భారత చైనాల మధ్య 2020 లో మొదలై 2021 లో కూడా కొనసాగిన సరిహద్దు ఘర్షణలు From Wikipedia, the free encyclopedia
2020 భారత చైనా కొట్లాటలు, భారత చైనాల మధ్య కొనసాగుతున్న సైనిక ప్రతిష్ఠంభనలో భాగం. 2020 మే 5 నుండి, భారత, చైనా దళాలు వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ప్రదేశాలలో దొమ్మీలకు, ముష్టి యుద్ధాలకూ, కొట్లాటలకూ పాల్పడ్డాయి. లడఖ్లోని వివాదాస్పదమైన పాంగోంగ్ సరస్సుకు సమీపంలోను, సిక్కింకు, టిబెట్ అటానమస్ రీజియన్ కూ మధ్య గల సరిహద్దు వద్దా ఈ కొట్లాటలు జరిగాయి. తూర్పు లడఖ్లో కూడా వాస్తవాధీన రేఖ (ఎల్ఎసి) వెంట ఘర్షణలు జరిగాయి.
2020 భారత చైనా కొట్లాటలు | |||||
---|---|---|---|---|---|
భారత చైనా సరిహద్దు వివాదంలో భాగము | |||||
సిఐఏ వారి కాశ్మీరు మ్యాపు - కొట్లాటలు జరిగిన ప్రదేశాలను ఎర్ర వృత్తాల్లో చూపించారు. గల్వాన్ లోయ (పైన), హాట్ స్ప్రింగ్స్ చెక్ పాయింటు (మధ్య), పాంగోంగ్ త్సో (కింద). | |||||
| |||||
ప్రత్యర్థులు | |||||
India | China | ||||
సేనాపతులు, నాయకులు | |||||
రామ్నాథ్ కోవింద్ (భారత రాష్ట్రపతి) నరేంద్ర మోడీ (C.O. 16 బీహార్ రెజిమెంటు) | Xi Jinping (CCP General Secretary, PRC President and CMC Chairman)[lower-alpha 1] Li Keqiang (Premier of China) Gen. Wei Fenghe (Commander, PLA Ground Force South Xinjiang Military District)[11][3] | ||||
పాల్గొన్న దళాలు | |||||
Indian Armed Forces
Indo-Tibetan Border Police | People's Liberation Army
| ||||
బలం | |||||
60,000 (US, 11 October 2020)[12] | |||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||
మే10 న: గాయాలు 4[13] | భారతీయ వర్గాలు: మే 10 న: ఇతర వర్గాలు: |
మే చివరలో, గల్వాన్ నది లోయలో భారతదేశం చేస్తున్న రహదారి నిర్మాణం పట్ల చైనా దళాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.[26][27] భారత వర్గాల సమాచారం ప్రకారం, జూన్ 15/16 న జరిగిన కొట్లాట ఫలితంగా 20 మంది భారతీయ సైనికులు (ఒక అధికారితో సహా) మరణించారు.[28] 43 మంది చైనా సైనికులు మరణించడం గాని గాయపడ్డం గానీ జరిగింది (ఒక అధికారితో కలిపి). [lower-alpha 2][30][31] ఇరువైపులా సైనికులను బందీలుగా పట్టుకొని, తరువాతి కొద్ది రోజుల్లో విడుదల చేసినట్లు మీడియా వార్తల్లో వచ్చాయి. భారత్ వైపు పది మంది సైనికులను బందీలుగా తీసుకున్నట్లు తెలిసింది, అయితే చైనా సంఖ్యలు ధ్రువీకరణ కాలేదు.[15] తరువాత, భారత సైనికులను నిర్బంధించినట్లు వచ్చిన వార్తలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం రెండూ ఖండించాయి.[32]
జూలై 25 న, గల్వాన్, గోగ్రా హాట్ స్ప్రింగ్స్ వద్ద కొట్లాటలు ఆగిపోయాయని వార్తలు వచ్చాయి.[33] జూలై 30 నాటికి, పాంగోంగ్ త్సో (త్సో అంటే టిబెట్ భాషలో సరస్సు అని అర్థం) వద్ద, గోగ్రాలోని పిపి 17 ఎ వద్దా కొట్లాటలు పూర్తిగా ఆగలేదు. భారత, చైనాల మధ్య "పూర్తి విరమణ" ఇంకా మిగిలే ఉంది.[34][35] విరమణ ప్రక్రియ పూర్తి కాకపోతే శీతాకాలంలో కూడా దళాల విస్తరణను కొనసాగిస్తామని భారత సైన్యం చెప్పింది.[36] ఆగస్టు చివరలోను, సెప్టెంబరు ఆరంభంలోనూ, చుషుల్ సెక్టార్లో భారత దళాలు ఎల్ఎసి వెంట అనేక శిఖరాలను ఆక్రమించాయి. అక్కడి నుండి స్పంగ్గూర్ గ్యాప్, స్పంగ్గూర్ త్సో వద్ద ఉన్న చైనా స్థావరాలు కనిపిస్తాయి.[37][38] సెప్టెంబరు 7 న, 45 సంవత్సరాలలో మొదటిసారి, ఎల్ఎసి వెంట కాల్పులు జరిగాయి. కాల్పులకు కారకులు మీరంటే మీరేనంటూ ఇరువర్గాలు ఒకరినొకరు నిందించుకున్నాయి.[39][40] ఆగస్టు 30 న చైనా సైన్యంపై భారత దళాలు హెచ్చరిక కాల్పులు జరిపినట్లు భారత మీడియా తెలిపింది.[41]
ఓవైపు ప్రతిష్టంభన కొనసాగుతూ ఉండగానే, భారతదేశం సుమారు 12,000 మంది కార్మికులను అదనంగా లడఖ్కు పంపి ఇక్కడి పనులను వేగవంతం చేసింది. వారు భారత చైనా సరిహద్దులో భారత మౌలిక సదుపాయాల అభివృద్ధిని త్వరగా పూర్తి చేయడంలో భారత సరిహద్దు రహదారుల సంస్థకు సహాయపడతారు.[42][43][44] లడఖ్లో భారత్ నిర్మిస్తున్న డార్బుక్-ష్యోక్-డిబివో రోడ్డు నిర్మాణాన్ని ముందే అడ్డుకునే చైనా ప్రణాళికలో భాగమే ఈ ప్రతిష్ఠంభనలని నిపుణులు సిద్ధాంతీకరించారు.[45] ఈ వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలలో చైనీయులు కూడా తమవైపు మౌలిక సదుపాయాలను విస్తృతంగా అభివృద్ధి చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు కూడా.[46][47] 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడం కూడా చైనీయులను ఇబ్బంది పెట్టింది.[48] అయితే, నిశ్శబ్ద దౌత్యం ద్వారా పరిస్థితిని పరిష్కరించడానికి సరిపడినన్ని ద్వైపాక్షిక యంత్రాంగాలు తమకు ఉన్నాయని భారతదేశం, చైనా రెండూ అభిప్రాయపడ్డాయి.[49][50] సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో భారత చైనాల మధ్య అనేక దౌత్య, సైనిక స్థాయి చర్చలు జరిగాయి. కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్ ర్యాంకుల్లో చర్చలు, ప్రత్యేక ప్రతినిధుల సమావేశాలు, [lower-alpha 3][52][53] 'భారత చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం ఏర్పాటైన కార్యకారక మెకానిజం' (WMCC), [lower-alpha 4][55] విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రుల మధ్య సమావేశాలూ సమాచార మార్పిడీ మొదలైనవన్నీ ఇందులో భాగాలే.[56] సెప్టెంబరు 21 న, ఆరవ కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం జరిగింది. దాని తరువాత మరొక ఉమ్మడి ప్రకటన విడుదలైంది.[57]
జూన్ 15 న గల్వాన్ లోయ కొట్లాటల తరువాత, చైనా ఉత్పత్తులను బహిష్కరించడం గురించి భారతదేశంలో కొన్ని ప్రచారాలు జరిగినప్పటికీ సరిహద్దు ఉద్రిక్తతలు భారత చైనా వాణిజ్యాన్ని ప్రభావితం చేయవని పలువురు భారత ప్రభుత్వ అధికారులు తెలిపారు[58][59] అయితే, తరువాతి రోజులలో, చైనా సంస్థలతో చేసుకున్న కొన్ని ఒప్పందాలను రద్దు చేయడం, కొన్నిటిపై అదనపు పరిశీలనలను విధించడంతో సహా ఆర్థిక రంగంలో వివిధ రకాల చర్యలు తీసుకున్నారు. టెలికాం వంటి వ్యూహాత్మక మార్కెట్లలో చైనీయుల ప్రవేశాన్ని ఆపడానికి కూడా పిలుపునిచ్చారు.[60][61][62] సరిహద్దు ఉద్రిక్తతల వలన భారత చైనాల మధ్య వాణిజ్యమేమీ "మందగించలేదని" సెప్టెంబరులో తెలిసింది.[63]
భారత చైనాల మధ్య సరిహద్దు అనేక ప్రదేశాలలో వివాదాస్పదంగా ఉంది. "నియంత్రణ రేఖపై భారతీయ వాదనను వివరించే మ్యాపులు బహిరంగంగా అందుబాటులో లేవు". భారతదేశపు అధికారిక సరిహద్దుకు సర్వే ఆఫ్ ఇండియా పటాలు మాత్రమే సాక్ష్యం.[64] ఎల్ఎసి పై చైనీయుల వాదన ఎక్కువగా లడఖ్ ప్రాంతంలో క్లెయిములు చేస్తూ ఉంటుంది. ఈశాన్య భారతదేశం లోని అరుణాచల్ ప్రదేశ్ను కూడా తనదిగా చైనా పేర్కొంటూ ఉంటుంది.
1980 ల నుండి, ఈ సరిహద్దు సమస్యలకు సంబంధించి ఇరు దేశాల మధ్య 20 సార్లు చర్చలు జరిగాయి.[65] అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ చేసిన అధ్యయనంలో 2010 - 2014 మధ్య జరిగిన మొత్తం సరిహద్దు సంఘటనలన్నింటి లోనూ 1 నుండి 2 శాతం సంఘటనలు మాత్రమే మీడియాలో వచ్చాయి.[66] 2019 లో చైనా సైన్యం 660 ఎల్ఎసి ఉల్లంఘనలు, 108 వైమానిక ఉల్లంఘనలూ జరిపినట్లు భారతదేశం చెప్పింది. ఇవి, 2018 లో జరిగిన సంఘటనల సంఖ్య కంటే గణనీయంగా ఎక్కువ.[67] వివాదాలు, కొట్లాటలు, ప్రతిష్టంభనలు ఉన్నప్పటికీ, సరిహద్దులో ఇరుదేశాల మధ్య 50 సంవత్సరాలుగా తుపాకీ కాల్పులు జరిగిన దాఖలాలు లేవు.[68]
షీ జిన్పింగ్ 2014 సెప్టెంబరులో భారత్లో పర్యటించినపుడు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సరిహద్దు సమస్యను లేవనెత్తాడు. ఒక పరిష్కారం చూద్దామని షీను కోరాడు. అయినా, 2017 లో భారత చైనాల మధ్య డోక్లాం ప్రతిష్టంభన ఏర్పడింది. అది 73 రోజుల పాటు సాగింది.[69][70] అప్పటి నుండి టిబెట్ పీఠభూమిలో చైనా తన సైనిక ఉనికిని పెంచుకుంది;[71] లడఖ్ లోని పాంగోంగ్ త్సో సరస్సు నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్గారి గున్సా విమానాశ్రయంలో చైనా యుద్ధ విమానాలను కూడా మోహరించింది.[46] భారత పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్లలో చైనా తన అడుగుజాడలను విస్తరిస్తోంది; దాంతో భారతదేశానికి గుత్తాధిపత్యం ఉన్న ఈ ప్రాంతంలో చైనా, ఇప్పుడు న్యూ ఢిల్లీ ప్రభావానికి సూటిగా సవాలు విసురుతోంది.[72]
ఈ కొట్లాటలకు ట్రిగ్గర్గా అనేక కారణాలను ఉదహరిస్తారు. అమెరికా సెనేట్ మెజారిటీ లీడర్ మిచ్ మెక్కానెల్, ప్రపంచ శాంతి కోసం ఏర్పరచిన కార్నెగీ ఎండోమెంట్ లో సీనియర్ ఫెలో అయిన ఆష్లే టెల్లిస్ ల ప్రకారం, భూభాగాలను ఆక్రమించుకునే చైనా కూటనీతి దీనికి ఒక కారణం. దీనిని 'సలామీ స్లైసింగ్ ' అని పిలుస్తారు. ఈ పద్ధతిలో, సుదీర్ఘ కాలవ్యవధిలో శత్రు భూభాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఆక్రమిస్తూ పోతారు.[73][74] 2020 జూన్ మధ్యలో న్యోమా ప్రాంతానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఉర్గెయిన్ చోడాన్, దశాబ్దాలుగా లడఖ్లోని సరిహద్దు ప్రాంతాలనూ, అక్కడ చైనా చేస్తూ ఉన్న ఆక్రమణలనూ భారత ప్రభుత్వాలు (ప్రస్తుత మోడీ ప్రభుత్వంతో సహా) పట్టించుకోలేదని చెప్పింది. ఆమె అభిప్రాయంలో భారతదేశం తన సరిహద్దుల రక్షణలో విఫలమైంది. 2020 లో కూడా ఎల్ఎసి వెంబడి భారతదేశం భూమిని కోల్పోయింది.[75][76] ఇతర స్థానిక లడఖి నాయకులు కూడా ఈ ప్రాంతంలో చైనా చొరబాట్లు చేసినట్లు అంగీకరించారు.[77] 2020 జూన్ మధ్యలో, అరుణాచల్ ప్రదేశ్ నుండి ఎన్నికైన భాజపా పార్లమెంటు సభ్యుడు తాపిర్ గావో, ఈశాన్య భారతదేశంలో కూడా చైనా దళాలు గస్తీ తిరగడం మామూలేనని అంగీకరించాడు.[78]
MIT ప్రొఫెసర్, టేలర్ ఫ్రేవెల్ మాట్లాడుతూ, లడఖ్లో, ముఖ్యంగా డార్బుక్-ష్యోక్-డిబివో రహదారి వెంబడి, భారతదేశం చేస్తున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల చైనా నుండి వచ్చిన స్పందనే ఈ కొట్లాటలు అని అన్నాడు. కోవిడ్ -19 మహమ్మారి చైనా ఆర్థిక వ్యవస్థను, అంతర్జాతీయంగా దాని ప్రతిష్ఠనూ దెబ్బతీసిన సమయంలో చైనా చేసిన బలప్రదర్శన ఇది అని ఆయన అన్నాడు.[79] స్టిమ్సన్ సెంటర్లో చైనా స్పెషలిస్టయిన యున్ సన్ ప్రకారం, భారతదేశ రహదారి నిర్మాణం చైనా దృష్టిలో "చైనాకు పొడిచిన వెన్నుపోటు". చైనా దీన్ని తన "ప్రాదేశిక సమగ్రతకు" ముప్పుగా చూస్తుంది. భారతదేశంతో సత్సంబంధాల కోసం తన ప్రాదేశిక సమగ్రతను చైనా పణంగా పెట్టదు.[80]
దేశం లోని అంతర్గత సమస్యల కారణంగాను, కోవిడ్-19 సమస్యపై తనపై అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి కారణం గానూ చైనా, ఈ సరిహద్దు సమస్యలను లేవనెత్తుతోందని టిబెట్ ప్రవాస ప్రభుత్వ అధ్యక్షుడు లోబ్సాంగ్ సంగే చెప్పాడు..[81][82] మాజీ భారత జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడు జయదేవ రానడే, ఈ ప్రాంతంలో చైనా చూపిస్తున్న ప్రస్తుత దూకుడు, లడఖ్ లోను చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వంటి పరిసర ప్రాంతాలలోనూ తన ఆస్తులనూ భవిష్యత్తు ప్రణాళికలనూ కాపాడుకునేందుకేనని చెప్పాడు.[83]
ఆర్టికల్ 370 ను రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్ స్థితిని మార్చాలన్న 2019 నాటి భారత నిర్ణయంతో ప్రస్తుత సరిహద్దు ఉద్రిక్తతలు ముడిపడి ఉన్నాయని చైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కు చెందిన వాంగ్ షిడా చెప్పాడు.[48] ప్రవీణ్ సాహ్నీ వాంగ్తో ఏకీభవించినప్పటికీ, అమిత్ షా చేసిన పార్లమెంటరీ ప్రసంగం కూడా చైనీయులను చికాకు పెట్టి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. చైనా అధీనంలో ఉన్న వివాదాస్పద ప్రాంతమైన అక్సాయ్ చిన్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగమని షా తన ప్రసంగంలో ప్రకటించాడు.[84] పైగా, 2019 నాటి జమ్మూ కాశ్మీర్ విభజన తరువాత అనేకమంది సీనియర్ భారతీయ జనతా పార్టీ మంత్రులు ఇక గిల్గిట్ - బాల్టిస్తాన్ను తిరిగి సాధించడమే మిగిలి ఉందని వ్యాఖ్యానించారు. 2020 మేలో కూడా ఈ వాదనలు వినిపించాయి.[85] జమ్మూ కాశ్మీర్కు సంబంధించి న్యూ ఢిల్లీ ఎత్తుగడలు బీజింగ్ను కలవరపెడుతున్నాయని భారత దౌత్యవేత్త గౌతమ్ బంబవాలే కూడా అంగీకరించాడు.
భారతదేశానికీ అమెరికాకూ మధ్య పెరుగుతున్న మైత్రికీ ఈ కొట్లాటలకూ లింకుందని ఇతర విశ్లేషకులు చెప్పారు. షాంఘై ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ లోని దక్షిణాసియా నిపుణుడు లియు జోంగీ ఫైనాన్షియల్ టైమ్స్తో మాట్లాడుతూ "చైనాను లక్ష్యంగా చేసుకున్న అనేక అమెరికా ప్రణాళికలలో భారతదేశం చురుకుగా ఉంది". ఫేట్ఫుల్ ట్రయాంగిల్ (అమెరికా, భారత్, చైనా ల అంతర్జాతీయ సంబంధాల గురించిన పుస్తకం) లో రచయిత తన్వి మదన్, అమెరికాతో సంబంధాలను "పరిమితం" చేసుకొమ్మని "బీజింగ్ తనకు ఇస్తున్న సంకేతమే ఇది" అని భారతదేశం భావించిందని పేర్కొంది.[86] భారత మాజీ మాజీ దౌత్యవేత్త ఫుంచోక్ స్టోబ్డాన్, "అమెరికాతో పొత్తు పెట్టుకున్న భారతదేశం, ఆస్ట్రేలియా వంటి చిన్న శక్తులు, తమ పట్ల చైనా మరింత దూకుడుగా వ్యవహరించడాన్ని గమనిస్తున్నాయి" అని పేర్కొన్నాడు.[87]
భారత చైనా సరిహద్దు, దక్షిణ చైనా సముద్రం రెండింటిలోనూ పెరుగుతున్న చైనా నిశ్చయాత్మకతలో ఈ పోరాటాలు భాగమని చైనాకు భారత మాజీ రాయబారి అశోక్ కాంత అన్నాడు.[79] రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్, ఇవి చైనా నుండి భారత్కు అందుతున్న కోవిడ్ అనంతర వ్యూహాత్మక సందేశాలు అని అన్నాడు. చైనాకు అంతగా బలం లేని హిందూ మహాసముద్ర ప్రాంతం నుండి భారత ప్రాథమ్యాలను హిమాలయాల వైపు మళ్ళించేలా ఈ కొట్లాటలు ఉన్నాయి అని అయన అన్నాడు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ డైరెక్టర్ రాజ మోహన్, భారత చైనాల శక్తిలో పెరుగుతున్న అసమతుల్యత ఈ వివాదానికి ప్రధాన కారణమనీ, వివాద ప్రదేశం, భారత అంతర్జాతీయ సంబంధాలు వంటివన్నీ కేవలం వివరాలేననీ అన్నాడు.[88] మరి కొందరు, టిబెట్ ఐదు వేళ్ళు అనే చైనా వ్యూహంతో ఈ కొట్లాటలను ముడిపెట్టారు.[89][90][91][92]
కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ వెలువరించిన 2020 జూన్ నివేదిక ప్రకారం, భారత చైనా సరిహద్దు వెంబడి పలు ప్రదేశాలలో భూమిని ఆక్రమించడానికి చైనా ఏకకాలంలో ప్రయత్నాలు చేసింది. లడఖ్లోని పాంగోంగ్ త్సో, హాట్ స్ప్రింగ్స్, గల్వాన్ లోయ, కుంగ్రాంగ్ నాలా, డెప్సాంగ్, గురుంగ్ హిల్, రెచిన్ లా వద్దనూ, సిక్కిం లోనూ ప్రతిష్ఠంభనలు, కొట్లాటలు, అతిక్రమణలూ జరిగాయి.[93] 2020 జూన్ 29 న లడఖ్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఓ వైపు చర్చలు జరుగుతూండగానే, సాక్టెంగ్ వన్యప్రాణుల అభయారణ్యం, భూటాన్ ట్రాషిగాంగ్ జిల్లాలోని వివాదాస్పద భూభాగంలో ఉందని పేర్కొంటూ చైనా, సరిహద్దు వివాదంలో ఒక కొత్త ఫ్రంట్ను తెరిచింది. [lower-alpha 5][94][95] జూలై మాసాంతం నుంచి ఆగస్టు తొలినాళ్ళ మధ్య కాలంలో లడఖేతర ప్రాంతాల్లో కూడా పిఎల్ఎ స్థానాలను బలోపేతం చేసుకుంటున్నట్లు, బలగాలను సమీకరిస్తున్నట్లూ నివేదికలు వెలువడ్డాయి. ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ కనుమ, ఉత్తర సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని భాగాలు వీటిలో ఉన్నాయి.[96]
మే 5 న, భారత టిబెట్ల మధ్య ఉన్న పాంగోంగ్ సరస్సు తీరం వద్ద భారతీయ [lower-alpha 6] చైనా సైనికుల మధ్య ఘర్షణతో తొలి ప్రతిష్ఠంభన మొదలైంది. వాస్తవాధీన రేఖ (ఎల్ఎసి) ఈ సరస్సు గుండా వెళ్తుంది.[98][99] రెండు దేశాల సైనికులు వాస్తవాధీన రేఖ వెంట పిడికిళ్ళతో, రాళ్ళతో కొట్టుకోవడం ఒక వీడియోలో కనిపించింది.[100] మే 10/11 న మరో ఘర్షణ జరిగింది.[101] రెండువైపులా అనేక మంది సైనికులకు గాయాలయ్యాయి. పాంగోంగ్ త్సోలో జరిగిన ఘర్షణలో సుమారు 72 మంది భారతీయ సైనికులు గాయపడ్డారని, కొందరిని లేహ్, చండి మందిర్, ఢిల్లీలోని ఆసుపత్రులకు తరలించాల్సి వచ్చిందనీ భారత మీడియా తెలిపింది.[102] ది డైలీ టెలిగ్రాఫ్, తదితర వనరుల ప్రకారం చైనా, 2020 మే - జూన్ మధ్య కాలంలో 60 చ.కి.మీ. భారత్ గస్తీ తిరిగే భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది.[103][104][105] ఆగస్టు చివరి నాటికి, భారత కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, ఈ ప్రాంతంలో చైనా 65 చ.కి.మీ.ల భూమిని ఆక్రమించినట్లు తెలిసింది.[106] మేలో, చైనా సైనికులు కర్రలకు ముళ్ల తీగలు చుట్టి చేసిన ఆయుధాలతో భారత సైనికుల పై దాడికి వచ్చిన్నట్లు వార్తలు వచ్చాయి.[107]
జూన్ 27 నాటికి చైనీయులు, పాంగోంగ్ త్సో ఉత్తర, దక్షిణ ఒడ్డుల వద్ద సైనిక ఉనికిని పెంచుకున్నారని, ఫింగర్ 4 సమీపంలో వారి స్థానాలను బలోపేతం చేసుకున్నారనీ (ఏప్రిల్ నాటి స్థితితో పోలిస్తే), హెలిప్యాడ్, బంకర్లు, పిల్బాక్స్ల నిర్మాణం కూడా ప్రారంభించారనీ వార్తలు వచ్చాయి.[108] జూన్ 12 - 26 మధ్య ప్లానెట్ ల్యాబ్స్ అందించిన ఉపగ్రహ చిత్రాలు చైనా సైన్యం ఫింగర్ 4, 5 ల మధ్య మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో పెంచిందనీ తెలిసింది. ఇందులో గుడారాలు, కందకాలు, వాటర్ ట్యాంకులు, ఇతర పరికరాలు, వాహనాలు, ముసుగు కప్పిన కొన్ని నిర్మాణాలూ ఉన్నాయి. ప్లానెట్ ల్యాబ్స్ చిత్రాల్లో ఫింగర్ 4, 5 ల మధ్య, సరస్సు ఒడ్డున, ప్రస్తుత చైనా మ్యాప్తో పాటు మాండారిన్ భాషలో చైనా పేరైన ఝాంగ్గువోను కూడా చిత్రించినట్లు కనిపించింది.[109][110] సముద్ర మట్టానికి 13,900 అడుగుల ఎత్తులో ఉన్న పాంగోంగ్ సరస్సులో గస్తీ కోసం రెండు దేశాలకూ శక్తిమంతమైన పడవలు అనేక సంఖ్యలో ఉన్నాయి. భారత సైన్యానికి ఇప్పటికే పడవ గస్తీ బృందాలుండగా, సరస్సు వద్ద చైనీయుల టైప్ 928 బి నావలను దీటుగా ఎదుర్కోవడానికి, 2020 జూలైలో భారత నావికాదళాన్ని రంగం లోకి దించింది.[111][112] సెప్టెంబరు మొదటి వారంలో, ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ వచ్చిన భారత మీడియా నివేదికల ప్రకారం, పాంగోంగ్ సరస్సు ఉత్తరపు ఒడ్డున రెండు వైపులా "100 నుండి 200 షాట్లు" "హెచ్చరిక"గా కాల్చారు.[113][114]
ఆగస్టు 29-30 తేదీలలో, కొట్లాటలు లడఖ్ గ్రామం చుషుల్కు సమీపం లోని పాంగోంగ్ త్సో సరస్సు దక్షిణ తీరానికి విస్తరించింది.[119] భారత ఆర్మీ ప్రతినిధి మాట్లాడుతూ, పిఎల్ఎ ఆగస్టు 29/30 రాత్రి దక్షిణ ఒడ్డున రెచ్చగొట్టే సైనిక కదలికలు చేసిందని, భారత సైన్యం ముందస్తు చర్యలు తీసుకుని, వారిని ముందే కట్టడి చేసిందనీ తెలిపారు. [lower-alpha 8][125][126][127][128] సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వ్యాసంలో రాసినట్లుగా భారతీయ ప్రభుత్వ ఆధారాల ప్రకారం, పాంగోంగ్ త్సో దక్షిణ తీరం వెంబడి చైనా సైనిక బలగాల కదలికలను గమనించిన భారత దళాలు వెంటనే రక్షణాత్మక చర్యలలో భాగంగా ఎత్తైన ప్రదేశాలకు చేరుకున్నాయి.[129] అయితే, భౌతిక ఘర్షణలేమీ జరగలేదు. భవిష్యత్తులో చైనా సైన్యం చేసే చొరబాట్లను నివారించడానికి భారత సైన్యం ఈ ప్రాంతంలో తన దళాలను తిరిగి ఉంచింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ భారత భూభాగంలోకి పిఎల్ఎ చొరబడలేదని చెబుతూ ఆ వార్తలను ఖండించారు. మరోవైపు వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ప్రతినిధి ఝాంగ్ షుయిలీ భారత సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని, చైనా ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందనీ ఆరోపించారు.[130] సమస్యలను పరిష్కరించడానికి బ్రిగేడ్ కమాండర్-స్థాయి జెండా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. 2020 సెప్టెంబరు 3 నాటికి, భారత దళాలు పాంగోంగ్ త్సో దక్షిణపు ఒడ్డున అనేక శిఖరాలను ఆక్రమించాయని భారత మీడియా నివేదించింది. వాటిలో రెజాంగ్ లా, రెకిన్ లా, బ్లాక్ టాప్, హానన్, హెల్మెట్ టాప్, గురుంగ్ హిల్, గూర్ఖా హిల్, మాగర్ హిల్లు ఉన్నాయి.[37] ఈ శిఖరాల్లో కొన్ని వాస్తవాధీన రేఖకు చెందిన అస్పష్ట ప్రాంతంలో ఉన్నాయి. అక్కడి నుండి చైనా శిబిరాలను పర్యవేక్షించే వీలు ఉంటుంది.[38]
2020 సెప్టెంబరు 4 న, మాస్కోలో భారత చైనాల మధ్య ఉన్నత స్థాయి సమావేశంలో, చుషుల్ సెక్టార్లోని రెచిన్ లా వద్ద దుడుకు చర్యలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. చైనా సైన్యం బ్లాక్ టాప్ వద్దకు యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ గన్ను తరలిస్తున్నట్లు కూడా కనిపించింది.[56] భారతీయ నివేదికల ప్రకారం 2020 సెప్టెంబరు 7 సాయంత్రం 6:15 గంటలకు పిఎల్ఎ దళాలు ముఖ్పారి వద్ద భారతీయ స్థానాలను చేరుకోవడానికి ప్రయత్నించాయి.[131] ఈటెలు, పట్టాకత్తులు, తుపాకులూ పట్టుకుని ఉన్న పిఎల్ఎ సైనికుల ఫోటోలను విడుదల చేశారు; చైనా సైనికులు అటువంటి ఆయుధాలను ఉపయోగించిన ఫొటో ఆధారాలను బహిరంగంగా విడుదల చేయడం ఇదే తొలిసారి.[132] ఇక్కడి శిఖరాలను నియంత్రణలో పెట్టుకున్న భారతీయ సైనికులు ఫ్లడ్ లైట్లు, మెగాఫోన్లను ఉపయోగించి చొచ్చుకొస్తున్న పిఎల్ఎ దళాలను నిలువరించారు. పిఎల్ఎ దళాలు 10 - 15 రౌండ్లు కాల్పులు జరిపినట్లు భారత నివేదికలు పేర్కొన్నాయి. అయితే భారత దళాలు చైనా దళాలపై హెచ్చరిక కాల్పులు జరిపాయని పిఎల్ఎ ప్రతినిధి పేర్కొన్నారు. "షెన్పావో పర్వత ప్రాంతంలో" ప్రవేశించడానికి భారత సైన్యం ఎల్ఎసిని దాటిందని పిఎల్ఎ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ప్రతినిధి పేర్కొన్నారు.[133][134][135] హెచ్చరిక కాల్పులు జరిపారంటూ భారత చైనా ఒకరినొకరు సెప్టెంబరు 8 న నిందించుకున్నాయి.[136][137] భారత సైన్యం ఒక ప్రకటనలో, పిఎల్ఎ దళాలే మొదట గాలిలోకి కాల్పులు జరిపాయని చెబుతూ, "వెస్ట్రన్ థియేటర్ కమాండ్ చేసిన ప్రకటన, తమ స్వంత ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం" అని చెప్పింది.[138][139] అరుణాచల్ ప్రదేశ్ లోని తులుంగ్ లాలో అస్సాం రైఫిల్స్ గస్తీ దళంపై చైనా సైన్యం కాల్పులు జరిపింది. 1975 తరువాత, ఈ 45 సంవత్సరాల కాలంలో భారత చైనాల మధ్య కాల్పులు జరగడం ఇదే మొదటిసారి.[40] పాంగోంగ్ త్సో దక్షిణపు ఒడ్డున యథాతథ స్థితిని మార్చకుండా చైనాను నిరోధించడానికి భారత దళాలు ఆగస్టు 30 న పిఎల్ఎపై హెచ్చరిక కాల్పులు జరిపినట్లు భారత మీడియాలో వార్తలు వచ్చాయి.[41][140] భారత స్థానాల చుట్టూ ముళ్ల కంచెలను ఏర్పాటు చేశాయి.[141]
హెల్మెట్ టాప్, బ్లాక్ టాప్ స్థానాలను ఆక్రమించామనడాన్ని భారత ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. ముందుకు వెళ్ళడంలో "ఏ మార్గమైనా" సాధ్యమేనని అవి పేర్కొన్నాయి.[142]
భారత మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం, మే 10 న, సిక్కిం లోని ముగుతాంగ్, నాకు లాలో భారత చైనా దళాల మధ్య స్వల్ప కొట్లాట జరిగింది. ఈ సంఘటనలో అనేక మంది సైనికుల మధ్య జగడం జరిగింది. ప్రత్యర్థి పక్షాలు ఒకరిపై మరొకరు రాళ్ళు కూడా విసురుతున్నాయి.[69][143] ఇరువైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు. [lower-alpha 9][145] భారత సైన్యపు ఈస్టర్న్ కమాండ్ ప్రతినిధి మాట్లాడుతూ, "స్థానిక స్థాయిలో సంభాషణ, పరస్పర చర్యల తరువాత ఈ విషయం పరిష్కారమైంది", "సరిహద్దులు తేలనందున తాత్కాలిక, స్వల్పకాలిక ముఖాముఖీలు జరుగుతాయి. పరస్పరం ఏర్పాటు చేసుకున్న ప్రోటోకోల్లను ఉపయోగించి ఇటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూంటాయి " అని చెప్పాడు.[70] చైనా మాత్రం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలనేమీ ఇవ్వలేదు. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ సంఘటనపై వ్యాఖ్యానించ లేదు.[146] అయితే, "చైనా సైనికులు సరిహద్దులో శాంతినీ, ప్రశాంతతను ఎల్లప్పుడూ నెలకొల్పుతూనే వచ్చారు" అని మాత్రం చైనా విదేశాంగ శాఖ చెప్పుకుంది.
గల్వాన్ నది లోయలోని భారత భూభాగంలోకి చైనా దళాలు ప్రవేశించాయని, ఏ వివాదమూ లేని భారత భూభాగంలో భారతదేశం చేసుకుంటున్న రహదారి నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తం చేసాయనీ మే 21 న ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది. నిర్మాణంలో ఉన్న రహదారి, డార్బుక్-ష్యోక్-డిబివో రోడ్డు (డిఎస్డిబిఒ) కు చెందిన ఒక శాఖ. ఇది గల్వాన్ లోయలోకి దారితీస్తుంది. [lower-alpha 10] "చైనీయులు ఈ ప్రాంతంలో ముందు 70-80 గుడారాలను వేసారు. ఆపై దళాలు, భారీ వాహనాలు, పర్యవేక్షణ పరికరాలతో ఈ ప్రాంతాన్ని బలోపేతం చేశారు. ఇవన్నీ భారతదేశం వైపు నుండి ఎంతో దూరంలో లేవు" అని కూడా ఆ వార్తలో రాసారు.[147] మే 24 న, చైనా సైనికులు హాట్ స్ప్రింగ్స్, గస్తీ కేంద్రం 14, గస్తీ కేంద్రం 15 అనే మూడు వేర్వేరు ప్రదేశాలలో భారతదేశంపై దాడి చేశారని మరొక నివేదిక పేర్కొంది. ఈ మూడు చోట్లా, సుమారు 800 నుండి 1,000 మంది చైనా సైనికులు సరిహద్దును దాటి, 2 - 3 కిలోమీటర్ల లోపల ఒక ప్రదేశంలో స్థిరపడ్డారు. గుడారాలు వేసి భారీ వాహనాలు, పర్యవేక్షణ పరికరాలను కూడా మోహరించారు. భారతదేశం కూడా తన దళాలను ఈ ప్రాంతంలో చైనీయుల నుండి 300 - 500 మీటర్ల దూరంలో మోహరించింది.[26][27] సైనిక తరహా బంకర్లు, కొత్త శాశ్వత నిర్మాణాలు, మిలిటరీ ట్రక్కులు, రహదారి నిర్మాణ పరికరాలతో సహా చైనీయులు భారీగా చేరుకున్నారని యురేషియన్ టైమ్స్ పేర్కొంది. ఇది "1962 తరువాత అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి" అని ఒక భారతీయ అధికారిని ఉటంకిస్తూ రాసింది.[148] మరో అధికారిని ఉటంకిస్తూ ది హిందూ పత్రిక, "ఇది యథాతథ స్థితిలో మార్పుకు దారితీసింది, ఇది భారతదేశం ఎప్పటికీ అంగీకరించదు" అని రాసింది.[149] మే 30 న బిజినెస్ స్టాండర్డ్, వేలాది మంది చైనా సైనికులు "తమ స్థానాలను సంఘటితం చేసుకుంటున్నారని, భారత దాడులను తిప్పికొట్టడానికి అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నార"నీ నివేదించింది. చైనా సైనికులకు మద్దతుగా పాంగోంగ్ త్సో వద్ద సుమారు 18 గన్లు, గల్వాన్ లోయలో సుమారు 12 గన్లూ ఉన్నాయని కూడా ఆ పత్రిక రాసింది. డార్బుక్-ష్యోక్-డిబివో రహదారి వైపు పిఎల్ఎ ముందుకు సాగకుండా నిరోధించడానికి భారత దళాలు తగు స్థానాల్లో మోహరించాయి.[150]
మొత్తం మీద పరిస్థితి స్థిమితంగానే ఉందని 2020 మే 27 న భారతదేశంలోని చైనా రాయబారి, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధీ పేర్కొన్నారు.[151] అయితే, లడఖ్లోని వివాదాస్పద ప్రాంతాలలోకి వేలాది మంది చైనా సైనికులు తరలి వస్తున్నారని వార్తా కథనాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారతదేశం అనేక పదాతిదళ బెటాలియన్లను లడఖ్ రాజధాని లేహ్ నుండి, మరికొన్ని యూనిట్లను కాశ్మీర్ నుండీ రప్పించి మోహరించడానికి చైనా వారి ఈ చర్యలు ప్రేరేపించాయి.[152][153]
జూన్ 15 న, గల్వాన్ లోయలోని ఒక పర్వత ప్రాంతంలో నిటారుగా ఉన్న విభాగంలో భారత చైనా దళాలు[lower-alpha 11] ఆరు గంటల పాటు ఘర్షణ పడ్డాయి. ఈ సంఘటనకు తక్షణ కారణమేంటో తెలియదు. తరువాత రెండు వైపుల నుండి పరస్పర విరుద్ధమైన అధికారిక ప్రకటనలను విడుదల చేసాయి.[154] భారత దళాలు మొదట చైనా దళాలపై దాడి చేశాయని బీజింగ్ చెప్పగా,[155] జూన్ 18 న ది హిందూ, "తమ దళాలను దెబ్బతిన్న వాగులకు అడ్డుగా ఉన్న కట్టలను కూలదోసి, తమపై బండరాళ్లు విసిరి, తమ సైనికులపై చైనా దళాలు దొంగద్చెబ్బ తీసాయ"ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఒక "సీనియర్ అధికారి" చెప్పినట్లుగా రాసింది.[156]కల్నల్ సంతోష్ బాబు రెండు రోజుల ముందు చైనా గుడారాన్ని ధ్వంసం చేసిన వివాదాస్పద ప్రాంతంలో వారు గస్తీ తిరుగుతూండగా ఇది జరిగినట్లు తెలిపింది.[156] సైనికులు తుపాకీలను తీసుకువెళ్లడం మామూలే అయినప్పటికీ, ఉద్రిక్తతలు ఉధృతమయ్యే అవకాశాన్ని తగ్గించడానికి చేసుకున్న ఒప్పందాల ప్రకారం దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో సైనికులు తుపాకీలు వాడరు. కాని చైనా సైనికుల వద్ద ఇనుప కడ్డీలు, దుడ్డుకర్రలూ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.[157] తత్ఫలితంగా, ముష్టి యుద్ధాలు జరిగాయి. భారతీయులు 3.2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ శిబిరం నుండి మరింత మందిని రప్పించారు. చివరికి, 600 మంది సైనికులు రాళ్ళు, లాఠీలు, ఇనుప కడ్డీలు, ఇతర తాత్కాలిక ఆయుధాలతో కొట్టుకున్నారు. మొత్తం చీకట్లో జరిగిన ఈ పోరాటం ఆరు గంటల పాటు సాగింది.[158] చైనా సైనికులు ముళ్ల తీగ చుట్టిన లాఠీలను, మేకులు దిగగొట్టిన దుడ్డుకర్రలనూ ఉపయోగించారని సీనియర్ భారత సైనిక అధికారులు చెప్పారు.[159]
ఈ గొడవలో 16 వ బీహార్ రెజిమెంట్కు చెందిన 20 మంది భారతీయ సైనికులు, దాని కమాండింగ్ అధికారి కల్నల్ బి. సంతోష్ బాబుతో సహా, మరణించారు.[160][161] ముగ్గురు భారతీయ సైనికులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు గాయాల వలనా, హైపోథెర్మియా కారణంగానూ మరణించారు.[162] చనిపోయిన సైనికులు చాలామంది తోపులాటలో నిలదొక్కుకోలేక శిఖరం నుండి కిందకు పడిపోవడంతో మరణించారు.[163] వేగంగా ప్రవహించే గల్వాన్ నది సమీపంలో ఈ ఘర్షణ జరిగింది. ఇరువైపులా కొంతమంది సైనికులు ఒక వాగులో పడి మరణించారు లేదా గాయపడ్డారు. తరువాత ష్యోక్ నది నుండి వీరి మృతదేహాలను వెలికి తీసారు. నలుగురు అధికారులతో సహా 10 మంది భారతీయ సైనికులను బందీలుగా తీసుకొన్న చైనీయులు, వీరిని జూన్ 18 న విడుదల చేసినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. జనరల్ వికె సింగ్ ప్రకారం, భారత్ కూడా కొంతమంది చైనా సైనికులను బంధించి, తరువాత విడుదల చేసింది. కొంతమంది భారతీయ సైనికులు బందీలై వెంటనే విడుదలయ్యారు. భారతీయ మీడియా వర్గాల సమాచారం ప్రకారం, ఈ దొమ్మీలో 43 మంది చైనా సైనికులు మరణించారు లేదా గాయపడ్డారు.[28][164] ఈ సంఘటన తరువాత, సామరస్యాన్ని నెలకొల్పేందుకు జరిగిన సమావేశంలో తమ కమాండింగ్ అధికారి కూడా ఈ దొమ్మీలో మరణించాడని చైనా పక్షం అంగీకరించిందని మీడియా నివేదికలు వచ్చాయి.[30][165] చైనా వైపున ప్రాణనష్టం ఉన్నట్లు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది, కాని ఆ సంఖ్యను చెప్పేందుకు నిరాకరించింది.[166] జూన్ 16 న ఐదుగురు చైనా సైనికులు మరణించినట్లు చైనా అంతర్జాలంలో నివేదిక వెలువడింది.[167][168] కాని ఆ నివేదికను చైనా ప్రభుత్వం సెన్సార్ చేసింది.[169] జూన్ 22 న, చైనా మరణాల సంఖ్య గురించి భారత మంత్రి చేసిన వాదన గురించి అడిగినప్పుడు, చైనా వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.[170] ఆ తరువాతి కాలంలో, చైనా మరణాల సంఖ్యపై భారత మంత్రి చెప్పిన అంకె గురించి వ్యాఖ్యానించమని అడగ్గా, చైనా దీనిపై స్పందించడానికి నిరాకరించింది.[171] పిఎల్ఎ సైనికులు 35 మంది మరణించినట్లు అమెరికా నిఘా సంస్థ నిర్ధారించింది. జూన్ 17 న నలుగురు అధికారులతో సహా 10 మంది భారతీయ సైనికులను చైనా కస్టడీ నుండి విడుదల చేసినట్లు భారత మీడియా రాసింది.[15][172] ఈ వార్తను ఖండిస్తూ, భారతీయ సైనికులెవరినీ చైనా అదుపులోకి తీసుకోలేదని భారత సైన్యం, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ రెండూ చెప్పాయి.[173]
జూన్ 16 న, పిఎల్ఎ పశ్చిమ కమాండ్ ప్రతినిధి కల్నల్ ఝాంగ్ షుయిలీ మాట్లాడుతూ, భారత సైన్యం ద్వైపాక్షిక ఏకాభిప్రాయాన్ని ఉల్లంఘించి "తీవ్రమైన శారీరక ఘర్షణలకు, ప్రాణనష్టాలకూ" కారణమైందని వ్యాఖ్యానించాడు.[174] "గల్వాన్ లోయ ప్రాంతంపై సార్వభౌమాధికారం ఎప్పుడూ చైనాదే" అని అతను వ్యాఖ్యానించాడు.[161][175][176] జూన్ 18 న, భారత విదేశాంగ మంత్రి ఒక ప్రకటన చేస్తూ, చైనా "ఏకపక్షంగా ఉన్న స్థితిని మార్చడానికి ప్రయత్నించింది" అని అన్నాడు. ఈ హింస "ముందే ఆలోచించుకుని, ప్రణాళికా బద్ధంగా" చేసినట్లు ఉందని కూడా అన్నాడు.[177][178] అదే రోజు, అమెరికాకు చెందిన తూర్పు ఆసియా, పసిఫిక్ వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ మాట్లాడుతూ, భారత, చైనాల మధ్య "వివాదాస్పద ప్రాంతాన్ని" చైనా పిఎల్ఎ దురాక్రమణ చేసిందని అన్నారు.[179] అయితే, జూన్ 19 న, ప్రధానమంత్రి మోడీ మాత్రం "చైనా మా సరిహద్దులోకి చొరబడనూ లేదు, మా శిబిరం దేన్నీ ఆక్రమించనూ లేదు" అని ప్రకటించాడు. ఇది, అంతకు ముందు భారత ప్రభుత్వం చేసిన పలు ప్రకటనలకు విరుద్ధంగా ఉంది.[180][181] 16 బీహార్ రెజిమెంట్ చూపిన శౌర్యాన్ని ప్రశంసించే క్రమంలో, చైనా చేసిన ప్రయత్నం విఫలమైందని నరేంద్ర మోడీ అన్నారని ప్రధాని కార్యాలయం వివరణ నిచ్చింది[182][183] ఈ కొట్లాటకు చైనా తరపున అనుమతి నిచ్చినది చైనా వెస్ట్రన్ థియేటర్ కమాండ్ చీఫ్ అయిన జనరల్ జావో జోంగ్కి అని అమెరికా నిఘా సంస్థలు అంచనా వేసినట్లుగా జూన్ 22 న యుఎస్ న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ పత్రిక రాసింది.[184]
గల్వాన్ వద్ద జరిగిన సంఘటన తరువాత, సరిహద్దులో ఉన్న సైనికులకు తేలికపాటి సామాగ్రితో పాటు, ముళ్ళ కర్రలను కూడా ఇచ్చి సన్నద్ధం చేయాలని భారత సైన్యం నిర్ణయించింది.[185][186] జూన్ 20 న, ఎల్ఎసి వెంట తుపాకీ వాడకంపై తమ సైనికులపై ఉన్న ఆంక్షలను భారత్ తొలగించింది.[187] ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ విశ్లేషించిన ఉపగ్రహ చిత్రాలను బట్టి జూన్ 15 నాటి కొట్లాటల తరువాత గల్వాన్ లోయలో చైనీయులు చేసిన నిర్మాణాలు పెరిగాయని తేలింది.[55] జూన్ 15 న భారత దళాలు నాశనం చేసిన చైనా శిబిరాన్ని జూన్ 22 నాటికి పునర్నిర్మించారు. దాని పరిమాణాన్ని పెంచారు, సైనిక కదలికలూ పెరిగాయి. లోయలో భారత, చైనా దళాలు రెండూ కొత్త రక్షణ స్థానాలను కూడా నిర్మించుకున్నాయి.[188]
2020 మే ప్రతిష్ఠంభనకు కొన్ని నెలల ముందే డెప్సాంగ్ మైదానంలో భారత చైనా ఉద్రిక్తత ప్రారంభమైందని ది ప్రింట్ రాసింది.[189] డెప్సాంగ్ మైదానంలోని బాటిల్ నెక్ (వై జంక్షన్) వద్ద నున్న DS-DBO రహదారి నుండి, 30 కిలోమీటర్లు ఆగ్నేయాన [lower-alpha 12] ఎల్ఎసి నుండి 18 కిలోమీటర్ల దూరం భారత భూభాగం లోకి చైనా దళాలు చొచ్చుకు వచ్చాయని 2020 జూన్ 25 న భారత మీడియాలో వార్తలు వచ్చాయి. దళాలు, భారీ వాహనాలు, సైనిక పరికరాలూ తరలిస్తున్నట్లు ఈ వార్తల్లో రాసారు. చైనీయులు వాదిస్తున్న రేఖలు ఈ బాటిల్ నెక్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.[190] 2020 మార్చి - ఏప్రిల్ నుండి డెప్సాంగ్లోని బాటిల్ నెక్ వద్ద పిఎల్ఎ కదలికలు, వారు చేపట్టిన నిర్మాణాలూ భారత గస్తీ స్థలాలు (పిపి) 10, 11, 11 ఎ, 12 లను అడ్డుకున్నాయి.[191][192] ఎల్ఎసి పట్ల భారతదేశపు అవగాహనలో ఉన్న 900 చ.కి.మీ. భూభాగంపై చైనా నియంత్రణ సాధించినట్లు 2020 ఆగస్టు 31న డెప్సాంగ్ (పిపి 10–13) కు సంబంధించిన నిఘా నివేదికలు వచ్చాయి.[106][193] టైమ్స్ ఆఫ్ ఇండియాకు దౌత్య సంపాదకుడు ఇంద్రాణి బాగ్చి, డెప్సాంగ్ లోను, ఆ చుట్టుపక్కలా చైనీయుల సైనిక స్థావరాల వృద్ధి అన్నీ కేవలం దృష్టిమళ్లింపు వ్యూహాలు అని వివరించింది.[194]
హాట్ స్ప్రింగ్స్లో చైనా మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రధానంగా గోగ్రాలోను, ఆ చుట్టుపక్కలా జరిగింది. ఉపగ్రహ చిత్రాల్లో ఉన్న వాహన చక్రాల దారులను గమనిస్తే, పిఎల్ఎ దళాలు ఇక్కడ భారత భూభాగంలోకి ప్రవేశించాయని తెలిసింది.[195] ఒక రహదారి, ఈ ప్రాంతాన్ని చైనా ఆవాస స్థానమైన వెన్క్వాన్తో కలుపుతుంది. హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో బంగారం వంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయని అంచనా.[196]
2020 సెప్టెంబరు 4 న పిఎల్ఎ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని ఎగువ సుబన్సిరి జిల్లా నుండి ఐదుగురు భారతీయులను అపహరించినట్లు భారత మీడియాలో వార్తలు వచ్చాయి. అపహరణకు గురైన భారతీయులకు సంబంధించి చైనా నుండి ఎటువంటి స్పందనా రాలేదు. కానీ, "అరుణాచల్ ప్రదేశ్" అనే ప్రాంతాన్ని చైనా ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదని వ్యాఖ్యానించింది.[197][198] దీనికి సంబంధించినదే మరో సంఘటనలో, ఆగస్టు 31 న తూర్పు కామెంగ్ జిల్లాలో 17 యాక్లు, దూడలు ఎల్ఎసిని దాటి భారత భూభాగం లోకి వచ్చాయి. సెప్టెంబరు 7 న భారత సైన్యం ఆ జంతువులను చైనాకు తిరిగి అప్పజెప్పింది. అక్కడున్న చైనా అధికారులు దీనిపట్ల భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు.[199] ఆ తరువాత, సెప్టెంబరు 8 న, తప్పిపోయిన భారతీయులను కనుగొన్నట్లు హాట్లైన్పై పిఎల్ఎ స్పందించింది.[200] సెప్టెంబరు 12 న, అరుణాచల్ ప్రదేశ్ లోని టాగిన్ తెగకు చెందిన ఈ ఐదుగురు భారతీయులను (వీళ్ళు భారత సైన్యానికి పోర్టర్లుగా పనిచేస్తారు) చైనా సైన్యం భారత్కు అప్పగించింది.[201] అయితే, చైనా మీడియా వారిని గూఢచారులు అని వర్ణించింది.
గల్వాన్ లోయ ఘర్షణ తరువాత, భారతదేశం దక్షిణ చైనా సముద్రంలో ఒక యుద్ధనౌకను మోహరించింది.[202][203] సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తూర్పు ఆసియా విశ్లేషకురాలు మారియా సియోవ్, చైనా - పాకిస్తాన్ కూటమికి ప్రతిగా ఇది దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో భారత - వియత్నాం సైనిక కూటమి అని రాసింది.[204] వివాదాస్పద ద్వీపాల్లో చైనా సైనిక మోహరింపుకు సంబంధించి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం గురించి ఆగస్టులో వియత్నాం భారతదేశానికి వివరించింది.[205] చైనా మద్దతుగల థాయ్ కెనాల్ ప్రాజెక్టు వలన చైనా భారతదేశాన్ని మరింతగా చుట్టుముట్ట గలుగుతుంది. దీనికి స్పందనగా భారతదేశం అండమాన్, నికోబార్, లక్షద్వీపాల్లో వైమానిక స్థావరాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిసింది.[206] సాల్వాటోర్ బాబోన్స్ తన ఎ ఫారిన్ పాలిసీ వ్యాసంలో, భారత చైనాల మధ్య తదుపరి ముఖాముఖి థాయ్ కాలువే కావచ్చునని రాసాడు.[207]
2020 సెప్టెంబరు 19 న, నిక్కీ ఏషియన్ రివ్యూ పత్రిక, హిందూస్తాన్ టైమ్స్ పత్రికలలో వచ్చిన ఒక కథనంలో, 2020 లో చైనా ప్రవర్తనను 1950 ల ప్రారంభంలో టిబెట్ను స్వాధీనం చేసుకున్నప్పటి చైనా ప్రవర్తనతో పోల్చారు. అప్పట్లో నెహ్రూ ప్రభుత్వంతో సహా ప్రపంచమంతా కొరియా యుద్ధం పైనా, అందులో చైనా పాత్రపైనా దృష్టి పెట్టగా చైనా టిబెట్ను ఆక్రమించింది. 2020 లో జూలై నుండి సెప్టెంబరు వరకూ ప్రపంచపు దృష్టి అంతా అమెరికా చైనాలు దక్షిణ చైనా సముద్రంలో చేస్తున్న సైనిక విన్యాసాలపై ఉన్న సమయంలో, "హిమాలయాల్లో భారతదేశంతో నిజ జీవిత ప్రతిష్టంభనలో బీజింగ్ నిమగ్నమై ఉంది" అని ఆ కథనం పేర్కొంది.[208][209]
భారత చైనాలు రెండూ తమ వ్యూహాత్మక సామర్థ్యాలను పెంచుకునే లక్ష్యంతో సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలు కూడా ఇందులో భాగమే.[206]
ప్రతిష్టంభన మధ్య, భారతీయ రహదారి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అదనంగా సుమారు 12,000 మంది కార్మికులను సరిహద్దు ప్రాంతాలకు తరలించాలని భారత్ నిర్ణయించింది.[42][43] వీరిలో సుమారు 8,000 మంది కార్మికులు లడఖ్లోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఓ) చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టైన ప్రాజెక్ట్ విజయక్లో పాల్గొంటారు. కొంతమంది కార్మికులను సమీపంలోని ఇతర సరిహద్దు ప్రాంతాలకు కేటాయించారు.[210] వీళ్ళు జూన్ 15, జూలై 5 మధ్య లడఖ్ చేరుకునేలా ప్రణాళిక వేసారు.[44] 1600 మందికి పైగా కార్మికులతో కూడిన మొదటి రైలు 2020 జూన్ 14 న జార్ఖండ్ నుండి ఉధంపూర్ బయలుదేరింది. అక్కడి నుండి కార్మికులు భారత చైనా సరిహద్దు వద్దకు చేరుకున్నారు.[211] DS-DBO రహదారిని పూర్తి చేయడమే కాకుండా, ఇతర సరిహద్దు రహదారుల నిర్మాణంలో కూడా ఈ కార్మికులు బిఆర్వో తరపున పాల్గొంటారు.[212] జూన్ నుండి, భారత చైనా సరిహద్దులో పనిచేసేవారికి కనీస వేతనాలు 170% వరకూ పెరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. లడఖ్లోని ఉద్యోగులకు అత్యధిక స్థాయిలో వేతనాలు పెరిగాయి.[213] సరిహద్దులో భారతదేశం చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధే, ప్రస్తుత ప్రతిష్టంభనకు ఒక కారణమని నిపుణులు పేర్కొన్నారు.[45] లైవ్మింట్ నివేదికలో, "అటువంటి ఆస్తుల సృష్టి భారతదేశ వ్యూహాత్మక మూలధనానికి తోడ్పడుతోందేమో గానీ, మానవ మూలధన వృద్ధికి మాత్రం ఆ విధంగా తోడ్పడ్డం లేదు." అని రాసింది.[214] ఎల్ఎసి వెంట భారతదేశం నిఘా పరికరాలను కూడా ఏర్పాటు చేసింది.[215]
ఎల్ఎసి దగ్గర చైనా మౌలిక సదుపాయాల కల్పనను కొనసాగిస్తోంది.[216] వీటిలో రోడ్లు, వంతెనలు, హెలిప్యాడ్లు, శిబిరాలు వంటి సైనిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. పాంగోంగ్ త్సో, గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలోని ముఖాముఖీ స్థలాల వద్ద దాని దళాల కోసం ఆప్టికల్ ఫైబరు కేబుళ్ళు వేస్తోంది.[217] పాంగోంగ్ త్సో వద్ద రెండు కొత్త పడవల రేవులను కూడా నిర్మించారు.[119] ఎల్ఎసి వెంట కెమెరాలు, కదలికలను పసిగట్టే సెన్సర్లు, ఇతర నిఘా పరికరాలను ఏర్పాటు చేసింది[218] జిన్జియాంగ్, టిబెట్ల లోని వైమానిక స్థావరాలను మరింత అభివృద్ధి చేస్తోంది; వీటిలో హోటాన్, కష్గర్, గర్గున్సా, లాసా-గాన్గార్, షిగాట్సేలు ఉన్నాయి. లిపులేఖ్ కనుమ సమీపంలో ఉన్న కైలాస- మానసరోవర్ వద్ద చైనా, ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణుల స్థావరాన్ని నిర్మిస్తోంది.[219][220] ఎల్ఎసి వెంట చైనా తన దళాల కోసం 5 జి నెట్వర్కును కూడా అభివృద్ధి చేస్తోంది.[221][222] చైనా సరిహద్దులో 26 కొత్త తాత్కాలిక బ్యారక్లు, 22 కొత్త స్థావరాలను నిర్మించినట్లు స్ట్రాట్ఫోర్ జూలైలో రాసింది. ఇది "శాశ్వత, అర్ధ శాశ్వత స్థానాల మిశ్రమం" అని రాసింది.[223][224] ప్రతిష్ఠంభన మొదలైన తర్వాత, నాలుగు కొత్త హెలిపోర్ట్ల నిర్మాణం ప్రారంభమైందని స్ట్రాట్ఫోర్ సెప్టెంబరులో రాసింది. హిమాలయాలలో చైనా చేస్తున్న నిర్మాణాలు, దక్షిణ చైనా సముద్రంలో చైనా వ్యూహానికి సమానమని సిమ్ టాక్ ఇచ్చిన నివేదిక పేర్కొంది. ఈ వ్యూహం వలన, చైనాను వ్యతిరేకిస్తున్నవారికి ఖర్చు గణనీయంగా పెరుగుతుంది.[225][226]
2020 మే 5–6 న పాంగోంగ్ సరస్సు వద్ద మొదటి దొమ్మీ జరిగిన తరువాత, భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా, భారతదేశంలో చైనా రాయబారి సన్ వీడాంగ్ను పిలిచాడు.[227] తరువాత, సిసిపి పొలిట్బ్యూరో సభ్యుడు యాంగ్ జీచీతో అజిత్ దోవల్ మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. జీచీ, సిసిపి ప్రధాన కార్యదర్శి షీ జిన్పింగ్ కింద పనిచేసే ఉన్నత దౌత్యవేత్త కూడా. సరిహద్దు వివాదాలను దౌత్యపరంగా పరిష్కరించడానికి తగినన్ని ద్వైపాక్షిక యంత్రాంగాలు తమకున్నాయని మే 28 న విలేకరుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డాడు.[49][228] (అయితే, ఈ ఒప్పందాలు "చాలా లోపభూయిష్టంగా" ఉన్నాయని కొందరు విమర్శకులన్నారు.[229]) మే-జూన్లలో బోర్డర్ పర్సనల్ మీటింగ్ (బిపిఎం) పాయింట్లలో సైనిక చర్చలు జరిగాయి; మొదట కల్నల్స్ మధ్య, తరువాత బ్రిగేడియర్స్ మధ్య, చివరకు జూన్ 2 న, ప్రధాన జనరల్స్ మధ్య మూడు రౌండ్లకు పైగా చర్చలు జరిగాయి.[53][230] ఈ చర్చలన్నీ విఫలమయ్యాయి. చైనా డిమాండ్లేమిటో భారత్కు ఇంకా స్పష్టంగా తెలీలేదని భారత సైనిక వర్గాలు తెలిపాయి. "ఒక ప్రక్రియను నిలిపివేయాలనుకునేవారు, అసంబద్ధమైన డిమాండ్లు చేస్తూంటారు... వాళ్ళు కావాలని కొన్ని అసమంజసమైన డిమాండ్లను చేశారు" అని ఆ వర్గాలు తెలిపాయి. జూన్ 6 న, కమాండర్ల చర్చలు చుషుల్ - మోల్డో బిపిఎం వద్ద జరిగాయి. ఈ చర్చలలో లేహ్ లో ప్రధాన కార్యాలయం కలిగిన 14 కార్ప్స్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, టిబెట్ మిలిటరీ డిస్ట్రిక్ట్ (సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ రీజియన్) కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ పాల్గొన్నారు[231][232]
2020 జూన్ 17 న జరిగిన గల్వాన్ కొట్లాటకు సంబంధించి ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాడు. భారత సైనికుల మరణాలపై చైనాకు గట్టి సందేశం పంపించాడు.[233][234] సరిహద్దు వివాదం ప్రారంభమైన తరువాత భారత చైనా విదేశాంగ మంత్రులు, ఎస్ జైశంకర్ వాంగ్ యి ల మధ్య తొలి సంభాషణ గల్వాన్ కొట్లాట తరువాతనే జరిగింది. గల్వాన్లో చైనా చర్యలు "ముందస్తు ఆలోచనతో, ప్రణాళికతో చేసినదే" అని ఎస్ జైశంకర్ ఆరోపించాడు. గల్వాన్ కొట్లాటపై భారత ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను చైనీస్ సోషల్ మీడియా వేదిక Wechat జూన్ 20 న తొలగించింది.[235] దీన్ని చైనా లోని భారత రాయబార కార్యాలయం అప్లోడ్ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన అధికారిక ప్రకటనలను కూడా తొలగించింది. ఆ ప్రసంగం, ప్రకటనలూ దేశ రహస్యాలు, జాతీయ భద్రతలకు అపాయం కలిగించినందున వాటిని తొలగించామని వీచాట్ తెలిపింది.[236] ఈ సంఘటనపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి చేసిన ప్రకటనను వీబో నుండి కూడా తొలగించారు. తదనంతరం చైనాలోని భారత రాయబార కార్యాలయం, ఈ పోస్ట్ను తాము తొలగించలేదని తన వీబో ఖాతాలో స్పష్టం చేసింది. చైనీస్ భాషలో ఉన్న ఈ ప్రకటన స్క్రీన్ షాట్ను తిరిగి ప్రచురించింది.[237] జూలై 1 న ప్రధాని మోడీ చైనా సోషల్ మీడియా ప్లాట్ఫారమైన వీబో నుంచి తప్పుకున్నాడు.[238][239] జూలై 3 న, లడఖ్లోని సైనిక పోస్టులను సందర్శించిన హఠాత్ పర్యటనలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, "విస్తరణవాదపు రోజులు" ముగిసాయి. "విస్తరణవాద శక్తులు ఓడిపోయాయి లేదా మడమ తిప్పాయ"ని చరిత్ర చెబుతోంది అని ప్రకటించాడు. అతడు ప్రస్తావించినది బీజింగ్నే నని మీడియా పేర్కొంది.[240]
రెండవ విడత కమాండర్ల సమావేశం జూన్ 22 న జరిగింది. 11 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో, కమాండర్లు విరమణకు రూపురేఖలు రూపొందించారు. జూన్ 24 న, వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ చైనా-ఇండియా బోర్డర్ అఫైర్స్ (డబ్ల్యుఎంసిసి) వర్చువల్ సమావేశంలో ఈ విరమణను ఇరుపక్షాలూ దౌత్యపరంగా అంగీకరించాయి.[55] చైనా ప్రతినిధి, జావో లిజియన్ మాట్లాడుతూ, "చైనా అభ్యర్థన మేరకు గల్వాన్ లోయలో ఉన్న సరిహద్దు సిబ్బందిని ఉపసంహరించుకునేందుకు భారత్ అంగీకరించి, ఉపసంహరించుకుంది. క్రాసింగ్ సౌకర్యాలను కూల్చివేసింది" అని చెప్పాడు.[241] మూడవ విడత కమాండర్ల చర్చలు జూన్ 30 న జరిగాయి..[242][243] ఈ చర్చల్లో, పాంగోంగ్ త్సో, గల్వాన్ లోయ, డెప్సాంగ్ మైదానాలతో సహా అన్ని కీలక ప్రాంతాల నుండి చైనా దళాలను ఉపసంహరించుకోవాలనీ ఏప్రిల్ నాటి ఘర్షణ-పూర్వ స్థితిని పునరుద్ధరించాలనీ భారతదేశం తన డిమాండ్ను పునరుద్ఘాటించింది. ఈ ప్రాంతంలో సైనిక శక్తిని తగ్గించాలని చైనా వాదించింది.[244] ఈ చర్చల తరువాత, చైనా వాహనాలు గల్వాన్ కొట్లాట స్థలం నుండి, అలాగే హాట్ స్ప్రింగ్స్, గోగ్రా నుండి వెనక్కి తరలి పోవడం కనిపించిన్నట్లు వార్తలు వచ్చాయి.[245]
పూర్తి విరమించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో, జూలై 5 న ప్రత్యేక ప్రతినిధులు భారత జాతీయ భద్రతా సలహాదారు, అజిత్ డోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య సమావేశం జరిగింది. భారత, చైనా దళాలు పెట్రోలింగ్ పాయింట్ పిపి 14 నుండి 1.8 కి.మీ. వెనక్కి వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గల్వాన్ లోయలో జూన 15 నాడు ఘర్షణ జరిగిన ప్రదేశం కూడా ఇదే.[246] బఫర్ జోన్ను ఏర్పాటు చేస్తూ రెండు దళాలు పిపి 14 నుండి 1.5 నుండి 2 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లినట్లు తెలిసింది. తరువాతి 30 రోజుల వరకు వారు ఈ ప్రాంతంలో నడక గస్తీ తిరిగేందుకు వీల్లేదు. హాట్ స్ప్రింగ్స్, గోగ్రా వద్ద దళాలను తగ్గించడంతో పాటు, చైనా దళాలు ఘర్షణ స్థలం నుండి పూర్తిగా వెనక్కి పోయాయి.[247][248] అయితే, చైనా దళాలు పాంగోంగ్ త్సో నుండి వైదొలగలేదు. అక్కడ వారు భారత గస్తీ భూభాగంలోకి 8 కి.మీ. దూరం చొరబడ్డారు[249][250]
జూలై 25 న, గల్వాన్, హాట్ స్ప్రింగ్స్, గోగ్రా వద్ద విరమణ పూర్తయినట్లు భారత మీడియా నివేదించింది.[33][251] క్రమంగా విరమించడం, సడలించడం జరుగుతోందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ జూలై 30 న చెప్పిన కొద్దికాలానికే, విరమణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని భారత్ చైనాకు తెలిపింది;[252] భారత సైన్య వర్గాలు "ఇప్పుటికి రెండు వారాలుగా క్షేత్ర స్థాయిలో ఎలాంటి సానుకూల కదలికలూ లేవు" అని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి. గోగ్రా, పాంగోంగ్ త్సో వద్ద విరమణ ఇంకా మిగిలే ఉంది అని కూడా చెప్పాయి.[34][35] జూలై 30 న, చైనా రాయబారి సన్ వీడాంగ్, ఎల్ఎసిపై స్పష్టత నిచ్చే ప్రక్రియను కొనసాగించలేమని పేర్కొన్నాడు. ఎల్ఎసిపై ఏకపక్షంగా చేసే వివరణలు మరింతగా వివాదాలకు కారణమవుతాయని దానికి అతడు చెప్పిన కారణం.[253] జూలై 14న నాల్గవ విడత కార్ప్స్-కమాండర్ చర్చలు జరిగాయి. ఆగస్టు 2 న చుషుల్-మోల్డో బిపిఎం వద్ద ఐదవ విడత చర్చలు జరిగాయి.[254] జూలై 24 న ఇరు దేశాల మధ్య దౌత్యస్థాయిలో చర్చలు జరిగాయి.[255] ఐదవ విడత చర్చల తరువాత, భారతదేశపు చైనా స్టడీ గ్రూప్ సమావేశమై పాంగోంగ్ త్సో వద్ద చైనా ప్రతిపాదిస్తున్న "పరస్పర, సమానమైన" విడదీత ఆమోదయోగ్యం కాదని తేల్చింది..[256][257] సరిహద్దు ఉద్రిక్తతల 100 వ రోజున, ది వీక్ న్యూ ఢిల్లీలోని సెక్రటేరియట్ భవనంలో ఉన్న ఒక రక్షణ అధికారి ఇచ్చిన ప్రకటనను ప్రచురించింది: "పరిస్థితి తమ నియంత్రణలో లేదని భారత సైనిక వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఇప్పుడు, రాజకీయ జోక్యం మాత్రమే సమస్యను పరిష్కరించగలదు. అనేక సార్లు జరిపిన మారథాన్ చర్చల ద్వారా సైనిక పక్షం తాను చేయగలిగినదంతా చేసింది."[52] ఆగస్టు 27 న, భారత మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్ శరణ్ మాట్లాడుతూ, "భారతదేశం ఓపికపట్టాల్సిన అవసరం ఉంది [...] 1987 లో సుమ్దొరాంగ్ చు సమస్యను పరిష్కరించడానికి ఏడు సంవత్సరాలు పట్టింది" అని అంటూ, అతడు "సంతృప్తికరమైన ఫలితం సాధించేందుకు భారత్ సుదీర్ఘమైన వ్యవహారానికి సిద్ధపడాలి" అని అన్నాడు.[258]
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశం సందర్భంగా సెప్టెంబరు 4 న మాస్కోలో చైనాకు చెందిన జనరల్ వీ ఫెంగ్, అతని భారత ఉజ్జీ రాజ్ నాథ్ సింగ్లు ప్రసంగించారు[56] సెప్టెంబరు 10 న చైనా, భారత విదేశాంగ మంత్రులు మాస్కోలో సమావేశమయ్యారు. సంయుక్త ప్రకటనలో ఇరుదేశాల మధ్య విశ్వసాన్ని పాదుకొల్పే చర్యలపై కొత్త ప్రతిపాదనలతో సహా ఐదు అంశాలను పరస్పరం అంగీకరించారు.[259] సెప్టెంబరు 21 న, ఆరవ కమాండరు-స్థాయి సమావేశం చుషుల్-మోల్డో బిపిఎం వద్ద జరిగింది.[260] భారత ప్రతినిధి బృందంలో లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ పిజికె మీనన్, ఇద్దరు మేజర్ జనరళ్ళు, నలుగురు బ్రిగేడియర్లు, ఇతర అధికారులూ ఉన్నారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుల చీఫ్ కూడా ప్రతినిధి బృందంలో ఉన్నారు.[261] ఈ సమావేశంలో, మొదటిసారి, భారత పక్షం నుండి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కూడా హాజరయ్యారు.[262] గంటల చర్చల తరువాత, ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసారు. ఇందులో "ఫ్రంట్లైన్కు ఎక్కువ మంది సైనికులను పంపడం ఆపడానికి" ఇరు పక్షాలు అంగీకరించాయి.[263][264] సెప్టెంబరు 30 న, ఐదవ విడత దౌత్య చర్చలు జరిగాయి; ఇది WMCC యొక్క 19 వ సమావేశం.[265] అక్టోబరు 13 న, చుషుల్లో ఏడవ విడత మిలటరీ కమాండర్ల చర్చలు జరిగాయి; చర్చలు సానుకూలంగా జరిగాయని చెప్పినప్పటికీ, క్షేత్ర స్థాయిలో సమస్యలు, ఉద్రిక్తతలూ అలానే ఉన్నాయి.[57] అక్టోబరు 15 న, జైశంకర్ మాట్లాడుతూ, భారత చైనాల మధ్య ప్రతిష్టంభనను పరిష్కరించడానికి జరుగుతున్న చర్చలు "గోప్యమైనవ"ని, వాట్ని ముందే "తేల్చెయ్యకూడద"నీ అన్నాడు.[266]
మంత్రిత్వ శాఖ స్థాయి చర్చల అనంతరం ఇరుపక్షాలు పాక్షికంగా విరమించిన తరువాత, అనేక మంది భారత రక్షణ విశ్లేషకులు ఈ ఒప్పందం 2020 ఏప్రిల్ వరకూ ఉన్న ఘర్షణ-పూర్వ స్థితికి వెళ్ళలేదని చెప్పారు. భౌగోళిక రాజకీయ నిపుణుడైన బ్రహ్మ చెల్లానీ హిందూస్తాన్ టైమ్స్ లో రాసిన తన వ్యాసంలో "భారతదేశం కోరుకుంటునట్లు ఘర్షణ-పూర్వ స్థితికి తిరిగి వెళ్ళే అవకాశం బాగా తక్కువగా ఉన్నట్లు తోస్తోంది" అని పేర్కొన్నాడు. 'పరస్పర పుల్బ్యాక్ ఒప్పందం' కారణంగా భారత్, మరింత భూభాగాన్ని నష్టపోతుందని బిజినెస్ స్టాండర్డ్ రాసింది. భారత దళాలు చారిత్రికంగా పిపి 14 (గాల్వన్ క్లాష్ సైట్), పిపి 15, పిపి 17, పిపి 17 ఎ ప్రాంతాల వరకు గస్తీ తిరుగుతున్నాయని పేర్కొంటూ, చైనా దళాలు భారత గస్తీ తిరిగే ప్రాంతాల్లోకి ఇప్పటికే 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం చొరబడి ఉన్నాయి. దీంతో ఇప్పుడు ప్రతిపాదించిన 4 కిలోమీటర్ల 'బఫర్ జోన్' పూర్తిగా భారత భూభాగంలోనే ఉంటుంది. PP14 కి ఆవల ఉన్న ప్రాంతాలు ఇప్పుటికే సరిహద్దులు దాటేసినట్లు కూడా దీనికి అర్థం. "10 మైళ్ళు చొరబడు, 6 మైళ్ళు వెనక్కెళ్ళు" అనే చైనా వ్యూహం ఫలితంగా చైనాకు ప్రాదేశిక లాభాలు వస్తాయని కూడా చెల్లానీ రాశాడు. అంతేకాకుండా, డెప్సాంగ్ మైదానంలోని బాటిల్నెక్ లేదా 'వై' జంక్షన్ నుండి, పాంగోంగ్ త్సో లోని ఫింగర్ 4 నుండి చైనా వినక్కెళ్ళడానికి విముఖత చూపించిందని, ఇక్కడ చైనీయులు భారతీయ భూభాగం లోపల 8 కిలోమీటర్ల దూరం దాకా చొరబడి సైనిక స్థావరాలను కూడా నిర్మించారనీ, యథాపూర్వ స్థితికి వెళ్ళేందుకు ఇదొక అడ్డంకి అనీ భారతీయ వర్గాలు అన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.