హైద్రాబాద్ సమీపం లో ఒక పురాతన కోట / From Wikipedia, the free encyclopedia
గోల్కొండకోట, ఒక పురాతన నగరం. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదుకు 10 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరం, కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. సా. శ. 1083 నుండి సా. శ. 1323 వరకు కాకతీయులు గోల్కొండను పాలించారు. సా. శ 1336 లో ముసునూరి కమ్మ నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. సా. శ. 1364 లో కమ్మ మహారాజు ముసునూరి కాపయ నాయకుడు గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షా వశము చేశాడు. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1365-1512) ఉంది. కానీ సా.శ. సా. శ 1512 తరువాత ముస్లిము సుల్తానుల రాజ్యములో రాజధాని అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, 2014 ఆగస్టు 15న గోల్కొండ కోటపై తొలిసారిగా భారత స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు.