ఆధునిక మానవుల మూలస్థానం గురించి, తొలి వలసల గురించీ చెప్పే నమూనా From Wikipedia, the free encyclopedia
పాలియో ఆంత్రొపాలజీలో, ఆధునిక మానవుల భౌగోళిక మూలాన్ని, శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల (హోమో సేపియన్స్) తొలి వలసలనూ వివరించే సిద్ధాంతాల్లో ప్రబలంగా ప్రాచుర్యంలో ఉన్నది, ఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికన్ మూలం. దీనిని "ఆఫ్రికా నుండి బయటకు 2" సిద్ధాంతం (OOA) అని, ఇటీవలి ఏకైక-మూల పరికల్పన (RSOH) అనీ, పునస్థాపన పరికల్పన అనీ, ఇటీవలి ఆఫ్రికన్ మూలం (RAO) మోడల్ అని కూడా పిలుస్తారు. [1][2][3] హోమో ఎరెక్టస్, ఆ తరువాత హోమో నియాండర్తాలెన్సిస్లు ఆఫ్రికా నుండి చేసిన తొలి వలసలను ఇది పరిశీలిస్తుంది.
జీవ వర్గీకరణ కోణంలో హోమో సేపియన్లకు "ఒకే మూలం" ఉందని ఈ నమూనా ప్రతిపాదిస్తుంది. దీనికి సమాంతరంగా ఇతర ప్రాంతాలలో జరిగిన మానవ పరిణామాన్ని ఈ సిద్ధాంతం పట్టించుకోదు. కానీ హోమో సేపియన్స్కు ఐరోపా, ఆసియాల్లోని ప్రాచీన మానవులకూ మధ్య జరిగిన పరస్పర సంకరాన్ని ఇది పరిగణన [4] లోకి తీసుకుంటుంది.[5][6][note 1] హెచ్. సేపియన్లు 3,00,000 – 2,00,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా కొమ్ములో [note 2]అభివృద్ధి చెందారు.[7][8] ఆధునిక ఆఫ్రికా-యేతర జనాభా అంతా కూడా ఆ కాలం తరువాత ఆఫ్రికాను నుండి వెళ్ళిన వారేనని ఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికన్ మూలం నమూనా ప్రతిపాదిస్తోంది.
ఆధునిక మానవుల "ఆఫ్రికా నుండి బయటకు" విస్తరణలు చాలానే జరిగాయి. బహుశా 2,70,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ విస్తరణలు, 2,15,000 సంవత్సరాల క్రితం కనీసం గ్రీస్ వరకు,[9][10][11] 1,30,000 నుండి 1,15,000 సంవత్సరాల మధ్యన ఉత్తర ఆఫ్రికా ద్వారా కచ్చితంగానూ ఇవి జరిగాయి.[12][13][14][15][16][17] ఈ తొలి వలస తరంగాలు 80,000 సంవత్సరాల క్రితం నాటికి చాలావరకు ఆగిపోయినట్లుగా లేదా తగ్గినట్లుగా కనిపిస్తోంది.
అత్యంత విశేషమైన "ఇటీవలి" వలస తరంగం 70,000-50,000 సంవత్సరాల క్రితం జరిగింది[18][19][20][21][22] "దక్షిణ మార్గం" అని పిలిచే మార్గం ద్వారా ఈ వలస తరంగం, ఆసియా తీరం వెంబడి వేగంగా వ్యాపించి, సుమారు 65,000-50,000 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా చేరుకుంది.[23][24][note 3] (కొంతమంది పరిశోధకులు మరీ ప్రాచీన తేదీలను ఒప్పుకోనప్పటికీ, 50,000 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాకు మానవుల తొలి రాక జరిగిందని మాత్రం అంగీకరించారు.[25][26] అయితే కొందరు మాత్రం ఆస్ట్రేలియాలో తొలుత స్థిరపడ్దవారు తొలి వలస తరంగంలో వచ్చి ఉండవచ్చని, మలి తరంగంలో వచ్చిన వారికి వీరు పూర్వీకులు కాకపోవచ్చనీ భావించారు [27]) అయితే ఐరోపాలో మాత్రం 55,000 సంవత్సరాల క్రితమే వలస వచ్చారని భావిస్తున్నారు. [28]
2010 లలో చేసిన జనాభా జన్యుశాస్త్ర అధ్యయనాలలో, యురేషియా, ఓషియానియాలలో హోమో సేపియన్లు, ప్రాచీన మానవుల మధ్య జాత్యంతర సంకరం జరిగిందనీ, ఆఫ్రికాలో మాత్రం జరగలేదనీ తేలింది.[29][30][31] అంటే ఆఫ్రికాయేతర ఆధునిక జనాభా సమూహాలన్నీ చాలావరకూ హోమో సేపియన్స్ నుండి ఉద్భవించాయనీ, కొంతవరకు ప్రాచీన మానవుల ప్రాంతీయ వైవిధ్యాల నుండి కూడా ఉద్భవించాయనీ చెప్పవచ్చు.
3,00,000 నుండి 2,00,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఉద్భవించిన ఆధునిక మానవులు (హోమో సేపియన్స్) చేపట్టిన వలసలను "ఇటీవలి ఆఫ్రికన్ మూలం," లేదా ఆఫ్రికా నుండి బయటకు -2 (అవుట్ ఆఫ్ ఆఫ్రికా 2) అనే ఈ పరికల్పన వివరిస్తుంది. దీనికంటే చాలా ముందు, 18 నుండి 5 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య కాలంలో, ప్రాచీన మానవులు ఆఫ్రికా నుండి యురేషియాకు చేపట్టిన వలసలను ఆఫ్రికా నుండి బయటకు -1 (అవుట్ ఆఫ్ ఆఫ్రికా 1) సిద్ధాంతం వివరిస్తుంది. ఈ రెండూ వేరు.
21 వ శతాబ్దం ప్రారంభం నుండి, "ఇటీవలి ఏకైక-మూలం" వలసల చిత్రపటం చాలా క్లిష్టంగా మారింది. ఆధునిక-పురాతన మానవుల పరస్పర సంకరాలు దీనికి ఒక కారణం. అదే కాకుండా, "ఇటీవలి ఆఫ్రికా నుండి బయటకు" వలసలు ఒక్కసారి కాకుండా అలలు అలలుగా జరగడం కూడా మరొక కారణం. 2010 నాటికి, ఆధునిక మానవుల వలసలకు రెండు మార్గాలున్నాయని స్పష్టమైంది. నైలు లోయ, సినాయ్ల గుండా పోయే "ఉత్తర మార్గం" ఒకటి కాగా, రెండవది బాబ్-ఎల్-మండేబ్ జలసంధి ద్వారా సాగిన "దక్షిణ మార్గం". [33]
1,35,000 సంవత్సరాల క్రితం, ఉష్ణమండల ఆఫ్రికాలో తీవ్రమైన కరువు ఏర్పడింది. మానవులు సముద్ర తీరాల వైపుకు, ఖండాంతరాలకూ వలస వెళ్ళక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.[note 5]
ఆధునిక మానవులు ఎర్ర సముద్రానికి దక్షిణాన ఉన్న బాబ్-ఎల్-మండేబ్ జలసంధిని దాటి, అరేబియా లోని పచ్చని తీరప్రాంతాల వెంట, మిగతా యురేషియా లోకి వలస వెళ్లారు. ఇజ్రాయెల్లోని కఫ్జే గుహలో కనుగొన్న తొలి హోమో సేపియన్ల శిలాజాలు 80,000 నుండి 1,00,000 సంవత్సరాల క్రితం నాటివని గుర్తించారు. ఈ మానవులు 70,000 నుండి 80,000 సంవత్సరాల క్రితం అంతరించిపోవడం గానీ తిరిగి ఆఫ్రికాకు వెళ్ళిపోవడం గానీ జరిగి ఉండవచ్చు. బహుశా మంచుయుగ ఐరోపాలోని శీతల ప్రాంతాల నుండి తప్పించుకుని దక్షిణంగా వచ్చిన నియాండర్తల్లు వీరి స్థానాన్ని ఆక్రమించి ఉండవచ్చు. ఆటోసోమల్ మైక్రోసాటిలైట్ మార్కర్లను హువా లియు తదితరులు విశ్లేషించి అవి 56,000 సంవత్సరాల క్రితం నాటివని తేల్చారు. ఆ శిలాజం ఆఫ్రికాకు తిరిగి వెళ్ళిన వ్యక్తిదని వారు భావించారు. [41]
2011 లో యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ లోని ఫాయా-1 స్థలంలో కనుగొన్న రాతి పనిముట్లు కనీసం 1,25,000 సంవత్సరాల కిందట ఆధునిక మానవులు ఆ ప్రాంతంలో ఉన్నారని సూచిస్తున్నాయి.[12] దీంతో చాన్నాళ్ళుగా పట్టింపుకు నోచుకోని ఉత్తర ఆఫ్రికా మార్గానికి పునశ్చేతన కలిగింది.[13][42][14][15]
ఒమన్లో, 2011 లో బీన్ జోవెన్ కనుగొన్న ఒక స్థలంలో మలి నూబియన్ కాంప్లెక్స్కు చెందిన రాతి పనిముట్ల శకలాలు 100 కు పైగా కనిపించాయి. గతంలో ఇవి సూడాన్లోని పురావస్తు త్రవ్వకాలలో మాత్రమే కనిపించాయి. ఈ అరేబియా నూబియన్ కాంప్లెక్స్ వయసు సుమారుగా 1,06,000 సంవత్సరా లుంటుందని అంచనా వేసారు. దక్షిణ అరేబియాలో ఒక విశిష్టమైన రాతి యుగం నాటి టెక్నోకాంప్లెక్స్ ఉండేదని ఈ ఆధారాలు సూచిస్తున్నాయి.[43]
సుమారు 50-70 వేల సంవత్సరాల క్రితం మైటోకాండ్రియల్ హాప్లోగ్రూప్ L3 కలిగిన ప్రజలు కొందరు, తూర్పు ఆఫ్రికా నుండి సమీప ప్రాచ్యం లోకి వలస వెళ్ళారు. ఆఫ్రికాలోని 2,000 నుండి 5,000 మంది జనాభాలో, 150 నుండి 1,000 మంది మాత్రమే కలిగిన ఒక చిన్న సమూహం ఎర్ర సముద్రం దాటిందని అంచనా.[44] ఎర్ర సముద్రం దాటిన ఈ బృందం అరేబియా, పర్షియా పీఠభూమిలో తీరం వెంట ప్రయాణించి భారత దేశం చేరింది. ఇది వారి మొదటి ప్రధాన స్థిర నివాసకేంద్రంగా కనిపిస్తోంది.[45] వారు ఆసియా దక్షిణ తీరం వెంబడి ప్రయాణించి సుమారు 50,000 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాకు చేరారని వెల్స్ (2003) వాదించాడు.
వర్తమాన కాలంలో బాబ్-ఎల్-మండేబ్ జలసంధి వద్ద ఎర్ర సముద్రం 20 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. కానీ 50,000 సంవత్సరాల క్రితం గ్లేసియేషను కారణంగా సముద్ర మట్టాలు 70 మీ. తక్కువగా ఉండేవి. దాంతో, ఈ వెడల్పు బాగా తక్కువగా ఉండేది. జలసంధి పూర్తిగా అదృశ్యం కానప్పటికీ, మామూలు తెప్పలపై దాటగలిగేంత సన్నగా ఉండేది. పైగా మధ్యలో ద్వీపాలు కూడా ఉండి ఉండవచ్చు.[46] [33] ఎరిట్రియాలో 1,25,000 సంవత్సరాల నాటి నత్త గుల్లలు కనిపించాయి.[47] తొలి మానవుల ఆహారంలో, సముద్రపు టొడ్డున గాలించి పట్టుకునే ఆహారం కూడా ఉండేదని దీనివలన తెలుస్తోంది.
దక్షిణ దిశగా జరిగిన వలసల కాలనిర్ణయం వివాదాస్పదాంశంగా ఉంది. [37] 69,000 – 77,000 సంవత్సరాల క్రితం నేటి టోబా సరస్సు వద్ద జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనానికి ముందు గానీ, తరువాత గానీ ఈ వలసలు జరిగి ఉండవచ్చు. ఈ విస్ఫోటనం భారతదేశంలో విరజిమ్మిన బూడిద పొరల క్రింద కనబడిన రాతి పనిముట్లు టోబాకు పూర్వమే వలసలు జరిగాయని సూచిస్తున్నాయి. అయితే ఈ పనిముట్ల మూలం వివాదాస్పదంగా ఉంది. [37] ఆఫ్రికా నుంచి బయటకు వలస వెళ్ళిన మానవుల్లో ఉన్న హాప్లో గ్రూప్ L3, 60,000-70,000 సంవత్సరాల క్రితం నాటిది. అంటే "టోబా సంఘటన తరువాత కొన్ని వేల ఏళ్ళకు మానవులు ఆఫ్రికా వదిలి వెళ్ళారని ఇది సూచిస్తోంది". [37] మానవ DNA లోని ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్లు) ఊహించిన దానికంటే నెమ్మదిగా జరిగాయని తెలిపే కొన్ని పరిశోధనా ఫలితాలను 2012 లో ప్రచురించారు. దీని ప్రకారం, వలసలు 90,000 – 1,30,000 సంవత్సరాల క్రితం జరిగి ఉండవచ్చని భావించవచ్చు.[48] మునుపటి అంచనాల మాదిరిగానే ఆధునిక ఆఫ్రికాయేతర జనాభా పూర్వీకులు 50,000-65,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వలస వెళ్ళారని మరికొన్ని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.[27][49][50]
54,700 సంవత్సరాల క్రితం నాటి ఆధునిక మానవుని శిలాజం ఇజ్రాయెల్లోని మనోట్ గుహలో కనుగొన్నారు. దీనికి మనోట్ 1 అని పేరుపెట్టారు. అయితే, దీని కాలం పట్ల గ్రౌకట్ తదితరులు సందేహం వెలిబుచ్చారు (2015).
65,000–50,000 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో మానవ నివాసాలు ఉన్నట్లు భావిస్తున్నారు. 2017 నాటికి, ఆస్ట్రేలియాలో మానవుల ఉనికిని సూచించే అత్యంత పురాతన ఆధారపు వయస్సు కనీసం 65,000 సంవత్సరాలు.[23][24] మెక్చెస్నీ ఇలా పేర్కొన్నాడు:
...M168 మార్కరు కలిగిన చిన్న బృందం ఒకటి ఆఫ్రికా నుండి బయల్దేరి, అరేబియన్ ద్వీపకల్పం, భారతదేశాల తీరం వెంట, ఇండోనేసియా గుండా ప్రయాణించి, 60,000 – 50,000 సంవత్సరాల మధ్య ఆస్ట్రేలియా చేరింది అని జన్యు ఆధారాలు చెబుతున్నాయి. ఈ వలస పరికల్పనను రాస్ముస్సెన్ తదితరులు (2011) సమర్ధించారు."[28]
ఆస్ట్రేలియాలో లేక్ ముంగో లోని శిలాజాలు సుమారు 42,000 సంవత్సరాల క్రితం నాటివి.[51][52] మాడ్జెడ్బెబే అనే స్థలం లోని ఇతర శిలాజాలు కనీసం 65,000 సంవత్సరాల క్రితం నాటివి.[24] అయితే, కొంతమంది పరిశోధకులు ఈ శిలాజాల వయస్సు అంత ఉండదని, అవి సుమారు 50,000 సంవత్సరాల క్రితం నాటివి అయి ఉంటాయనీ భావించారు.[25][53]
చైనాకు చెందిన టియాన్యువాన్ మనిషి 38,000 – 42,000 సంవత్సరాల క్రితానికి చెందినది. అదే ప్రాంతానికి చెందిన లియుజియాంగ్ మనిషి బహుశా 67,000 – 1,59,000 సంవత్సరాల క్రితం నాటిది. 2013 DNA పరీక్షల ప్రకారం, టియాన్యువాన్ మనిషి "ప్రస్తుత ఆసియన్లు, ఆదివాసీ అమెరికన్లకు " సంబంధించినవాడని తేలింది.[54][55][56][57] టియాన్యువాన్కు, 17,000 – 19,000 సంవత్సరాల క్రితం నాటి ఆధునిక మానవుడైన మినాటోగావా మనిషికీ అవయవ నిర్మాణంలో సారూప్యత ఉంది. మినాటోగావా మనిషి శిలాజాన్ని జపాన్లోని ఒకినావా ద్వీపంలో కనుగొన్నారు.[58][59]
దక్షిణ వలసదార్లలో హాప్లోగ్రూప్ N కలిగిన శాఖ ఒకటి, తూర్పు ఆఫ్రికా నుండి నైలు నదిని వెంట, ఉత్తరం వైపుకు వెళ్లి, సినాయ్ ద్వారా ఆసియాలోకి ప్రవేశించిందని మెకాలే తదితరులు (2005) చెప్పారు. అక్కడ ఈ గుంపు శాఖలుగా చీలి, కొందరు ఐరోపాలోకి, మరికొందరు తూర్పు ఆసియాలోకీ వెళ్ళారు. ఐరోపాలో ఆధునిక మానవులు ఆలస్యంగా రావడం, పురావస్తు, DNA ఆధారాలూ ఈ పరికల్పనకు సమర్ధనగా నిలుస్తున్నాయి. వేటాడే, ఆహారాన్ని సేకరించే మానవుల 55 మైటోకాండ్రియల్ జన్యువులను (mtDNA) విశ్లేషించినపుడు, "55,000 సంవత్సరాల కిందట ఆఫ్రికాయేతరు లందరూ ఒకేసారి వేగంగా విస్తరించార"ని తేలిందని పోస్థ్ తదితరులు (2016) వాదించారు.
లండన్ జూలో ఉన్న ఆఫ్రికా వాలిడుల (తోక లేని కోతులు) ప్రవర్తనను అధ్యయనం చేసాక, చార్లెస్ డార్విన్ ఆఫ్రికా వాలిడులతో మానవుల క్లాడిస్టిక్ సంబంధాన్ని సూచించాడు.[60] శరీర నిర్మాణ శాస్త్రవేత్త థామస్ హక్స్లీ కూడా ఈ పరికల్పనకు మద్దతు ఇచ్చాడు. ఆఫ్రికన్ వాలిడులకు మానవులకూ సన్నిహిత పరిణామ సంబంధాలు ఉన్నాయని అతడు అన్నాడు.[61] ఈ అభిప్రాయాలను జర్మన్ జీవశాస్త్రవేత్త ఎర్నెస్ట్ హేకెల్ వ్యతిరేకించాడు. అతను "ఆసియా నుండి బయటకు" సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవాళ్ళలో ఒకడు. మానవులకు ఆగ్నేయ ఆసియా ప్రైమేట్స్తో ఎక్కువ సంబంధం ఉందని హేకెల్ వాదించాడు. డార్విన్ చెప్పిన ఆఫ్రికా పరికల్పనను తిరస్కరించాడు.[62][63]
మానవులు వాలిడుల నుండి వచ్చారని డార్విన్ తన డిసెంట్ ఆఫ్ మ్యాన్ పుస్తకంలో ఊహించాడు. వాలిడుల మెదడులు ఇప్పటికీ చిన్నవి గానే ఉన్నాయి. కానీ నిటారుగా నడుస్తూ, చేతులను తెలివితేటలను సూచించే పనుల కోసం వాడాయి; అలాంటి వాలిడులు ఆఫ్రికావి అని డార్విన్ అనుకున్నాడు:
ప్రపంచం లోని ప్రతీ ప్రాంతం లోనూ సజీవ క్షీరదాలకు అదే ప్రాంతానికి చెందిన అంతరించిన జాతులతో దగ్గరి సంబంధం ఉంటుంది. అందుచేత, గొరిల్లా, చింపాజీలకు దగ్గరి సంబంధీకులైన జాతులు గతంలో ఆఫ్రికాలో జీవించి ఉండే సంభావ్యత ఉంది; ఈ రెండు జాతులూ ఇప్పుడు మానవుడికి దగ్గరి సంబంధీకులు కాబట్టి, మన పూర్వీకులు ఇతర చోట్ల కంటే ఆఫ్రికా ఖండం లోనే ఉండేందుకు ఎక్కువ సంభావ్యత ఉంది. కానీ, ఈ విషయంపై కల్పనలు చెయ్యడం వలన ఉపయోగమేమీ లేదు. ఎందుకంటే దాదాపు మనిషంత పరిమాణంలో ఉండే, హైలోబేట్స్కు సంబంధించిన డ్రయోపిథెకస్ అనే కోతి, ఎప్పుడో.. ఎగువ మయోసీన్ కాలంలో ఐరోపాలో ఉండేది; ఇంత విస్తారమైన సమయంలో భూమి అనేకానేక మహా విప్లవాలకు లోనై ఉంటుంది, ఈ జీవులు చాలా పెద్ద యెత్తున వలసలు పోయేందుకు కూడా బోలెడు సమయం ఉంది.
1871 లో పురాతన హోమినిన్ కాలపు మానవ శిలాజాలు దాదాపుగా లేవు. సుమారు యాభై సంవత్సరాల తరువాత, ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలలో మానవ శాస్త్రవేత్తలు చిన్నపాటి మెదడు కలిగిన పురాతన హోమినిన్ల శిలాజాలను కనుగొనడం మొదలైనప్పుడు, డార్విన్ ఊహాగానాలకు మద్దతు లభించింది. ఇటీవలి (పురాతనానికి వ్యతిరేకంగా) ఆఫ్రికన్ మూలం పరికల్పన 20 వ శతాబ్దంలో అభివృద్ధి చెందింది. ఆధునిక మానవుల "ఇటీవలి ఆఫ్రికన్ మూలం" అంటే "ఒకే మూలం". దీన్ని బహుళ మూలాలకు వ్యతిరేక పదంగా వివిధ సందర్భాల్లో ఉపయోగించారు. మానవ శాస్త్రంలో జరిగిన ఈ చర్చ 20 వ శతాబ్దం మధ్యకాలం నాటికి ఏకైక మూలం వైపు మొగ్గు చూపింది. 20 వ శతాబ్దం మధ్య కాలం నాటికి కూడా, చెదురుమదురుగా ఉన్న బహుళ మూలాల సమర్ధకుల (కార్లెటన్ కూన్ వంటి వారు) పట్టు కాస్త బలంగానే ఉండేది. అతడు 1962 నాటికి కూడా, హెచ్. ఎరెక్టస్ నుండి హెచ్. సేపియన్స్ ఐదుసార్లు పుట్టుకొచ్చారని భావిస్తూండేవాడు.[65]
ఇటీవలి మూలం నమూనాకు ప్రత్యామ్నాయంగా ఉన్న పరికల్పన, ఆధునిక మానవుల బహుళ ప్రాంతీయ మూలం. దీనిని 1980 లలో మిల్ఫోర్డ్ వోల్పాఫ్ ప్రతిపాదించాడు. 18 లక్షల సంవత్సరాల క్రితం ప్లైస్టోసీన్ ప్రారంభంలో, ప్రపంచ జనాభా అంతటా హెచ్. ఎరెక్టస్ నుండి ఉత్పన్నమైందని ఈ పరికల్పన ప్రతిపాదించింది. ఈ పరికల్పనపై చర్చ 1980 ల చివరలోను 1990 ల లోనూ వివాదాస్పదంగా మారింది.[66] 1990 లలో జరిగిన ఈ చర్చల్లోనే "ఇటీవలి-మూలం", "అవుట్ ఆఫ్ ఆఫ్రికా" అనే పదాలు ప్రస్తుత పరిభాషలో చేరాయి.[67] ఇటీవలి మూలం మోడల్కు వ్యతిరేకంగా ఉన్న బహుళప్రాంతీయ పరికల్పన యొక్క "బలమైన" అసలు రూపానికి కాలదోషం పట్టింది. దాని బలహీన రూపాలు, పురాతన-ఆధునిక సమ్మేళనంతో కలిసిన "ఇటీవలి మూలం" పరికల్పనకు అనుబంధాలుగా మారాయి.[68]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.