దాసరి నారాయణరావు
భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత / From Wikipedia, the free encyclopedia
డా. దాసరి నారాయణరావు ( మే 4, 1947 - మే 30, 2017) ఆంధ్రప్రదేశ్కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత , రాజకీయనాయకుడు.[2] అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్ పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం , కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.
దాసరి నారాయణరావు | |
---|---|
జననం | మే 4, 1947 పాలకొల్లు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
మరణం | 2017 మే 30(2017-05-30) (వయసు 70) [1] హైదరాబాద్ |
మరణ కారణం | మూత్రపిండాల సమస్య |
ఇతర పేర్లు | దాసరి, దర్శక రత్న |
ప్రసిద్ధి | సినిమాలు, రాజకీయం |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
మతం | హిందూమతం |
భార్య / భర్త | దాసరి పద్మ |
పిల్లలు | ప్రభు,అరుణ్ కుమార్,హేమాలయకుమారి |
కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.
దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, , మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన బొబ్బిలి పులి , సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.
మామగారు, సూరిగాడు , ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు , బహుమతులు అందుకున్నాడు.