From Wikipedia, the free encyclopedia
శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం పిఠాపురం లోని ప్రముఖ గ్రంథాలయం. ఇది 1915వ సంవత్సరంలో స్థాపించబడింది.[1]
దేశము | భారత దేశము |
---|---|
తరహా | ప్రైవేటు |
ప్రదేశము | పిఠాపురం |
భౌగోళికాంశాలు | 017°07′00″N 082°16′00″E |
శతాబ్ధాల చరిత్ర కలిగిన పిఠాపురం జైన మతం, బౌద్ధ మతం, శైవ మతం, వైష్ణవ మతం ఇలా అన్ని దివ్య క్షేత్రాల కూడలిగా ఉంది. 1907 ప్రాంతంలో పిఠాపురం మాహారాజా సూర్యారావు గారు రాజరికానికి వచ్చిన తరువాత వారితోపాటుగా బ్రహ్మ సమాజీకులు మొక్కపాటి సుబ్బారాయుడుగారు, రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు, పిఠాపురానికి దయచేసారు. అప్పటి నుండి కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి వగైరా పట్టణాలలో సమాజ పరంగానూ మహారాజావారు వ్యక్తిగతంగానూ ప్రోత్సహించి సాంఘిక న్యాయం కోసం కార్యక్రమాలను చేపట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళారు.
రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆదేశాaల మేరకు హరిజన, నిమ్నజాతుల అభివృద్ధికై కాకినాడలో శరణాలయం, రాజమండ్రిలో వీరేశలింగ ఆస్తికపాఠశాల, పిఠాపురంలో హరిజన బాల బాలికల శరణాలయాలు స్థాపించారు. వీటిలో ఉచిత భోజన, వసతి, విద్యాబోధనలు ఏర్పాటు చేసారు. అలా పిఠాపురానికి ఉత్తేజాన్ని తీసుకొచ్చారు శ్రీ రాజావారు. అయితే ఈ మార్పు వలన రాజ వారి చుట్టూ భజన పరుల సంఖ్య ఎక్కువ చేసింది కాని సమాజంలో తగిన మార్పు తీసుకురాలేకపోయింది. ఈ సమయంలో పురాతన సంసృతీ వ్యవస్థ, ఆధునిక బ్రహ్మ సమాజ వ్యవస్థల మద్య గ్రాంధిక బాషా బేషజాలు, జమిందారీ వ్యవస్థ మద్య జాతీయోజ్యమం, గ్రంథాలయ పరిణామం సాగుతూ వచ్చాయి.
ఆ సమయంలో పిఠాపురం చరిత్రలో గొప్ప మలుపు చోటుచేసుకుంది. అదే సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ స్థాపన. 1915 మార్చి 16 న శ్రీ మలిరెడ్డి వెంకటరాయుడు, వేపూరి వేణుగోపాలదాసు, శ్రీ కొత్త సూర్యనారాయణగార్లు మరికొందరు దేశభక్తులు కలసి పిఠాపురంలో విద్యానంద పుస్తక భాండాగారాన్ని స్థాపించారు. పిమ్మట శ్రీ హనుమానుల సూర్యనారాయణ గుప్త గారు అదే పట్టణంలో 12-03-1916లో శ్రీ సూర్యరాయ పుస్తక భాండారాన్ని నెలకొల్పారు.
దీనికి ఉపశాఖగా దామెర రామస్వామి గారి అధ్యక్షతన ఆంధ్రబాషా అభివృద్ధి నాటకసమాజం అనే ఒక సంస్థను మహారాజా వారి సహకారంతో స్థాపించారు. ఈ నాటక సమాజానికి రాజావారు యాభైవేలను విరాళంగా ఇచ్చారు. ఈ విరాళంతో నాటక సమాజానికి కావలసిన హంగులు సమకూర్చుకొని వేణీ సంహారం, విజయ విలాసం వంటి నాటకాలను, కొన్ని సంసృత నాటకాలనూ రాష్ట్రమంతటా పలు చోట్ల ప్రదర్శించేవారు. ఇలా నాటక సమాజం ద్వారా ప్రదర్శనలు ఇస్తూనే పిఠాపురం రెండు గ్రంథాలయాల నిర్వహకులు గ్రంథ సేకరణ, వనరుల సేకరణలో పోటాపోటీగా పనిచేసేవారు.
గ్రంథాలయ ఉద్యమంలో పిఠాపురం కేంద్రంగా రెండు గ్రంథాలయాలు విడివిడిగా పనిచేయడం కంటే కలసి పనిచేస్తే మరింత భావుంటుందని తలచిన స్థానిక పెద్దల కోరిక ఫలితంగా రెండు గ్రంథాలయాలు కలపి సూర్యరాయ విద్యానంధ గ్రంథాలయంగా రూపొందించారు. అన్ని పుస్తకాలను కలపి జాబితా రూపొందించారు. ఇది సోములు బాబుగా పిలిచే దామెర స్వాముల బాబు గారి ఇంట్లో ఎక్కువ కాలం నడిచింది. తదుపరి నగరంలో రెండు మూడు ఇళ్ళు మారింది. 30 సంవత్సరాలు గడిచిన పిమ్మట పాఠకుల సంఖ్య, గ్రంథాల సంఖ్య విశేషంగా పెరగటం వలన గ్రంథాలయానికి సొంత స్థలం, భవనం సమకూర్చాలని ఊరి ప్రముఖులు యోచన చేసారు.
1942లో సోషలిస్ట్ భావాలు కల చెలికాని భావనరావు గారు, అవంత్స సోమసుందర్ గార్లు దీనికి కృషిచేసారు, గ్రంథాలయానికి సొంత భవనం సమకూర్చారు. 1944 లో కొత్త కార్యవర్గం వచ్చిన పిదప పాత బస్టాండ్కు సమీపాన కల పెంకుటింటికి మార్చబడింది. అలా గ్రంథాలయానికి సొంత జాగా ఏర్పడినది. చెలికాని భావనరావు గారు కొంత కాలం ఊరు విడి వెళ్ళటం జరిగింది.
ప్రకృతి వైపరీత్యాల వలన, కొన్ని వైషమ్యాల వలన గ్రంథాలయ నిర్వహణ కుంటుపడటం, సాంసృతిక కూడలిగా ఉండాలనే తలంపుతో ఊరిలో కల కల్చరల్ క్లబ్ను ప్రక్కన కల రెండో భవనంలోకి దానిని తీసుకురావడం ద్వారా గ్రంథాలయంలో ఇతర అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారింది. అదేకాక పెంకుటింటిలో కొంత భాగం కూలిపోగా బాగా దెబ్బతినడం జరిగింది. అయితే పుస్తకాలు చాలా వరకూ జాగ్రత్త చేయబడ్డాయి.
తిరిగి ఊరు వచ్చిన చెలికాని భావనరావు గారు పరిస్థితులను పరిశీలించి గ్రంథాలయానికి తిరిగి పూర్వ వైభవం తేవాలని రాయవరపు సుబ్బరావు గారితో కలసి కోర్టులో గ్రంథాలయం తరపున పోరాడి రాజావారి దగ్గర నుండి 1400 రూపాయలతో భవనం, స్థలం మొత్తంగా కొనుగోలు చేసి గ్రంథాలయం పేరుతో 1974లో రిజిస్టర్ చేయించారు. జిలా గ్రంథాలయ అద్యక్షుడైన కొప్పన వెంకట కొండలరావు గారి ప్రోత్సాహంతో తిరిగి గ్రంథాలయ నిర్వహణ ఒక దారికి తీసుకువచ్చారు.
ప్రస్తుతం ఉన్న భవనం 1977-78 లో పునర్నిర్మించడం జరిగింది. దీనికి నటరాజ రామకృష్ణ బృందం, కళాకృష్ణ, డా.విజయలక్ష్మీ మురళీకృష్ణ గార్లకుమార్తె తుషార, సతివాడ సూర్యనారాయణ గారి కుమార్తె రాధిక మున్నగువారు ప్రధర్శనల ద్వారా నిధులను పోగుచేసి ఇచ్చారు. దానితో పాటుగా అప్పటి గ్రంథాలయ శాఖామాత్యులు భాట్టం శ్రీరామమూర్తి గారు, జె. చోక్కారావు గార్ల సహకారం, ఆంధ్ర నాట్య ప్రధర్శనల ద్వారా నూతన భవన నిర్మాణం జరిగింది.
మాధవరావు గారి ప్రోద్భలంతో 1990 లో గ్రంథాలయ నిర్వహణ నిమిత్తం ముందు కల కాళీ స్థలంలో ముందు 3 షాపులను నిర్మించారు. వాటి ఆదాయం ద్వారా గ్రంథాలయ అభివృద్ధి నిమిత్తం ఖర్చుచేస్తూఉన్నారు. తధనంతర కాలంలో మరో 4 షాపులు 2006 లో నిర్మించారు. గ్రంథాలయ పై భాగాన ఊరి ధాతల సహకారంతో మరోక అంతస్తు నిర్మించారు. దీన్లో సాంసృతిక సభలకు, సమావేశాలకు నామ మాత్రపు అద్దెతో ఇవ్వడం ద్వారా గ్రంథాలయ నిర్వహణకు మరొక వనరుగా ఏర్పరిచారు.
కృష్ణశాస్త్రి, విశ్వనాధ సత్యనారాయణ, సి.నారాయణ రెడ్డి, మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి అనేకమంది ఇక్కడ ఆహ్వానించి వారి ప్రసంగాలతో ఉత్తేజితులై వారిని సన్మానించుకొంటూ వెలిగినది. 1977లో వజ్రోత్సవం జరిగింది. పాతూరి నాగభూషణం, ఎం. ఆర్. అప్పారావు, భాష్యం అప్పలాచార్యులు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి మొదలైన వారు పాల్గొని వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.