![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/India_disputed_areas_map.svg/langte-640px-India_disputed_areas_map.svg.png&w=640&q=50)
భారత చైనా సరిహద్దు వివాదం
భారత చైనాల మధ్య ఉన్నసరిహద్దుపై నెలకొన్న వివాదం / From Wikipedia, the free encyclopedia
భారతదేశం, చైనా ల మధ్య రెండు పెద్ద భూభాగాల సార్వభౌమత్వం పైన, అనేక చిన్న చిన్న భూభాగాల పైనా కొనసాగుతున్న ప్రాదేశిక వివాదమే భారత చైనా సరిహద్దు వివాదం. వివాదాస్పదమైన ఆ రెండు పెద్ద భూభాగాల్లో మొదటిది, అక్సాయ్ చిన్. ఇది లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగమని భారతదేశం పేర్కొంటుంది. తన జిన్జియాంగ్ ఉయ్గుర్ అటానమస్ రీజియన్, టిబెట్ అటానమస్ రీజియన్ లలో భాగమని చైనా వాదిస్తుంది. అక్సాయ్ చిన్ కాశ్మీరు, టిబెట్ ప్రాంతంలోని, జనావాసాలు అసలే లేని ఎత్తైన బంజరు భూమి. జిన్జియాంగ్-టిబెట్ హైవే ఈ ప్రాంతం గుండా పోతుంది. రెండవ వివాదాస్పద భూభాగం మెక్మహాన్ రేఖకు దక్షిణంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్. దీనిని గతంలో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని పిలిచేవారు. 1914 లో బ్రిటిషు ఇండియా, టిబెట్ ల మధ్య కుదిరిన 1914 సిమ్లా ఒడంబడికలో మెక్మహాన్ రేఖ ఒక భాగం. ఈ ఒప్పందంలో చైనా భాగం కాదు [1] 2020 నాటి స్థితి ప్రకారం, మెక్ మహాన్ రేఖయే చట్టబద్దమైన తూర్పు సరిహద్దు అని భారతదేశం చెబుతోంది. సిమ్లా ఒప్పందంపై సంతకం చేసినప్పుడు టిబెట్ అసలు స్వతంత్రంగానే లేదని పేర్కొంటూ చైనా ఆ సరిహద్దును ఏనాడూ అంగీకరించలేదు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/India_disputed_areas_map.svg/640px-India_disputed_areas_map.svg.png)
1962 లో పై రెండు వివాదాస్పద ప్రాంతాలలో భారత చైనాల మధ్య యుద్ధం జరిగింది. చైనా దళాలు పశ్చిమాన లడఖ్లోని భారత సరిహద్దు పోస్టులపై దాడి చేసాయి. తూర్పున మెక్మహాన్ రేఖను దాటాయి. 1967 లో సిక్కిం ప్రాంతంలో స్వల్ప స్థాయిలో సరిహద్దు ఘర్షణలు జరిగాయి. 1987 లోను, 2013 లోనూ వాస్తవాధీన రేఖకు చెందిన రెండు విభిన్నమైన భావనల కారణంగా రేగబోయిన ఘర్షణలను విజయవంతంగా నివారించగలిగారు. భూటాన్, చైనాల సరిహద్దులో భూటాన్ నియంత్రణలో ఉన్న భూభాగంపై నెలకొన్న ఘర్షణ 2017 లో ఇరుదళాలకూ గాయాలైన తరువాత సమసింప జేసారు.[2] 2020 లో అనేక ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల కారణంగా 2020 జూన్లో డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయి.[3]
వివాదాన్ని పరిష్కరించడంలో భాగంగా 1996 లో కుదిరిన ఒప్పందంలో "విశ్వాసం పెంపొందించే చర్యల"ను, వాస్తవాధీన రేఖనూ పొందుపరచారు. 2006 లో ఓ పక్క ఇరువైపులా సైనిక సమీకరణ జరుగుతూండగా[4], భారతదేశంలోని చైనా రాయబారి, అరుణాచల్ ప్రదేశ్ అంతా చైనా భూభాగమేనని చెప్పుకున్నాడు [5] ఆ సమయంలో, ఇరు దేశాలూ సిక్కిం రాష్ట్రపు ఉత్తర కొన వద్ద ఒక కిలోమీటరు చొప్పున చొరబాటు జరిపినట్లు పరస్పరం ఆరోపించుకున్నాయి.[6] సరిహద్దులో అదనపు సైనిక దళాలను మోహరిస్తామని 2009 లో భారత్ ప్రకటించింది. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి చైనా "వన్ ఇండియా" విధానాన్ని అంగీకరించాలని 2014 లో భారత్ ప్రతిపాదించింది.[7][8]