ఆర్యుల వలస సిద్ధాంతం
ఇండో ఆర్యులు భారత ఉపఖండం లోకివలస వచ్చారనే సిద్ధాంతం / From Wikipedia, the free encyclopedia
ఇండో-ఆర్య ప్రజలు భారత ఉపఖండంలోకి వలస వచ్చారనే పరికల్పనను ఆర్యుల వలస సిద్ధాంతం అంటారు. దీన్ని ఇండో-ఆర్య వలసలు[note 1] అని కూడా అంటారు. ఇండో-ఆర్య భాషలు మాట్లాడే ఒక భాషా జాతి సమూహమే ఇండో ఆర్యులు. నేటి ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులలో మాట్లాడే భాషలు ఈ భాషా కుటుంబం లోనివే. మధ్య ఆసియా నుండి ఈ ప్రాంతంలోకీ, అనటోలియా (పురాతన మిటాని) లోకీ ఇండో-ఆర్య జనాభా కదలికలు సా.పూ 2000 తరువాత ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. చివరి హరప్పన్ కాలం తరువాత ఈ వలసలు నెమ్మదిగా వ్యాపించి, ఉత్తర భారత ఉపఖండంలో భాషా మార్పుకు దారితీసిందని ఈ సిద్ధాంతం చెబుతోంది. ఇండో-ఆర్యన్లతో దగ్గరి సంబంధం ఉన్న ఇరానియన్లు ఇరానియన్ భాషలను ఇరానియన్ పీఠభూమిలోకి తీసుకువచ్చారు.
ఇండో-ఆర్యుల పుట్టుకకు, ఇరానియన్ల పుట్టుకకూ మూలమైన ప్రోటో-ఇండో-ఇరానియన్ సంస్కృతి కాస్పియన్ సముద్రానికి ఉత్తరాన ఉన్న మధ్య ఆసియా గడ్డిభూములపై సింటాష్ట సంస్కృతిగా (2200 [2] [3] [4] –1800 BCE) [5] [6] [7] [8] అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం ఆధునిక కాలపు రష్యా, కజాఖ్స్తాన్లలో ఉంది. ఆ తరువాతి కాలంలో ఇది ఆరల్ సముద్రం చుట్టూ ఆండ్రోనోవో సంస్కృతిగా (క్రీ.పూ. 2000-900), వృద్ధి చెందింది.
ఇండో-ఆర్యులు క్రీ.పూ 2000 - క్రీ.పూ 1600 మధ్య కాలంలో ఇరానియన్ల నుండి విడిపోయి, [9] దక్షిణ దిశగా బాక్టీరియా-మార్జియానా సంస్కృతి (BMAC) వైపు వలస వెళ్ళారు. దాని నుండి వారు తమ విలక్షణమైన మత విశ్వాసాలను, అభ్యాసాలను స్వీకరించారు. BMAC నుండి, ఇండో-ఆర్యులు అనటోలియాకు వలస వెళ్ళారు. బహుశా పంజాబ్ (ఉత్తర పాకిస్తాన్, భారతదేశం) లోకి కూడా అనేక తరంగాలుగా వలస వెళ్ళి ఉండవచ్చు. ఇరానియన్లు, సా.పూ. 800 లో ఇరాన్లోకి వలస వెళ్ళారు. ఈ రెండు శాఖలూ తమతో ఇండో-ఇరానియన్ భాషలను తీసుకువెళ్ళాయి.
18 వ శతాబ్దం చివరలో, పాశ్చాత్య భారతీయ భాషల మధ్య సారూప్యతలు గుర్తించిన నేపథ్యంలో ఇండో-యూరోపియన్ భాషా కుటుంబాన్ని కనుగొన్న తరువాత ఇండో-యూరోపియన్ ప్రజల వలస సిద్ధాంతాన్ని కల్పన చేసారు. ఈ సారూప్యతలను బట్టే, ఒకే మూలాన్ని ప్రతిపాదించారు. ఏదో ఒక అసలు జన్మస్థానం (మాతృభూమి) నుండి వాళ్ళు వలసల ద్వారా వ్యాపించి ఉంటారని కల్పన చేసారు.