రాష్ట్రపతి పాలన
రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావడాన్ని రాష్ట్రపతి పాలన అంటారు. / From Wikipedia, the free encyclopedia
భారత దేశంలో ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వాన్ని సస్పెండు చేసి లేదా రద్దుచేసి, రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావడాన్ని రాష్ట్రపతి పాలన అంటారు. భారత రాజ్యాంగం లోని 356 వ అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం సంక్రమించింది. దీని ప్రకారం, రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని భావించినపుడు, దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నరు ఇచ్చిన నివేదికపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రపతి పాలన అమల్లో ఉండగా, రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్ర గవర్నరు పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ బాధ్యతల్లో భాగంగా గవర్నరు తనకు సహాయపడేందుకు అధికారులను నియమించుకోవచ్చు.
మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం ద్వారా పరిపాలన సాగిస్తుంది. ఈ మంత్రులు శాసనసభకు జవాబుదారీగా ఉంటారు. మంత్రులకు ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తాడు. గవర్నరు రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి మాత్రమే. వాస్తవానికి ముఖ్యమంత్రే రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణాధికారి. అయితే, రాష్ట్రపతి పాలనలో ఉండగా, మంత్రివర్గాన్ని రద్దు చేస్తారు. ముఖ్యమంత్రి ఉండరు. శాసనసభ సమావేశాలను వాయిదా (ప్రోరోగ్) వేస్తారు లేదా రద్దు చేస్తారు. రద్దు చేస్తే కొత్త ఎన్నికలు అనివార్యమౌతాయి.
జమ్మూ కాశ్మీరులో గవర్నరు పాలన అనే పద్ధ్తి కూడా ఉంది. అక్కడి ప్రభుత్వం విఫలమైనపుడు, జమ్మూ కాశ్మీరు రాజ్యాంగం లోని 92 వ విభాగం కింద గవర్నరు పాలన విధిస్తారు. రాష్ట్రపతి అనుమతితో గవర్నరు ఈ పాలన విధిస్తారు. ఆరు నెలల తరువాత కూడా గవర్నరు పాలనను ఎత్తివేసే వీలు కుదరకపోతే, అపుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. రాష్ట్రపతి పాలనకు, గవర్నరు పాలనకూ పెద్ద తేడా లేదు.
1994 లో ఎస్సార్ బొమ్మై కేసులో ఇచ్చిన తీర్పులో సుప్రీమ్ కోర్టు, ఇచ్ఛవచ్చిన రీతిలో రాష్ట్రపతి పాలన విధింపుకు అడ్డుకట్ట వేసింది. ఛత్తీస్గఢ్, తెలంగాణా రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పటివరకూ ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలన విధించలేదు.
Note:-ఆంధ్ర ప్రదేశ్ లో మొదటిసారి 1973 జనవరి 18 నుంచి 1973 డిసెంబరు 10 వరకు రాష్ట్రపతి పాలన విధించారు.