శాతవాహనులు
From Wikipedia, the free encyclopedia
శాతవాహనులు దక్షిణ మధ్య భారతదేశాన్ని, కోటిలింగాల, ధరణికోట, జూన్నార్ ల నుండి సా.శ..పూ. 230 సం. నుండి సుమారు 450 సంవత్సరాలు పరిపాలించారు. శాతవానుల తొలి రాజధాని కోటిలింగాల.[1] కాని కొందరు చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని ఆంధ్రప్రదేశ్ లోని ధాన్యకటకం (అమరావతి) అని అభివర్ణిస్తున్నారు వీరి జనరంజక పరిపాలన వీరికి శాంతికాముకులుగా పేరు తెచ్చింది.
సా.శ..150లో శాతవాహన సామ్రాజ్య విస్తృతి | |
అధికార భాషలు | ప్రాకృతం సంస్కృతం, భట్టిప్రోలు లిపి (ఆది - తెలుగు) |
రాజధానులు | కోటిలింగాల, పుణె వద్ద ఉన్న జున్నార్, గుంటూరు సమీపాన కల ధరణికోట/ అమరావతి |
ప్రభుత్వం | రాచరికం |
శాతవాహనులకు ముందు పాలించినవారు | మౌర్యులు |
శాతవాహనుల తర్వాత పాలించినవారు | ఇక్ష్వాకులు, కదంబులు |
మౌర్య వంశ సామంతులుగా రాజకీయజీవితం ప్రారంభించిన శాతవాహనులు సా.శ..పూ 232లో అశోకుని మరణం తర్వాత స్వాతంత్ర్యము ప్రకటించుకొన్నారు. శాతవాహన వంశ మూలాల గురించి అస్పష్టంగా ఉంది. పురాణాల ప్రకారం, ఈ వంశపు తొలి రాజు కణ్వ వంశాన్ని ఓడించాడు. మౌర్యుల తరవాత దక్కనులో విదేశీయుల దండయాత్రలను ఎదుర్కొని శాంతిని స్థాపించారు. మరీ ముఖ్యంగా శకులు, పశ్చిమ సాత్రపులతో వారి యుద్ధాలు దీర్ఘ కాలం పాటు సాగాయి. గౌతమీపుత్ర శాతకర్ణి, అతని కుమారుడూ వాశిష్ఠీ పుత్ర పులుమావి ల కాలంలో శాతవాహన సామ్రాజ్యం ఉచ్ఛ స్థితికి చేరింది. సా.శ. 3 వ శతాబ్దపు తొలి నాళ్ళకు ఈ సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విచ్ఛిన్నమై పోయింది.
ఆంధ్ర అనే పదప్రస్తావన అల్ బెరూని (సా.శ..1030) వ్రాతలలో కూడా ఉంది. ఈయన దక్షిణ భారతదేశంలో మాట్లాడే భాష "ఆంధ్రి" అని వ్రాశాడు. ఈయన గ్రంథం కితాబుల్ హింద్ ఆనాటి ఆంధ్రదేశములోని కొన్ని ఆచారవ్యవహారాలను, సంప్రదాయాలను వర్ణిస్తుంది. ఆంధ్రుల మధ్య ఆసియా నుండి తరచు దండయాత్రలు ఎదుర్కొంటూ, శక్తిమంతమైన విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వీరి సైనిక శక్తితో పాటు, వ్యాపార దక్షత, నావికా కౌశలానికి చరిత్రలో మొట్టమొదటి సారిగా ఆగ్నేయ ఆసియాలో భారత కాలనీలు స్థాపించడమే తార్కాణం.
శాతవాహనులు, వాశిష్ఠీపుత్ర శ్రీ పులోమావి (సా.శ..పూ. 130-158) తో ప్రారంభించి తమ నాణేలపై రాజుల ముఖచిత్రాలు ముద్రించిన తొలి భారతీయ స్థానిక పాలకులుగా భావిస్తారు. ఈ సంప్రదాయం వాయవ్యాన పరిపాలించిన ఇండో-గ్రీకు రాజుల నుండి వచ్చింది. శాతవాహన నాణేలు రాజుల కాలక్రమం, భాష, ముఖ కవళికల (గుంగురు జుట్టు, పెద్ద చెవులు, బలమైన పెదవులు) గురించి అనూహ్యమైన ఆధారాలు పొందు పరుస్తున్నవి. వీరు ప్రధానంగా సీసము, రాగి నాణేలు ముద్రించారు; వీరి ముఖచిత్ర వెండి నాణేలు సాధారణంగా పశ్చిమ క్షాత్రప రాజుల నాణేలపై ముద్రించబడినవి. ఈ నాణేలపై ఏనుగులు, సింహాలు, గుర్రాలు, చైత్య స్తూపాల వంటి అనేక సాంప్రదాయక చిహ్నాలు అలంకరించబడి ఉన్నాయి. వీటిపై "ఉజ్జయిని చిహ్నం", (ఒక + గుర్తులో నాలుగు అంచుల వద్ద నాలుగు వృత్తాలు) కూడా ఉన్నాయి. ఉజ్జయినీ చిహ్నం శాతవాహనుల నాణేలపై ఉండటము వలన ప్రసిద్ధ పౌరాణిక చక్రవర్తి విక్రమాదిత్యుడు శాతవాహన చక్రవర్తి అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ విక్రమాదిత్యుని పేరు మీదనే విక్రమ శకం ప్రారంభమైంది.