తెలుగు రచయిత, యాత్రికుడు From Wikipedia, the free encyclopedia
ఏనుగుల వీరాస్వామయ్య (1780 - 1836) తెలుగు రచయిత, యాత్రికుడు. ఇతడు కాశీయాత్ర చరిత్ర విశేషాలు పుస్తకరూపంగా వెలువరించిన వ్యక్తిగా సుప్రసిద్ధుడు. కాశీయాత్ర చరిత్ర మొదటిసారి అచ్చు అయినపుడు కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన ముందుమాట వలన, తన రచనలో సందర్భానుసారంగా వీరాస్వామయ్య పేర్కొన్న విషయాల వలన, దిగవల్లి వేంకటశివరావు, ముక్తేవి లక్ష్మణరావు సంపాదకత్వంలో వెలువడిన కాశీయాత్ర చరిత్ర గ్రంథాలలోని పీఠికల ద్వారా వీరాస్వామయ్య జీవిత విశేషాలు తెలుస్తున్నాయి.
ఏనుగుల వీరాస్వామయ్య తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో శ్రీవత్స గోత్రంలో 1780 ప్రాంతంలో జన్మించాడు. తండ్రి పేరు సామయమంత్రి. 9వ యేటనే వీరాస్వామయ్య తండ్రి గతించాడు. వారి కుటుంబం కొన్ని తరాలుగా మద్రాసులో ఉండేది.
12 యేళ్ళకే వీరాస్వామయ్య ఆంగ్లం ధారాళంగా చదవడం నేర్చుకొన్నాడు. ఆ వయసులోనే "బోర్డ్ ఆఫ్ ట్రేడ్"లో "వాలంటీరు"గా ఉద్యోగంలో కుదిరాడు. అప్పటిలో ఇంగ్లీషు నేర్చుకొన్నవారు అధికంగా వాలంటీరు గానే చేరి, తమ శక్త్యానుసారం పై ఉద్యోగాలకు ఎదిగేవారు. అతి చిన్న వయసులోనే అతని ప్రతిభ చూసి పై అధికారులు అతనిని తమ వద్ద పనిచేయించు కోవాలని పోటీ పడేవారట. తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషలలో కూడా అతను మంచి ప్రతిభ సాధించి ఉండవచ్చును. 13వ యేట తిరునల్వేలి జిల్లా కలెక్టరు ఆఫీసులో ద్విభాషి గా ఉద్యోగంలో కుదిరాడు. అప్పట్లో కలెక్టరు చాలా చాలా పెద్ద ఉద్యోగం. అంత చిన్నవయసులో కలెక్టరు ఆఫీసులో చేరగలగడం వీరాస్వామయ్య ప్రతిభకు తార్కాణం.
రెండు సంవత్సరాల తరువాత వీరాస్వామయ్య చెన్నపట్నం చేరి, అనేక వ్యాపార సంస్థలలో పనిచేసి, బుక్ కీపింగ్ లాంటి అనేక విద్యలలో నిపుణుడయ్యాడు. బోర్డ్ ఆఫ్ ట్రేడ్ లో ఎకౌంటెంట్గా పని చేశాడు. ఈ సమయంలోనే సంస్కృతంలోను, జ్యోతిష్యం, ఖగోళం, స్మృతులు, పురాణాలు వంటి అనేక విషయాలలో పండితుడైనట్లున్నాడు. 15యేళ్ళ బాలుడు బాధ్యత గల ఉద్యోగంలో పై అధికారుల మెప్పును పొందుతూ అంత శాస్త్రవిజ్ఞానం సంపాదించడం ఆశ్చర్యకరం. అతని ప్రతిభను గుర్తించి మద్రాసు సుప్రీం కోర్టువారు అతనికి "హెడ్ ఇంటర్ప్రిటర్" ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇది చాలా గొప్ప ఉద్యోగంగా భావింపబడేది. పాశ్చాత్య చట్టాలను, స్థానిక ధర్మ సంప్రదాయాలను, ఆచారాలను సమన్వయపరుస్తూ విచారణ జరపడానికి బ్రిటిషు జడ్జీలకు ద్విభాషీలు సహాయపడేవారు. క్రొత్త ఉద్యోగంలో చేరేముందు పాత సంస్థవారు అతనికి ఘనమైన వీడ్కోలు ఇస్తూ బంగారపు నశ్యపు డబ్బాను బహూకరించారు. అప్పటిలో బ్రిటషు పాలనలో ఉన్న ప్రాంతాలలోని బలమైన చట్టాల వలన నెలకొన్న స్థిరత్వానికి, ఇతర పాలకుల ప్రాంతాలలో జరిగే అరాచకాలకు మధ్య భేదాన్ని వీరాస్వామయ్య యాత్రా చరిత్రలో స్పష్టంగా గమనించవచ్చును.
అప్పటికి కృష్ణా గోదావరి నదులపై ఆనకట్టలు కట్టలేదు. 19వ శతాబ్ది ఉత్తరార్థంలో తీవ్రమైన కరువు కాటకాలు వచ్చాయి. ప్రజల ఆకలి తీర్చడానికి "గంజిదొడ్లు" (ఆహార సహాయ కేంద్రాలు) ఏర్పాటు చేశారు. అలాంటి గంజిదొడ్ల దగ్గర ఒక తపస్విలా తన బాధ్యత నిర్వహించి వీరాస్వామయ్య వీలయినంతమందికి సహాయపడ్డాడు.
సర్ రాల్ఫు ఫాల్మరు దొర, ఆయనకు వ్రాసి యిచ్చిన టెష్టిమోనియల్ అనే యోగ్యతా పత్రికలో - అయన కోర్టులో నున్ను, చేంబరులో నున్ను, అలసట లేక బహు నెమ్మదితో పనులు గడుపుచు వచ్చెననిన్ని, ఆయన తన గొప్ప ఉద్యోగపు పనులను మిక్కిలి నమ్మకముగా జరిపించెననిన్ని, మరిన్ని ప్రజల మేలు కోరి స్మృతిచంద్రిక మొదలైన పుస్తకములకు అనువాదము చేసెననిన్ని, నేనెరిగినంతలో ప్రభుత్వవారి విశేష కృపకు యీ పురుషుడు పాత్రుడైనట్లు హిందు పెద్దమనుషులలో ఎవరున్ను ఎక్కువైనవారు లేరని నాకు తోచియున్నదనిన్ని వ్రాయబడియున్నది.
ఆంగ్ల విద్య, పాశ్చాత్య విజ్ఞానాల అవసరం వీరాస్వామయ్య బాగా గుర్తించాడు. అప్పటికి విశ్వవిద్యాలయాలు లేవు. కొద్దిపాటి కళాశాలలు కూడా లేవు. ఆ కాలంలోనే తన పలుకుబడితో "హిందూ లిటరరీ సొసైటీ" స్థాపించి వీరాస్వామయ్య ఆధునిక విద్యకు బాట వేశాడు. మద్రాసులో విశ్వవిద్యాలయం స్థాపించాలనే భావనకు ఈ చర్య పునాది వేసింది. (ఇదంతా లార్డ్ మెకాలేకు చాలా ముందుకాలం.)
అచ్చు పుస్తకాలు లేని ఆ కాలంలో వీరాస్వామయ్య సంపాదించిన పాండిత్యం ఆశ్చర్యకరంగా ఉంటుంది. సందర్భానుసారంగా తన రచనలో అతను ఉదహరించిన విషయాలు శృతి, స్మృతులపై అతని జ్ఞానాన్ని, అతని తార్కిక లక్షణాన్ని, సత్యశోధన పట్ల నిబద్ధతను తెలియజేస్తాయి. సౌరమాన, చాంద్రమాన విధానాలలో అధిక, క్షయ మాసాల గురించి అతని ఉపన్యాసాన్ని ఖగోళ శాస్త్ర విషయాల గురించిన పండిత సభలో హర్షించి, పండితులు రత్నహారాన్ని బహూకరించారు. స్మృతులు, శృతులు ఎన్ని అన్న విషయంపై ధర్మ నిర్ణయం చేయవలసినదని అతని యాత్రా సమయంలో గయలో ఒక జడ్జి అతనిని కోరాడు. ఆ పండిత సభలో సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి, ఈ విషయంపై ఉన్న భిన్నాభిప్రాయాలను, నిశ్చయమైన ప్రమాణాలను, అస్పష్టతకు కారణాలను వివరించాడు. అతను ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించేవాడు.
కష్టాలు పడి, స్వయంకృషితో ఉన్నత స్థానానికి ఎదిగిన వీరాస్వామి పండితుడు, వివేకవంతుడే కాక వినయశీలి. ఇంగ్లీషు దొరలవద్ద ఉద్యోగం చేస్తూ వారి అభిమానాన్ని చూరగొన్నాగాని తన మతం, సంప్రదాయం పట్ల తన భావాలను నిర్భయంగా ప్రకటించేవాడు. ఎంత పెద్ద దొరతోనైనా వాదానికి దిగి భిన్న మతతత్వాలకు సమన్వయం కుదిర్చే ప్రయత్నం చేసేవాడు. అయినా వారి అభిమానాన్ని అతను నిలుపుకొన్నాడు.
ఉన్నత ఉద్యోగంలో తనకున్న విశేష స్థాయిని అతను ఎప్పుడూ చెప్పుకోలేదు. సందర్భానుసారంగా మాత్రమే మనం గ్రహించాలి. తన యాత్ర ఆరంభంలో అప్పటి విధానం ప్రకారం వీరాస్వామయ్య మద్రాసు దొరలనుండి "క్యారక్టర్లు" (ఇతర స్థలాలలో ఉండే అధికారులకు తనగురించిన పరిచయ పత్రాలు కావచ్చును) తీసుకొని వెళ్ళాడు. అవి చూసి, దేశమంతటా దొరలు, సంస్థానాధీశులు వీరాస్వామయ్యను విశేషంగా మన్నించి అతని అవసరాలన్నీ సమకూర్చారు. గవర్నరు లాంటి హోదా ఉద్యోగులు కూడా అతనిని మన్నించారు. ఆ కాలంలో సంస్థానాధీశులకు మాత్రమే వారి పరివారం ఆయుధాలు ధరించడాని అనుమతి ఉండేది. అలాంటి సదుపాయం వీరాస్వామి పరివారానికి కలుగజేశారు. గంగను దాటే ముందు వీరాస్వామయ్య సామానులను తనిఖీ చేయాలని పట్టు బట్టిన కస్టమ్స్ ఉద్యోగిని ఆపే కమిషనర్ వెంటనే డిస్మిస్ చేశాడు. అయితే అతనిని క్షమించమని వీరాస్వామయ్య కోరాడు.
తన యాత్ర తనకొక్కడికే పుణ్యవంతం కావాలని అతను కోరుకొనలేదు. నూరు మందికి పైగా ఉన్న తన పరిజనం చేత యాత్రా ఫలసిద్ధికి కావలసిన విధులు, కర్మలు అన్నింటినీ చేయించాడు. దారిలో తన పరిజనానికి ఆయనే వైద్యుడు కూడాను. దారిలో అస్వస్థతకు గురైన నౌకర్లు కూడా యాత్రను పూర్తి చేయాలని స్థానికి కూలీల ద్వారా డోలీలు ఏర్పాటు చేయించాడు. ఆఖరికి స్థానికంగా తెచ్చుకొన్న తాత్కాలిక కూలీకి జ్వరమొస్తే అతనిని మోసుకెళ్ళడానికి మరో నలుగురు కూలీలను నియమించాడు. కాశీలో చలికాలంలో రక్షణ కోసం అందరికీ తగు వస్త్రాలు, నూనెలు కొని ఇచ్చాడు.
తన యాత్రా ఫలాన్ని తనకొకడికే పరిమితం చేసుకోలేదు. నలభై బిందెల గంగా జలాన్ని పది బాడుగ గుర్రాలమీద చెన్నపట్నం పంపించే ఏర్పాటు చేయించాడు. అయినా ఆ జలం రవాణాకు ఏమయినా అంతరాయం కలుగుతుందేమోనని మరొక ఎనిమిది బిందెల తనవెంట రెండు బండ్లలో తీసుకొని వచ్చాడు. ఆ పుణ్య తీర్ధాన్ని మద్రాసులో ఇంటింటికి పంచాడు.
దాన గుణానికి వీరాస్వామి పెట్టింది పేరు. తన శక్తికి మించిన దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమాలను తలకెత్తుకొని విజయవంతంగా పూర్తి చేశాడు. తనకెవరైనా కొంచెమైనా సహాయపడితే అది మరచి పోకుండా గుర్తుంచుకొని అంతకు ఎన్నోరెట్ల సహాయం చేసేవాడు. తన కూతురి వివాహానికి, బంధువుల ఆక్షేపణను లక్ష్యపెట్టుండా, సమస్త జాతులవారికి భోజనాలు ఏర్పాటు చేసెను. ఇంత ఖర్చు చేసేబదులు పిల్లదానికి కొంత ఆస్తి ఏర్పరుచవచ్చునుగదా అని బంధువులు ప్రశ్నించారు. చిన్నదాని పోషణ నిమిత్తము ద్రవ్యమును మనుష్యాధీనముగా నుంచుటకు బదులుగా ఈశ్వరుని చేతిలో భద్రంగా ఉంచుతున్నాని చెప్పాడు వీరాస్వామయ్య.
వీరాస్వామయ్య కాశీయాత్ర జర్నల్ మొదటి వాక్యం ఇది -
ఇలా 1830 మే 18న అతని కాశీయాత్ర ప్రారంభమైంది. సుమారు 15 నెలలు సాగిన ఈ యాత్రలో అతని కుటుంబ స్త్రీ జనం, బంధువులు, పరిజనులు సుమారు 100 మంది పైగా ఉన్నారు. వారు తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాదు, నాగపూరు, ప్రయాగల మీదుగా కాశీ చేరుకొన్నారు. ప్రయాణం అధికంగా పల్లకీలు మోసే బోయల ద్వారా జరిగినట్లు తెలుస్తున్నది. వారు కాశీ నుండి గయ ద్వారా కలకత్తా నగరానికి చేరారు. తరువాత ఉత్కళ ప్రాంతం భువనేశ్వరం, బరంపురంల మీదుగా శ్రీకాకుళం చేరారు. రాజమహేంద్రవరం, బందరు, నెల్లూరుల గుండా తిరిగి చెన్నపట్నం చేరుకున్నారు. అప్పటికి రైళ్ళు లేవు. రోడ్లు కూడా సరిగా లేవు. కంకర రోడ్లసలే లేవు. "బాట సరాళము" అంటే మనుషులు, బండ్లు నడవడానికి వీలుగా ఉన్నదని అర్ధం చేసుకోవాలి. అతని యాత్రలో సందర్శించిన కొన్ని ఊళ్లు, మజిలీలు, స్థలాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ వ్రాసిన తేదీలు వాటి ప్రక్కన ఇచ్చిన ఏదో ఒక ఊరి మజిలీకి చెందినవవుతాయి.
చివరి అధ్యాయంలో కొన్ని వాక్యాలు:
యాత్రా విశేషాలను ఒక జర్నలుగా వ్రాసి పంపవలెనని వీరాస్వామయ్య కాశీయాత్రకు బయలు దేరే ముందు అతని మిత్రుడు శ్రీనివాస పిళ్ళై కోరాడు. అలా వ్రాసిన సంగతులను 1838లో అచ్చు వేయించాడు. 1869లో ప్రభుత్వ ఉత్తరువుల ప్రకారం పునర్ముద్రింపబడింది. 1941లో దిగవల్లి వేంకటశివరావు కొంత పరిశోధించి, మరిన్ని సమగ్రమైన వివరణలతో పునర్ముద్రింపజేశాడు. 19వ శతాబ్దం ఆరంభ కాలానికి సంబంధించిన విశేషాలను తెలుసుకోవడానికి ఈ పుస్తకంలా మరే తెలుగు పుస్తకమూ ఉపకరించడంలేదు. ఆ కాలంలో జీవనం గురించి, భాష గురించి, పాలనా వ్యవస్థ గురించి అనేక విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలుస్తున్నాయి.
యాత్రా విశేషాలు వ్రాయడం 19వ శతాబ్దంలో ఈ పుస్తకానికి ముందు లేదనే చెప్పవచ్చును. తెలుగులో యాత్రా చరిత్రకు వీరాస్వామయ్య ఆద్యుడు అనవచ్చును. అప్పటిలోనే ఇది తమిళ మరాఠీ భాషలలోకి తర్జుమా చేయబడింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.