భారత చైనా సరిహద్దు రోడ్లు
From Wikipedia, the free encyclopedia
భారత చైనా సరిహద్దు రోడ్లు (ఇండియా-చైనా బోర్డర్ రోడ్స్ -ఐసిబిఆర్) భారత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు. చైనా-భారతీయ సరిహద్దులో "వ్యూహాత్మక రహదారులను" నిర్మించి, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. [1] ఐసిబిఆర్ లో అనేక సంస్థలు భాగంగా ఉన్నాయి. వీటిలో ఐసిబిఆర్ రహదారి నిర్మాణ పనులలో ఎక్కువ భాగం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) చేపట్టింది. NHAI, MoDNER, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (CPWD), నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (NPCC), సంబంధిత రాష్ట్రాల PWD లు, తదితరులు కూడా మిగిలిన భాగాన్ని చేపట్టాయి. [2] టిబెట్ స్వాధికార ప్రాంతంలో ఐదు ఎయిర్బేస్లు, విస్తృతమైన రైలుమార్గ నెట్వర్కు 58,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రోడ్ల నెట్వర్కులతో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచుకున్న చైనా, భారతదేశాన్ని భౌగోళిక-వ్యూహాత్మక ఒత్తిడికి గురిచేయడానికి "నెమ్మదిగానే అయినప్పటికీ, స్థిరమైన కార్టోగ్రాఫిక్ దూకుడు" ను ఆశ్రయిస్తోంది. [3]
2020 డిసెంబరు నాటికి పూర్తి చేయాల్సిన ఫేజ్ -1 లోని 73 ఐసిబిఆర్ రోడ్లు, ఫేజ్ -2 లో 32 ఐసిబిఆర్ రోడ్లతో సహా మొత్తం 105 ఐసిబిఆర్ రోడ్లను బిఆర్ఓ నిర్మిస్తుంది. [2] [4] BRO బాధ్యత వహించే మొత్తం రహదారి నెట్వర్కు పొడవు 32,000 కిలోమీటర్లు కాగా, ఇందులో 67% ఐసిబిఆర్ కు చెందినవి. [1] ఫేజ్ -1 లోని 73 ఐసిబిఆర్లలో, 2018 నాటికి 50% కన్నా తక్కువ పని జరిగింది. తరువాత అదనపు నిధులతో నిర్మాణ వేగం పెరిగింది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులలో ఇప్పటికే పూర్తయినవి డార్బుక్-ష్యోక్-దౌలత్ బేగ్ ఓల్డీ (DS-DBO) రహదారి, అటల్ సొరంగం (రోహ్తాంగ్ సొరంగం) కాగా, ఈశాన్యంలో సెలా సొరంగం, బ్రహ్మపుత్ర నది క్రింద రైల్వే సొరంగం నిర్మాణంలో ఉన్నాయి. [5]