మలేరియా
దోమల ద్వారా వ్యాపించే ఒక వ్యాధి / From Wikipedia, the free encyclopedia
చలిజ్వరం లేదా మలేరియా (Malaria), దోమల ద్వారా వ్యాపించే ఒక వ్యాధి. [1] మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. పరాన్నజీవులు తమ ఆహారం కోసం తాము నివసిస్తున్న మనుషులపైనే అధారపడతాయి. మలేరియా ఏ విధంగా వస్తుందో కనిపెట్టినందుకుగాను ఫ్రెంచి రక్షణ వైద్యుడయిన "చార్లెస్ లూయీ ఆల్ఫోన్సె లావెరెన్"కు 1907లో నోబెల్ బహుమతి లభించింది. మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రము, అది దోమలలో, మనుషులలో ఎలా నివసిస్తుందో తెలిపినందుకు 1902లో రొనాల్డ్ రాస్కు నోబెల్ బహుమతి లభించింది. సర్ రోనాల్డ్ రాస్ మలేరియా పరాన్న జీవి జీవిత చక్రాన్ని సికింద్రాబాదు నగరంలో పరిశోధన చేస్తున్నప్పుడు కనుగొన్నాడు. ప్రపంచంలో ఏటా 500 మిలియన్ల జనాభా మలేరియా జ్వరాల బారిన పడి వారిలో 2.7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. "ప్లాస్మోడియం" (Plasmodium) అనే ప్రొటోజోవా పరాన్నజీవి మలేరియా వ్యాధి కారకము. ప్రోటోజోవాలు ఏకకణజీవులు. కానీ వీటి నిర్మాణము బ్యాక్టీరియా కంటే క్లిష్టమైనది. బ్యాక్టీరియా చాలా సులువయిన నిర్మాణము కలిగి ఉంటాయి. వివిధ ప్లాస్ల్మోడియం స్పీసీస్లు మనుషులలో వివిధ రకాల మలేరియాలను కలుగజేస్తాయి. అందులో ముఖ్యమైనవి
- ప్లాస్మోడియం ఫాల్సిపారం (falciparum)
- ప్లాస్మోడియం వైవాక్స్ (vivax)
- ప్లాస్మోడియం మలేరియై (malariae)
- ప్లాస్మోడియం ఒవేల్ (ovale)
- ప్లాస్మోడియం సెమీఒవేల్ (semiovale)
- ప్లాస్మోడియం నోవెస్లి (knowesli)
పైవాటిలో ప.వైవాక్స్, ప.ఫాల్సిఫెరం ఎక్కుమంది ప్రజలకు సోకుతుంది. ఫాల్సిఫెరం మలేరియా అన్నింటికంటే ప్రాణాంతకమయినది.