ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా ఆదోని మండల పట్టణం From Wikipedia, the free encyclopedia
ఆదోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం. అదేపేరుగల మండల ప్రధాన కేంద్రం. ఆదోని కర్నూలు నుండి పశ్చిమ దిశగా 101 కి.మీ దూరంలో వుంది.
పట్టణం | |
Coordinates: 15.63°N 77.28°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు జిల్లా |
మండలం | ఆదోని మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 106.4 కి.మీ2 (41.1 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 1,84,625 |
• జనసాంద్రత | 1,700/కి.మీ2 (4,500/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1013 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8512 ) |
పిన్(PIN) | 518301 |
Website |
రాయచూరు అంతర్వేదికి సమీపంలో ఉండటం వలన మధ్యయుగపు దక్కన్ చరిత్రలో ఆదోని కీలకపాత్ర పోషించింది. సాంప్రదాయం ప్రకారం ఆదోని క్రీ.పూ.1200లో బీదరు రాజు భీంసింగ్ పాలనలో చంద్ర సేనుడు స్థాపించాడని ప్రతీతి.[2] ఆ తరువాత విజయనగర రాజుల పాలనలో ఉంది. 1564లో తళ్ళికోట యుద్ధానంతరం ఆదోని ఆదిల్ షాహీ వంశ పాలకుల చేతిలోకి వచ్చింది. ఆదిల్ షాహీలు వెలుపలి ప్రాకారాలు, దిగువ కోటను నిర్మించి కోటను పటిష్ఠం చేశారు. అప్పట్లో ఆదోని కోట కేంద్రముగా ఉన్న ఆదోని సీమ ఆదాయము 675,900 పగోడాలు. కోటలో 4వేల మంది ఆశ్వికదళము, 8 వేల సైనికుల పదాతిదళము ఉండేది. 1690లో ఔరంగజేబు సేనానులు గట్టి పట్టుతో ఆదోనిపై దాడిచేసి దాన్ని వశపరచుకొని బీజాపూరు సుబాలో భాగంగా మొఘల్ సామ్రాజ్యంలో కలిపారు. దక్షిణాదిపై ఢిల్లీ పట్టు సడలటంతో ఆదోని అసఫ్జాహీల రాజ్యంలో భాగమై ఈ కుటుంబంలో చిన్న విభాగానికి సామంతరాజ్యమైంది. ఈ విధంగా 1748లో ముజఫర్ జంగ్ చేతిలో ఉండి 1752లో ఆయన మరణము తర్వాత ఆయన కుమారునికి సంక్రమించింది. 1756లో హైదరాబాదు నిజాం తన సోదరుడైన బసాలత్ జంగ్ కు ఆదోని ని జాగీరుగా ఇచ్చాడు.[3] బసాలత్ జంగ్ ఆదోని ని రాజధానిగా చేసుకొని స్వతంత్రరాజ్యాన్ని స్థాపించే ప్రయత్నం చేశాడు. హైదర్ అలీ రెండుసార్లు ఆదోని కోటను ముట్టడించటానికి విఫలయత్నం చేశాడు. 1758లో ఈ కోట గోడల వద్దే హైదర్ అలీ మరాఠులను ఓడించాడు. ఆ మరు సంవత్సరం చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ నేలమట్టంచేశాడు కానీ ఆదోని కోట మాత్రం వశం కాలేదు. 1782లో బసాలత్ జంగ్ మరణించాడు. ఆ వెనువెంటనే హైదర్ అలీ కూడా మరణించాడు. 1786లో టిప్పూ సుల్తాన్ నెలరోజులపాటు కోటపై ముట్టడి చేసి వశపరచుకొని కొల్లగొట్టాడు. సంధి జరిగిన తర్వాత ఆదోనిని నిజాంకు తిరిగి ఇచ్చేశాడు. 1799లో నిజాం ఆదోని కోటను ఆంగ్లేయులకు దత్తం చేశాడు.
16వ శతాబ్దంలో ఆదోని యాదవుల పాలనలో ఉంది. అప్పుడు దీనిపేరు యాదవగిరి. యాదవగిరి ముస్లింల పాలనలో ఆదవోని అయ్యింది. ఆదవోని కాలక్రమంలో ఆదోనిగా రూపాంతరం చెందింది. బ్రిటీషు పాలనలో ఆదోని మద్రాసు ప్రెసిడెన్సీలోని బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది. అప్పట్లో దక్షిణాది యొక్క ధాన్యపు మార్కెట్టుగా ప్రసిద్ధి చెందింది. ఆదోని బట్టల, బంగారు మార్కెట్టుకు కూడా పేరొందినది. వందకు పైగా ప్రత్తి మిల్లులు, నూనె మిల్లులతో ప్రత్తివ్యాపారానికి ఆదోని ముఖ్యకేంద్రము. ఈ పట్టణానికి రెండో ముంబాయి అని కూడా పేరు. ప్రస్తుతం ఆదోనిలో ఎటువంటి ప్రత్తి మిల్లులు పనిచేయటం లేదు. భీమాస్ వారి ఆయిల్ మిల్లుకు మాత్రం ఇంకా పేరుంది. ఆ తరువాత జనతా మిల్ జిన్ స్టోర్స్ వారు మొదటి సారిగా ఆదోనిలో ఒక మిల్ జిన్ స్టోర్ ఏర్పాటు చేసారు.
మధ్యయుగంలో విజయనగర సామ్రాజ్యములో ముఖ్య పట్టణమైన ఆదవోని నేడు వస్త్ర పరిశ్రమలకు పేరుపొందింది. కొండపైన జీర్ణావస్థలో ఉన్న కోట దుర్గం ముస్లింల పాలనలో ప్రభుత్వ కేంద్రంగా ఉండేది. 18వ శతాబ్దపు ఆంధ్రదేశపు యుద్ధాలలో తరచూ ఆదోని కోట ప్రస్తావన ఉంది.[4]
2011 భారత జనాభా లెక్కలప్రకారం, ఆదోని పట్టణంలో మొత్తం 36,650 కుటుంబాలు నివసిస్తున్నాయి. అదోని మొత్తం జనాభా 184,625. అందులో 91,736 మంది పురుషులు కాగా, 92,889 మంది మహిళలు. సగటు లింగ నిష్పత్తి 1,013.[5]
ఆదోని పట్లణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 21967, ఇది మొత్తం జనాభాలో 12%. 0-6 సంవత్సరాల మధ్య 11203 మగ పిల్లలు, 10764 ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 961, ఇది సగటు లింగ నిష్పత్తి (1,013) కన్నా తక్కువ. పట్టణ అక్షరాస్యత 65.9%. ఈ విధంగా కర్నూలు జిల్లాలో 60% తో పోలిస్తే ఆదోని అక్షరాస్యత ఎక్కువ. ఆదోనిలో పురుషుల అక్షరాస్యత రేటు 74.24%, స్త్రీ అక్షరాస్యత రేటు 57.64% గా ఉంది.[5]
రాష్ట్రంలోని అత్యంత పురాతమైన మున్సిపాలిటీలలో ఆదోని ఒకటి. ఆదోని ప్రజల కోరిక మేరకు 1865 మేలో మున్సిపాలిటీగా వ్యవస్థీకరించారు.[6] ఆదోని పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
ఇక్కడ టి.బి. యూనిట్ కేంద్రం ఉంది.
రాష్ట్రంలోని ఆంజనేయస్వామి ఆలయాలలో యాదాద్రి శ్రీ వీరాంజనేయ భైరవ దేవస్వామి ఆలయం ఒకటి. యాదాద్రి, యాదవగిరి అని పిలువబడే ఈ క్షేత్రం గురించి చాలమందికి తెలియకపోవచ్చు. కానీ 'ఆదోని శ్రీ వీరాంజనేయ భైరవదేవస్వామి ఆలయం' అంటే ఇట్టే తెలిసిపోతుంది. ఆదోని పట్టణంలో రెండు కొండలపైన వున్న ఈ పుణ్యస్థలం నిత్యం భక్త జనసందోహంతో కళకళలాడుతూంటుంది. ఆ స్వామి కరుణ కోసం భక్తులు వస్తూంటారు. విజయనగర సామ్రాజ్య సైనిక స్థావరంగా ఉన్న ఆదోని, ఆరోజుల్లో యాదవగిరి లేక యాదాద్రి అని పిలువబడుతుండేది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం బీజాపూర్ సుల్తానుల ఆధీనంలోకి వచ్చింది. ఆ కాలంలోనే ఆదోని కోట బాగా అభివృద్ధి చేయబడిందని అంటారు. అనంతరం మొగలాయిల పరిపాలనలో, ఆ తదనంతరం నిజాము నవాబుల పరిపాలనలో నున్న ఆదోని, ఈ విధంగా చారిత్రాత్మకంగా ఎంతో ఘనచరిత్రను కలిగి వుందని తెలుస్తోంది.
ఆదోని పట్టణంలోని ఆస్పత్రి రహదారిలో ఉన్న ఈ అనాధ వృద్ధాశ్రమం, అనాధ వృద్ధులకు ఆశ్రయం కల్పించుచున్నది. శ్రీ విక్టర్ పాల్ ఫిలిప్స్, 2002లో ముగ్గురు అనాధ వృద్ధులతో దీనిని ప్రారంభించినారు. అప్పటినుండి దాతల సహకారంతో, ఈ ఆశ్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వృద్ధులు, సహాయకులతో కలిసి మొత్తం 65 మంది ఈ ఆశ్రమంలో ఆశ్రయం పొందుచున్నారు. ప్రత్యేక సందర్భాలలో ప్రజలు ఈ ఆశ్రమానికి వచ్చి, అనాధలకు అన్నదానం చేయుచున్నారు. దీనితోపాటు దుస్తులు, దుప్పట్లు అందజేయుచున్నారు. మరికొందరు వైద్యసేవలు అందించుచున్నారు. ఎక్కడైనా కష్టాలలో ఉన్న అనాధవృద్ధులెవరైనా ఉంటే,ఈ ఆశ్రమ నిర్వాహకులకు సమాచారం అందిస్తే, వారిని ఆశ్రమంలో చేర్చుకుంటారు.
1957లో నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో నంద్యాల నియోజకవర్గాన్ని రద్దుచేసి కొత్త ఆదోని లోక్సభ నియోజవర్గాన్ని సృష్టించారు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.