బూదరాజు రాధాకృష్ణ
From Wikipedia, the free encyclopedia
బూదరాజు రాధాకృష్ణ (1932 మే 3 - 2006 జూన్ 4) భాషా శాస్త్రవేత్త, సీనియర్ పాత్రికేయుడు. పాత్రికేయులకు, భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించాడు. తెలుగు, సంస్కృత భాషల్లో మంచి పట్టున్న రాధాకృష్ణ వాస్తు పదకోశం, వ్యవహారకోశం మొదలైన భాషా సంబంధ పుస్తకాలను రచించాడు. ఆధునిక పత్రికల తెలుగు భాషను ప్రామాణీకరించిన ఘనత ఆయనకు చెందుతుంది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బూదరాజు రాధాకృష్ణ | |
---|---|
జననం | బూదరాజు రాధాకృష్ణ (1932-05-03)1932 మే 3 వేటపాలెం |
మరణం | 2006 జూన్ 4(2006-06-04) (వయసు 74) |
ఇతర పేర్లు | సి.ధర్మారావు (కలం పేరు) |
వృత్తి | తెలుగు అధ్యాపకుడు, పాత్రికేయుడు |
ఉద్యోగం | తెలుగు అకాడమీ, ఈనాడు జర్నలిజం స్కూల్ |
ప్రసిద్ధి | తెలుగు భాషపై పుస్తకాలు |
మతం | హిందూ |
1932 మే 3 న ప్రకాశం జిల్లా వేటపాలెం గ్రామంలో రాధాకృష్ణ జన్మించాడు. హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఎర్లీ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ అనే అంశంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పట్టా అందుకున్నాడు. చీరాల వి.ఆర్.ఎస్ అండ్ వై.ఆర్.ఎన్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి, ఆపై తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టరుగా పనిచేశాడు. 1988లో తెలుగు అకాడమీలో పదవీ విరమణ చేశాక, ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపల్ గా పదేళ్ళకు పైగా పనిచేశాడు. ఈనాడు పత్రికలో పుణ్యభూమి శీర్షికన సి.ధర్మారావు పేరుతో వందలాది వ్యాసాలు రాశాడు. ఆయన తన సాహిత్య ప్రస్థానంలో అనేకమైన రచనలను తెలుగులోకి అనువదించాడు.
మహాకవి శ్రీశ్రీ అనే పుస్తకాన్ని బూదరాజు రాధాకృష్ణ భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షిక కోసం 1999లో ఆంగ్లంలో రచించాడు. దాన్ని ఆయనే తెలుగులోకి అనువదించాడు. కేంద్ర సాహిత్య అకాడమీ ముఖ్యమైన భారతీయ భాషలన్నిటిలోకీ అనువదించి భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షికన ప్రచురించారు. [1]