విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (IATA: VGA, ICAO: VOBZ) విజయవాడ నగరం నుండి జాతీయ రహదారి 16 కు సమీపంలో 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. కృష్ణా జిల్లాలో గన్నవరం, కేసరపల్లి గ్రామాల మధ్య ఉంది. ఈ విమానాశ్రయమును రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలములో బ్రిటీషు ప్రభుత్యము ఏర్పాటు చేసింది. దీని సుదీర్ఘ రన్వే (విమాన రహదారి) సముద్రమట్టం కంటే 82 అడుగుల ఎత్తులో, 11 వేల అడుగులు పొడవు కలిగినది కావున, అతి పెద్దవి, వెడల్పు కలిగిన భారీ విమానాలు దిగుటకు అనుకూలమయిన విమానాశ్రయం.[2] ఈ ప్రాంతం నుండి ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదల కారణంగా, భారతదేశం విమానాశ్రయాల అథారిటీ వారు విమానాశ్రయానికి అభివృద్ధి, మౌలిక వసతులలో మార్పులు చేపట్టారు.
త్వరిత వాస్తవాలు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం, సంగ్రహం ...
మూసివేయి
2017, ఆగస్టులో ఈ విమానాశ్రయమును అంతర్జాతీయముగా ప్రకటింపబడింది. సింగపూర్ కు మొదటి అంతర్జాతీయ విమాన సేవ 2018 డిసెంబరు 4 నుండి ప్రారంభించబడింది. జూలై 2019లో రాష్ట్రప్రభుత్వం రాయితీ తొలగించడంతో రద్దయినది.[3]
కార్గో సేవలు ఆగస్టు, 2018 నుండి అందుబాటులోకి వచ్చాయి. హజ్ యాత్రకు ఇక్కడి నుండి నేరుగా వెళ్ళే సదుపాయం భారత ప్రభుత్వం 2020 నుండి అందిచనుంది.