రావూరి భరద్వాజ
2012 లో జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందిన భారతీయ రచయిత / From Wikipedia, the free encyclopedia
రావూరి భరద్వాజ (జూలై 5, 1927 [2] - (అక్టోబరు 18, 2013) తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి, రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించాడు.[3] ఈయన బాలసాహిత్యంలో కూడా విశేషకృషి సలిపాడు. [4] సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడు రాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది. ఈయన రచనలలో జీవన సమరం మరో ప్రముఖ రచన.
Ravuri Bharadwaja రావూరి భరద్వాజ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | (1927-07-05)1927 జూలై 5 తాడికొండ గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ |
మరణం | 2013 అక్టోబరు 18(2013-10-18) (వయసు 86)[1] హైదరాబాదు, తెలంగాణ, భారత దేశము |
వృత్తి | రచయిత |
భాష | తెలుగు భాష |
జాతీయత | భారతీయుడు |
పౌరసత్వం | భారతీయుడు |
విద్య | 7 వ గ్రేడు |
గుర్తింపునిచ్చిన రచనలు | పాకుడురాళ్ళు |
ప్రభావం | చలం |
పురస్కారాలు | జ్ఞానపీఠ పురస్కారం |
జీవిత భాగస్వామి | కాంతం |
సంతానం | 5 ( 4 కుమారులు , 1 కుమార్తె) |
తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడితడు. ఆడంబరాలులేని సాధారణ జీవితం ఆయనది. భరద్వాజకు దిగువ మధ్యతరగతి, పేదప్రజల భాషపై గట్టిపట్టు ఉంది. ఒక బీదకుటుంబంలో జన్మించిన భరద్వాజ కేవలం ఉన్నత పాఠశాల స్థాయివరకే చదువుకున్నాడు. ఆతరువాత కాయకష్టం చేసే జీవితాన్ని ప్రారంభించాడు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల కఠినమైన జీవన పరిస్థితులను గమనించేవాడు. అప్పుడే పల్లెప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనించిన భరద్వాజ ఆ అనుభవాలను తర్వాతకాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించుకున్నాడు. 2013 అక్టోబరు 18న రావూరి భరద్వాజ తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళారు.[5]