మిస్సమ్మ (1955 సినిమా)
1955 తెలుగు సినిమా / From Wikipedia, the free encyclopedia
మిస్సమ్మ చిత్రం జనవరి 12 1955 న విడుదలైంది. ఇది ఒక అద్భుతమైన పూర్తినిడివి హాస్య చిత్రం. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో రుపోందిన ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అతి పెద్ద హీరోలుగా పేరు గాంచిన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఘన విజయము సాధించిన ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించినది మాత్రము మహానటి సావిత్రి. ఎస్వీ రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, ఋష్యేంద్రమణి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, బాలకృష్ణ, దొరైస్వామి తదితరులు నటించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా ఒక చిన్న పాత్రలో మీకు కనిపిస్తారు.
మిస్సమ్మ (1955 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎల్వీ ప్రసాద్ |
---|---|
నిర్మాణం | నాగిరెడ్డి, చక్రపాణి |
రచన | చక్రపాణి |
చిత్రానువాదం | చక్రపాణి |
తారాగణం | నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, ఋష్యేంద్రమణి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
గీతరచన | పింగళి నాగేంద్రరావు |
నిడివి | 181 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సావిత్రికి ఈ సినిమాతో చక్కని అభినేత్రిగా మంచి పేరు వచ్చింది. ఆమె ఇక చిత్ర పరిశ్రమలో తిరిగి చూడ లేదు. మిస్సమ్మ చిత్రము యొతిష్ బెనర్జీ అనే బెంగాలి రచయిత యొక్క "మన్మొయీ గర్ల్స్ స్కూల్" అనే హాస్య రచన ఆధారంగా చక్రపాణి రచించగా ఎల్వీ ప్రసాదు దర్శకత్వంలో రూపొందిచబడింది. సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, రేలంగి, అల్లు రామలింగయ్య మొదలైన వారి నటనతో సినిమా పూర్తి వినోదాత్మకంగా రూపొందింది.
ఈ సినిమాకు పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నదగ్గ వాటిలో కొన్ని. ఆయన సాహిత్యమూ, ఎ.ఎం.రాజా, పి.లీల, పి.సుశీల గార్ల గాత్రమాధుర్యమూ కలిసి మిస్సమ్మ సినిమా పాటలను అజరామరం చేసాయి. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు ఈనాటికీ తెలుగు వారిని అలరిస్తూ ఉన్నాయి. పి.లీల పాడిన కరుణించు మేరిమాత అనేపాట హృదయాలను తాకుతుంది.
సినిమా చిత్రీకరణ మద్రాసు (ప్రస్తుతం చెన్నై) చుట్టుపక్కల జరిగింది, 1954 డిసెంబరు నాటికల్లా చిత్రీకరణ పూర్తయింది. మిస్సమ్మ సినిమా 1955 జనవరి 12న తొలిసారి ప్రదర్శించారు, ఆపైన మరో రెండు రోజులకు థియేటర్ల వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లు రెండూ వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి, వందరోజులు పూర్తిచేసుకున్నాయి. ఈ ద్విభాషా చిత్రం నటీనటులకు,, స్టూడియోకి తెలుగు, తమిళ సినీ రంగాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగు జనజీవితంలో మిస్సమ్మ సినిమాలోని మాటలు, పాటలు భాగమైపోయాయి. 1957లో ఏవీఎం ప్రొడక్షన్స్ ఈ సినిమాని హిందీలోకి మిస్ మేరీగా నిర్మించారు. మిస్ మేరీ ఎల్.వి.ప్రసాద్కి బాలీవుడ్లో దర్శకుడిగా మొట్టమొదటి సినిమాగా నిలిచింది. 1991లో ముళ్ళపూడి వెంకటరమణ, రావికొండలరావు మిస్సమ్మ సినిమా కాన్సెప్టుని తిరగేసి, అడాప్ట్ చేసుకుని పెళ్ళిపుస్తకం కథ రాస్తే దాన్ని బాపు సినిమాగా తీశాడు, ఇదీ మంచి విజయం సాధించింది.