![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8b/British_India.png/640px-British_India.png&w=640&q=50)
శాసనోల్లంఘన ఉద్యమం
భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా నాలుగేళ్ళ పాటు సాగిన శాంతియుత చట్ట ధిక్కార ఉద్యమం / From Wikipedia, the free encyclopedia
భారత స్వాతంత్ర్యోద్యమంలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రధాన ఘట్టం. ఈ ఉద్యమం కాంగ్రెసు పార్టీ నాయకత్వంలో 1930 మార్చిలో మొదలై, 1934 వరకూ సాగింది. ఉద్యమానికి నేతృత్వం వహించే బాధ్యతను కాంగ్రెసు పార్టీ మహాత్మా గాంధీకి అప్పగించింది. భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి కల్పించే విషయంలో బ్రిటిషు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబించి, నిర్ణయం తీసుకోవడంలో కాలయాపన విధానాలను అవలంబించింది. దాంతో కాంగ్రెసు నాయకులు ఆశాభంగం చెంది ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఆ కార్యాచరణలో భాగమే శాసనోల్లంఘన.
ప్రజా క్షేమం దృష్ట్యా బ్రిటిషు ప్రభుత్వం తీసుకోవాల్సిన 11 కనీస చర్యలను ప్రకటించి, ఆ చర్యలు తీసుకోకపోతే, శాసనోల్లంఘన చెయ్యక తప్పదని గాంధీ, 1930 జనవరి 31 న యంగ్ ఇండియా పత్రికలో ప్రకటించాడు. ఉద్యమంలో భాగంగా చేపట్టవలసిన పలు కార్యక్రమాలను గాంధీ నిర్దేశించాడు. ఆ కార్యక్రమాల నన్నిటినీ అహింసా పద్ధతిలో జరగాలని కూడా అతడు నిర్దేశించాడు. ఉద్యమ కార్యక్రమంలో ప్రధానమైన అంశం ఉప్పు సత్యాగ్రహం. ఇతర కార్యక్రమాల్లో విదేశీ వస్త్ర దుకాణాల వద్ద పికెటింగు, మద్యం దుకాణాల వద్ద పికెటింగు, సారా దుకాణాల వేలం పాటలు జరిగే చోట పికెటింగు, బ్రిటిషు వస్తు బహిష్కరణ, పన్నుల ఎగవేత, అటవీ పరిరక్షణ చట్టాల అతిక్రమణ, కల్లు తీసే తాడి, ఈత చెట్లను నరకడం వంటివి ఉన్నాయి. అంతకు మునుపెన్నడూ లేని విధంగా మహిళలు పెద్దయెత్తున పాల్గొనడం ఈ ఉద్యమ ప్రత్యేకత.
ఈ ఉద్యమం రెండు దశల్లో నాలుగు సంవత్సరాల పాటు జరిగింది. మధ్యలో దాదాపు ఒక సంవత్సరం పాటు ఉద్యమాన్ని ఆపారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటిషు ప్రభుత్వం పెద్ద యెత్తున దమనకాండకు పాల్పడింది. ప్రత్యేకంగా ఆర్డినెన్సులను జారీ చేసింది. కాంగ్రెసును దాని శాఖలనూ చట్టవిరుద్ధమైనవని ప్రకటించి, వాటి ఆస్తులను జప్తు చేసింది. 75,000 మందికి పైగా నాయకులను, ఉద్యమకారులనూ అరెస్టు చేసింది. పోలీసు కాల్పుల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. జైళ్ళలో అమానవీయ పరిస్థితులు కల్పించింది. పోలీసులు మహిళలపై అత్యాచారాలు, హింస చేసారు.
ఉద్యమ సమయంలో అనేక సమావేశాలు సంప్రదింపులూ జరిగాయి. మూడు రౌండు టేబులు సమావేశాలు, నాలుగు కాంగ్రెసు సమావేశాలు, అనేక అఖిల పక్ష సమావేశాలే కాక మహాత్మా గాంధీకి వైస్రాయి ఇర్విన్కూ మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగి ఒక ఒడంబడిక కుదిరింది. అయితే రెండవ రౌడు టేబులు సమావేశం విఫలమవడంతో ఉద్యమం మళ్ళీ మొదలైంది. మధ్యలో దాదాపు ఒక సంవత్సరం పాటు విరామం వచ్చింది. ఈ విధంగా ఉద్యమం రెండు దశల్లో జరిగింది.
పెద్ద యెత్తున జరిగిన శాసనోల్లంఘన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహంతో ఉవ్వెత్తున మొదలై, పేలవంగా, పెద్దగా సాధించినదేమీ లేకుండా ముగిసింది. ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తూ గాంధీ,"ఈసారి శాసనోల్లంఘన అంటూ మొదలైతే, ఇక దాన్ని ఆపలేం. ఒక్క కార్యకర్తైనా బతికి ఉన్నంతవరకు, ఒక్క కార్యకర్తైనా స్వేచ్ఛగా ఉన్నంతవరకూ ఆపకూడదు కూడా" అని అన్నాడు. కానీ 1933 మే 8 న గాంధీయే స్వయంగా ఉద్యమాన్ని సస్పెండు చేయమని కాంగ్రెసు పార్టీ తాత్కాలిక అధ్యక్షుణ్ణి కోరాడు. 1933 మే 9 న ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపేసారు. 1933 జూలైలో సామూహిక ఉద్యమం కాస్తా వ్యక్తిగత శాసనోల్లంఘనగా మారి, రూపు కోల్పోయింది. ఆ తరువాత 1934 ఏప్రిల్ 7 న ఉద్యమం అధికారికంగా ముగిసింది.