ప్రకాశం జిల్లా
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
Remove ads
ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం ఒంగోలు. ఇది 1970 ఫిబ్రవరి 2న, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లాల యొక్క కొంత భాగముల నుండి ఆవిర్భవించింది. తరువాత 1972లో, జిల్లాలోని వినోదరాయునిపాలెము గ్రామములో పుట్టిన ఆంధ్ర నాయకుడైన టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది. 2022 ఏప్రిల్ 4 న కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా గుంటూరు జిల్లానుండి చేరిన భాగం, బాపట్ల జిల్లాలో, నెల్లూరు నుండి చేరిన కొంత భాగం తిరిగి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపబడింది.
భారతాన్ని తెనిగించిన కవిత్రయాల్లో ఒకరైన ఎర్రాప్రగడ,సంగీత విద్వాంసుడు త్యాగరాజు, శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ జిల్లా వారే. వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుసెనగ, ప్రత్తి, పొగాకు ప్రధానపంటలు. మార్కాపురం పలకలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు ప్రసిద్ధి. ప్రకాశంజిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు. Map
Remove ads
చరిత్ర
ఉమ్మడి జిల్లా చరిత్రకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా , గుంటూరు జిల్లాల చరిత్రే ఆధారం. ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాక, పల్లవ, చాళుక్య,కాకతీయ రాజ వంశాలు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, గోల్కొండ, కర్ణాటక నవాబులు పరిపాలించారు. భారతాన్ని తెనిగించిన కవిత్రయములో ఒకరైన ఎర్రాప్రగ్గడ, సంగీతంలో పేరుగాంచిన శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాంతానికి చెందినవారే.
స్వాతంత్ర్యోద్యమ సమయంలో చీరాల పేరాల ఉద్యమం నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, నరసింహరావు ప్రసిద్దులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ తర్వాత మొదటిగా ఒంగోలు జిల్లా ఏర్పడింది. ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా యొక్క మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల, ఒంగోలు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి), కర్నూలు జిల్లా యొక్క రెండు తాలూకాలతో (మార్కాపురం, గిద్దలూరు) ఏర్పడినది.[2] [3] [4]
1972 లో టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తుగా ప్రకాశం జిల్లాగా [5] పేరు మార్చబడింది.
2022 ఏప్రిల్ 4 న ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ప్రకాశం జిల్లాలోని 13 మండలాలు బాపట్ల జిల్లాలో చేర్చబడ్డాయి. కందుకూరు శాసనసభ నియోజకవర్గం మండలాలు మరల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపబడ్డాయి.[1][6]
Remove ads
భౌగోళిక స్వరూపం
ఉత్తరాన నాగర్కర్నూల్ జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాలు, పశ్చిమాన కర్నూలు జిల్లా, దక్షిణాన వైఎస్ఆర్ కడప జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు, తూర్పున బంగాళా ఖాతము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలోని మధ్య ప్రాంతం చిన్న చిన్న పొదలతో, కొండలతో, రాతి నేలలతో కూడి జిల్లాకు ఒక ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి.[7]
కొండలు
త్యాగరాజు నల్లమల, వెలుగొండలు జిల్లాలోని ముఖ్యమైన కొండలు. నల్లమల కొండలు గిద్దలూరు మండలం, మార్కాపురం మండలాలలో వ్యాపించి ఉండగా, వెలుగొండ కర్నూలు జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లాల సరిహద్దులలో ఉన్నాయి. నల్లమలలో నంది కనుమ (నంది కనుమ వద్ద పాతరాతి యుగపు (క్రీ.పూ 10000 - క్రీ.పూ 8000) నాటి రాతి పనిముట్ల పరిశ్రమ ఉన్నట్టు GSI వారు కనుగొన్నారు), మాబాల కనుమ అనే రెండు ముఖ్యమైన కనుమలు ఉన్నాయి. నంది కనుమ పశ్చిమాన గల కర్నూలు జిల్లా,బళ్ళారి జిల్లాలకు, తూర్పున కోస్తా జిల్లాలకు ప్రధాన మార్గం కాగా, మాబాల కనుమ పశ్చిమాన ఆత్మకూరు, కర్నూలును తూర్పున దోర్నాల, యర్రగొండపాలెం, మార్కాపురం లను కలుపుతుంది.
జలవనరులు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, మూసీ, మానేరు, పాలేరు, రొంపేరు, జిల్లాలో ప్రవహించే ముఖ్యమైన నదులు. వీటిలో 220 కి మీలు ప్రవహించే గుండ్లకమ్మ నది జిల్లా యొక్క తాగునీటి, సాగునీటి అవసరాలకు తల్లి వంటిది. మానేరు, పాలేరు, రొంపేరు సాగు తాగు నీటి అవసరాలు తీరుస్తాయి. కంభం వెలిగొండ, గుండ్లకమ్మ, మోపాడు, రాళ్లపాడు చెరువులు తాగు సాగునీటి అవసరాలకు ప్రధాన నదులపై నిర్మించారు. తమ్మిలేరు, సగిలేరు ఈగిలేరు, గుడిశలేరు అనే చిన్న నదులు, వాగేరు వాగు, నల్లవాగు, వేడిమంగల వాగు వంటివి కూడా జిల్లాలో పరిమితంగా ప్రవహిస్తున్నాయి.[7]
భారీ నీటిపారుదల ప్రాజెక్టులు
- పూర్తయినవి
- నాగార్జునసాగర్ జవహర్ కాలువ
- ఎమ్ ఎస్ ఆర్ రామతీర్థం రిజర్వాయర్
ఒంగోలు శాఖా కాలువ M. 16-5-330 వద్ద 1.514 టిఎంసి నీటిని నిల్వకు రిజర్వాయర్ కట్టబడింది. ఇది ఓబచెత్తపాలెం గ్రామం, చీమకుర్తి మండలం దగ్గర 2009 లో నిర్మించబడింది. 72,874 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించగా, 32,475 ఎకరాలు 2013-14లో స్థిరీకరించబడింది. దీనికి 47.61కోట్లరూపాయలు 2015 మే వరకు ఖర్చయ్యింది.56గ్రామాలకు మంచినీటి సౌకర్యం లభిస్తుంది.[8]
- నిర్మాణంలో వున్నవి
మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు
- రాళ్లపాడు ప్రాజెక్టు
- మోపాడు ప్రాజెక్టు
- కంభం చెరువు
- వీరరాఘవునికోట ఆనకట్ట
- పాలేరు బిట్రగుంట ఆనకట్ట
చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టు
నీటి చెరువుల ద్వారా కూడా వ్యవసాయం జరుగుతుంది. ఇవి 10 నుండి 40హెక్టార్ల విస్తీర్ణములో ఉన్నాయి.
వాతావరణం, వర్షపాతం
జిల్లా లోని కోస్తా ప్రాంతాల్లో సముద్రపు గాలి వలన అన్నికాలాల్లోను వాతావరణం ఒకే రకంగా ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంటుంది. జూన్- సెప్టెంబరులో నైరుతి ఋతుపవనాలు, అక్టోబరు - డిసెంబరులో ఈశాన్య ఋతుపవనాల వలన వర్షాలు కురుస్తాయి.
నేలలు
ఎర్ర, నల్ల రేగడి, ఇసుక నేలలు జిల్లాలో ఉన్నాయి.
వృక్ష సంపద
కోస్తా ప్రాంతంలో కొత్తపట్నం, సింగరాయకొండ, ఉలవపాడులో జీడి మొదలైన చెట్లతో కూడిన అడవులు ఉన్నాయి. ఉలవపాడు మామిడి, సపొటా తోటలకు ప్రసిద్ధి.
ఖనిజ సంపద
పలకలు, బలపాలకు పనికివచ్చే రాయి విస్తారంగా గిద్దలూరు మండలంలోని ఓబయనాపల్లి నుండి మార్కాపురం మండలంలోని కుళ్లపేట వరకు దొరుకుతుంది. భారతదేశం వుత్పత్తిలో దాదాపు 80 శాతం ఇక్కడేజరుగుతుంది. కోగిజేడు, మార్లపాడు గ్రామంలో మాగ్నటైట్, ముడి ఇనుము నిక్షేపాలున్నాయి. ఇంకా క్వార్ట్జ్, జిప్సం, సిలికా, సున్నపురాయి, బేరియం సల్ఫేట్ దొరుకుతున్నాయి. ప్రపంచంలోనే అతి శ్రేష్ఠమైన గాలక్సీ గ్రానైటు జిల్లాలో దొరుకుతుంది.[9]
Remove ads
ఆర్ధిక స్థితి గతులు
వ్యవసాయం

వర్జీనియా పొగాకు ఉత్పత్తిలో జిల్లా ప్రసిద్ధి చెందింది. వరి, జొన్న, రాగి, మొక్కజొన్న, కొర్రలు, పప్పు ధాన్యాలు, మిరప, పత్తి,శనగ, వేరుశనగ, ఆముదం ఇక్కడ పండే ఇతర పంటలు. పత్తివుత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది.
పరిశ్రమలు
జిల్లాలో ఐరన్ ఓర్, గ్రానైట్, ఇసుక, సిలికా, బైరటీస్, సున్నపురాయి, పలకలకు సంబంధించిన గనులు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు చీమకుర్తి, ఆర్.ఎల్.పురం, బూదవాడల్లో 8.60 మిలియన్ క్యూబిక్ మీటర్లు, వివిధ రంగుల గ్రానైట్ నిక్షేపాలు జిల్లాలోని ఉప్పుమాగులూరు, దర్శి, కనిగిరి,, బ్లాక్ పెరల్ గ్రానైట్ నిల్వలున్నాయి. ఇవేగాక ప్రత్తి జిన్నింగ్, పొగాకు, మంగుళూరు టైల్స్, పలకల తయారీ, జీడిపప్పు పరిశ్రమలు ఉన్నాయి. దేశానికి అవసరమైన రాతి పలకలో 80% మార్కాపురం నుండే 100కు పైగా పరిశ్రమలలో వుత్పత్తి చేయబడుతుంది. సముద్ర తీరం (పాకల,ఊళ్ళపాలెం,కేసుపాలెం,కరేడు ....మొదలైనవి. )పొడుగునా ఉప్పును పండిస్తారు. అవస్థాపన: జిల్లాలో ఆరు పారిశ్రామిక వాడలు ( ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు అభివృద్ధి కేంద్రము (Ongole growth center), ఒంగోలు ఆటోనగర్, వుడ్ కాంప్లెక్స్) ఉన్నాయి. [10]
డివిజన్లు లేదా మండలాలుు
- రెవెన్యూ డివిజన్లు (3): ఒంగోలు, కనిగిరి, మార్కాపురం
మండలాలు
మండలాలు: 38 [1]
- ఒంగోలు రెవెన్యూ డివిజన్
- కనిగిరి రెవెన్యూ డివిజన్
- మార్కాపురం రెవెన్యూ డివిజన్
గ్రామ పంచాయితీలు
715 గ్రామపంచాయితీలున్నాయి.[11]
Remove ads
నగరాలు, పట్టణాలు
నియోజకవర్గాలు
- లోక్సభ నియోజకవర్గములు(2) [1]
- ఒంగోలు లోక్సభ నియోజకవర్గం : సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం తప్ప మిగిలిన ప్రకాశం జిల్లా
- బాపట్ల లోక్సభ నియోజకవర్గం పరిధి: బాపట్ల జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా లోని సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం
- శాసనసభ నియోజకవర్గములు (8) [1]
రవాణా వ్యవస్థ

ఎన్.హెచ్.16., రాష్ట్ర రహదారులు, జిల్లా పరిషత్ రహదారులు, ఇతర జిల్లా రహదారులు ఉన్నాయి. చెన్నై - ఢిల్లీ రైలు మార్గం, గుంతకల్లు -గుంటూరు రైలు మార్గం జిల్లాలోని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కలిగిస్తున్నాయి.
జనాభా లెక్కలు
2011 భారత జనగణన ప్రకారం, 2022 లో సవరించిన జిల్లా పరిధిలో జనసంఖ్య 22.88 లక్షలు,[1][13][14][15]
సంస్కృతి
ఉమ్మడి ప్రకాశం సంస్కృతి రెండు ప్రాంతాల (రాయలసీమ, కోస్తా) మేళవింపుగావుంది. మార్కాపూర్ డివిజన్ లో కర్నూలు ప్రాంత, గుంటూరు ప్రాంత సంస్కృతులు కలసినవున్నాయి. ఒంగోలు, కందుకూరు డివిజన్లలో ప్రధానంగా బియ్యం ఆహారం తీసుకోగా, మార్కాపూర్ డివిజన్లో రాగి, మొక్కజొన్న, బియ్యం ఆహారంగావాడుతారు. ఈ జిల్లా తీరంలో వున్న మత్స్యకారుల సంస్కృతి ఈ జిల్లాకు వైవిధ్యాన్ని పెంచుతుంది. ఈ జిల్లా తెలుగు మాండలికం, బాగా ఎక్కువగా అర్థమయ్యే తెలుగు మాండలికాల్లో రెండవది.
పశుపక్ష్యాదులు
ఒంగోలు గిత్త ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. అమెరికా, హాలండ్. మలేషియా, బ్రెజిల్, అర్జెంటీనా లాంటి చాలా దేశాలకు ఎగుమతి చేయబడింది. మలేషియాలో ఒక ద్వీపం ఒంగోలు ద్వీపంగా పేరుపెట్టారు. ఈ జాతి పశువులు ప్రపంచంలో లక్షలలో వుంటాయి . 2002 భారత జాతీయ పోటీల చిహ్నం ఐన వీర1 ఒంగోలు గిత్త. పొట్టి కొమ్మల ఒంగోలు జాతి గిత్తలు, నంది శిల్పాలలాగా వుంటాయి.
విద్య
ఒంగోలు ప్రాంతంలో బాలికలకు ప్రత్యేకంగా పాఠశాలలు లేని కాలంలో మొదటిసారిగా 1867లో అమెరికన్ బాప్టిష్ట్ మిషన్ కు చెందిన క్లైవ్ దంపతులు ఒక బాలికల పాఠశాలను 1867లో స్థాపించుటయే గాక, ఒక లోయర్ గ్రేడ్ ట్రైనింగ్ స్కూలు కూడా 1892లో స్థాపించారు. 2014-15 సంవత్సరంలో 4751 విద్యాసంస్థలలో 610126 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.[2]
పర్యాటక ఆకర్షణలు

- చెన్నకేశవస్వామి దేవాలయం,మార్కాపురం
- త్రిపురాంతకేశ్వరాలయం, త్రిపురాంతకం
- కంభం చెరువు,
- భైరవకోన
- మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మాలకొండ
- శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టు. మల్లవరం
- పాకాల (సింగరాయకొండ) సముద్రతీరప్రాంతం
- పొలిమేర శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం, పావులూరు
వైద్యం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 9 అల్లోపతి వైద్యశాలలు, 46 డిస్పెన్సరీలు, 90 అయుర్వేద వైద్యశాలలు, 1 యునాని వైద్యశాల ఉన్నాయి.
సహకార సంఘాలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2,62,000 మంది సభ్యులతో జిల్లాలో 1275 సహకార సంఘాలున్నాయి. వీటిలో 1086 సాధారణ, 69 చేనేత,68 పారిశ్రామిక, 31 మత్స్యకార, 21 పాలసరఫరా సహకార సంఘాలు.
క్రీడలు
జిల్లాలో ఎండాకాలంలో పలు చోట్ల ఎడ్ల బలప్రదర్శన నిర్వహిస్తారు . జిల్లా నలుమూలలనుండి రైతుల పాల్గొంటారు.
ప్రముఖవ్యక్తులు
ఆంధ్రకేసరి బిరుదాంకితులు ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు, కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య. శాసనసభ స్పీకర్ దివికొండయ్య,పిడతల రంగారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఈ జిల్లావారే. సంగీత ప్రపంచంలో పేరుగాంచిన వారిలో త్యాగరాజు, శ్రీరంగం ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేసిన షేక్ చినమౌలానా . సినీరంగంలో ప్రముఖులు దగ్గుబాటి రామానాయుడు అత్యధిక చలన చిత్రాలు నిర్మించిన నిర్మాతగా పేరుతెచ్చుకున్నాడు. ఇంకా గిరిబాబు,రఘుబాబు గోపిచంద్, టి.కృష్ణ ఈ జిల్లా వారే.
ఇవీ చూడండి
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads