పల్లవులు
From Wikipedia, the free encyclopedia
పల్లవులు పారశీక దేశవాసులనియు, శక-పహ్లవ-కాంభోజ జాతుల వలసలలో భాగముగా దక్షిణదేశము చేరి శాతవాహనులతో సంబంధములు నెరిపి క్రమముగా స్వతంత్రులయ్యారని చెప్పవచ్చును. శాతవాహన రాజు గౌతమీపుత్ర సాతకర్ణి 'శకపహ్లవుల'ను నిర్జించెనని నాసిక్ శాసనము తెలుపుతున్నది. ప్రాచీన తమిళ గ్రంథాలు పల్లవులను విజాతీయులుగా పరిగణించాయి[1].
క్రీ. శ. రెండవ శతాబ్దిలో కాలభర్తి అనువాడు ఉత్తరదేశమునుండి వచ్చి శాతవాహనులకడ ఉద్యోగిగా చేరాడు. ఇతడు చూటు వంశీయుల కన్యను పెండ్లాడగా ఆమెవలన చూతుపల్లవుడు జన్మించాడు. చూతపల్లవుని కుమారుడు వీరకూర్బవర్మ. ఈతని మనుమడు స్కందమూలునికి పూర్వీకులవల్ల దక్షిణాంధ్ర దేశము, దానికి సమీపములోని కర్ణాటక ప్రాంతములు సంక్రమించాయి. శాతవాహనుల సామ్రాజ్యము అంతరించిన తరువాత, స్కందమూలుడు ఇక్ష్వాకుల ఒత్తిడికి తాళలేక తనదేశమును దక్షిణానికి విస్తరింపదలచాడు. తన కుమారుడు కుమారవిష్ణువును కంచి పైకి పంపగా అతడు సత్యసేనుని ఓడించి కంచిని వశపర్చుకున్నాడు. స్కందమూలుని తరువాత కుమారవిష్ణువు రాజ్యమును విస్తరించి అశ్వమేధ యాగము చేశాడు. ఈ సమయములో చోళులు మరలా విజృంభించి కంచిని తిరిగి వశపరచుకొనుటకు యత్నించారు. కుమారవిష్ణు రెండవ కుమారుడు బుద్ధవర్మ చోళులను నిర్జించి వారి ప్రాభవాన్ని అంతరింపచేశాడు. బుద్ధవర్మ పెద్ద కుమారుడు స్కందవర్మ రాజ్యాన్నికావేరి మొదలుగా కృష్ణానది వరకును, ప్రాక్సముద్రము మొదలుగ కుంతలపు పశ్చిమ సరిహద్దుల వరకు విస్తరించాడు. ఈ కాలమున పరాజితులైన చోళులలో పలువురు ఆంధ్ర మండలములు చేరి పల్లవరాజులకడ ఉద్యోగాలు నిర్వహించారు. వీరే తరువాతి తెలుగు చోళులకు మూలపురుషులయ్యారు.[2]
స్కందవర్మ తరువాత బుద్ధవర్మ కుమారుడగు రెండవ కుమారవిష్ణువు రాజయ్యాడు. ఈతని తరువాత మొదటి స్కందవర్మ కుమారుడు వీరవర్మ రాజరికము గ్రహించాడు. వీరవర్మ కుమారుడు రెండవ స్కందవర్మ, అతని కుమారుడు మొదటి సింహవర్మ వరుసగా రాజ్యం చేశారు. సా.శ. 300ప్రాంతమున సింహవర్మ ఇక్ష్వాకులను కూలద్రోశాడు. తరువాత పినతండ్రి విష్ణుగోపుని సాయంతో మూడవ స్కందవర్మ రాజయ్యెను. క్రీ. శ. 345లో విష్ణుగోపుడు రాజ్యము చేయాల్సివచ్చింది. ఈసమయములో ఉత్తరదేశమునుండి సముద్రగుప్తుడు దక్షిణదేశదండయాత్రకై వచ్చి శాలంకాయనులను, పలక్కడలో ఉగ్రసేనుని, తరువాత విష్ణుగోపుని జయించి తిరిగివెళ్ళాడు. క్రీ. శ. 360లో విష్ణుగోపుని మరణానంతరము ఆతని అన్న మనుమడు మొదటి నందివర్మ రాజయ్యాడు. క్రీ. శ. 383లో విష్ణుగోపుని కుమారుడు రెండవ సింహవర్మ రాజై పల్లవరాజ్యానికి పూర్వప్రతిష్ఠలు కలిగించాడు. ఈతని అనంతరము కుమారుడు రెండవ విష్ణుగోపుడు, మనుమడు మూడవ సింహవర్మ, మునిమనుమడు మూడవ విష్ణుగోపుడు, మునిమునిమనుమడు నాలుగవ సింహవర్మ క్రమముగా రాజులైరి. నాలుగవ సింహవర్మ విష్ణుకుండిన రాజులగు ఇంద్రభట్టారక వర్మ, రెండవ విక్రమేంద్ర వర్మలకు సమకాలీనుడు. క్రీ. శ. 566లో సింహవర్మను రెండవ విక్రమేంద్ర వర్మ జయించాడు. దీనితో పాకనాటికి ఉత్తరాననున్న తెలుగుదేశం విష్ణుకుండినుల వశమైనది. అదే సమయములో కళభ్రులను యోధజాతి (జైనులు) కంచిని వశముచేసుకొన్నది. పల్లవరాజన్యులు పాకనాటిలో తలదాచుకున్నారు. పల్లవ సామ్రాజ్యం అంతరించిపోయింది.