హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు
రెండు జపాను నగరాలపై అమెరికా అణ్వస్త్రాలు ప్రయోగించగా రెండవ ప్రపంచయుద్ధం ముగిసింది. / From Wikipedia, the free encyclopedia
1945 లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో, అమెరికా, జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై రెండు అణుబాంబు దాడులు చేసింది. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జరిగిన ఈ దాడుల్లో కనీసం 1,29,000 మంది మరణించారు. మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగినది ఈ రెండు సంఘటనల్లో మాత్రమే. ఈ దాడులు చేసే ముందు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ మద్ధతు తీసుకుంది.
హిరోషిమా, నాగసాకిలపై అణుదాడులు | |||||||
---|---|---|---|---|---|---|---|
పసిఫిక్ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో భాగము | |||||||
హిరోషిమా (ఎడమ) నాగసాకిలపై (కుడి) అణుబాంబు సృష్టించిన పుట్టగొడుగు మేఘాలు | |||||||
| |||||||
ప్రత్యర్థులు | |||||||
United States Support from: United Kingdom | Japan | ||||||
సేనాపతులు, నాయకులు | |||||||
William S. Parsons Paul W. Tibbets, Jr. Charles Sweeney Frederick Ashworth | Shunroku Hata | ||||||
పాల్గొన్న దళాలు | |||||||
Manhattan District: 50 U.S., 2 British 509th Composite Group: 1,770 U.S. | Second General Army: Hiroshima: 40,000 (5 Anti-aircraft batteries) Nagasaki: 9,000 (4 Anti-aircraft batteries) | ||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||
20 బ్రిటిషు, డచ్చి, అమెరికా యుద్ధఖైదీలు మరణించారు | హిరోషిమా: *20,000+ సైనికులు మరణించారు *70,000–146,000 పౌరులు మరణించారు నాగసాకి: *39,000–80,000 మంది మరణించారు మొత్తం: 129,000–246,000+ మంది మరణించారు |
యుద్ధం చివరి ఏడాదిలో మిత్రరాజ్యాలు జపానును ఆక్రమించుకునేందుకు సిద్ధపడ్డాయి. దీనికి ముందు అమెరికా సాంప్రదాయిక బాంబుదాడులు చేసి 67 జపాన్ నగరాలను ధ్వంసం చేసింది. 1945 మే 8 న, హిట్లరు ఆత్మహత్య చేసుకున్న కొద్దిరోజులకు, జర్మనీ లొంగుబాటు ఒప్పందంపై సంతకం చెయ్యడంతో ఐరోపాలో యుద్ధం ముగిసింది. ఓటమి తప్పని స్థితిలో ఉన్న జపాను బేషరతు లొంగుబాటుకు ఒప్పుకోకపోవడంతో పసిఫిక్ యుద్ధం కొనసాగింది. జపాను బేషరతుగా లొంగిపోవాలని 1945 జూలై 26 న మిత్ర రాజ్యాలు తమ పోట్స్డామ్ డిక్లరేషనులో ప్రకటించాయి. లేదంటే పెను వినాశనమేనని కూడా డిక్లరేషను హెచ్చరించింది. జపాను దాన్ని పెడచెవిని పెట్టింది.
1945 ఆగస్టు నాటికి మన్హట్టన్ ప్రాజెక్టు రెండు రకాల అణుబాంబులు తయారు చేసింది. మారియానా ద్వీపాల్లోని టినియన్ నుండి ఈ బాంబులను మోసుకెళ్ళేందుకు అమెరికా వైమానిక దళం బోయింగ్ B-29 సూపర్ఫోర్ట్రెస్ను సమకూర్చుకుంది.
నాలుగు జపాను నగరాల మీద అణుబాంబులు వెయ్యాలని జూలై 25 న ఆదేశాలు జారీ అయ్యాయి. ఆగస్టు 6 న అమెరికా హిరోషిమాపై యురేనియం గన్ రకం బాంబును (లిటిల్ బాయ్) వేసింది. లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు జపానుకు చెప్పాడు. లేదంటే "చరిత్రలో ఎన్నడూ చూడని వినాశనం ఆకాశం నుండి వర్షిస్తుందని" హెచ్చరించాడు. మూడు రోజుల తరువాత, ఆగస్టు 9 న ప్లుటోనియమ్ ఇంప్లోజను రకం బాంబును (ఫ్యాట్ మ్యాన్) నాగసాకిపై వేసింది. రెండు నుండి నాలుగు నెలల్లోపున హిరోషిమాలో 90,000 నుండి146,000 మంది వరకు, నాగసాకిలో 39,000 నుండి 80,000 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో దాదాపు సగం మంది మొదటిరోజునే మరణించారు. ఆ తరువాతి నెలల్లో కాలిన గాయాల వలన, రేడియేషన్ సిక్నెస్ వలన, ఇతర గాయాల వలనా, పౌష్టికాహార లోపంతో కూడి అనేక మంది మరణించారు. మరణించినవారిలో ఎక్కువమంది సాధారణ పౌరులే. హిరోషిమాలో మాత్రం ఒక సైనికస్థావరం ఉంది.
నాగసాకిలో బాంబు వేసిన ఆరు రోజుల తరువాత జపాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబరు 2 న లొంగుబాటు పత్రంపై జపాను ప్రభుత్వం సంతకం చేసింది. దాంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. లక్షకు పైగా ప్రాణాలను బలితీసుకున్న ఈ అణుదాడుల నైతికత నేటికీ చర్చాంశమే.