ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం
కాకసస్ నుండి ఆర్యులు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకున్నారనే సిద్ధాంతం / From Wikipedia, the free encyclopedia
కాకసస్ ప్రాంతానికి చెందిన ప్రజలు భారతదేశంపై దాడి చేసి, అక్కడున్న స్థానికులను తరిమిగొట్టి తమ భాషయైన సంస్కృతాన్ని, తమ సంస్కృతినీ ఇక్కడ విస్తరింపజేసాఅరని చెప్పే సిద్ధాంతమే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం. 19 వశతాబ్దంలో రూపుదిద్దుకున్న ఈ సిద్ధాంతం, 20 శతాబ్దపు చివరి పాదం వరకూ ప్రచారంలో ఉంది. ఈ సిద్ధాంతం ప్రకారం -నల్ల సముద్రానికి, కాస్పియన్ సముద్రానికీ మధ్య ఉన్న కాకసస్ ప్రాంతానికి చెందిన ప్రజలు సుమారు సా.పూ.1500 ప్రాంతంలో ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ - పాకిస్తాన్ - భారతదేశ మార్గంలో ఖైబర్ కనుమ ద్వారా భారతదేశానికి వచ్చారు; వారు గుర్రాలు పూన్చిన రథాలపై వచ్చారు. స్థానికులపై దాడి చేసి, వారిని ఓడించారు; ఈ ప్రజలు ఆర్య జాతికి చెందినవారు; వారు ఇండో-ఆర్యన్ లేదా ఇండో-యూరోపియన్ భాషలను తమతో తీసుకువచ్చారు; ఋగ్వేదం సా.పూ 1200 నాటిది. తరువాతి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలను సా.పూ. 1000-800 మధ్య కాలంలో రాసారు.[1]
ఈ సిద్ధాంతం ఏ ఒక్కరో రూపొంచించినది కాక, వివిధ పరికల్పనలను కలుపుకుని ఒక దండయాత్ర సిద్ధాంతంగా రూపుదిద్దుకుంది. విలియం జోన్స్, మ్యాక్స్ ముల్లర్, మోర్టిమర్ వీలర్ వంటి వారు ఈ సిద్ధాంతాన్ని కల్పించి, ప్రచారం చేసింవారిలో ప్రముఖులు. ఈ సిద్ధాంతాన్ని భాషాశాస్త్రంపై ఆధారపడి కల్పన చేసారు. సంస్కృత భాషకు, యూరపియన్, ఇరానియన్ భాషలకూ ఉన్న సారూప్యతలను గమనించిన కొందరు భాషావేత్తలు, ఈ భాషలు ఒకే కుటుంబానికి చెంది ఉండవచ్చునంటూ చేసిన ఆలోచనల నుండి ఈ ఆర్యుల దండయాత్ర పరికల్పన పుట్టింది. దీనికి పురావస్తు ఆధారాలేమీ లేవు. సింధు నాగరికత శిథిలాల లోని అస్థిపంజరాలను ఈ దండయాత్ర సిద్ధాంతానికి ఆధారాలుగా మోర్టిమర్ వీలర్ అనువర్తింప జూసినప్పటికీ అది పండితుల ఆమోదం పొందలేదు.
స్వామి వివేకానందుడు, అరబిందో, డా. బి. ఆర్ అంబేద్కర్ వంటి సామాజిక ప్రముఖులే కాకుండా, రొమిల్లా థాపర్, మిచెల్ డానినో, కోయెన్రాడ్ ఎల్స్ట్, ఎన్.ఎస్. రాజారామ్ వంటి ఆధునిక చారిత్రికులు కూడా ఈ సిద్ధాంతాన్ని తిరస్కరించారు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని అత్యంత తీవ్రంగా విమర్శించిన అంబేద్కర్, అసలు ఆర్య "జాతి" అనే భావననే తిరస్కరించాడు.