాతి ఉపకరణాలు ఇథియోపియాలోని గోనాలో దొరికాయి. వీటితో ఓల్డోవాన్ సాంకేతిక పరిజ్ఞానం మొదలైందని పరిగణిస్తారు. ఈ పనిముట్లు సుమారు 26 లక్షల సంవత్సరాల నాటివి.[133] కొన్ని ఓల్డోవాన్ సాధనాల దగ్గర ఒక హోమో శిలాజాన్ని కనుగొన్నారు. దాని వయస్సు 23 లక్షల సంవత్సరాలు. హోమో జాతులు ఈ సాధనాలను తయారు చేసి, ఉపయోగించుకున్నాయని ఇది సూచిస్తోంది. ఇది ఒక సంభావనే తప్ప, కచ్చితమైన ఋజువేమీ కాదు. మూడవ మెటాకార్పాల్ స్టైలాయిడ్ ప్రక్రియ చేతి ఎముకను మణికట్టు ఎముకలలోకి లాక్ చేయటానికి వీలు కల్పిస్తుంది. ఇది, మణికట్టుకూ, చేతికీ ఎక్కువ బలాన్ని ప్రయోగించటానికి వీలు కల్పిస్తుంది. దీంతో సంక్లిష్ట పనిముట్లను తయారు చేయడానికీ, ఉపయోగించటానికీ అవసరమైన సామర్థ్యమూ, బలమూ మానవులకు లభించింది. ఈ విశిష్ట శరీర నిర్మాణ లక్షణమే, మానవులకూ మానవేతర ప్రైమేట్లకూ మధ్య ఉన్న తేడా. ఈ లక్షణం 18 లక్షల సంవత్సరాల కంటే పురాతన మానవ శిలాజాలలో కనిపించదు.[134]
"ఓల్డోవాన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్" ప్రాంతంలో పారాంత్రోపస్, తొలి హోమో జాతులు సుమారుగా ఒకే కాలంలో జీవించాయని బెర్నార్డ్ వుడ్ చెప్పాడు. పారాంత్రోపస్ పనిముట్లు తయారు చేసినట్లుగా చెప్పే ప్రత్యక్ష ఆధారాలు లేనప్పటికీ, వాటికి ఈ సామర్థ్యం ఉండేదని చెప్పేందుకు వాటి శరీర నిర్మాణ శాస్త్రం పరోక్ష ఆధారంగా ఉంది. ఓల్డోవాన్ పనిముట్లను చాలావరకు తొలి హోమో జాతులే తయారు చేసాయని చాలా మంది పాలియో ఆంత్రోపాలజిస్టులు అంగీకరిస్తున్నారు. ఓల్డోవాన్ పనిముట్లు మానవ శిలాజాలతో పాటుగా కనిపించినప్పుడు చాలావరకూ అక్కడ హోమో యే కనిపిస్తుందనీ, పారాంత్రోపస్ కనిపించదనీ వారు వాదించారు.
1994 లో, రాండాల్ సుస్మాన్, హోమో, పారాంత్రోపస్ జాతులు రెండూ పనిముట్లు తయారుచేసాయనే వాదనకు ఆధారంగా, అభిముఖ బ్రొటనవేళ్ల నిర్మాణ శాస్త్రాన్ని (చేతి బొటనవేలును అదే చేతికి చెందిన ఇతర వేళ్ళకు ఎదురుగా పెట్టగలగడం) ఉపయోగించాడు. అతను మానవుల, చింపాంజీల బొటనవేళ్ల ఎముకలను, కండరాలనూ పోల్చి చూసాడు. చింపాంజీల్లో లేని 3 కండరాలు మానవులకు ఉండేవని అతడు కనుగొన్నాడు. మానవుల అరచేతులు మందంగాను, వాటి ఎముకలు వెడల్పాటి శీర్షాలతోటీ ఉండేవి. దీంతో వారు చింపాంజీ కంటే ఎక్కువ ఖచ్చితమైన పట్టును కలిగి ఉండేవారు. మానవ అభిముఖ బొటనవేలు ఆధునిక నిర్మాణం పనిముట్లను తయారు చేయడం, నిర్వహించడం వంటి అవసరాలకు పరిణామ పరమైన ప్రతిస్పందనేనని, వాస్తవానికి ఈ రెండు జాతులూ పనిముట్ల తయారీదారు లేననీ సుస్మాన్ పేర్కొన్నాడు.
రాతి పనిముట్లను మొదటగా 26 లక్షల సంవత్సరాల క్రితం, తూర్పు ఆఫ్రికాలో వాడారు. హోమినిన్లు గుండ్రటి రాళ్లను చెక్కి, కత్తుల్లాగా చేసారు.[135] ఇది పాతరాతియుగానికి ఆరంభం; అది సుమారు 10,000 సంవత్సరాల క్రితం చివరి మంచుయుగంతో ముగిసింది. పాతరాతియుగాన్ని దిగువ పాతరాతియుగం (ప్రారంభ రాతి యుగం) గాను (ఇది సుమారు 350,000–300,000 సంవత్సరాల క్రితం ముగిసింది), మధ్య పాతరాతియుగం (మధ్య రాతి యుగం) గాను (సుమారు 50,000–30,000 సంవత్సరాల క్రితం వరకు), ఎగువ పాతరాతియుగం (చివరి రాతి యుగం) గానూ (50,000 –10,000 సంవత్సరాల క్రితం వరకు) విభజించారు.
కెన్యాలోని గ్రేట్ రిఫ్ట్ వ్యాలీలో పనిచేస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే పురాతనమైన రాతి పనిముట్లను కనుగొన్నారు. సుమారు 33 లక్షల సంవత్సరాల క్రితం నాటి ఈ పనిముట్లు ఇథియోపియాలో దొరికిన రాతి పనిముట్ల కంటే 7 లక్షల సంవత్సరాలు పురాతనమైనవి.[132][136][137][138]
7,00,000-3,00,000 సంవత్సరాల క్రితం మధ్య కాలాన్ని అషూలియన్ అని కూడా అంటారు. ఈ కాలంలో హోమో ఎర్గాస్టర్ (లేదా ఎరెక్టస్) చెకుముకి, క్వార్జ్ లలో పెద్ద చేగొడ్డలిని తయారుచేసింది. అషూలియన్ తొలినాళ్ళలో ఈ గొడ్డలి బాగా మొరటుగా ఉండేది. తరువాతి కాలంలో దాన్ని మరింత మెరుగు పరచారు. 3,50,000 సంవత్సరాల క్రితం తరువాత, మరింత మెరుగైన లెవల్లోయిస్ టెక్నిక్ ను అభివృద్ధి చేసారు. ఈ పద్ధతిలో స్క్రాపర్లు, స్లైసర్లు ("రాక్లోయిర్స్"), సూదులు, చదునైన సూదులూ తయారు చేసారు.[135]
చివరిగా, సుమారు 50,000 సంవత్సరాల క్రితం తరువాత, నియాండర్తల్లు, వలస వచ్చిన క్రో-మాన్యాన్లూ కత్తులు, బ్లేడ్లు, స్కిమ్మర్లు వంటి అత్యంత మెరుగైన, విశిష్టమైన చెకుముకి రాతి (ఫ్లింట్) పనిముట్లు తయారు చేసారు. ఎముక పనిముట్లను, 90,000 – 70,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని హెచ్. సేపియన్స్ తయారు చేసారు [139][140] యూరేషియాలో 50,000 సంవత్సరాల క్రితం నాటి తొలి హెచ్. సేపియన్స్ సైట్లలో కూడా ఇవి దొరికాయి.
సుమారు 50,000-40,000 సంవత్సరాల క్రితం వరకు, రాతి పనిముట్ల వాడకం దశలవారీగా పురోగతి సాధించినట్లు కనిపిస్తోంది. ప్రతి దశ (హెచ్. హ్యాబిలిస్, హెచ్. ఎర్గాస్టర్, హెచ్. నియాండర్తాలెన్సిస్ ) మునుపటి దశ కంటే పై స్థాయిలో మొదలైంది, కాని ప్రతి దశలో కూడా, అది మొదలైన తరువాత తదుపరి అభివృద్ధి నెమ్మదిగా జరిగింది. ఆధునిక మానవుల లక్షణాలైన భాష, సంక్లిష్ట సంకేత ఆలోచన, సాంకేతిక సృజనాత్మకత మొదలైనవి కొన్నిగాని, చాలా గానీ ఈ హోమో జాతుల్లో కూడా ఉండేవా అనే అంశం పాలియో ఆంత్రోపాలజిస్టుల చర్చల్లో నలుగుతోంది. ఈ జాతుల ప్రజలు తమ సరళమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆహార సేకరణ పద్ధతులలో పెద్దగా మార్పులేమీ లేకుండా చాలా కాలం పాటు అనుసరించారని అనిపిస్తుంది.
సుమారు 50,000 సంవత్సరాల క్రితం ఆధునిక మానవ సంస్కృతి మరింత వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ప్రవర్తన లోని ఆధునికతను సూచించే స్పష్టమైన సంకేతాలు, పెద్ద జంతువులను వేటాడడం వంటి కారణాల వలన ఈ పరివర్తనను కొంతమంది "పెద్ద ముందడుగు" గాను, "ఎగువ పాతరాతియుగపు విప్లవం" [141] గానూ వర్ణించారు.[142] ప్రవర్తనా ఆధునికతకు ఆధారాలు - చాలా పురాతన కాలానివి - ఆఫ్రికాలో కూడా లభించాయి. నైరూప్య చిత్రాలు, విస్తృత జీవనాధార వ్యూహాలు, మరింత అధునాతన పనిముట్లు, ఆయుధాలు, ఇతర "ఆధునిక" ప్రవర్తనలు ఈ ఆధారాల్లో ఉన్నాయి. ఆధునికత దిశగా పరివర్తన గతంలో అనుకున్నదాని కంటే ముందే జరిగిందని చాలా మంది పండితులు ఇటీవలి కాలంలో వాదించారు.[143][144][145][146] మరికొందరు పండితులు ఈ పరివర్తన మరింత నిదానంగా జరిగిందని భావిస్తూ,3,00,000 – 2,00,000 సంవత్సరాల క్రితమే పురాతన ఆఫ్రికన్ హోమో సేపియన్లలో కొన్ని లక్షణాలు కనిపించాయని పేర్కొన్నారు.[147][148][149][150][151] ఆస్ట్రేలియన్ ఆదిమ జనాభా 75,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా జనాభా నుండి వేరుపడి, 60,000 సంవత్సరాల క్రితమే 160 కి.మీ. వరకు సముద్ర ప్రయాణం చేశారని ఇటీవలి ఆధారాలు సూచిస్తున్నాయి. ఇది ఎగువ పాతరాతియుగ విప్లవం విలువను కొంత తగ్గిస్తుంది.[152]
ఆధునిక మానవులు, చనిపోయినవారిని సమాధి చేయడం మొదలుపెట్టారు. జంతువుల చర్మాలతో చేసిన దుస్తులు ధరించడం, మరింత అధునాతన పద్ధతులతో వేటాడటం (మాటు వేసే గుంటలను ఉపయోగించడం, జంతువులను కొండ కొమ్ముల నుండి దూకేలా చెయ్యడం), గుహ చిత్రలేఖనం వంటివి చేసారు.[153] మానవ సంస్కృతి అభివృద్ధి చెందే క్రమంలో, వివిధ జనాభాలు ఇప్పటికే ఉన్న సాంకేతిక పరిజ్ఞానాలకు మెరుగు లద్దారు: చేపల గేలాలు, గుండీలు, ఎముక సూదులు వంటి హస్తకృతులు వివిధ మానవ జనాభాల్లో వివిధ రకాలుగా ఉండేవి. ఇది, 50,000 సంవత్సరాల క్రితం మానవ సంస్కృతులలో కనిపించలేదు. హెచ్. నియాండర్తలెన్సిస్ జనాభాల సాంకేతిక పరిజ్ఞానాలలో కూడా వైవిధ్యమేమీ ఉండేది కాదు.[154]
ఆధునిక మానవ ప్రవర్తనకు దృష్టాంతాలుగా పనిముట్ల ప్రత్యేకత, ఆభరణాలు, చిత్రాల వాడకం (గుహ చిత్రాల వంటివి), నివాస ప్రాంతాన్ని తీర్చిదిద్దుకోవడం, ఆచారాలు (ఉదాహరణకు, సమాధిలో బహుమతులు పెట్టడం), ప్రత్యేకమైన వేట పద్ధతులు, తక్కువ నివాస యోగ్యంగా ఉండే భౌగోళిక ప్రాంతాలు వెతకడం, వస్తు మార్పిడి మొదలైనవాటిని మానవ శాస్త్రవేత్తలు చూపుతారు. ఆధునిక మానవుల ఉనికికి దారితీసినది ఒక "విప్లవం" ("మానవ పరిణామానికి సంబ్ చెందిన బిగ్ బ్యాంగ్") లాంటి పరిణామమా, లేక పరిణామం మరింత "నిదానంగా" జరిగిందా అనే దానిపై చర్చ కొనసాగుతోంది.[90]
శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవ జనాభాలో పరిణామం కొనసాగుతోంది. సహజ ఎంపిక, జన్యు ప్రవాహం అనే రెండింటి ద్వారా ఇది ప్రభావితమవుతోంది. మశూచి నిరోధకత వంటి కొన్ని లక్షణాల పట్ల ఎంపిక ఒత్తిడి ఆధునిక మానవ జీవితంలో తగ్గినప్పటికీ, మానవులు ఇంకా అనేక ఇతర లక్షణాల విషయంలో సహజ ఎంపికకు లోనవుతూనే ఉన్నారు. వీటిలో, కొన్ని నిర్దుష్ట పర్యావరణ ఒత్తిళ్ళ వల్ల కాగా, వ్యవసాయం (10,000 సంవత్సరాల క్రితం), పట్టణ నాగరికత (5,000), పారిశ్రామికీకరణ (250 సంవత్సరాల క్రితం) వంటి అభివృద్ధి వలన జీవనశైలిలో ఏర్పడిన మార్పులకు సంబంధించినవి మరికొన్ని. 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం, 5,000 సంవత్సరాల క్రితం నాగరికత అభివృద్ధి చెందినప్పటి నుండి మానవ పరిణామం వేగవంతమైంది. దీని ఫలితంగా, వర్తమాన మానవ జనాభాల మధ్య గణనీయమైన జన్యుపరమైన తేడాలు ఏర్పడ్డాయనే వాదన ఉంది.
ఆఫ్రికా ప్రజల్లో ఉండే పొట్టి గిరజాల జుట్టు, కొన్ని జనాభాల్లో ఏర్పడిన తెల్ల చర్మం, రాగి జుట్టు వంటివి కొట్టొచ్చినట్టుగా కనిపించే ఇటీవలి బాహ్యరూప పరిణామాలు. వాతావరణంలోని తేడాలే వీటికి కారణమని చెప్పవచ్చు. ప్రత్యేకించి ఎత్తు ప్రదేశాల్లో నివసించే మానవుల్లో ఏర్పడిన అనుసరణకు బలమైన ఎంపిక వత్తిడి పనిచేసింది.
వ్యవసాయానికి సంబంధించిన ఇటీవలి మానవ పరిణామంలో, పెంపుడు జంతువుల నుండి మానవులకు అంటుకునే వ్యాధులకు నిరోధకత పెంపొందించుకోవడం ఒకటి. అలాగే ఆహారంలో మార్పుల వల్ల జీవక్రియలో మార్పులు కూడా వీటిలో ఉన్నాయి.
సమకాలీన కాలంలో, పారిశ్రామికీకరణ నాటి నుండి, కొన్ని పోకడలు గమనించవచ్చు: ఉదాహరణకు, రుతువిరతి (మెనోపాజ్) ఆలస్యంగా రావడం. మానవ పునరుత్పత్తి కాలం పెరగడం, కొలెస్ట్రాల్ స్థాయి, రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు మొదలైనవి తగ్గడం వంటివి ఉన్నాయి.[155]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.