పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
From Wikipedia, the free encyclopedia
Remove ads
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ లోక్సభ సభ్యుడు. 2014 నుండి 2019 వరకు ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుండి 16వ లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]
Remove ads
జీవిత విషయాలు
శ్రీనివాస్ రెడ్డి 1959, నవంబరు 4న రాఘవరెడ్డి, స్వరాజ్యం దంపతులకు ఖమ్మం జిల్లా, కల్లూరు మండలంలోని నారాయణపురంలో జన్మించాడు. వ్యవసాయదారుడిగా పనిచేశాడు. 1984లో కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ విద్యను, హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్యలో బిఏ డిగ్రీని పూర్తిచేశాడు.[3]
వ్యక్తిగత జీవితం
ఈయనకు 1992, మే 8న మాధురితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (హర్షా రెడ్డి), ఒక కుమార్తె (సప్ని) ఉన్నారు.[4]
సామాజిక కార్యక్రమాలు
1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామోదయ పథకంలో పేరువంచ మేజర్పై క్రాస్వాల్ నిర్మాణం చేశాడు. ఆ క్రాస్వాల్ నిర్మాణం వల్ల 450 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. అలా కాంట్రాక్టర్గా మారి ప్రభుత్వం తరపున అనేక నిర్మాణాలు చేశాడు.[4]
రాజకీయ ప్రస్థానం
కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతూ, వివిధ హోదాల్లో పనిచేశాడు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కొంతకాలం తెలంగాణ వైకాపా అధ్యక్షుడిగా ఉన్నాడు. 2014లో జరిగిన 16వ లోక్సభ ఎన్నికలలో ఆ పార్టీ తరపున ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుండి పోటీచేసి, టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 11,974 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు.[5] ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.
2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికలలో, 2019 17వ లోక్సభ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చాడు.[6] ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను 2023 ఏప్రిల్ 10న బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసింది.[7][8] ఆయన 2023 జూలై 2న ఖమ్మంలో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరగా, రాహుల్ గాంధీ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు.[9][10] ఆయన 2023 జూలై 14న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (టీ-పీసీసీ) ప్రచార కమిటీ కో-ఛైర్మన్గా నియమితులయ్యాడు.[11]
ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో పాలేరు అభ్యర్థిగా ప్రకటించగా[12][13], పాలేరు ఎమ్మెల్యేగా గెలిచి[14], రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 2023 డిసెంబరు 7న రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి[15][16], డిసెంబరు 14న డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.[17]
పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో 2023 డిసెంబరు 18న మహబూబాబాద్, ఖమ్మం లోక్సభ నియోజకవర్గల ఇన్చార్జ్గా కాంగ్రెస్ పార్టీ నియమించగా,[18] డిసెంబరు 24న వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.[19]
Remove ads
నిర్వహించిన పదవులు
- 2014, సెప్టెంబరు 1 నుండి 2019 వరకు రవాణా, పర్యాటక, సంస్కృతి శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నాడు.
- ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యులుగా పనిచేశాడు.[20]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads