తూర్పాసియా లోని ద్వీపకల్ప దేశము From Wikipedia, the free encyclopedia
జపాన్ ( జపాన్ భాషలో నిప్పన్ లేదా నిహన్ 日本国 నిప్పన్-కోక్ (help·info))అనేది తూర్పు ఆసియా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది చైనా, కొరియా, రష్యా దేశాలకు తూర్పు దిశగా ఉంది. జపాన్ దేశపు ఉత్తరాన ఉన్న సముద్ర భాగాన్ని ఓఖోట్స్క్ సముద్రం అని, దక్షిణాన్న ఉన్న సముద్ర భాగాన్ని తూర్పు చైనా సముద్రం అనీ అంటారు. జపాన్ భాషలో ఆ దేశం పేరు (నిప్పన్)ను వ్రాసే అక్షరాలు "సూర్యుని పుట్టుక"ను సూచిస్తాయి. కనుక జపాన్ను "సూర్యుడు ఉదయించే దేశం" అని అంటుంటారు.
日本国 Nippon-koku / Nihon-koku జపాన్ |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | టోక్యో1 35°41′N 139°46′E | |||||
అధికార భాషలు | జపనీస్ భాష | |||||
ప్రభుత్వం | రాజ్యాంగ బద్ధ రాజరికము | |||||
- | రాజు | Naruhito | ||||
- | ప్రధాన మంత్రి | నవోతో కాన్, డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్) | ||||
జపాన్ చరిత్ర | ||||||
- | జాతియ ఏర్పాటు దినము | ఫిబ్రవరి 11, 660 క్రీ.పూ.3 | ||||
- | మైజీ రాజ్యాంగము | నవంబరు 29 1890 | ||||
- | జపానీస్ రాజ్యాంగము | మే 3 1947 | ||||
- | శాన్ఫ్రాన్సిస్కో ఒప్పందము | ఏప్రిల్ 28 1952 |
||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 377,873 కి.మీ² (62వది) చ.మై |
||||
- | జలాలు (%) | 0.8 | ||||
జనాభా | ||||||
- | 2007 అంచనా | 127,433,494 (10th) | ||||
- | 2004 జన గణన | 127,333,002 | ||||
- | జన సాంద్రత | 337 /కి.మీ² (30th) /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $4.220 trillion2 (3rd) | ||||
- | తలసరి | $33,1002 (12th) | ||||
జీడీపీ (nominal) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $4.911 trillion2 (2nd) | ||||
- | తలసరి | $38,341 (14th) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.949 (high) (7th) | |||||
కరెన్సీ | జపనీస్ యెన్ (అంతర్జాతియ ¥ జపనీస్ 円 En) (JPY ) |
|||||
కాలాంశం | జపాన్ ప్రామాణిక సమయము (JST) (UTC+9) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .jp | |||||
కాలింగ్ కోడ్ | +జపనీస్ టెలీఫోను నంబరింగు | |||||
1 | యొకోమా అన్నింటికంటె పెద్ద incorporated నగరం. | |||||
2 | "World Factbook; Japan—Economy". CIA. 2006-12-19. Archived from the original on 2018-12-26. Retrieved 2006-12-28. | |||||
3 | చరిత్రను అనుసరించి జిమ్ము రాజు జపానును ఈ రోజు ఏర్పాటు చేసెను, ప్రస్తుతము దీనిని కేవలము సింబాలిక్కుగా మాత్రమే చూస్తున్నారు. |
జపాన్ దేశంలో సుమారు 3,000 పైగా దీవులు[1] ఉన్నందున ఇది నిజానికి ఒక ద్వీపకల్పం. ఈ దీవులలో పెద్దవైన నాలుగు దీవులు హోన్షూ, హొక్కయిడో, క్యూషూ , షికోకూ కలిపి మొత్తం దేశం భూభాగంలో 97% వైశాల్యం కలిగి ఉన్నాయి. ఎక్కువ దీవులు పర్వత మయాలు లేదా అగ్ని పర్వత భాగాలు. జపాన్లోని అత్యంత ఎత్తైన ఫ్యూజీ పర్వతం కూడా ఒక అగ్నిపర్వతమే.
128 మిలియన్ల జనాభా కలిగిన జపాన్ ప్రపంచంలో జనాభా ప్రకారం పదవ స్థానంలో ఉంది. టోక్యో దాని పరిసర ప్రాంతాలు కలిపితే 30 మిలియన్ల జనాభాతో ప్రపంచంలో అతిపెద్ద మెట్రొపాలిటన్ స్థలం అవుతుంది.
ఆర్ధికంగా జపాన్ ప్రపంచంలో చాలా ప్రముఖ స్థానం కలిగి ఉంది.[2] ప్రపంచంలో ఇది నామినల్ జి.డి.పి. క్రమంలో రెండవ పెద్ద దేశం. అభివృద్ధి చెందిన దేశాల సమాఖ్యలలో (G8, G4, OECD, APEC) సభ్యత్వం కలిగి ఉంది. ఇంకా ఇది ప్రపంచంలో నాలుగవ పెద్ద ఎగుమతిదారు, ఆరవ పెద్ద దిగుమతిదారు. సాంకేతిక, మెషినరీ రంగాలలో అగ్రగామి.
"జపాన్" అనే పదం ఆంగ్లంలోనూ, ఇతర భాషలలోనూ విస్తృతంగా వాడబడుతున్నది కాని జపాన్ భాషలో ఈ పదం లేదు. దీనికి జపాన్ భాషలో "నిప్ఫోన్" లేదా "నిహొన్" అనే పదాలు సరైనవి. అధికారిక వినియోగంలో "నిప్ఫోన్" అనే పదాన్ని వాడుతారు. వాడుక భాషలో "నిహన్" అంటుంటారు. రెండు పదాలకూ అర్ధం "సూర్యుడి మొదలు" లేదా "సూర్యుడు ఉదయించే స్థలం". చైనాకు తూర్పున ఉన్నందున చైనా వారి అధికారిక పత్రాలలో ఈ పదం వాడకం మొదలయ్యింది. అంతకు ముందు, అనగా చైనాతో సంబంధాలు పెరగక ముందు, జపాన్ దేశాన్ని "యమాటో" (Yamato, Hi no moto) అనేవారు. అంటే కూడా అర్ధం "సూర్యుడు ఉద్భవించేది" అనే.[3]
అంతర్జాతీయ వర్తకాలు పెరిగిన సమయంలో "జపాన్" అనే పేరు మొదలయినట్లుంది. మార్కోపోలో మొదటిసారిగా Cipangu అని ఈ దేశం పేరును చైనా భాషలో వ్రాశాడు. చైనాలోని వివిధ యాసల ప్రకారం జిప్పెన్, నిపెన్, జెపాంగ్, జెపున్ వంటి వివిధ పేర్లున్నాయి. చైనా భాషనుండి మలయా (ఇండొనీషియా) భాషలోకి, అక్కడినుండి పోర్చుగీసు వారి ద్వారా 16వ శతాబ్దంలో ఐరోపాకు "జపాన్" అనే మాట పరిచయమయ్యింది. 1577లో మొదటిసారి ఆంగ్లంలో దీన్ని Giapan అని వ్రాశారు.
జపాన్ ద్వీపసముదాయంలో జనావాసాపు చిహ్నాలు క్రీస్తు పూర్వం 30వ సహస్రాబ్దినాటికే పేలియోలితిక్ సంస్కృతిగా కనిపిస్తాయి. వీటి తరువాత క్రీస్తు పూర్వం పదవ సహస్రాబ్దికి మీసోలితిక్, నియోలితిక్ వేటాడి జీవించే సగం సంచార వాసులు బొరియలలో నివసించే సంస్కృతికి చెందిన వారు నివసించారు. ప్రాథమిక స్థాయి వ్యవసాయం చేసిన ఆనవాళ్ళు కన్పిస్తాయి. ఈ కాలములో దొరికిన అలంకరణలతో కూడిన మట్టి పాత్రలు ప్రపంచంలో ప్రస్తుతము మిగిలిన మట్టి పాత్రలలో పురాతనమైనవాటిలో వానిగా గుర్తింపు పొందినాయి.
అతి పురాతనమైన మట్టి పాత్రలు జపాన్ దేశము నుండే మనకు లభిస్తున్నాయి, ఇవి క్రీస్తు పూర్వం పదివేల ఐదువందల కాలానికి చెందినవి. ఆ తరువాత దొరికిన పాత్రల్లో పురాతనమైనవి చైనా, భారత దేశముల నుండి లభిస్తున్నాయి.[4][5][6] మంచు యుగం ముగిసిన తరువాత జపాన్ చరిత్రలో రెండు ప్రధాన ఘట్టాలు సంభవించినాయి, వాటిలో మొదటిది మట్టి పాత్రల తయారీ! ఇది పురాతత్వ శాస్త్రవేత్తలకు బహు ఆశ్చర్యం కలిగించినది, ఎందుకంటే సాధారణంగా ఏవైనా కొత్త విషయాలు పెద్ద పెద్ద భూభాగమున్న ప్రాంతాలలో కనుగొనబడి తరువాత చిన్న చిన్న ద్వీప సముదాయాలకు వ్యాపిస్తాయి, కానీ జపాన్ చిన్న ద్వీప సముదాయము అయినా కానీ మట్టి పాత్రలను ముందే కనుగొన్నది. ఇక్కడి మట్టి పాత్రలు సుమారుగా పన్నెండు వేల ఏడువందల సంవత్సరాల క్రితానివి.[7]
క్రీ.పూ. 3వ శతాబ్దంలో యాయోయ్ కాలంలో వరి సాగు, ఇనుము, ఇత్తడి తయారీ, క్రొత్త రకం పాత్రల తయారీ మొదలయ్యాయి. వీటిలో కొన్ని విధానాలు చైనా, కొరియాలనుండి వలసి వచ్చినవారు ప్రవేశపెట్టారు. మొత్తానికి ఈ కాలంలో జపాన్ ఒక వ్యవసాయ ప్రాముఖ్యత కలిగిన సమాజంగా పరిణమించింది.[8][9][10][11]
చైనాకు చెందిన హాన్ పుస్తకంలో మొట్టమొదటిగా జపాన్ యొక్క మూడు రాజ్యాల గురించి వ్రాయబడింది. బౌద్ధ మతం జపాన్లోకి కొరియా ప్రాంతంనుండి ప్రవేశించింది. కాని తరువాత జపాన్లో బౌద్ధం వ్యాప్తిపైన, బౌద్ధ శిల్ప రీతుల పైన చైనా ప్రభావం అధికంగా ఉంది.[12] అసూక కాలం తరువాత పాలక వర్గంనుండి బౌద్ధానికి విశేషంగా ఆదరణ లభింపసాగింది.[13]
8వ శతాబ్దంలో "నారా కాలం"లో జపాన్ దేశం కేంద్రీకృతమైన పాలనతో ఒక రాజ్యంగా రూపొందింది. అప్పుడు హేజో-క్యో అనే రాజనగరు (ప్రస్తుతం నారా) అధికార కేంద్రంగా వర్ధిల్లింది. దానికి తోడు చైనా సంస్కృతి, పాలనా విధానాల ప్రభావంతో లిఖిత సాహిత్యం ఆవిర్భవించింది. పురాతన గాధలను, మౌఖిక సాహిత్యాన్ని గ్రంధస్తం చేస్తూ కోజికి (712), నిహొన్ షోకి (720) అనే సంకలనాలు కూర్చబడ్డాయి.[14] అంతకు ముందు యమాటో రాజుల అసూక కాలంలో ఫ్యుజివరా-క్యో ఆ దేశపు (యమాటో రాజ్యపు) రాజధానిగా ఉండేది.
784లో కమ్ము చక్రవర్తి రాజధానిని నారా నుండి నగోకా-క్యోకు, తరువాత 794లో హెయాన్-క్యోకు (ప్రస్తుతపు క్యోటో వగరం) మార్చాడు. తరువాత 1000 సంవత్సరాలపైగా క్యోటోనే దేశపు రాజధానిగా ఉంది.[15] "హెయాన్ కాలం" అనబడే ఈ కాలంలోనే జపాన్ దేశం విలక్షణమైన సంస్కృతిని సంతరించుకొన్నది. జపాను చిత్రకళ, జపాను సంగీతం, జపాను సాహిత్యం అభివృద్ధి చెందాయి. జపాను జాతీయ గీతం ఈ కాలంలోనే వ్రాయబడింది.[16]
పోరాట ప్రధానమైన సంస్కృతి కలిగిన "సమూరాయ్" అనే పాలక వర్గం వృద్ధి చెందినపుడు జపాను సమాజం ఫ్యూడల్ సమాజంగా పరిణమించింది. 1185లో వివిధ వర్గాల మధ్య జరిగిన తగవులు, షోగన్ వ్యవస్థ ఈ పరిణామానికి అంకురార్పణ జరిగింది. "కకమురా" కాలంలో (1185–1333) చైనానుండి జపానులోకి జెన్ బౌద్ధం ప్రవేశించింది. 1274-1281 సమయంలో కకమురా షోగన్ ప్రతినిధులు మంగోలు దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఈ సమయంలో సంభవించిన ఒక తుఫాను జపాను వారికి అనుకూలమయ్యింది. దీనిని జపనీయులు కమికాజి లేదా దివ్యమైన తుఫాను అంటారు. తరువాత అనేక అంతఃకలహాలు జరిగాయి. 1467లో చెలరేగిన అంతర్యుద్ధం ఫలితంగా సెంగోకు పాలన ఆరంభమయ్యింది.[17]
16వ శతాబ్దంలో క్రైస్తవ మిషనరీలు, పోర్చగీసు వర్తకులు మొట్టమొదటిసారిగా జపాను భూభాగంపై అడుగు పెట్టారు. అప్పటినుండి జపాన్ - పాశ్చాత్య దేశాల మధ్య వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలు పురోగమించాయి. తరువాత పాశ్చాత్యులనుండి వచ్చిన ఆయుధ సామగ్రి జపాన్ అంతర్యుద్ధాలలో విరివిగా వాడబడింది. 1590 ప్రాంతంలో "టొయొటోమి హిదెయోషి" నాయకత్వంలో దేశం మళ్ళీ ఒకటయ్యింది. 1592 - 1598 కాలంలో రెండుమార్లు జపాన్ కొరియాపై దండెత్తింది. కాని కొరియా సేనలు, చైనా మింగ్ రాజుల సేనల చేతిలో పరాజయం పాలయ్యింది.[18]
తరువాత 1600 వరకు మళ్ళీ అంతర్యుద్ధాలు కొనసాగాయి. 1639లో జపాన్ షోగన్ నాయకత్వం సకోకు ("closed country") లేదా "ఏకాంత విధానం" అని ప్రసిద్ధమైన విధానాన్ని అనుసరించింది. సుమారు రెండున్నర శతాబ్దాల కాలం కొనసాగిన ఈ సమయంలో జపాను బయటి ప్రపంచం నుండి సంబంధాలు దాదాపు పూర్తిగా తెంచుకొని ఏకాకిగా ఉంది. ఈ సమయాన్ని ఎడో కాలం అని కూడా అంటారు. ఈ కాలంలో జపాను అధ్యయనాన్ని జపానువారే కొనసాగించారు. ఈ ప్రక్రియను కోకుగాకు లేదా "జాతీయ అధ్యయనం" అంటారు. అయితే నెదర్లాండ్స్ అధీనంలో ఉన్న "డెజిమా" (నాగసాకి లోనిది) సంబంధాల ద్వారా పాశ్చాత్య విజ్ఞానాన్ని మాత్రం అధ్యయనం చేయడం కొనసాగించారు.[19]
1854 మార్చి 31న, అమెరికా సైనికాధికారి కమొడోర్ మాత్యూ పెర్రీ నాయకత్వంలో అమెరికాకు చెందిన "నల్ల ఓడలు" బలవంతంగా జపాన్ ఏకాంతాన్ని విచ్ఛిన్నం చేశారు. తరువాత జరిగిన వివిధ ఒప్పందాలు, ఘటనలు, యుద్ధాల కారణంగా జపాన్ దేశంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. పాశ్చాత్య పరిపాలన, ప్రజా ప్రాతినిధ్య విధానం అమలై రాజరికం నామమాత్రమయ్యింది. ఇలా జరిగిన పరిణామాలను మెయిజీ పునరుద్ధరణ అంటారు. ఆ తరువాత జపాన్ ఒక పారిశ్రామిక శక్తిగా రూపుదిద్దుకొంది. తన ప్రాబల్యాన్ని మరింత విస్తృత పరచేందుకు యుద్ధాలు చేసింది. 1894-1895 కాలంలో మొదటి చైనా - జపాను యుద్ధము, 1904-1905 లో రష్యా - జపాన్ యుద్ధము జరిగాయి. తైవాన్, కొరియా, దక్షిణ సఖలిన్ జపాన్ అధీనంలోకి వచ్చాయి.[20]
20వ శతాబ్దం ఆరంభంలో జపాన్ మరింత బలపడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జపాన్ మిత్ర పక్షాల తరఫున ఉండి విజయంలో భాగం పంచుకొంది. తరువాత తన అధికారాన్ని విస్తరిస్తూ 1931లో మంచూరియాను ఆక్రమించింది. దీనిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అందుకు నిరసనగా జపాన్ నానాజాతి సమితి నుండి బయటకు వచ్చింది. 1936లో నాజీ జర్మనీతో కమ్యూనిస్టు వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకొంది. 1941లో అక్ష రాజ్యాల కూటమిలో చేరి జర్మనీ, ఇటలీలకు తోడుగా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంది.[21]
1937లో జపాన్ మళ్ళీ చైనాపై దండెత్తింది. 1937-1945 కాలంలో రెండవ చైనా - జపాన్ యుద్ధం జరిగింది. అమెరికా అందుకు వ్యతిరేకంగా జపాన్పై చమురు నిషేధం (oil embargo) విధించింది.[22] డిసెంబరు 7, 1941న జపాన్ అమెరికా యొక్క పెరల్ హార్బర్ నౌకా స్థావరంపై దాడి చేసింది. అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్పై యుద్ధం ప్రకటించింది. దీంతో అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో భాగస్వామి అయ్యింది. 1945లో హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు ప్రయోగం , సోవియట్ యూనియన్ ఆగస్టు యుద్ధం తరువాత జపాను ఓటమిని అంగీకరించి ఆగస్టు 15న లొంగిపోయింది.[23]
యుద్ధం కారణంగా జపాన్లో అపారమైన ప్రాణ నష్టం జరిగింది. పరిశ్రమలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయి. యుద్ధకాలంలోని నాన్కింగ్ ఊచకోత వంటి అనేక నేరాల అభియోగాలు జపాన్పై మోపబడ్డాయి.[24] 1947లో జపాన్ క్రొత్త శాంతియుత రాజ్యాంగాన్ని అమోదించింది. ఈ రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్యం అమలయ్యింది. 1952లో శాన్ ఫ్రాన్సిస్కో ఒడంబడిక ప్రకారం జపాన్లో మిత్ర పక్షాల అధికారం తొలగించబడింది.[25] 1956లో జపాన్కు ఐక్య రాజ్య సమితి సభ్యత్వం లభించింది.
తరువాత మళ్ళీ జపాన్ ఆర్థిక వ్యవస్థ ఒక అద్భుతంలాగా పుంజుకొంది. అది ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. 1990 దశకం మధ్యలో ఆర్థిక మాంద్యం నెలకొని జపాన్ ఆర్థిక వ్యవస్థను కొంత వరకు దెబ్బ తీసింది. 2000 తరువాత మళ్ళీ కొంత అభివృద్ధి కనుపిస్తున్నది.[26]
జపాన్ ఒక రాజ్యాంగబద్ధ రాజరికం. రాజు లేదా చక్రవర్తి కేవలం జాతికి, దేశానికి, జాతి సమైక్యతకు చిహ్నంగా మాత్రమే ఉంటాడు. నిజమైన అధికారం ప్రధానమంత్రి చేతుల్లోను, ఎన్నుకొనబడిన ప్రతినిధుల (డయట్) చేతిలోను ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం నిజమైన సార్వభౌమత్వం ప్రజలదే.[27] ప్రస్తుత చక్రవర్తి పేరు అకిహిటో. అతని తరువాత నరుహిటోకు వారసత్వంగా చక్రవర్తి పదవి లభిస్తుంది.
జపాన్ పార్లమెంటు అయిన డయట్లో రెండు సభలున్నాయి. ఇందులో ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలలో ఎన్నుకొనబడే 480 మంది ప్రజాప్రతినిధుల సభ ప్రతినిధుల సభ. మరొక సభలో 242 మంది కౌన్సిలర్లు ఉంటారు. పదవీ కాలం 6 సంవత్సరాలు. జపాన్లో 20 సంవత్సరాలు దాటిన వారందరికీ వోటు హక్కు ఉంది.[2][27] 1955నుండి "లిబరల్ కన్సరవేటివ్ పార్టీ" అధికారంలో ఉంది. కేవలం 1993లో మాత్రం సంకీర్ణ ప్రభుత్వం పనిచేసింది.[28] జపాన్లో "డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ జపాన్" అనే లిబరల్ పార్టీ ముఖ్యమైన ప్రతిపక్షం.
ప్రభుత్వం నాయకుడైన ప్రధానమంత్రిని చక్రవర్తి నియమిస్తాడు. ఇతను ఎన్నుకొనబడిన ప్రజాప్రతినిధుల సభ విశ్వాసం కలిగి ఉండాలి. కేబినెట్ మంత్రులను ప్రధానమంత్రి నియమిస్తాడు. ప్రస్తుతం జపాన్ ప్రధాన మంత్రి యాసువో ఫుకుడా.[29]
జపాన్ చట్ట వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పాలవా విధానంలో స్థానిక సంప్రదాయాలతో పాటు చైనా ప్రభావం కూడా ఉంది. కాని పాశ్చాత్య దేశాల న్యాయ, పాలనా వ్యవస్థలు ప్రస్తుత జపాన్ రాజ్యాంగానికి ముఖ్యమైన దిశానిర్దేశం చేశాయి.[30] జపాన్ న్యాయ వ్యవస్థలో సుప్రీమ్ కోర్టు, మరి మూడు అంచెల కోర్టులు ఉన్నాయి.[31] జపాన్ న్యాయ చట్టంలోని ముఖ్యాంశాలను ఆరు చట్టాలు అంటారు.[30]
జపాన్ అమెరికాతో మంచి ఆర్థిక , మిలిటరీ సంబంధాలు కలిగిఉంది. జపాన్-అమెరికా రక్షణ సంబంధాలు జపాన్ విదేశాంగ విధానంలో ముఖ్యమైన భాగం.[32]
1956 నుండి జపాన్ ఐక్య రాజ్య సమితి సభ్య దేశం. ఐ.రా.స. భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం కోసం జపాన్, మరో మూడు దేశాలతో కలిపి, (G4 దేశాలు అనబడుతున్నాయి) ప్రయత్నిస్తున్నాయి[33] G8, APEC లేదా ఆసియా - పసిఫిక్ ఆర్థిక సహకార మండలి, "ASEAN ప్లస్ మూడు" వంటి పలు ప్రముఖ సమాఖ్యలలో జపాన్ సభ్యత్వం కలిగి ఉంది. ప్రపంచంలో అభివృద్ధికి అధికారిక సహాయం అందించే రెండవ పెద్ద దేశం కూడాను. 2004లో 8.86 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయం అందజేసింది.[34]
జపాన్కు పొరుగు దేశాలైన రష్యా (దక్షిణ కురిల్ దీవుల వివాదం), దక్షిణ కొరియా (లియాన్ కోర్ట్ రాక్స్), చైనా , తైవాన్ (సెంకాకు దీవులు, ఒకినోటోరిషిమా) లతో భూభాగ వివాదాలున్నాయి.
జపాన్ రాజ్యాంగంలో 9వ ప్రకరణం ప్రకారం ఆ దేశం అంతర్జాతీయ వివాదాలలో విదేశాలపై యుద్ధాన్ని ప్రకటించే హక్కును పరిత్యజించింది. కనుక జపాన్ మిలిటరీ అంతా రక్షణ మంత్రిత్వం అధ్వర్యంలో స్వీయ రక్షణా సైన్యంగా నడుస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపాన్ సేనలు విదేశీ భూభాగంపై మొట్టమొదటిసారిగా ఇరాక్ యుద్ధంలో "యుద్ధం చేయని బృందాలు"గా అడుగుపెట్టాయి కాని తరువాత ఆ సేనలను కూడా జపాన్ ప్రభుత్వం ఉపసంహరించుకొంది.
సాధారణంగా జపాన్ను 8 ప్రాంతాలుగా వర్ణిస్తారు. కాని పాలనా పరంగా 47 జిల్లాలు(prefectures)గా విభజింపబడింది. ఒకో జిల్లాకు ఎన్నికైన గవర్నర్, చట్ట సభ, పాలనాధికార వ్యవస్థ ఉన్నాయి. ఈ వ్యవస్థ ప్రస్తుతం పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నది.[35]
జపాన్లో పెక్కు పెద్ద నగరాలున్నాయి. జపాన్ సంస్కృతి, ఆర్ధిక వ్యవస్థ, సామాజిక స్థితిలో ఈ నగరాలు చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నాయి.
పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న జపాన్ దేశంలో మూడువేలపైగా దీవులు ఉత్ర దక్షిణాలుగా విస్తరించి ఉన్నాయి. వీటిలో హొక్కయయిడో, హోన్షూ, షికోకు, క్యూషూ అనేవి పెద్ద దీవులు.ర్యుకూకు, ఒకినావా దీవులు క్యూషూ దీవికి దక్షిణాన ఉన్న చిన్న దీవిల సముదాయం. అన్నీ కలిపి "జపాన్ ద్వీప కల్పం" (Japanese Archipelago) అంటారు. దేశంలో 70% నుడి 80% వరకు అరణ్యాలు, పర్వతాలతో నిండి ఉంది.[36][37] ఈ భాగం నివాసానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు అనుకూలం కాదు. ఎందుకంటే అక్కడ చాలా వాలు ప్రదేశం కాని, అగ్నిపర్వతాల అంచులు గాని, చరియలు విరిగిపడే అవకాశం కాని, లేదా అధిక వర్షపాతం లేదా బురదనేల ఉండవచ్చును. కనుక మిగిలిన ప్రాంతాలలో, అధికంగా తీర ప్రాంతంలో, జనసాంద్రత చాలా ఎక్కువ. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశాలలో జపాన్ ఒకటి.[38]
పసిఫిక్ అగ్ని వలయం అనబడే ప్రాంతంలో మూడు tectonic plates కలిసే చోట ఉన్నందున జపాన్లో భూకంపాలు, అగ్నిపర్వతాలు, సునామీలు తరచు సంభవిస్తుంటాయి.[39]
భౌగోళికంగా జపాన్లో ఆరు ముఖ్య పర్యావరణ ప్రాంతాలు ఉన్నాయి
జపాన్లో ఇంతవరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత — 40.9 డిగ్రీలు సెల్సియస్ - ఆగస్టు 16, 2007.[40] తూర్పు ఆసియా వర్షాకాలంతో మే నెలలో ఒకినావాలో వర్షాలు మొదలవుతాయి. క్రమంగా ఈ వర్షాలు ఉత్తరానికి విస్తరిస్తాయి. హొక్కయిడో ప్రాంతలో జూలై నెలలో వర్షాలు పడతాయి. హోన్షూ ప్రాంతంలో జూన్ నెలలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. వేసవి చివరికాలంలో టైఫూనులు అధికంగా సంభవిస్తాయి. జపాన్లో 9 రకాలైన వివిధ వృక్షజాతుల వనాలున్నాయి.[41]
జపాన్ దేశం ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుంది. ముమ్మరమైన పారిశ్రామికీకరణ కారణంగా తీవ్రమైన పర్యావరణ కాలుష్య సమస్యలు ఉత్పన్నం కావడం ఇందుకు ఒక ముఖ్య కారణం. ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా అనేక చట్టాలు చేసింది.[42] క్యోటో ఒడంబడిక భాగస్వామిగా జపాన్ ప్రపంచ పర్యావరణ రక్షణకు, గ్లోబల్ వార్మింగ్ నివారణకు కృషి చేస్తున్నది. కార్బన్ డయాక్సైడ్ విడుదలను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నది.
జపాన్ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖంగా కానవచ్చే అంశాలు - తక్కువ రేంజి పన్నులు,[43] అధికంగా ప్రైవేటు రంగంలో కార్య కలాపాలు,[43] ఎక్కువ ఆర్థిక స్వాతంత్ర్యం, అభివృద్ధిలో ప్రభుత్వం-పరిశ్రమల మధ్య సహకారం, సైన్సు, టెక్నాలజీలపై ప్రత్యేక శ్రద్ధ, పని నిర్వహణ పట్ల ప్రబలమైన బాధ్యతాయుత ప్రవర్తన. అయితే ఫైనాన్స్ రంగంలో ఉత్పాదన కంటే సంబంధాల పట్ల ఉన్న ప్రాముఖ్యత, స్థానిక మార్కెట్లో పెద్దగా అంతర్జాతీయ పోటీ లేకపోవడం వల్ల 1990 దశకం అవకాశాలు కోల్పోయిన దశకం (lost decade) గా అయ్యిందని అంటారు.[43][44] 2000 సంవత్సరం తరువాత మొదలైన సంస్కరణల ఫలితంగా 2005 తరువాత మళ్ళీ ఆర్థిక రంగం పుంజుకొన్నది. నామినల్ జి.డి.పి. ప్రకారం జపాన్ ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ.
బ్యాంకింగ్, ఇన్షూరెన్సు, రియల్ ఎస్టేట్, రెటెయిల్ వాణిజ్యం, రవాణా, టెలికమ్యూనికేషన్స్ - ఇవన్నీ జపాన్లో ప్రముఖ వ్యాపారాలు లేదా పరిశ్రమలు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మోటారు వాహనాలు, యంత్ర భాగాలు, ఉక్కు, లోహాలు, ఓడలు, రసాయనాలు, వస్త్రాలు, ఆహార పదార్ధాలు వీటన్నింటిలోనూ జపాన్ పరిశ్రమలు అంతర్జాతీయంగా అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్నాయి. నిర్మాణ రంగం జపాన్లో ఎప్పుడూ చాలా ప్రముఖమైన స్థానం కలిగి ఉంది. ఇందుకు పెద్ద పెద్ద ప్రభుత్వ కంట్రాక్టులు ప్రోద్బలాన్ని అందించాయి. సరకుల తయారీ దారులు, ముడి సరకుల సప్లై చేసేవారు, పంపిణీదారులు, బ్యాంకులు - వీరందరి మధ్య బలమైన సహకారం జపాన్ ఉత్పాదక రంగంలో చాలా ముఖ్యమైన అంశం. వారు ఒక సంఘటితమైన బృందంగా పని చేస్తారు. ఇలాంటి బృందాలను అక్కడ కేరిత్సూ అంటారు. పెద్ద పెద్ద కంపెనీలు చాలావరకు తమ ఉద్యోగులకు జీవితకాలం పని హామీ ఇస్తాయి.[45] ఇటీవలి కాలంలో జపాన్ కంపెనీలు ఈ విధమైన విధానాలను వదలి "లాభసాటి" విధానాలవైపు మళ్ళుతున్నాయి.[46] ప్రపంచంలో కొన్ని అతిపెద్ద ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీలు, బిజినెస్ గ్రూపులు జపాన్లో ఉన్నాయి. - సోనీ, సుమిటోమో, మిత్సుబిషి, టొయోటా వంటివి ప్రపంచ ప్రఖ్యాతమైన బ్రాండ్ పేర్లు. జపాన్ పోస్ట్ బ్యాంకు అస్సెట్ల ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకు.
1960 నుండి 1980 వరకు రికార్డయిన ప్రగతిని ఒక జపాన్ అద్భుతంగా అభివర్ణిస్తారు. ఈ మూడు దశకాలలోను 10%, 5%, 4% క్రమంగా అభివృద్ధి నమోదయ్యింది.[47] తరువాత ప్రగతి కొంత మందగించింది. 1990 దశకంలో జరిగిన అధిక స్పెక్యులేటివ్ పెట్టుబడుల కారణంగా స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేటు వ్యాపారాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలు పని చేయలేదు. 2005 తరువాత ఆర్థిక వ్యవస్థ కొంత పుంజుకొంది. 2005లో 2.5% అభివృద్ధి నమోదయ్యింది.
జపాన్ భూభాగంలో 15% మాత్రమే వ్యవసాయ యోగ్యమైనది.[48] చిన్న చిన్న పొలాలను కూడా terrace farming విధానంలో సాగు చేస్తారు. ఎకరాకు జపాన్ వ్యవసాయోత్పాదకత ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఉత్పాదకతల స్థానంలో ఉంటుంది. అయితే వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీలు, ఇతర రక్షణ విధానాలు ఆర్థిక రంగంపై గణనీయమైన భారం మోపుతున్నాయి. తన అవసరాలలో 50% వరకు ధాన్యాలను, మాంసాన్ని జపాన్ దిగుమతి చేసుకొంటుంది.[49] జపాన్ చేపలు పట్టే పరిశ్రమ ప్రపంచంలో చైనా తరువాత రెండవ స్థానంలో ఉంది. ప్రపంచంలో వాణిజ్యపరంగా పట్టే చేపలలో 15% వరకు జపనీయుల చేతిలోనే పడతాయి. దాదాపు తన పూర్తి చమురు అవసరాలను జపాన్ దిగుమతి చేసుకొంటుంది. జపాన్లో పన్నులు పాశ్చాత్య దేశాలతో పోలిస్తే బాగా తక్కువ. జి.డి.పి.లో పన్నుల శాతం 2007లో 26.4% ఉంది. ఉద్యోగులలో సగం లోపే ఆదాయపు పన్ను కడతారు. వాట్ పన్ను కేవలం 5% ఉంది. కార్పొరేట్ టాక్సులు మాత్రం బాగా ఎక్కువ.[43]
జపాన్ రవాణా వ్వవస్థ బాగా అభివృద్ధి చెందింది. 2004 నాటికి 1,177,278 కి.మీ (731,683 మైళ్ళు) పక్కారోడ్లు, 173 విమానాశ్రయాలు, 23,577 కి.మీ. (14,653 మైళ్ళు) రైలు మార్గాలు ఉన్నాయి.
జపాన్ అంతర్జాతీయ వాణిజ్యంలో అధికంగా ఎగుమతులు చేరే దేశాలు - అమెరికా 22.8%, యూరోపియన్ యూనియన్ 14.5%, చైనా 14.3%, దక్షిణ కొరియా 7.8%, తైవాన్ 6.8% , హాంగ్కాంగ్ 5.6% (2006 సంవత్సరంలో). జపాన్ ముఖ్యమైన ఎగుమతులు - మోటారు వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, విద్యుత్ యంత్రాలు, రసాయన పదార్ధాలు. ఖనిజ సంపద అత్యల్పంగా ఉన్నందున జపాన్ తన ముడి సరుకుల కోసం ఇతర దేశాలనుండి దిగుమతులపై దాదాపు పూర్తిగా ఆధారపడుతుంది. జపాన్కు ముడి సరుకులు పంపే దేశాలు - చైనా 20.5%, అమెరికా 12.0%, యూరోపియన్ యూనియన్ 10.3%, సౌదీ అరేబియా 6.4%, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 5.5%, ఆస్ట్రేలియా 4.8%, దక్షిణ కొరియా 4.7% , ఇండొనేషియా 4.2% (2006 సంవత్సరానికి).
జపనీసులు మాట్లాడేది జపనీసు భాష అయినా వ్రాసేదపుడు మాత్రం మూడు భాషలు ఉపయోగిస్తారు. జపనీసుల యొక్క మాతృభాష హిరాగణా. చైనీసు వారి కాంజీని కూడా వాడుతారు. ఆంగ్లంలో మాట్లాడేవారి గురించి కతాకనాని ప్రవేశపెట్టారు.
జపాన్ శాస్త్రీయ పరిశోధనలో, ముఖ్యంగా సాంకేతిక, యాంత్రిక , బయోమెడికల్ పరిశోధనలలో ప్రముఖ దేశం. దాదాపుగా 7,00,000 పరిశోధకులు $ 130 బిలియన్ల పరిశోధన , అభివృద్ధి బడ్జెట్ను ఉపయోగించుకోవడం వల్ల ఈ దేశం ప్రపంచంలో మూడవ స్థానాన్ని ఆక్రమిస్తుంది.[50] జపాన్ దేశం నుండి జరిగిన పరిశోధనలలో ఎలక్ట్రానిక్స్, ఆటోమెబైల్, యాంత్రిక, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, ఆప్టిక్స్, రసాయనాలు, సెమికండక్టర్లు , లోహాలకు సంబంధించిన పరిశోధనలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. జపాన్ రోబోటిక్స్ ఉత్పత్తి , వాడుకలో ప్రపంచంలో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది.[51]
జపాన్ ప్రపంచంలో అతి పెద్ద మోటారు వాహనాల ఉత్పత్తిదారు.[52] ప్రపంచంలో పెద్దవైన 15 ప్రసిద్ధ వాహనాల బ్రాండ్లలో ఆరు జపానువే. అలాగే ప్రపంచంలో 20 అతి పెద్ద సెమికండక్టర్ ఉత్పాదనల అమ్మకాల కంపెనీలలో ఏడు జపాను దేశానికి చెందినవి. అంతరిక్ష పరిశోధనల పట్ల, అంతరిక్షయాన వాహనాల పట్ల కూడా జపాన్ దేశం ఆసక్తి చూపుతున్నది.
జపాన్ జనాభా సుమారు 127.3 మిలియన్.[53] భాషా పరంగానూ, సాంస్కృతికంగానూ జపనీయులలో భిన్నత్వం అంతగా లేదు. కొరియా, చైనా, ఫిలిప్పీన్స్, జపనీస్ బ్రెజిలియన్ జాతులకు చెందిన వలస కార్మికులు తప్ప జపనీయులు అధికంగా స్థానిక జాతులవారే. వీరిలో "యమాటో" జాతివారు ఎక్కువగా ఉన్నారు. "ఐను", "ర్యుకూకుయాన్" తెగలవారు మైనారిటీ సంఖ్యాకులు.
ప్రపంచంలో అత్యధిక జీవిత కాల ప్రమాణం కలిగిన దేశాలలో జపాన్ ఒకటి. 2006 నాటికి సగటు జపనీయుల జీవిత కాల ప్రమాణం (life expectancy) 81.25 సంవత్సరాలు.[54] ఫలితంగా జపాన్ జనాభాలో వృద్ధుల శాతం నానాటికీ పెరుగుతున్నది. 2004 నాటికి 19.5% జనాభా 65 సంవత్సరాల వయసు పైబడినవారే.[55] ఈ కారణాల వలన జపాన్ జనవిస్తరణలో కొన్ని గణనీయమైన పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. చాలా మంది పెళ్ళి చేసుకోకుండా ఉడడం కాని, పిల్లలను కనకపోవడం గాని జరుగుతున్నది. 2050 నాటికి జపాన్ జనాభా 100 మిలియన్లకు, 2100 నాటికి 64 మిలియన్లకు తగ్గిపోవచ్చునని అంచనా.[55] ఇందువలన పని చేసేవారి సంఖ్య తరగడం, సోషల్ సెక్యూరిటీపై అధిక భారం పడడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.[56]
జపాన్లో మతాలు | ||||
---|---|---|---|---|
మతము | శాతం | |||
షింటో , బౌద్దమతములు | 95% | |||
ఇతరాలు | 4% | |||
క్రైస్తవము | 0.8% |
జపాన్లో 84 నుండి 96% వరకు షింటో బౌద్ధులు. చైనా నుండి వచ్చిన టావోయిజమ్, కన్ఫ్యూషియానిజమ్ జపాన్లోని ఆచారాలు, విశ్వాసాలపై ప్రభావం కలిగి ఉన్నాయి. దేశంలో 99%జనాభా జపాన్ భాష మాట్లాడుతారు.[53] చాలా పబ్లిక్ పాఠశాలలో జపాన్ భాషతో పాటు ఇంగ్లీషు భాష కూడా చదవాల్సి ఉంటుంది.[57]
జపాన్లో పెద్ద నగరాలు | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
Core City | Prefecture | Population | Core City | Prefecture | Population | |||||
1 | టొక్యో | టోక్యో | 8,483,050 | [[Image:|border|100px|టొక్యో]] టొక్యో యొకొహామా |
7 | క్యోటో | క్యోటో | 1,474,764 | ||
2 | యొకొహామా | కనగావా | 3,579,133 | 8 | ఫుకుయోకా | Fukuoka | 1,400,621 | |||
3 | ఒసాకా | ఒసాకా | 2,628,776 | 9 | కావాసాకి | కనాగావా | 1,327,009 | |||
4 | నగోయా | అయిచీ | 2,215,031 | 10 | సైతామా | సైతామా | 1,176,269 | |||
5 | సప్పోరో | హొక్కైడొ | 1,880,875 | 11 | హిరోషిమా | Hiroshima | 1,159,391 | |||
6 | కోబె | హ్యోగో | 1,525,389 | 12 | సెందాయ్ | Miyagi | 1,028,214 | |||
Source: 2005 Census |
1872లో మెయిజీ పునరుద్ధరణ తరువాత జపాన్లో ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, విశ్వవిద్యాలయం విద్య అనే వ్యవస్థ మొదలయ్యింది.[58] 1947 తరువాత ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్య నిర్బంధంగా ఉంటున్నది. తరువాత దాదాపు అందరు విద్యార్థులూ ఉన్నత పాఠశాల విద్యను కొనసాగిస్తుంటారు. 2005 లెక్కల ప్రకారం ఉన్నత పాఠశాల పాసైనవారిలో 75.9% కాలేజి లేదా విశ్వవిద్యాలయం లేదా వృత్తి విద్య కోర్సులు చేస్తున్నారు.[59] జపాన్ విద్యలో పోటీ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఉన్నత విద్యాలయాలలో ప్రవేశానికి ఈ పోటీ బాగా గట్టిగా ఉంటుంది. టోక్యో విశ్వవిద్యాలయం, క్యోటో విశ్వవిద్యాలయం జపాన్లో అత్యుత్తమ విశ్వవిద్యాలయాలుగా పరిగణింపబడుతాయి.[60] OECD వారి ఒక అధ్యయనం ప్రకారం 15 సంవత్సరాల విద్యార్థుల విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పోల్చి చూస్తే జపాన్ విద్యార్థులు ప్రపంచంలో 6వ ఉన్నత స్థానంలో ఉన్నారు.[61]
జపాన్లో వైద్య సదుపాయాలు జాతీయ, స్థానిక ప్రభుత్వాలు కలిసి అందిస్తాయి. జాతీయ ఆరోగ్య బీమా పధకం ద్వారా దాదాపు అందరికీ సమస్థాయిలో వైద్య సేవలు లభ్యమవుతున్నాయి. ఈ సేవల ఫీజులు ఒక ప్రభుత్వ కమిటీ నిర్ణయిస్తుంది. కంపెనీ ద్వారా వైద్య బీమా లేనివారికి స్థానిక ప్రభుత్వాల సహకారంతో బీమా పధకం అమలు అవుతుంది.[62]
జపాన్ సంస్కృతిలో స్థానిక జపనీయ కళ, సంస్కృతలకు తోడు ఆసియా, ఐరోపా, అమెరికాల ప్రభావాలు కూడా ఉన్నాయి. జపాన్ సాఁప్రదాయ కళలలో ముఖ్యమైనవి - హస్త కళలు: ఇకబానా, ఒరిగామి, ఉకియో-ఇ, జపాను బొమ్మలు, లక్కసామగ్రి, పాత్రల తయారీ); - ప్రదర్శన కళలు బున్రకు, జపాన్ సాంప్రదాయిక నృత్యం, కబూకి, నోహ్, రకుగో) - సాంప్రదాయిక క్రీడలు జపాన్ తేనీరు ఉత్సవం, బుడో, జపాన్ నిర్మాణ శైలి, జపాన్ తోటలు, కత్తి సాములు, వంటలు. జపాన్లో సంప్రదాయంగా ఉండే చెక్క బొమ్మల ముద్రణతో పాశ్చాత్య చిత్ర విధానాలు జోడించి చేసిన మాంగా అనే కామిక్ పుస్తకం జపాన్లోనూ, విదేశాలలోనూ కూడా ప్రాచుర్యం పొందింది.[63] దాని స్ఫూర్తితోనే అనిమే అనబడే కార్టూను చిత్రాలు రూపొందాయి. 1980 దశకం తరువాత జపనీయుల విడియో గేమ్లు ప్రపంచమంతటా జనప్రియమయ్యాయి.[64] జపాన్ సంగీతంలో కోటో వంటి అనేక వాయిద్యాలు ఇతర సంస్కృతులనుండి గ్రహింపబడ్డాయి.
గమనిక : జపనీసులో "アニメ (అనిమె) " (ఉచ్ఛారణ: ఆనిమే Archived 2012-06-19 at the Wayback Machine) ను ఇంగ్లీషులో "అనిమేషన్ లేదా అనిమి" అంటారు. దినికి తెలుగులో పదం లేదు. కాని దీనిని తెలుగులో కూడా "అనిమె Archived 2012-06-19 at the Wayback Machine" అని పలకవచ్చు, వ్రాయవచ్చు. " అనిమె " కార్యాక్రమాలు ఉదాహరణాకు : నారుటొ, పొకెమాన్, హిగురాషినొ నకు కొరొ ని, బ్లేచ్, డెత్ నోట్, రాన్మా 1/2, డ్రాగన్ బాల్ ఝి (జి) , ఇంకా చాలా ఉన్నాయి.
కారవోకె పాటలు జపాన్ దేశీయులలో అత్యంత జనాదరణ పొందాయి. సాంప్రదాయ ఉత్సవాలకంటే ఇదే పైచేయిలో ఉంది.[65]
జపాన్ సాహిత్యంలో ఆది కాలంలో వెలువడిన రెండు చరిత్ర పుస్తకాలు కోజికి , 'నిహోన్ షోకి , 8వ శతాబ్దపు కవితారచన మన్ యోషు అనేవి చైనా భాష లిపిలో వ్రాయబడ్డాయి.[66] తరువాత క్రమంగా జపాన్ భాష ప్రత్యేక లిపి అభివృద్ధి చెందింది. మురసాకీ రచన అయిన గెంజీ కథ - అనే పుస్తకం ప్రపంచంలో మొట్ట మొదటి నవల అని చెప్పబడుతుంది.
జపానువారి సంగీతం దేవుళ్ళవలనే ఉద్బవించినదని సర్ సురేంద్రమోహన్ ఠాగూర్ వ్రాసిన Universal History of Music అనే గ్రంథం వలన తెలుస్తున్నది.పూర్వం సూర్యదేవుని భార్య ఎమాటిరాసు ఓసారి ప్రత్యేకమైన కొండగుహలో దాక్కుని ఎవరిని ఇష్టపడలేదని, మిగిలిన దేవగణమంతా వారి పొరపాట్లను క్షమించమని, ఎంత్ర బ్రతిమిలాడినా, ఆవిడ వినిపించుకోలేదని, అప్పుడు దేవుళ్ళంతా ఆమెను సంగీతంతో కరిగించి, కరుణించేటట్లు చేసుకోవాలనుకొని మధుర సంగీతంతో వారామెను జయించారని ఠాగూర్ గారు వ్రాసినారు. శాస్త్రనిపుణుల పరిశీనలద్వారా జపానువారికి సంగీతం భారతదేశం ఇచ్చిన వరమని, అది వారికి చైనా, కొరియాలద్వారా లభించిందని తేల్చారు.జపాను చక్రవర్తి మరణం పట్ల సంతాపహృదుయుడైన శ్రిగి అను కొరియాదేశపురాజు (సా.శ.453)లో విచారం వ్యక్తంచేస్తూ, జ్ఞాపకార్ధం 80 మంది గొప్పసంగీతవిద్వాంసులను, వెలకట్టలేని ఇతర వస్తువులను జపానుకు పంపించాడు. అప్పుడే జపానులో సంగీత శతాబ్దం మొదలయింది.అటుపౌ 6వ శతాబ్దంలో బౌద్ధమతము, సంగీతాచారాలు కొన్ని చైనానుండి జపానులోకి ప్రవేశించిఅ విస్తరైంచాయి.
భారతదేశం నుండి జపాను చేరిన సంగీత నృత్య కళలు వారి ఆచారాల ప్రకారం కొన్నిమార్పులుచెంది స్థిరంగా ఇప్పటికీ నిలిచాయి.ఉదాహరణకు, వారి మనోహరమైన ఋగాకు స్వరాల్ని పరిశీలిస్తే తెలుస్తుంది.ఋగాకు అంటే నృత్యసంగీతం. ఇది నర నయిన్ కాలంలో వృద్ధి చెందింది.8వ శతాబ్దంలో మంచూరియా తరంగాలపై ఇతరదేశాల ప్రభావం పడింది.దానిటొ జపానులో సాంప్రదాయ సంగీతం కొంత మరుగున పడింది. అప్పుడు శ్రీ ఓకాకుర అను సంగీతం విద్వాంసుడు ఋగాకు అను జపాను సంగీతంలో హిందూదేశపు సంగీతాన్ని , పురాతన హుంగ్ సంగీతాన్ని కలిపి ప్రతిభావంతంగా తయారుచేశారు.
పురాతనకాలానికి చెందిన ఆరుగీతాలు (Balladas) కొంతమంది విజ్ఞానవంతులద్వారా సేకరించబడినవి.అందు చైనీయులు స్వణయుగానికి చెందినవి.వాటిని భ్హా, ఇన్ , షూ అని అంటారు.
ఆరవశతాబ్దంలో చైనాద్వారా జపానుకు చేరిన భారత సంగీత పరికరాలు, వాయిద్యాలద్వారా కొన్నిరాగాలు కూడా వెళ్ళి జపానువారి హృదయాల్లో ముద్రలు వేసాయని తెలుస్తుంది. అందుకే వారి భెరో అనేరాగం మన భరవి అనే రాగాలనుండే వెల్లువడిందనవచ్చును.
జపానులో సంగీత వాయిద్యాలను 2గా విభజిస్తారు. 1.సంపూర్ణమైనవి 2.అసంపూర్ణమైనవి. సంపూర్ణమైనవాటిని కేవలం మతసంబందమైన పాటలకే ఉపయోగిస్తారు.మిగిలనవి ఏరకపు పాటలకైనా అసంపూర్ణమైనవే!
వాయిద్యాలలో కోట్, సామిసెన్, కోకు , బివా అన్నవి ముఖ్యమైనవి. సామిసెన్ అనునది ఘికో గాయినీమణులకు అత్యంతప్రియమైన వాయిద్యము.పోతే వారి కోకు మన వయలిన్ లా ఉంటుంది.మనకు డోలు, మద్దెల, తబులా, డప్పు వంటి చర్మ వాయిద్యాలవలె జపానువారికి క-గూర-టైకొ వాయిద్యాలు ఉన్నాయి.
జపానులో సంగీతకారులను నాలుగు భాగాలుగా విభజించారు. 1. గెక్కునైన్ 2. గియోనిన్ 3. ఫికిబ్లైండ్ 4. ఘికోస్. గెక్కునైన్ గాయకులు కేవలం మతసంబంధమైన, భక్తికి, త్యాగానికి సంబంధించిన గీతాలే గానం చేస్తారు. ఇక రెండవరకం గియోనిన్ గాయకులకే గానమే వృత్తి.అందువలన వారు అన్నిరకాల పాటలు పాడుతారు. ఇక ఫి-బ్లైండ్ సంగీతకారుల కేవలం బృంద గానాలు చేస్తారు. ఘికోలో అంగరూ యువతీమణులే ఉంటారు.వీరు ఆధునిక, లలితగీతాలను మాత్రం ఆలపిస్తారు.
జపాను సంగీతం నేర్చుకోవడమైనా, అర్ధం చేసుకోవడమైనా సులువు.సంగీత స్వరాలను తెలిపే సంకేతాలు వ్రాయడం జపానులో 1511 నుండి ప్రారంభం అయినది.వారు సంకేతాలను చైనీయుల్లానే కుడినుండి, ఎడమకు వ్రాస్తారు.1878లో జపాను ప్రభుత్వం మొదటి సంగీత పరిశోధక సంఘం నియమించింది. మళ్ళీ 1880లో జపాను ప్రభుత్వం జాతీయ సంగీత మండలం పరిధి (National Music Circle) అన్నదాన్ని స్థాపించింది. సంగీతంలో పరిశోధనలు జరిపి ఫలితాలను ప్రజలకు అందివ్వడానికి ఈ ప్రభుత్వ మండలి చాలా సహకరించింది.
సా.శ.5వ శతాబ్దంలో చైనా నాగరికత జపాన్కు సోకినా వారి నుంచి మతం మాత్రం ప్రవేశించలేదు. చైనా నుంచి 5వ శతాబ్ది కల్లా కొరియాకు ప్రవేశించిన బౌద్ధమతం కొరియా ద్వారానే జపాన్కు చేరింది. సా.శ.580 నాటికి ఉమయోదో అనే జపాన్ రాజు బౌద్ధాన్ని రాజమతంగా చేశారు. కొరియా భిక్షువులలతో తన ప్రజలకు వైద్యం, జ్యోతిష్యం చెప్పించే ఏర్పాట్లు చేసి దేశస్థులు కొందరు బౌద్ధంలో చేరేలా ప్రోత్సహించారు. బౌద్ధాన్ని గురించి తెలుసుకొమ్మని కొందరు దేశస్థులను రాజు చైనాకు పంపారు. ఆ క్రమంలో కళలు, స్వచ్ఛందసేవ మొదలైనవి కూడా జపాన్కు చైనా నుంచి ప్రవేశించాయి. జన్మత: బ్రాహ్మణుడు, భారద్వాజ గోత్రీకుడు అయిన బోధిసేనుడనే బౌద్ధభిక్షువు సా.శ.736లో భారతదేశం నుంచి చిత్రకారులు, గాయకులను తీసుకుని జపాన్ చేరి 30 సంవత్సరాల పాటు బౌద్ధమత ప్రచారం చేశారు. ఆపైన 8వ శతాబ్దంలో సుధాకర సింహ, అమోఘవజ్ర మొదలైనవారు నిర్మించిన మాంత్రికవాదం, అసంగభిక్షుడు సిద్ధాంతీకరించిన ధర్మలక్షణవాదం జపాన్ చేరాయి. అంతేకాక 9వ శతాబ్దంలో జపనీయులే నూతన సిద్ధాంత నిర్మాణాలు చేయడం ప్రారంభించారు. టెండెయ్, షిన్ గన్ అనే బౌద్ధమత శాఖలు ఏర్పడ్డాయి. 12వ శతాబ్దిలో సిద్ధాంతాలు, కర్మావలంబనలు తగ్గి సుఖ ప్రథమైన జీవితాన్ని సమర్థించే సుఖవటి అనే సిద్ధాంతం ప్రబలింది. బౌద్ధానికి పూర్వం అక్కడ ఉన్న మతంలోని పూర్వదేవతలను బుద్ధుని అవతారాలుగా పరిగణించడమూ ప్రారంభమైంది.[67]
సాంప్రదాయకంగా చూస్తే జపాన్లో సుమో ఆట జాతీయ క్రీడగా భావించబడుతుంది. అంతేకాకుండా జపాన్లో జనాదరణ కూడా ఈ క్రీడకే ఉంది.[68] జపానీస్ మార్షల్ విద్యలైన జూడో, కరాటే , కెండోలు కూడా విస్తృతంగా ఆడబడుతాయి. మైజి పునరుజ్జీవనం అనంతరం అనేక పాశ్చాత్య క్రీడలు జపాన్లో ప్రవేశించాయి.[69]
1936లో ప్రొఫెషనల్ బేస్బాల్ లీగ్ జపాన్లో ప్రారంభించబడింది.[70] ప్రస్తుతం బేస్బాల్ క్రీడ జనాదరణ కలిగిన క్రీడగా తయారైంది. ఇచిరో సుజికి లాంటి బేస్బాల్ క్రీడాకారులు జపా తరఫున 1994, 1995 , 1996 లలో అవార్డులు పొందినారు. బేస్బాల్ కోసం హన్షిన్ కోషియన్ స్టేడియం ఉంది.
1992లో జపాన్ ప్రొఫెషనల్ లీగ్ ఫుట్బాల్ స్థాపించబడినప్పటినుంచి అది కూడా పురోగతి చెందుతోంది.[71] 1981 నుంచి 2004 వరకు జపాన్ ఇంటర్నేషన్ కప్ ఫుట్బాల్ను నిర్వహించింది. 2002 ప్రపంచ కప్ ఫుట్బాల్ను దక్షిణ కొరియాతో కలిసి సంయుక్తంగా నిర్వహించింది. ఆసియాలో జపాన్ అత్యంత సఫలమైన సాకర్ జట్టుగా ఎదిగింది. ఆసియా కప్ ఫుట్బాల్ను 3 సార్లు చేజిక్కించుకోవడమే దీనికి నిదర్శనం.
జపాన్లో గోల్ఫ్ కూడా ప్రజాదరణ పొందిన క్రీడగా కొనసాగుతోంది.[72] అట్లే ఫార్మూలా రెశ్ క్రీడలు కూడా ప్రజల మన్నలను పొందాయి.[73]
ఆసియా క్రీడల నిర్వహణలో కూడా జపాన్ ఇంతవరకు రెండుసార్లు పాలుపంచుకుంది. 1958లో 3వ ఆసియా క్రీడలను రాజధాని నగరమైన టోక్యో నిర్వహించగా, 1994లో 12వ ఆసియా క్రీడలకు హీరోషిమా నగరం ఆతిథ్యం ఇచ్చింది. 2006లో దోహలో జరిగిన 15వ ఆసియా క్రీడలలో జపాన్ 50 స్వర్ణాలతో పాటు మొత్తం 198 పతకాలతో పతకాల పట్టికలో మూడవ స్థానంలో నిలిచింది.
ఒలింపిక్ క్రీడల నిర్వహణలో కూడా జపాన్ ఆసియాలో ముందంజలో ఉంది. 1964లోనే ఒలింపిక్ క్రీడలను నిర్వహించి ఈ ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. 2004లో ఏథెన్స్లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో జపాన్ 16 స్వర్ణాలతో పాటు మొత్తం 37 పతకాలు సాధించి 5వ స్థానంలో నిలిచింది. చైనా తరువాత ఆసియా తరఫున అత్యధిక పతకాలు సాధించిన రెండో దేశంగా అవతరించింది.
హన్షిన్ టైగర్స్ సెంట్రల్ లీగ్తో అనుబంధించబడిన జపనీస్ ప్రొఫెషనల్ బేస్బాల్ జట్టు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.