విష్ణువు
హిందూ దేవుడు, వైష్ణవ మతానికి మూలకేంద్రం / From Wikipedia, the free encyclopedia
హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో విష్ణువు ఒకరు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి యొక్క స్థితి కర్త, లయ కర్త, సృష్టికి మూలంగా భావిస్తారు. శ్రీవైష్ణవం సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాథుడు, పరబ్రహ్మము, సర్వేశ్వరుడు. శంకరాచార్యుని పంచాయతన విధానాన్ని అనుసరించే స్మార్తుల ప్రకారం విష్ణువు ఐదు ముఖ్యదేవతలలో ఒకడు.[1] యజుర్వేదం, ఋగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలు నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి.[2][3][4][5][6]
- శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
- విశ్వాథారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
- లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
- వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||
విష్ణు సహస్రనామ స్తోత్రం[7]లో విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, విశ్వరూపుడని, కాలాతీతుడని, సృష్టి స్థితి లయాధిపతియని, దేవదేవుడని కీర్తించింది. పురాణాలలో విష్ణువు వర్ణన ఇలా ఉంటుంది - నీలమేఘశ్యామవర్ణం కలవాడు, చతుర్భుజుడు, పంచాయుధములు ధరించినవాడు, పాల సముద్రంలో శేషునిపై పవళించినవాడు, శ్రీదేవి, భూదేవిలచే కొలువబడుచున్నవాడు, శ్రీవత్సచిహ్నమును, కౌస్తుభమును, వైజయంతీ మాలను ధరించినవాడు, గరుడునిపై ప్రయాణించువాడు.[8]
యుగయుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అవతరిస్తాడు. అలాంటి అనేక అవతారాలలో దశావతారములు ప్రసిద్ధములు. ముఖ్యముగా నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి వంటి అవతారాలలో విష్ణువు పూజింపబడుతాడు.[9][10]