మెగస్తనీసు
From Wikipedia, the free encyclopedia
మెగస్తనీసు (క్రీ.పూ. 350 - క్రీ.పూ. 290) ప్రాచీన గ్రీకు యాత్రికుడు, సందర్శకుడు. ఆసియా మైనర్ ప్రాంతంలో జన్మించిన మెగస్తనీసును సెల్యూకస్ గ్రీకు రాయబారిగా పాటలీపుత్రములోని శాండ్రోకొట్టస్ (చంద్రగుప్త మౌర్యుడు) ఆస్థానానికి పంపాడు. అతను రాయబారిగా పనిచేసిన కాలము ఖచ్చితంగా తెలియదు కానీ చరిత్రకారులు చంద్రగుప్తుని మరణ సంవత్సరమైన క్రీ.పూ. 288 కు ముందు అని మాత్రం నిర్ణయించారు. ఇతడు ప్రఖ్యాత చారిత్రక గ్రంథమైన ఇండికాను రచించాడు.
ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న అనేక ప్రాంతాలు, సింధూ నదీ లోయ ప్రాంతం, ఆఫ్ఘనిస్తాన్ మొదలైన ప్రాంతాల్లో పర్యటించాడు. గంగానది మీదుగా పాటలీపుత్రను చేరుకున్నాడు. బహుశా ఈ విధంగా ఆ పవిత్రమైన నదిని దర్శించిన మొట్టమొదటి పాశ్చాత్యుడు ఇతనే కావచ్చని చరిత్రకారుల ఊహ.[1] మెగస్తనీస్ తన ప్రయాణంలోని అనుభవాలని గ్రంథస్తం చేశాడు కానీ వాటిలో ఏమీ లభ్యం కావడం లేదు. తన రచనల్లో హిమాలయాలు, టిబెట్, శ్రీలంకలను కూడా ప్రస్తావించాడు. మౌర్యుల తరువాత ఎన్నదగిన జాతి ఆంధ్ర జాతియని, వారి రాజు మిక్కిలి బలవంతుడని అతనికి 32 కోటలున్నాయని పేర్కొన్నాడు. భారతీయ పద్ధతులు, ధార్మిక, మత సంబంధమైన ఆచారాల గురించి, కుల వ్యవస్థ గురించి కూడా రాశాడు.