సర్దార్ వల్లభ్భాయ్ పటేల్
స్వాతంత్ర్య సమర యోధుడు, స్వరాజ్య ఏకీకరణ చేసినవారు / From Wikipedia, the free encyclopedia
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ భాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్లోని నాడియార్లో జన్మించారు.[1] ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్గా వ్యవహరించాడు. స్వాతంత్ర్యానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, భారత ఉప ప్రధాన మంత్రి గానూ బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేదించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చింది.
సర్దార్ వల్లభాయి పటేల్ | |
భారతదేశపు మొదటి భారత ఉప ప్రధాన మంత్రి | |
పదవిలో 1947 ఆగస్టు 15 – 1950 మే 27 | |
రాష్ట్రపతి | రాజేంద్ర ప్రసాద్ , సర్వేపల్లి రాధాకృష్ణన్ |
---|---|
మునుపు | (ఎవరూ లేరు) |
తరువాత | మురార్జీ దేశాయ్ |
పదవిలో 1947 ఆగస్టు 15 – 1950 డిసెంబరు 15 | |
మునుపు | (ఎవరూ లేరు) |
తరువాత | చక్రవర్తి రాజగోపాలాచారి |
జననం | (1875-10-31)1875 అక్టోబరు 31 నాడియర్, గుజరాత్, ఇండియా |
మరణం | 1950 డిసెంబరు 15(1950-12-15) (వయసు 75) ముంబయి, భారతదేశం |
సంబంధీకులు | చంద్రలేఖ (మేనకోడలు) |
సంతానం | మణిబెన్ పటేల్, దాహ్యాబాయి పటేల్ |
Profession | న్యాయవాది |
మతం | హిందూ |