1947 లో భారత పాక్ల మధ్య జరిగిన యుద్ధం From Wikipedia, the free encyclopedia
భారత్ పాక్ ల మధ్య 1947లో జరిగిన యుద్ధాన్ని మొదటి కాశ్మీర్ యుద్ధం అని వ్యవహరిస్తారు. కాశ్మీర్ ప్రాంతం కోసం జరిగిన యుద్ధం 1947లో మొదలై 1948లో ముగిసింది. భారత్ పాక్ ల మధ్య జరిగిన నాలుగు యుద్ధాలలో ఇది మొదటిది. యుద్ధం అప్పుడే కొత్తగా స్వాతంత్ర్యం పొందిన రెండు దేశాల మధ్య జరిగింది. ఈ యుద్ధ పరిణామాలు ఇప్పటికీ ఇరు దేశాల భౌగోలిక రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి.
భారత్ పాక్ యుద్ధం 1947 | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||
ప్రత్యర్థులు | |||||||||
భారతదేశం జమ్మూ-కాశ్మీర్ రాజ్యం(princely state) | పాకిస్తాన్ | ||||||||
సేనాపతులు, నాయకులు | |||||||||
Field Marshal K M Cariappa Lt Gen S M Shrinagesh Maj Gen K S Thimayya Maj Gen Kalwant Singh | Maj Gen Muhammed Akbar Khan | ||||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||||
1,104 మరణం[1](భారత సైన్యం)
684 మరణం(రాష్ట్రీయ దళాలు)[2] [3] 3,152 గాయపడ్డారు[1] | 1,500 మృతి[4] (పాకిస్తాన్ సైన్యం) 2,633 మృతి, 4,668 గాయపడ్డారు[5] |
1815కు ముందు జమ్మూ-కాశ్మీరు ప్రాంతం 22 చిన్న స్వతంత్ర రాజ్యాలుగా ఉండేది. ఇందులో 16 హిందూ రాజ్యాలు, 6 మొహమ్మదిన్ రాజ్యాలు ఉండేవి[6]. వీటన్నిటినీ కలిపి పంజాబ్ పర్వత రాజ్యాలుగా పిలిచేవారు. 1757 నుండి 1857 వరకు తమ రాజ్యాలను మొఘల్ సామ్రాజ్యములో భాగంగా ఉంచి రాజ్పూత్ లు స్వయంగా పాలించారు. తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చాక బ్రిటిష్ సామ్రాజ్యములోకి వచ్చింది.
నిజానికి పంజాబ్ పర్వత రాజ్యాలకి చెందిన ఈ రాజ్పూట్ లు మొఘల్ సామ్రాజ్యానికి ప్రధాన బలం. వీరు ఎన్నో యుద్ధాలలో ముఖ్యంగా సిక్కులతో జరిగిన యుద్ధాలలో మొఘల్ ల తరఫున పోరాడారు. బిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎదుగుదల, తదనంతరం మొఘల్ సామ్రాజ్యం పతనంతో పంజాబ్ పర్వత రాజ్యాల శక్తి కూడా క్షీణించింది. దీని పర్యవసానంగా సిక్కు నాయకుడు రంజిత్ సింగ్ కు ఈ రాజ్యాలు తేలిక లక్షాలయ్యాయి. ఒక్కొక్కటిగా అన్నిటినీ ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. చివరకు రంజిత్ సింగ్ జయించిన అన్ని పంజాబ్ పర్వత రాజ్యాలు కలిసి జమ్మూ రాజ్యంగా ఏర్పడ్డాయి.
మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం 1845-1846 ల మధ్య ఈస్ట్ ఇండియా కంపెనీ, కాశ్మీరుపై సార్వభౌమాధికారం తమదేనని నొక్కి వక్కాణించిన సిక్కు సామ్రాజ్యానికి మధ్య జరిగింది. 1846లో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందం ప్రకారం సిక్కులు బీయస్, సట్లెజ్ నదుల మధ్య ఉన్న విలువైన భూమిని వదులుకోవడంతో పాటు 12 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టాల్సిన పరిస్ధతి వచ్చింది.
కానీ అంత సొమ్ము సిద్ధంగా లేకపోవడం వల్ల సిక్కు సామ్రాజ్యంలోని కాశ్మీరు ప్రాంతాన్ని 7,50,000 రూపాయలకి డోగ్రా రాజు గులాబ్ సింగ్కి ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పగించింది. గులాబ్ సింగ్ స్వయంప్రతిపత్తి గల జమ్మూ కాశ్మీరు[7] రాజ్యానికి తొలి మహారాజు అయ్యాడు. తద్వారా కొత్త రాజవంశాన్ని స్ధాపించాడు. బ్రిటిష్ పాలనలో స్వయంప్రతిపత్తి గల రెండో అతి పెద్ద రాజ్యంగా కాశ్మీరు గుర్తింపు పొందింది.
భారతదేశం నండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత కూడా జమ్మూ-కాశ్మీరు రాజ్యంపై భారత్-పాక్ లు తమలో కలవాలని ఒత్తిడి చేశాయి. భారతదేశ విభజనకి సంబంధించిన విలీన ఒప్పందాల ప్రకారం అన్ని రాజ్యాలకు చెందిన రాజులకు భారత్ లేదా పాక్ ను ఎన్నుకునే స్వేచ్ఛను ఇచ్చారు. ఇరు దేశాలని కాదని స్వతంత్రంగా ఉండే హక్కు కూడా వారికి ఉంది. కాశ్మీరు మహారాజు, హరి సింగ్ తన రాజ్యాన్ని ఇరు దేశాలను కాదని స్వతంత్రంగా ఉంచాలని అనుకున్నాడు. బ్రిటిష్ దళాలు భారత దేశాన్ని వీడిన వెంటనే పశ్చిమ కాశ్మీరులోకి[8] ముస్లిమ్ తీవ్రవాదులు ప్రవేశించి దాడి చేశారు. వీరిలో పష్తూన్ తెగకు చెందిన వారు కూడా ఉన్నారు.
కాశ్మీరు రాజు తన సైన్యం ఈ దాడిని తిప్పిగొట్టలేదని భయపడి భారత సైన్యాన్ని సహాయం కోసం అర్ధించాడు. సహాయం కావాలనుకుంటే కాశ్మీరు భారతదేశంలో విలీనం కావాలని భారతదేశం షరతు పెట్టింది. తదనంతరం భారత ప్రభుత్వం మునపటి కాశ్మీరు రాజ్యాన్ని భారతదేశంలో విలీనాన్ని గుర్తించి, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. పాక్ దళాల బారి నుండి కాపాడటానికి ఆ రాష్ట్రానికి భారత దళాలను పంపింది. ఈ విలీనానికి చట్టబద్ధత ఉందా లేదా అన్న విషయం ఇప్పటికీ వివాదాస్పదంగా మిగిలింది. ఆ కాలపు మత ప్రాదిపదిక జనాభా లెక్కలు లేకపోవడంతో హరి సింగ్ నిర్ణయంలో ప్రజల అభిప్రాయం పరిగణలోకి తీసుకున్నారా లేదా అనేది నిర్ధారించడం కష్టం. తదనంతర కాలంలో హిందువుల ఊచకోత, 5 లక్షల హిందువులను కాశ్మీరు ప్రాంతం నుండి గెంటివేయడంతో ఇప్పుడు అక్కడ ముస్లిమ్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటికీ కాశ్మీరీ పండిట్లు ఢిల్లీలో శరణార్ధులుగా దుర్బర జీవితాన్ని గడుపుతున్నారు. మరోవైపు జమ్మూ ప్రాంతంలో ఇప్పటికీ అధిక శాతం హిందూ మతానికి చెందిన వారే.
పాకిస్తాన్ వాదన ప్రకారం కాశ్మీరు మహారాజుకి భారత సైన్యాన్ని పిలిపించే హక్కు లేదు. ఎందుకంటే కాశ్మీరు మహారాజు వంశపారంపర్యంగా ఉన్న రాజు కాదు, కేవలం బ్రిటిష్ వారిచే నియమితుడయ్యాడు. బ్రిటిష్ పాలనకు ముందు కాశ్మీరు మహారాజు అనే పదవి లేదు. అందుకని పాకిస్తాన్ చర్య తీసుకుందామని నిర్ణయించుకుంది. కానీ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు డగ్లస్ గ్రేసీ సైన్యాన్ని పంపడానికి అంగీకరించలేదు. పాకిస్తాన్ గవర్నర్ జనరల్, మహమ్మద్ అలీ జిన్నా ఇచ్చిన ఆజ్ఞను పాటించడానికి విభేదించాడు. కాశ్మీరులోకి ప్రవేశిస్తున్న భారత సైన్యం బ్రిటిష్ సామ్రాజ్యానికి విధేయతగా ఉండటం వల్ల వారితో యుద్ధం సొంత సైన్యంపై యుద్ధం చేసినట్లవుతుందని డగ్లస్ గ్రేసీ వాదించాడు. పాకిస్తాన్ చివరకు సైన్యాన్ని పంపగలిగింది. కాని అప్పటికే భారత సైన్యం మూడింట రెండు వంతులు కాశ్మీరు భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నది. గిల్గిట్, బల్టిస్తాన్ సంస్థానాలను గిల్గిట్, చిత్రాల్ కు చెందిన దళాలు పాక్ లో విలీనం కోసం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.
యుద్ధం కాశ్మీర్ రాజ్యం సరిహద్దు లోపలే జరిగింది. భారత సైన్యం, పారామిలిటరీ దళాలు, కాశ్మీర్ రాజ్యపు దళాలు కలిసి పాకిస్తాన్ సైన్యం, పారామిలిటరీ, NWFP కి చెందిన ప్రాంతీయ దళాలను ఎదుర్కొన్నారు.(పాకిస్తాన్ దళాలు తమను తాము స్వతంత్ర కాశ్మీరు దళాలు(ఆజాద్ కాశ్మీర్ ఫోర్సెస్, AZK దళాలు) గా వ్యవహరించుకున్నారు). కాశ్మీర్ రాజ్యపు దళాలు AZK దళాల తొలి దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేవు. దీనికి కారణం ఈ దళాలను సరిహద్దుల వద్ద సైనిక కార్యకలాపాలను నిరోధించడానికి పల్చగా మొహరించారు. కాశ్మీర్ రాజ్య రక్షణ వ్యవస్థ ఈ దాడికి కుప్పకూలింది. చివరికి కొందరు AZK దళాలతో కలిసిపోయారు..
AZK దళాలకు మొదట్లో లభించిన విజయాలను సద్వినియోగ పర్చుకోకపోవడంతో విలీన ఒప్పందం కుదిరిన వెంటనే భారత దళాలను ఆకాశమార్గం గుండా కాశ్మీరులోకి పంపే అవకాశం లభించింది. AZK దళాలను ఎదురించడానికి భారత దళాలు రావడంతో 1947 సంవత్సరం చివరకి పోరాటం ఆవిరైపోయింది. కాని ఎత్తున ఉన్న హిమాలయా ప్రాంతాలలో AZK దళాలు ప్రగతి కనబర్చారు. కాని అక్కడ కూడా 1948 జూన్ సమయానికి లేహ్ సరిహద్దుల దగ్గర వెనుదిరగాల్సి వచ్చింది. 1948 సంవత్సరం మొత్తం చాలా చిన్న చిన్న యుద్ధాలు జరిగినా ఇరు పక్షాలకీ వ్యూహాత్మక అనుకూలత లభించలేదు. ప్రస్తుతం నియంత్రణ రేఖగా పిలవబడుతున్న పరిధుల వద్ద ఇరు పక్షాలు ఉండిపోయాయి. 1948 డిసెంబరు 31 న అధికారికంగా కాల్పుల విరమణ ప్రకటించారు.
యుద్ధాన్ని కాలానుక్రమంగా పది భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగాన్ని కింద వివరించడం జరిగింది.
మొట్టమొదటి దండయాత్ర యొక్క ముఖ్య ఉద్ధేశం కాశ్మీరు లోయని ముఖ్యంగా వేసవి రాజధాని శ్రీనగర్ని ఆక్రమించుకోవడం.(జమ్మూ శీతాకాలపు రాజధాని). ముజఫ్ఫరాబాద్, డోమెల్ చుట్టుపక్కల ఉన్న సరిహద్దు ప్రాంతాల వద్ద మొహరించిన రాష్ట్ర దళాలును AZK దళాలు త్వరలోనే ఓడించాయి. (కొన్ని రాష్ట్ర దళాలు తిరుగుబాటు చేసి AZK దళాలతో కలిశాయి). రాజధాని వైపు వెళ్ళే మార్గం తెరుచుకుంది. రాష్ట్ర దళాలు తేరుకునే లోపు శ్రీనగర్ వైపు బయలుదేరడం బదులు AZK దళాలు ఆక్రమించుకున్న నగరాలలోనే ఉండి ఆ ప్రాంతాన్ని కొల్లగొట్టడం, ఇతర నేరాలకు పాల్పడ్డారు.[9] పూంచ్ లోయ లో, రాష్ట్ర దళాలు పట్టణాలకు వెనుదిరగగా అక్కడ వారిని ముట్టడించారు.
విలీనం తర్వాత, భారత్ ఆకాశ మార్గం గుండా దళాలను, సామాగ్రి శ్రీనగర్ పంపింది. అక్కడ వారు రాష్ట్ర దళాలతో కలిసి రక్షణ వలయం ఏర్పాటు చేసి AZK దళాలను నగర పొలిమేరల వద్ద ఓడించారు. విజయవంతమైన రక్షణ చర్యలలో భాగంగా భారత్ కవచరక్షిత కార్లతో చేసిన విన్యాసాలతో శత్రువులను తరిమికొట్టడం కూడా జరిగింది. ఓడిపోయిన AZK దళాలను బారాముల్లా, యురి వరకు తరిమికొట్టి ఆ పట్టణాలను తిరిగి స్వాధీన పర్చుకున్నారు.
పూంచ్ లోయలో AZK దళాలు రాష్ట్ర దళాలను చుట్టుముట్టడం కొనసాగింది.
గిల్గిట్లో ఆ రాజ్యపు సైనిక దళాలు(గిల్గిట్ స్కౌట్స్) AZK దళాలతో కలిసి ఉత్తర భాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. చిత్రాల్కి చెందిన దళాలు కూడా AZK దళాలతో కలిసాయి. చిత్రాల్ పాలకుడు పాకిస్తాన్ లో తన రాజ్యాన్ని విలీనం చేశాడు.
భారత దళాలు యురి, బారాముల్లా స్వాధీనం చేసుకున్నాక AZK దళాల కోసం వెతకడం ఆపేశాయి. పూంచ్ కి విముక్తి కలిగించడానికి దక్షిణ దిక్కుకు కొంత బలగాన్ని పంపింది. పూంచ్ కి బలగాలు చేరుకున్నప్పటికీ అక్కడ ఆక్రమణలు తొలగించలేకపోయాయి. కోట్లికి రెండో బలగం చేరుకున్నప్పటికీ వారు బలవంతంగా ఖాలీ చేయాల్సివచ్చింది.
మరోవైపు మీర్పుర్ని AZK దళాలు 1947 నవంబరు 25 న స్వాధీన పర్చుకున్నాయి. ఆ తర్వాత అక్కడ హిందువులని, సిక్కులని ఊచకోత కోశారు. ఆ ప్రాంతాన్నంతా కొల్లగొట్టారు. అలీబేగ్ కాంప్ లో కూడా ఇది కొనసాగింది.[10] దాదాపు 20 వేల మందిని చంపారు. ఆడవారి మీద అత్యాచారాలకు ఒడిగట్టారు. అఘాయిత్యాలకు పాల్పడ్డారు.[11]
పాకిస్తానీ/AZK దళాలు ఝాన్గర్ మీద దాడి చేసి స్వాధీన పర్చుకున్నాయి. తర్వాత నౌషేరా మీద దాడి చేసినా సఫలీకృతం కాలేదు. ఇతర పాకిస్తానీ/AZK దళాలు యురి మీద వరుస దాడులు చేసినా సఫలీకృతం కాలేదు. దక్షిణాన భారత్ చేసిన చిన్న దాడితో ఛామ్బ్ ను సురక్షితం చేశారు. యుద్ధములో ఈ సమయానికి అదనపు బలగాలు అందుబాటులోకి రావడంతో భారత్ తన పరిధులను స్థిరము చేసుకుంది.
భారత దళాలు దక్షిణాన ఎదురుదాడి చేసి ఝాన్గర్, రాజౌరిలను తిరిగి స్వాధీన పర్చుకున్నారు. కాశ్మీర్ లోయలో పాకిస్తాని/AZK దళాలు యురి రక్షక దళాల పై దాడిని కొనసాగించాయి. ఉత్తరాన ఉన్న స్కర్దుని పాకిస్తాని/AZK దళాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.
AZK దళాలు ఝాన్గర్ మీద జరిపిన ఎన్నో ఎదురు దాడులను భారత్ దళాలు కాచుకున్నాయి.ఈ దాడులకు పాక్ దళాల సహకారం అందించాయి. కాశ్మీర్ లోయలో భారత్ దాడి చేసి టిత్వెయిల్ ను ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఎత్తైన హిమాలయా ప్రాంతాల మీద AZK దళాలు మంచి ప్రగతి కనబరిచాయి. బలగాలను చొరబాట్ల ద్వారా రప్పించి లేహ్ను ముట్టడించి కార్గిల్ను ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. స్కర్దులోని భారత రక్షక బలగాల్ని ఓడించాయి.
భారత్ దళాలు కాశ్మీర్ లోయ ప్రాంతంలో దాడిని కొనసాగిస్తూ కేరన్, గురాయిస్ లను ఆధీనంలోకి తేవడం కోసం ఉత్తర దిక్కుకు పయనించాయి. టిత్వెయిల్ మీద జరిగిన ఎదురుదాడిని కూడా భారత్ తిప్పికొట్టింది. పూంచ్ లోయలో ముట్టడిలో ఉన్న దళాలు బయటపడి తాత్కాలికంగా బయటి ప్రపంచంతో తిరిగి సంబంధాలు నెలకొల్పాయి. కాశ్మీర్ రాజ్యపు బలగాలు స్కర్దుని గిల్గిట్ బలగాల బారి నుండి కాపాడుకోగలిగాయి. అందువల్ల వారు ఇండస్ లోయ గుండా లేహ్ ప్రాంతం వైపు కొనసాగలేకపోయారు. ఆగస్టులో చిత్రాల్ దళాలు మాటా-ఉల్-ముల్క్ నేతృత్వంలో స్కర్దుని ముట్టడించి శతఘ్నుల సహాయంతో తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. దీంతో గిల్గిట్ దళాలు లధాక్ లోకి చొచ్చుకుపోయేందుకు అవకాశం వచ్చింది.
ఈ సమయంలో యుద్ధక్షేత్రం స్ధిరపడుతోంది. ఇరవైపుల కార్యకలాపాలు తగ్గాయి. ద్రాస్ వైపు భారత్ దళాల పై జరిగిన విఫల దాడి ఒకే ఒక్క పెద్ద సంఘటణ (ఆపరేషన్ డక్). పూంచ్ ముట్టడి కొనసాగింది.
భారత దళాలు అన్ని ప్రాంతాలలో ఆధిక్యాన్ని రాబట్టడం మదలైంది. సంవత్సరకాలంగా ముట్టడిలో ఉన్న పూంచ్ ని చివరకి విడిపించగలిగారు. ఎత్తైన హిమాలయా ప్రాంతాలలో మంచి ప్రగతి కనబర్చిన గిల్గిట్ దళాలు చివరకు ఓటమి చవిచూశారు. భారత దళాలు కార్గిల్ దాకా దూసుకుపోయారు. కాని సామాగ్రి సరఫరాలో సమస్యలు రావడంతో అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. జోజి లా కనుమ దారి(Zoji-La pass) నుంచి యుద్ధట్యాంకులతో దాడి చేసి ద్రాస్ ను ఆధీనంలోకి తెచ్చుకున్నారు.(యుద్ధట్యాంకులు అంత ఎత్తులో ఉపయోగించడం సాధ్యపడదని అనుకున్నారు) 1945లో బర్మాలో వచ్చిన అనుభవము యుద్ధట్యాంకుల ఉపయోగంలో పనికొచ్చింది.
ఈ దశలో భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఐక్యరాజ్య సమితిని కలుగచేసుకోవాల్సిందిగా కోరారు. 1948 డిసెంబరు 31న ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది. కాల్పుల విరమణకు కొద్ది రోజుల ముందు పాకిస్తానీలు ఎదురు దాడి చేయడంతో యురి, పూంచ్ మధ్య ఉన్న రోడ్డు మార్గం తెగిపోయింది. చర్చల అనంతరం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. కాల్పుల విరమణకు సంబంధించిన నిబంధనలు UNCIP తీర్మానంలో 1948 ఆగస్టు 13 న పొందుపరిచారు.[12] 1949 జనవరి 5 న ఐక్యరాజ్య సమితి స్వీకరించింది. ఈ తీర్మానం ప్రకారం పాకిస్తాన్ తన బలగాలను వెనక్కి పిలిపించాలి. శాంతి భద్రతలు కాపాడటానికి భారత్ కనీస సంఖ్యలో బలగాలను అక్కడ ఉంచేందుకు సమ్మతించాలి. ఈ రెండు నిబంధనలు అమలౌతే అక్కడ అభిప్రాయసేకరణ జరిపి ఆ ప్రాంత భవిష్యత్తు తేల్చాలనుకున్నారు. మొత్తం మీద ఇరు పక్షాల వైపు 1,500 సైనికులు చొప్పున మరణించారు.[13] పాకిస్తాన్ కాశ్మీరులోని ఐదు వొంతులలో రెండు వొంతులు భూభాగాన్ని సాధించింది. ప్రపంచంలోని 8000 అడుగుల ఎత్తున్న మొత్తం 14 కొండలలో 5 కొండలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. మిగిలిన మూడొంతుల భూభాగం భారత్ ఆధీనంలో ఉంది. ఎక్కువ జనసాంద్రత, సారవంతమైన భూమి భారత్ లో కలిసింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.